breaking news
Nagarkurnool District Latest News
-
అందని రైతు ‘భరోసా’
● పంట పెట్టుబడి సాయం కోసంరైతన్నల ఎదురుచూపులు ● యాసంగి సీజన్ వరినాట్లు పూర్తి.. దిగుబడి దశలో వేరుశనగ ● ఎన్నికలు ముగిసినా నిధుల విడుదలపై స్పందించని ప్రభుత్వం ● తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు శాటిలైట్ సర్వే ఆధారంగా.. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో శాటిలైట్ సర్వే చేసింది. సర్వే నంబర్ల వారీగా రైతుల వివరాలు నమోదు చేస్తూ.. ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సర్వే పూర్తిచేయగా.. సాగుచేసిన భూముల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసినప్పటికీ రైతు భరోసా జాడే లేకుండాపోయింది. కాగా, రైతుభరోసా కింద ఎకరాకు ప్రతి ఏడాది రూ. 15వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రెండు సీజన్లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పెట్టుబడి సాయం పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. రెండు సీజన్లలో ఎకరాకు రూ. 12వేలు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఒక సీజన్లో రూ. 6వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేట: యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పంటలు చేతికందే సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు రైతు భరోసా జమ కాలేదు. ఎన్నో ఇబ్బందులు పడి వేరుశనగ, వరి, ఇతర పంటలు సాగుచేసిన రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 2023 యాసంగిలో 3.06 లక్షల మంది రైతులకు రూ. 369.21 కోట్లు అందించగా.. 2024 యాసంగిలో 2.41 లక్షల మంది రైతులకు రూ. 247.39 కోట్ల సాయం మాత్రమే అందింది. అదే ఏడాది వానాకాలంలోనూ రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు.. 5 – 6 ఎకరాలున్నా చిన్న, మధ్యతరహా రైతులు కూడా నష్టపోయారు. ప్రస్తుత యాసంగిలోనూ రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా సాగదీస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో పంటసాగు ఇలా.. జిల్లాలో 7,59,793 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుత యాసంగి సీజన్లో 3.95 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఇందులో 1,40,064 ఎకరాల్లో వరి, 1,06,368 ఎకరాల్లో వేరుశనగ, 1,35,348 ఎకరాల్లో మొక్కజొన్న, 10,734 ఎకరాల్లో మినుములు, 811 ఎకరాల్లో జొన్నలు, 674 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేశారు. ఎకరాకు రూ. 6వేల చొప్పున రూ.237 కోట్లు అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా అందించకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్ సాకుతో.. గతేడాది డిసెంబర్లోనే అందాల్సిన యాసంగి సాయం వరుస ఎన్నికల కారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు వాయిదా పడుతూ వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే నిధులు విడుదల చేయాలని.. లేకపోతే మళ్లీ కోడ్ సాకుతో సాయం నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతుభరోసా పొందే రైతులు 3.06 లక్షలు సమగ్ర వివరాలు నమోదు.. సాగులో ఉన్న భూముల వివరాలు రైతుల వారీగా ఆన్లైన్లో పొందుపరిచాం. ఈ ఏడాది కొత్తగా పంట సాగుచేసిన భూముల వివరాలను సైతం మండల తహసీల్దార్, వ్యవసాయాధికారి నివేదిక ఆధారంగా నమోదు చేశాం. రైతుభరోసాకు సంబంధించిన జాబితా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
కొల్లాపూర్ రూరల్: ప్రతి ఒక్కరికీ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని కొల్లాపూర్ కోర్డు న్యాయమూర్తులు ఉపనిషధ్వాని, డి.లక్ష్మణ్ అన్నారు. శనివారం కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో న్యాయ విజ్ఞాన సదుస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. అదే విధంగా ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అటవీ చట్టాలు, రోడ్డు భద్రత నియమాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమిని, న్యాయవాదులు మోహన్లాల్, బాలస్వామి, నిరంజన్ పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో 3 నెలల పసికందు మృతి
అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం ఆర్టీసీ ఉద్యోగులకుపురస్కారాలు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపోలో శనివారం ఉత్తమ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్లకు డీఎం ఉమాశంకర్ పురస్కారాలను అందజేశారు. గత జనవరిలో అత్యధిక ఈపీకే, అత్యధిక ఇన్సెంటివ్, ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లు, కండెక్టర్లను నగదు పురస్కారాలతో సత్కరించినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉద్యోగులు రత్నమ్మ, వెంకటేశ్వర్లు, నజీర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షకు 5,763 మంది హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది హాజరయ్యారు. జనరల్లో 4,537 మందికి గాను 4,431 మంది, ఒకేషనల్ విభాగంలో 1,384 మందికి గాను 1,332 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్లో 107 మంది, ఒకేషనల్ విభాగంలో 52 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించి.. గోత్ర నామార్చనలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి పాల్గొన్నారు. ‘సప్తశేష వాహనం’పై రంగనాథస్వామి వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అర్చకులు స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి మూలమంత్ర హవనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకరణ శోభితుడు, సమస్త లోకాధిపతి అయిన రంగనాథస్వామి ఉభయ నాంచారీ సమేతుడై సప్త శేషవాహనంపై తిరువీధుల్లో విహరించారు. దివ్యతేజ స్వరూపుడైన స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గెస్టు లెక్చరర్స్కు ఇంటర్వ్యూలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ లా కళాశాలలో ఖాళీలను గెస్టు లెక్చరర్లచే భర్తీ చేసేందుకు గాను శనివారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గత వారం అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా.. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఇంటర్వ్యూ సరళిని పరిశీలించారు. కార్యక్రమంలో ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు –IIలో u -
అత్యాధునికపరిజ్ఞానం..
సురభిరాజులు ప్రజారంజక పాలనతోపాటు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలోనూ ముందున్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉన్న రెండు విమానాలలో ఒకటి మద్రాసు పాలకులది కాగా.. రెండోది సురభి రాజులది. ఇద్దరు ప్రయాణించగల ఈ విమానాన్ని సురభి వెంకటలక్ష్మారావు కూతురు అయిన సరస్వతిదేవి అమ్మయ్యగారి భర్త బొబ్బిలి రాజ్యానికి చెందిన ఐవీ కృష్ణారావు నడిపేవారు. 1935 ఆగస్టు 25న కృష్ణారావు చనిపోవడంతో ఆయన స్మృత్యార్థం ఆర్ఐడీ బాలుర కళాశాల సమీపంలో స్తూపం ఏర్పాటు చేశారు. రైల్వే వ్యవస్థ ప్రారంభమయ్యాక కొల్లాపూర్కు రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదనను బ్రిటీష్ పాలకులు తీసుకురాగా సురభిరాజులు తిరస్కరించారు. ఇక్కడి సంపదను తరలించుకుపోతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు. సురభి రాజులు వినియోగించిన విమానం -
ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలుద్దాం
కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి.. జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల పదో తరగతి విద్యార్థులకు శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ మార్గనిర్దేశం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలంటే భయం వీడాలన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయ బృందం అందుబాటులో ఉంటుందని.. ఏ సమయంలోనైనా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. వసతిగృహాల్లో పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ యన సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధి కారి ఉమాపతి, సైకాలజిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి
కందనూలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పోస్టర్ను శనివారం కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి.. 4వ తరగతి చదువబోతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు http://tgss.te langana.gov.com వెబ్సైట్లో మార్చి 4వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 13 నుంచి 17వ తేదీ వరకు మండల స్థాయిలో ఎంపికలు ఉంటాయన్నారు. 30న నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే విధ్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి పుట్టిన తేదీ ధ్రువపత్రం, 3వ తరగతి పురోగతి నివేదిక కాపీ, ఆధార్, కుల ధ్రువపత్రం, ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ సీతారాం, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు. -
సకలకళా సురభిలు
● స్వాతంత్య్రానికి ముందే కొల్లాపూర్లో డబుల్ లైన్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు ● దక్షిణ భారతంలో రెండో విమానం కొనుగోలు చేసింది వీరే.. ● ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట ● కళలకు పట్టం.. ఉద్యానవనాల సాగుకు బీజం కొల్లాపూర్ బంగ్లా వ్యూ జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానాలుగా సురభిరాజుల ప్రజారంజక పాలన రాచరిక పాలన అంటే సంప్రదాయాలు, కట్టుబాట్లు, బానిసత్వం ఉంటాయి.. కానీ, కొల్లాపూర్ను శతాబ్దాల పాటు పాలించిన సురభి రాజవంశస్థులు అందుకు భిన్నంగా స్వేచ్ఛాయుత పాలన అందించారు. ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ.. కళలకు పట్టం కట్టి.. అధునాతన వసతులతో ఆదర్శవంతమైన పాలన సాగించారు.. ఆ కాలంలోనే కొల్లాపూర్లో వంద ఫీట్ల వెడల్పాటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, ఆస్పత్రి వసతులు కల్పించారంటే వీరి ముందుచూపు ఏపాటిదో ఊహించవచ్చు. అలాగే దక్షిణ భారతంలోనే మద్రాస్, నిజాం పాలకుల తర్వాత విమానం కొనుగోలు చేసిన ఘనత వీరికే దక్కింది. ఆధునికతతోపాటు ఆధ్యాత్మికత, తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట వేసిన సురభిరాజ వంశస్తుల ప్రజారంజక పాలనపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం.. – కొల్లాపూర్ సుపరిపాలన అందించిన రాజా వెంకట లక్ష్మారావు తెలంగాణ రాష్ట్రంలో గల 14 సంస్థానాల్లో సురభిరాజులది ఒకటి. జటప్రోల్ను కేంద్రంగా చేసుకుని సాగించిన వీరి పరిపాలనకు సంబంధించిన చారిత్రక అంశాలు 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్నాయి. జటప్రోల్లో శత్రుదుర్భేద్యమైన రాజధాని కోట నిర్మించారు. జటప్రోల్ సంస్థానంపైకి తరచూ కర్నూలు జిల్లా నుంచి శత్రురాజులు దండయాత్రలు చేస్తుండడంతో 1840లో రాజా లక్ష్మణరాయల కాలంలో సంస్థానాన్ని కొల్లాపూర్కు మార్చారు. మైసూరు ప్యాలెస్ నమూనాతో రాజమహల్, మంత్రమహల్, రాణిమహల్ అని విభజించి భారీ కోటను నిర్మించారు. 1884లో రాజా వెంకటలక్ష్మణరావు హయాంలో సంస్థానం కోట నిర్మాణం జరిగింది. 1948లో సురభిరాజుల సంస్థానం రాజా వెంకట జగన్నాథరావు పరిపాలనా కాలంలో భారత ప్రభుత్వంలో విలీనమైంది. కవుల పోషణ సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్ కవి వంటి ఉద్దండులు ఉండేవారు. తెలుగు భాషా పరిరక్షకులు నిజాం నవాబులకు సామంతులుగా ఉన్న సురభిరాజులు పరిపాలనలో ఎక్కడ కూడా నిజాం పోకడలను అనుసరించలేదు. ప్రధానంగా భాషా పరిరక్షణలో వారు తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చారు. సంస్థానాల్లో చాలాచోట్ల ఉర్దూ ప్రభావం ఉన్నప్పటికీ.. జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానంలో మాత్రం ఆ ఊసు ఎక్కడా కనిపించదు. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా 1920లో కొల్లాపూర్ కవులచే స్నేహలతా కవితా సంఘాన్ని ఏర్పాటు చేయించి.. దాని నిర్వహణకు సహకరించారు. 1930లో రాణి రత్నమాంబ ఆర్థిక సహకారంతో వైజయంతి అనే తెలుగు పత్రికను ప్రచురించారు. అభివృద్ధికి చిరునామా.. కొల్లాపూర్ పట్టణాన్ని సురభిరాజులు అభివృద్ధికి చిరునామాగా మార్చారు. దేశంలో విద్యుత్ వాడకం ప్రారంభమైన తొలినాళ్లలోనే మద్రాసు సంస్థానంతోపాటు విద్యుత్ వినియోగించిన పట్టణాల్లో కొల్లాపూర్ ఒకటి. 18వ శతాబ్దంలోనే ధర్మాస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందించారు. 1920లోనే టౌన్ ప్లానింగ్ రూపొందించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం వేలాది ఎకరాలకు సాగునీరందించేలా సింగోటం శ్రీవారి సముద్రం చెరువు నిర్మించారు. హిందూ, ముస్లింలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ.. జటప్రోల్లో హజ్రత్ ఇనాయత్షా ఖాద్రీ దర్గా ఉర్సుకు మదనగోపాలస్వామి ఆలయం నుంచి పూజా సామగ్రిని పంపించేవారు. నిజాంకు ఇష్టమైన ప్రాంతం.. కొల్లాపూర్ సంస్థానం నిజాం నవాబుకు ఇష్టమైన ప్రాంతం. సురభి రాజులు సింగోటంలో నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి నిజాం నవాబు రోజూ ఒక్క రూపాయి చొప్పున కై ంకర్యంగా పంపేవారు. 1850 నుంచే నిజాం పాలకులతో సురభి రాజులకు సత్సంబంధాలు ఉండేవి. 1854 నుంచి 1884 వరకు సంస్థానాన్ని పాలించిన రాజా వెంకట జగన్నాథరావును నిజాం పాలకులు రాజా బహదూర్, నిజాం నూజ్వంత్ అనే బిరుదులతో సత్కరించారు. కళలకు పుట్టినిల్లు.. సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్, కొల్లాపూర్లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధాన్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి. హైదరాబాద్లోరాజవంశ వారసులు.. సురభి రాజవంశ వారసుడిగా ప్రస్తుతం ఆదిత్య లక్ష్మారావు కొనసాగుతున్నారు. సింగోటం లక్ష్మీనర్సింహస్వామి, జటప్రోల్ మదనగోపాలస్వామి, కొల్లాపూర్లోని మాధవస్వామి, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి, శివాలయం, రామాలయాలకు ఫౌండర్ ట్రస్టీగా ఉన్నారు. ఆదిత్య లక్ష్మారావుకు అనిరుధ జగన్నాథరావు, విధుర రాజగోపాలరావు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరు సికింద్రాబాద్లోని సురభి గార్డెన్లో నివాసం ఉంటున్నారు. ఉద్యానవనాల పెంపకంపై దృష్టి బొబ్బిలి రాజవంశాలతో బంధుత్వం ఉన్న సురభి రాజులు అక్కడి నుంచి వివిధ రకాల మామిడి మొక్కలను తెచ్చి కొల్లాపూర్లో ఉద్యానవనాల సాగుకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మామిడి మొక్కలను కొల్లాపూర్లోని పెద్దతోటలో సాగుచేశారు. పెద్దతోటలో కాచిన పండ్లను బ్రిటీష్ పాలకులతోపాటు నిజాం నవాబులకు పంపేవారు. -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
కందనూలు: ఎలాక్ట్రానిక్ వేస్టేజ్ పర్యావరణానికి పెను సవాల్గా మారిందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ప్రతినిధి చైతన్య అన్నారు. హరిథాన్ ఎకో హ్యాకథాన్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ–వేస్ట్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఈ–వేస్ట్ పర్యావరణానికి పెను ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్న కొద్దీ.. వాటి వ్యర్థాలు అధికమవుతున్నాయన్నారు. వాటిని సరైన విధంగా నిర్వహించకపోతే భూమి, నీరు, గాలి కాలుష్యానికి దారితీస్తాయని తెలిపారు. పాడైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు వంటి పరికరాల్లో ఉండే హానికర రసాయనాలు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. యువత ఈ విషయంపై చైతన్యం పెంపొందించుకొని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా, సరైన విధానంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఈ–వేస్ట్ను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం పాత ఎలక్ట్రానిక్ పరికరాలను రీ సైక్లింగ్కు పంపించడం.. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవడం.. కాలుష్య నియంత్రణపై అవగాహన పెంపొందించడం వంటి సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ చర్చకు సిద్ధం: ఎంపీ మల్లు రవి
శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
రేర్ డిసీజెస్.. బీ అలర్ట్!
జన్యుపరమైన లోపాలతోనూ చర్మవ్యాధులు ఈ ఫొటోలో మందంగా మారిన అరచేతులు, కాళ్లను చూపిస్తున్న వ్యక్తిది హనుమాన్పల్లి గ్రామ పరిధిలోని ఓ తండా. జన్యు లోపంతో చర్మవ్యాధి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఇలాగే ఉంది. రోజురోజుకూ పెద్దగా అవుతోంది. మహబూబ్నగర్లో, హైదరాబాద్లో చాలా ఆస్పత్రులకు తిరిగా. మహారాష్ట్రలో ఉండగా.. అక్కడి డాక్టర్ల వద్దకూ వెళ్లా. రూ.3 లక్షలు కడితే అమెరికాలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చని అక్కడి డాక్టర్ చెప్పారు. సిద్ధమైన తర్వాత గ్యారంటీ ఇవ్వలేమనడంతో ఆశలు వదులుకున్నా. నాతోపాటు గ్రామంలో ఐదారుగురి పరిస్థితి ఇలాగే ఉంది.’ అని ఆయన తన ఆవేదన వెళ్లగక్కారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో చర్మ సంబంధిత వ్యాధుల శాతం పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో డెర్మటాలజీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పరిశుభ్రత, పోషకాహారంతోపాటు జీవనశైలిలో లోపాలు, వాయు, జల కాలుష్యంతో చర్మ వ్యాధుల బారినపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్తోపాటు పలు పరిశోధన సంస్థల అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. జన్యుపరమైన లోపాలతో సైతం స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బాధితులు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు అతి తక్కువే. తాజాగా ఉమ్మడి పాలమూరులో ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడిన కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధన్వాడ మండలంలో.. గతంలో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జన్యు లోపాలతో చర్మ వ్యాధుల బారిన పడిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లితోపాటు దాని చుట్టు పక్కల గ్రామాల్లో ఇలాంటి బాధితులు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. వీరిలో పలువురు ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. అరి చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోయి.. హనుమాన్పల్లి గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1 ,425 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 7 28, మహిళలు 697 మంది. వీరిలో ఎస్టీ సామాజిక వ ర్గానికి చెందినవారు 250 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వర్గానికి చెందిన సుమారు 25 నుంచి 30 మంది వరకు జన్యు లోపాలతో వచ్చిన చర్మ వ్యా ధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అధి క సంఖ్యలో ప్రధానంగా పామోప్లాంటార్ కెరటోడ ర్మా వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అరి చేతులు, పాదాలు మందమై.. స్పర్శ కోల్పోవడం, చర్మం పగుళ్లు రావడం, నడిచేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు నొప్పి ఉండడం, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు. అవగాహన లేకపోవడంతో అనేక ఏళ్లుగా ఇబ్బందులు తాజాగా ఉమ్మడి పాలమూరులో వెలుగులోకి.. రక్త సంబంధీకుల మధ్య వివాహాలేకారణమంటున్న వైద్యులు -
కంటిచూపుపై నిర్లక్ష్యం వహించొద్దు
కల్వకుర్తి రూరల్: డ్రైవర్లు కంటిచూపు సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి అన్నారు. కల్వకుర్తి పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఆమనగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్యసిబ్బంది వెంకటేశ్, వెంకటస్వామి డ్రైవర్లకు పరీక్షలు చేసి.. అవసరమైన మందులు అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్కు తప్పనిసరిగా దూరం, దగ్గరిచూపు ఉండాలన్నారు. డ్రైవర్లకు కంటి సమస్యలు ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణదేవ పాల్గొన్నారు. -
అనూహ్య మలుపులు
క్లిష్టతరంగా మారిన కుమ్మెర జాతరలో దాడి ఘటన సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో దాడి ఘటన అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల పోరాటం కొనసాగడంతోపాటు ఉన్నత స్థాయిలో ఎస్సీ, బీసీ కమిషన్లు సైతం విచారణలో భాగమయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించి నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ నెల 18న జాతరలో దాడి ఘటన చోటుచేసుకోగా 21న పసిపాప మరణం నుంచి వరుసగా ఏడు రోజులపాటు నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పోలీసుల నిఘా వైఫల్యంతోపాటు బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా విచారణ.. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబంపై దాడి జరగగా ఇది ఆధిపత్య వర్గం నుంచి పోరుగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ క్రమంలో నిందితులపై హత్యకేసు నమోదుచేయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే పోలీసులు దాడి ఘటనలో పాల్గొన్నవారు ఎవరు.. ఏం జరిగిందన్న దాంతోపాటు బాధితులపైనా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరగా ఏం తేలుతుందోనని, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతుండగా.. ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. బాధితులపైనే కేసుతో.. జాతరలో గణేశ్ను కొబ్బరికాయల గదిలో తలుపులు వేసి బంధించి 8 మంది వరకు దాడి చేసినట్లు బయటకు వచ్చిన వీడియోల్లోనే స్పష్టమైంది. దాడి ఘటన వెంటనే ముందుగా బాధితుడు గణేశ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్స్టేషన్ దాకా వచ్చాక ముందుగా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం వివాదానికి దారితీసింది. నిందితుల పట్ల పోలీసులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించారని, తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని బాధితులు పదేపదే ఆరోపించారు. గణేశ్పై దాడి జరిగింది స్పష్టమైనప్పటికీ, నిందితుడు శ్రీనివాస్రెడ్డికి గాయాలు అయ్యాయన్న కారణంతో బాధితులపైనే కేసు నమోదు చేయడం ఆగ్రహావేశాలకు దారితీసింది. దాడి ఘటన తర్వాత మూడు రోజులకు ఫిబ్రవరి 21న రెండు నెలల పాప మరణంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితులు రోడ్డెక్కారు. ప్రజాసంఘాల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదుచేశారని, లేకపోతే మరింత నీరుగార్చేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఘటన తర్వాత స్పందనపై విమర్శలు.. కుమ్మెర మల్లన్న జాతరలో ఏటా పదివేల మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రానికి 11 కి.మీ దూరంలో కుమ్మెర ఉండగా.. భారీ సంఖ్యలో పాల్గొనే జాతరలో పోలీసుల బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్టు ఎస్సీ, బీసీ కమిషన్ చైర్మన్లు స్పష్టం చేశారు. దాడి ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఏం జరుగుతుందన్న దానిపై, అసలు నిజాలు తెలుసుకోవడంలో పోలీస్ నిఘా వ్యవస్థ సైతం వైఫల్యం చెందినట్లు విమర్శలు వస్తున్నాయి. దాడి ఘటన చోటుచేసుకున్న తర్వాత బాధితుల పట్ల పోలీసులు చూపిన వైఖరి వివాదాస్పదమైంది. అనేక మలుపులతో అంతుచిక్కని దాడి కేసు బాధితులపైనా లోతుగా సాగుతున్న విచారణ చివరికి ఎటువైపు దారితీస్తుందోనన్న అనుమానం పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై విమర్శలు -
టెన్త్ బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు అందించి.. బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. త్వరలో నిర్మంచబోయే 30 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అలాగే ప్రతిభకనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణి, ఆర్ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన నిర్ణయాల్లో సర్పంచులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అచ్చంపేట డివిజన్లోని 137 జీపీల సర్పంచులకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 3వ విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు ముందుండి పనిచేయాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా తమ వ్యక్తిగత గౌరవం కూడా పెంపొందుతుందని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా తమ పరిపాలన పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడేలా ఉండాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానాల్లో కుటుంబ సభ్యుల జోక్యం ఉండరాదన్నారు. మహిళా సర్పంచులు తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. లోటుపాట్లు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పన్నులు, ఇతర స్థానిక వనరుల ద్వారా సమకూరే ఆదాయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. తద్వారా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, డీపీఓ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
బాధితులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి
నాగర్కర్నూల్ రూరల్: కుమ్మెర ఘటన బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించడంతో పాటు నిందితులపై హత్యకేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులను ఒంటరి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి ఎత్తుగడలను మానుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, పొదిలి రామయ్య, అశోక్, తారాసింగ్, అంతటి కాశన్న, మధు, వెంకటేశ్, మాలిక్, వెంకటయ్య, నాగరాజుగౌడ్ పాల్గొన్నారు. కుమ్మెర ఘటనపై పోలీసుల విచారణ మహమ్మదాబాద్: కుమ్మెర ఘటనలో బిడ్డను కోల్పోయిన మౌనిక తల్లిగారి ఊరైన మహమ్మదాబాద్ మండలం సంగాయపల్లిలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు మౌనిక తల్లి బాలికిష్టమ్మతో పలు వివరాలు సేకరించారు. బాధితురాలి అసలు పేరు యాదమ్మ అని.. తమది బీసీ సామాజిక వర్గం కాగా.. నాగర్కర్నూల్కు చెందిన గణేశ్ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించింది. అయితే బాధితురాలి పేరు, ఊరు, మండలం, జిల్లా, కులం తదితర వివరాల సేకరణ నిమిత్తం విచారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
పీఆర్సీ ప్రకటించాలి
ఉప్పునుంతల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జక్క రామస్వామి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తాడూరు యూపీఎస్లో నిర్వహించిన డీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని ప్రకటించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నం.25ను రద్దుచేసి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు డి భాస్కర్రెడ్డి, ఉపాధ్యక్షులు రత్నప్రసాద్, కె.జ్యోతి, కార్యదర్శులు పి.జానకీరాం, భార్గవి, హజారుద్దీన్, రాములు తదితరులు ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
వెల్దండ: నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ముఖ్యమంత్రి సోదరుడు, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ప్రతి గ్రామంలో విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ కార్తీక్కుమార్, సర్పంచ్ యాదమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వెంకటయ్యగౌడ్, భూపతిరెడ్డి, రామకృష్ణ, సంజీవ్కుమార్, పర్వత్రెడ్డి, తిరుపతిరెడ్డి, హమీద్, పుల్లయ్య, పురుషోత్తంచారి, జంగయ్య యాదవ్, రాజు, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి
కందనూలు: మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేసి.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి సూచించారు. గురువారం నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కొత్త పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలతో పాటు శుభ్రత, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పుర చైర్మన్గా తీగల సునేంద్ర కుమార్, వైస్చైర్మన్గా బాదం రమేశ్, కౌన్సిల్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ను దిగ్బంధిస్తాం
నిందితులను అరెస్టు చేయకపోతే.. నాగర్కర్నూల్ క్రైం: రెండు నెలల పసిపాపను చంపిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే హైదరాబాద్ను దిగ్బంధిస్తామని దిగ్బందిస్తామని.. ముఖ్యమంత్రి ఇంటితో పాటు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ కుల, మతపరమైన ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కుల అహంకారంతో ఈ దాడి జరిగిందని.. ఇందుకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారి మృతి ఘటనపై పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామన్నారు. బడుగు బలహీన వర్గాలు ఐక్యమత్యతో ఉంటూ ఇలాంటి ఘటనలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మీడియాకు ఒక బులిటెన్ జారీ చేసి, అందులో బాధితులనే నిందితులుగా చూపడం.. చిన్నారి మృతదేహంపై, అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని ప్రకటించడం.. ఘటన జరిగిన సమయంలో కుమ్మెర గ్రామంలో ఆ చిన్నారి లేదని చెప్పడాన్ని చూస్తే కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీసులు, పాలకులు కుట్రలు పన్నుతున్నారని స్పష్టమవుతుందని అన్నారు. పోలీసు వ్యవస్థ న్యాయం వైపు ఉండాలని హితవు పలికారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉద్యమంగా కుమ్మెర ఘటనను ముందుకు తీసుకెళ్తాం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ -
ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
స్టేషన్ మహబూబ్నగర్: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్, లాజిస్టిక్ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం రీజినల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్లు గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్నగర్, షాద్నగర్, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్క పక్కా..
● ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయశాఖ ● జిల్లాలో 330 మంది వలంటీర్లు అవసరం ● ఎంపిక బాధ్యత ఎంఈఓలకు.. ●అచ్చంపేట: వలంటీర్లతో పంటల డిజిటల్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. అగ్రికల్చర్లో డిగ్రీ, డిప్లొమా, సైన్స్ గ్రాడ్యుయేట్ ఇతర డిగ్రీలు ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని.. వారు లేకుంటే ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని వలంటీర్లుగా నియమించాలని ఏఈఓలను ఆదేశించింది. స్థానికులైన వలంటీర్లను నియమించి.. 45 రోజుల్లో పంటల డిజిటల్ సర్వే ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించింది. అయితే రెండేళ్ల క్రితమే ఏఈఓలకు డిజిటల్ సర్వే చేయాలని బాధ్యతలు అప్పగించినప్పటికీ.. వారు ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నందున సక్రమంగా సర్వే నిర్వహింలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సర్వే ప్రైవేటు వలంటీర్లతో చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరులోగా ప్రారంభం.. జిల్లావ్యాప్తంగా 143 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 348 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే భూ భారతి మ్యాప్ కలిగిన 330 గ్రామాల్లో పంటల సర్వేకు వలంటీర్లను నియమించనున్నారు. మిగతా గ్రామాల్లో ఏఈఓలే సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆయా క్లస్టర్ల పరిధిలో ఏఈఓలు వలంటీర్ల నియామక ప్రక్రియ ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతో పాటు డిజిటల్ సర్వేపై అవగాహన కలిగిన ఉన్న వారిని వలంటీర్లుగా నియమించి.. ఒకటి, రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రారంభించాలని జిల్లా వ్యవసాయశాఖ యోచిస్తోంది. 3.95లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్లో 3.95లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగుచేశారు. అందులో వరి 1.40 లక్షల ఎకరాలు, వేరుశనగ 1.6 లక్షలు, మొక్కజొన్న 1.35లక్షలు, ఇతర పంటలు మరో 14వేల ఎకరాల్లో సాగుచేశారు. వలంటీర్లు పూర్తిస్థాయిలో డిజిటల్ సర్వే నిర్వహించి.. పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా డిజిటల్ సర్వేకు వలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. వారికి సమగ్ర శిక్షణ అనంతరం త్వరలోనే పంటల సర్వే ప్రారంభిస్తాం. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎంపికై న వలంటీర్లు మొబైల్ యాప్ ద్వారా పంటల నమోదు చేపట్టనున్నారు. ఒక్కో డిజిటల్ నమోదుకు ప్రభుత్వం రూ.7 చొప్పున వలంటీర్లకు చెల్లించనుంది. సర్వేలో భాగంగా రైతు డిజిటల్ ఫొటో, భూమి విస్తీర్ణం, ఏ విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేశారు.. రైతు ఫోన్ నంబర్ను నమోదు చేయనున్నారు. -
పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
కందనూలు: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించగా.. 5,968 మంది విద్యార్థులకు గాను 5,806 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,588 మందికి గాను 4,475 మంది, ఒకేషనల్ విభాగంలో 1,380 మందికి గాను 1,331 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్లో 113 మంది, ఓకేషనల్ విభాగంలో 49 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ వెంట డీఐఈఓ వెంకటరమణ ఉన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 4వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి.. 2026–27 విద్యా సంవత్సరం 4వ తరగతి చదవబోతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు మార్చి 4వ తేదీలోగా htt p://tfrr.telangana.gov.in వెబ్సైట్లో దర ఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కంటిచూపుపై నిర్లక్ష్యం వహించొద్దు నాగర్కర్నూల్ క్రైం: కంటిచూపుపై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాలమిక్ ఆఫీసర్ కొట్ర బాలాజీ అన్నారు. స్థానిక పాత కలెక్టరేట్ భవనంలో బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శిబిరానికి వచ్చిన 78 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 34 మందికి కంటిశుక్లం శస్త్రచికిత్స అవసరమని గుర్తించి.. ఏనుగొండ లయన్ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి పంపించినట్లు ఆయన తెలిపారు. కంటిచూపు సమస్యతో బాధపడే వారు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సేవాభావంతో మెలగాలి కందనూలు: విద్యార్థులు సేవాభావంతో మెలగాలని జిల్లా రవాణాశాఖ అధికారి చిన్నబాలు సూచించారు. నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లిలో స్థానిక ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చేపట్టిన శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు సేవాదృక్పథం కలిగి ఉండాలన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం బాధ్యతగా భావించాలని.. ఇలాంటి శిబిరాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. రేపు మెగా ఉద్యోగ మేళా గద్వాలన్యూటౌన్: మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మీనాక్షీ, సీపీడీసీ మెంబర్ సాయిశ్యామ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో ఉద్యోగ మేళా బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేళాలో జస్ట్ డయల్, క్యాలిబర్, మెడ్ ప్లస్, టాషియన్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికై న వారికి అదే రోజు అపాయిమెంట్ లెటర్ అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, కేరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు
తాడూరు: పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేవీకే శాస్త్రవేత్తలు ఎన్.నవత, భానుశ్రీ సూచించారు. బుధవారం తాడూరు మండలం తుమ్మలసూగూరు శివారులో సాగుచేసిన మొక్కజొన్న పంటను వారు పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం పంటకు సోకే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించారు. పంట దిగుబడి సాధించేందుకు శాసీ్త్రయ విధానం అనుసరించాలని సూచించారు. ఆదివాసీ చెంచులకు పట్టాలు ఇవ్వాలని హెచ్ఆర్సీ ఆదేశం మన్ననూర్: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చెంచులు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్తానీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో అర్హులైన రైతులకు ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే ఆదివాసీ చెంచులు పట్టాదారు పాస్పుస్తకాల కోసం కలెక్టరేట్లో పలుమార్లు అర్జీ పెట్టుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టాలు ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని రాయిలేటి పెంటకు చెందిన 8 మంది ఆదివాసీ చెంచుల తరఫున మాజీ సర్పంచ్, శక్తి స్వచ్ఛంద సంస్థ కార్యకర్త నల్లపోతుల పెద్దిరాజు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీనిపై విచారించిన కమిషన్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆదివాసీ చెంచులకు నాలుగు వారాల్లో పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేయాలని ఆదేశించిందని ఆయన తెలిపారు. -
దుర్మార్గులకు శిక్ష పడాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోండి ● కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర ఘటనలో దాడికి పాల్పడిన నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని, అందరికీ శిక్షపడేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి కమిషన్ తరపున రూ.లక్ష చెక్కును అందజేశారు. కుమ్మెరలో కుటుంబం జీవించలేని పరిస్థితులు ఉన్నాయని వారికి రక్షణ కల్పించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు ఏర్పాటు, గణేశ్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. -
తొలి పరీక్షకు 276 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉరుకులు పరుగుల మధ్య చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. అధికారులు, సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, పేపర్–1 పరీక్ష నిర్వహించగా.. 7,265 మంది విద్యార్థులకు గాను 6,989 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,565 మందికి గాను 5,387 మంది, ఒకేషనల్ విభాగంలో 1,700 మందికి గాను 1,602 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 178 మంది, ఒకేషనల్ విభాగంలో 98 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. -
ఒత్తిడి తగ్గించే టెలీమానస్
● ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకుఅందుబాటులోకి.. ● యాక్టివ్ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆరోగ్య శాఖ ‘టెలీమానస్’ను యాక్టీవ్ చేసింది. కొన్నిరోజుల నుంచి ఆరోగ్య శాఖ ప్రత్యేక కౌన్సిలర్ ఇంటర్ కళాశాలలను సందర్శించి టెలీమానస్పై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులు ఒత్తిడిని ఎలా అధిగమించాలనే అంశాలను వివరించారు. పరీక్షలంటే విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా టెలీమానస్ను అధికారులు ఏర్పాటు చేశారు. టోల్ఫ్రీ నంబర్ 14416 లేదా 1800–89–14416ను సంప్రదించాలి. 24 గంటలపాటు సేవలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డలో ఉన్న టోల్ఫ్రీ నంబర్ను సైకియాట్రిస్ట్లు, సైకాలజిస్ట్లు, కౌన్సిలర్లు అటెండ్ చేసి విద్యార్థులకు అవసరమైన సూచనలు చేస్తారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితోపాటు మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి ఇది ఉపయోగేపడే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాకు సంబంధించి జడ్చర్లలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి 45 ఫోన్ కాల్స్, నాగర్కర్నూల్ 21, వనపర్తి 10, గద్వాల 63, నారాయణపేట 27 కాల్స్ టెలీమానస్కు వచ్చాయి. ఇందులో అధికంగా విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెలిమానస్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య మరింత పెరగనుంది. సమయపాలన ముఖ్యం.. చుట్టూ ఉండే వాతావరణం ఇతరులతో పోలిక వంటి వాటి కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు వారిని అవసరమైన మేర ప్రోత్సహించి నడిపించాలి. చదువు విషయంలో ప్రణాళిక, సమయపాలన ఎంతో ముఖ్యం. కష్టమైన సబ్జెక్టు ఉంటే ప్రతిరోజు 30 నిమిషాలు చదివేందుకు కేటాయించాలి. మెదడును పరీక్షలపై ప్రణాళికబద్ధంగా అలవాటు చేయడం ఉత్తమం. నిత్యం ఒకే సమయం లేదా ఒకే ప్రాంతంలో చదువుకునేందుకు అలవాటు చేస్తే ఫలితాలు మెరుగైన పద్ధతిలో వస్తాయి. – వంగీపురం శ్రీనాథాచారి, మానసిక నిపుణుడు -
ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి
వీపనగండ్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలను విస్మరించి ఆర్భాటాలకు వెళ్లి అప్పులపాలు కావద్దని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని సంగినేనిపల్లి, కల్వరాలలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని చెప్పారు. కల్వరాలలో నెలకొన్న నీటిఎద్దడిని సత్వరమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్లు పల్ల జయంతి, బండారి రాముడు, బలుస రామన్గౌడ్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పోరాటం ఆపొద్దు..!
● మానవత్వానికి మాయని మచ్చగా దాడి ఘటన ● రెండు నెలల పసిపాపపై ఇంత క్రూరత్వమా? ● ఒక్క వ్యక్తిపై 20 మంది దాడి చేయడం సిగ్గుచేటు ● ‘కుమ్మెర’ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ బాధితులకు న్యాయం జరిగే దాకా అండగా నిలబడదాం కుమ్మెర ఘటనలో నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడటం అధికార దురహంకారానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఒక్క వ్యక్తిపై 20 మంది కలిసి దాడి చేయడం, పసిపాప అని కూడా చూడకుండా కాలితో తన్నడం మానవత్వానికే మచ్చగా మిగిలిందని విమర్శించారు. ఇలాంటి ఘటనపై ప్రజలంతా స్పందించాలని, మనసున్న మనుషులంతా ఏకం కావాలని కోరారు. హంతకులను శిక్షించే దాకా సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పసిపాపకు కుల, మతాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పుట్టిన 5 నిమిషాలకు పుట్టేదే కులం, మతమని.. మనుషులు పుట్టించిన కులం పేరుతో దేవుని దర్శనాలకు రాకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబంలో జరిగితే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? అని ప్రశ్నించారు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో ఓ కుటుంబం పట్ల పైశాచికంగా ప్రవర్తించిన మానవ మృగాలను శిక్షించే వరకు పోరాటం ఆపొద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే స్పందించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విశారదన్ మహరాజ్ పోరాటాన్ని అభినందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులందరికీ శిక్ష పడే దాకా పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులను డిస్మిస్ చేయాలి కుమ్మెర దాడి ఘటనలో బాధితుల ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసింగ్కు అంతర్జాతీయంగా పేరు తీసుకొస్తే.. కాంగ్రెస్ హయాంలో వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు. నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. ఆధిపత్యం, అహంకారంతోనే.. అగ్రకులాల ఆధిపత్యం, అహకారంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కుమ్మెరలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు, ఇలాంటి ఘటనల నుంచే తాను పాటలు పాడానని గుర్తుచేశారు. ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. బాధితులపైనే కేసు పెడతారా..? కుమ్మెర ఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టేందుకు కోర్టు అనుమతి కావాలని చెప్పడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో పదేపదే ఎమ్మెల్సీ నుంచి డీఎస్పీకి ఫోన్లు వచ్చాయని ఆరోపించారు. ఎంపీ మల్లు రవి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పకుండా.. చూసి చేయండి అని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇక్కడి ప్రాంతం కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. మహేంద్రనాథ్తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న లాంటి ప్రజా కవులు ఇక్కడి ప్రాంత సామరస్యం కోసం కృషిచేశారని చెప్పారు. కులాలు, మతాల పిచ్చి వదిలి.. సామాజిక చైతన్యం కావాలన్నారు. మానవ మృగాలకు శిక్ష పడేందుకు అందరం ఏకమవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. -
పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. ఇటీవల గుంపుమేస్త్రి చెర నుంచి విడిపించిన వలస కూలీలకు బుధవారం జిల్లాకేంద్రంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఇటీవల వనపట్లకు చెందిన గుంపుమేస్త్రి ఎర్రయ్య చెర నుంచి తెలకపల్లి మండలానికి సంబంధించిన వలస కూలీలను గతనెల 23న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో విడిపించడం జరిగిందన్నారు. వలస కూలీలు వెట్టిచాకిరీ నుంచి ఎలా బయటపడాలి.. జీవితంలో ఎలా ఉన్నతంగా జీవించాలనే విషయాలను వివరించారు. పిల్లలను పనిలో పెట్టకూడదని.. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు కలిగి ఉండాలన్నారు. అనంతరం బ్యాంకు ఖాతా ప్రాముఖ్యతను వివరించి.. ఆధార్, బ్యాంకు ఖాతా లేని వారికి నేషనల్ ఆదివాసీ సంస్థ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ లక్ష్మణ్రావు, ఎల్ఓ రాజ్కుమార్, డీసీపీఓ శ్రీశైలం, సీఐ శంకర్ పాల్గొన్నారు. -
నిరసనలు ఉధృతం..
జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాసంఘాల నాయకులు నిరసన శిబిరానికి చేరుకుని బాధితులకు మద్దతు తెలుపుతున్నారు. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసింది. -
అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి
వనపర్తి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు పరిష్కారం దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలానికి సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి సమీక్ష నిర్వహించారు. పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లిలో ఓ రైతు తన భూమి పొరపాటున అటవీ భూమిగా నమోదైందంటూ దరఖాస్తు చేసుకున్నారని, నేటికీ పరిష్కారం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. పది రోజుల్లో పరిష్కరించినట్లు తనకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా దావాజ్పల్లితండా, కిష్టాపూర్కు చెందిన పలువురు రైతులు తమ పోడు భూమి సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో ఆరా తీసిన మంత్రి వెంటనే పరిష్కరించాలని కోరారు. పానగల్ మండలంలోని భూములకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని వారితో సమావేశం నిర్వహించాలన్నారు. పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు తెలుసుకొని త్వరగా ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని.. కేవలం కార్యాలయాలకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాద య్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు, పాన్ గల్ మండల ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పసిబిడ్డ చనిపోయినా పట్టించుకోరా?
● బాధితులపైనే కేసులు పెడతారా.. ● కుమ్మెర ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కందనూలు: కుమ్మెర జాతరలో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిబిడ్డను కోల్పోయిన ఘటన దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు బిడ్డగా చెబుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఈ ప్రాంతంలోనే ఒక దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతిలో నియోజకవర్గ అధికారులంతా కీలుబొమ్మలుగా మారారని.. ఫలితంగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలన విషయంలో పట్టు కోల్పోయారని ఆయన ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేస్తే.. దాడికి పాల్పడిన నిందితుల నుంచి ఫిర్యాదు తీసుకుని బాధితులపైనే కేసులు పెట్టే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే కొనసాగుతున్నాయని.. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, కట్టా సుధాకర్రెడ్డి ఉన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి నాగర్కర్నూల్ రూరల్: కుమ్మెర ఘటనలో అకారణంగా దాడిచేసి.. రెండు నెలల పసికందు హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా శిబిరంలో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి మాట్లాడారు. కుమ్మెర ఘటనపై పోలీసులు స్పందించిన తీరును చూస్తుంటే.. నిందితులకు వారే పరోక్షంగా సహకరిస్తున్నారనే విషయం అర్థమవుతుందన్నారు. నేటికీ కులవివక్షత కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. నిరుపేద కుటుంబంపై దాడి, పసిబిడ్డ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి
కొల్లాపూర్: న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తెలంగాణ బార్ అసోసియేషన్ల సమాఖ్య చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావంగా మంగళవారం కొల్లాపూర్ జూనియర్ సివిల్జడ్జి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులపై గత కొంతకాలంగా దాడులు పెరుగుతున్నాయన్నారు. పాలక ప్రభుత్వాల అలసత్వమే ఇందుకు కారణమన్నారు. కఠిన చట్టాలు లేకపోవడంతో న్యాయవాదులకు రక్షణ లభించడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదులు శ్రీనివాసరావు, వసంతరెడ్డి, నజీరుద్దీన్, భాస్కర్రెడ్డి, ఉపేందర్, శ్రీహరి, శివారెడ్డి, నిరంజన్, కురుమూర్తి, మనోహర్, బాలస్వామి, రామలక్ష్మమ్మ, నళిని తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు కృషి చేయాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పీయూ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్కు అవసరమైన మానవ వనరులను అభివృద్ది చేసేందుకు కళాశాల స్థాయిలోనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. స్కిల్ మ్యాపింగ్, ఎక్స్పర్మెంటల్ లర్నింగ్, ఇంటర్న్షిప్, అప్రెంటిషిప్ వంటి వాటిని విద్యార్థులకు అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ప్రతినెల కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కోఆర్డినేటర్ రవికుమార్, సిద్దరామగౌడ్, సుజాత, రమేష్, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యమే పాపమైంది
కుమ్మెర ఘటనకు అధికారుల వైఫల్యమే కారణం వారిపై ఇలాంటిదాడులుంటాయా? పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పైనే దాడులు కొనసాగుతున్నాయని, ఉన్నత వర్గాలపై ఇలాంటి దాడులు ఎక్కడైనా ఉంటాయా అని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ప్రశ్నించారు. ఉన్నత వర్గాల, పెత్తందారుల చేతుల్లో దాడికి గురైతే పోలీసులు మాత్రం బాధితులపైనే మొదట కేసులు పెట్టారన్నారు. ప్రజాసంఘాల ఒత్తిడితో మాత్రమే తర్వాత నిందితులపై కేసు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసిన నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని, అందరినీ రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగాలి కుమ్మెరలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఎంపీ మల్లు రవి చెప్పారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతర నిర్వహణ మొదలు, దాడి ఘటన, తర్వాత కేసుల దర్యాప్తులోనూ అధికారుల నిర్లక్ష్యం కనిపించిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. మంగళవారం జిల్లాలోని నాగర్కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఆలయం వద్ద సంఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల బృందం పరిశీలించింది. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికను పరామర్శించారు. వారి నుంచి ఘటనకు కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర బీసీ కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, సమగ్ర విచారణ చేపడుతున్నట్టు వివరించారు. కుమ్మెర గ్రామంలో ఆలయ పరిసరాలు, సంఘటనా స్థలం, బాధిత కుటుంబం ఇంటిని పరిశీలించిన తర్వాత పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, భద్రతాలోపాలు తేటతెల్లమయ్యాయని వెల్లడించారు. 10 వేలకు మించి భక్తులు.. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, టి.సురేందర్, బాలలక్ష్మి బృందం కుమ్మెర గ్రామాన్ని సందర్శించారు. 10 వేలకు మించి భక్తులు పాల్గొనే జాతర నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఆలయంలో టికెట్, నిర్వహణ విషయంలో ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా.. పూర్తిగా సర్పంచ్, గ్రామ పెద్దల పెత్తనమే కొనసాగిందన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీస స్థాయిలో ఏర్పాట్లు లేవన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి పర్యవేక్షణ, ఏర్పాట్లు లేవని చెప్పారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొనే జాతరలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఆర్డీఓ సురేశ్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర వివరాలను నివేదిక అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ కరువు చిన్నారి మృతిపై విచారణ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లాకేంద్రంలో నాలుగోరోజు కొనసాగిన నిరసనలు నేడు కేటీఆర్ రాక.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 15,173 మంది విద్యార్థులు ● నేటి నుంచి వచ్చేనెల 18 వరకు కొనసాగనున్న పరీక్షలు వసతులపై ప్రత్యేక దృష్టి.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వసతులు కల్పించడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స నిమిత్తం సిబ్బందిని ప్రతి పరీక్ష కేంద్రాల్లో నియమించడంతో పాటు తరగతి గదుల్లో చీకటి ఉండకుండా లైట్లు, ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రశ్నపత్రాలను తెరవడం.. సీజ్ చేయడం వంటి వాటిని సీసీ నిఘాలో నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలను కంట్రోల్ కమాండ్ రూమ్కు అనుసంధానం చేశారు. కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదివరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవి. ఈ నేపథ్యంలో గతేడాది నుంచి ఓటీపీ ద్వారా ఆన్లైన్లో హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్బోర్డు కల్పించింది. హాల్టికెట్పై ఉండే బార్కోడ్ స్కాన్ చేస్తే ఏ పరీక్ష కేంద్రం అనే విషయం తెలిసిపోతుంది. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి.. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో 16 ప్రభుత్వ, 11 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక మైనార్టీ వెల్ఫేర్, ఒక సోషల్ వెల్ఫేర్, మూడు ఎంజేపీ, ఒక మోడల్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కొనసాగనున్నాయి. మొత్తం 15,173 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ 5,805 మంది, ఒకేషనల్ విభాగంలో 1,752 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్లో 5,837 మంది, ఒకేషనల్ విభాగంలో 1,779 మంది విద్యార్థులు ఉన్నారు. అధికారుల నియామకం.. పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 34 మంది డిపార్టుమెంట్ అధికారులు, 11 మంది అడిషనల్ చీప్ సూపరింటెండెంట్లు, ఏడుగురు కస్టోడియన్లు, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటు హైపవర్ కమిటీని నియమించారు. మాస్ కాపీయింగ్కు ఎక్కడా ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. 144 సెక్షన్ అమలు నాగర్కర్నూల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని.. ఎలాంటి సౌండ్ స్పీకర్లు, డీజే పెట్టకూడదన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని తెలిపారు. ఏర్పాట్లు పూర్తిచేశాం.. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వా తావరణంలో పరీక్షలు రాయాలి. ముఖ్యంగా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటరమణ, డీఐఈఓ -
విద్యార్థులు శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంచుకోవాలి
కందనూలు: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంపొందించుకొని తమ చుట్టూ జరుగుతున్న విషయాలను పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉందని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భౌతిక, రసాయన శాస్త్ర జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్మార్ట్ఫోన్లను వినోదానికి మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే సాధనంగా ఉపయోగించుకోవాలని హితవు పలికారు. జిల్లాస్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై న ముగ్గురు విద్యార్థులకు డీఈఓ నగదు బహుమతులు అందజేసి.. జ్ఞాపికలతో సత్కరించారు. ఈ క్రమంలో సిర్సవాడ జెడ్పీహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థిని జడ్పిహెచ్ఎస్ దీక్షిత మొదటి స్థానం సాధించగా, అదే పాఠశాల చెందిన విద్యార్థి హర్షవర్ధన్ రెండో స్థానం, బల్మూరు జెడ్పీహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థి కిరణ్సాగర్ మూడోస్థానం సాధించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంలు భాస్కర్రెడ్డి, ఎఫ్పీఎస్టీడీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
అన్ని అనుమతులు ఉన్నాయి
ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో న్యాయపరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకొనే కొనుగోలు చేశాం. 20 ఏళ్ల క్రితమే పట్టాదారుల రిజిస్ట్రేషన్తో పాటు నాలా, డీటీసీపీ అనుమతులు ఉన్నాయి. గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకున్నాం. పన్నులు కూడా కడుతున్నాం. ఇలాంటి సమయంలో ఇప్పడు దేవాదాయశాఖ భూమి అంటూ ఇబ్బంది పెట్టడం సరికాదు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. కాలనీల్లో ఇళ్లను మినహాయించి ఖాళీగా ఉన్న దేవాదాయ భూములను స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకంటామని హామీ ఇచ్చారు. – రాఘవేందర్, అధ్యక్షుడు, సరస్వతీ కాలనీ, జడ్చర్ల దేవాదాయ శాఖ పేర్కొన్న సర్వే నంబర్లలో ఇళ్లు, తదితర నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. గతంలోనే అనుమతులు నిలిపివేయాలని దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం వల్లే.. అన్ని అనుమతులు ఆపేశాం. – లక్ష్మారెడ్డి, కమిషనర్, జడ్చర్ల మున్సిపాలిటీ -
‘సామాజిక తెలంగాణ కోసం పోరాటం’
గద్వాల: పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం దక్కలేదని, సామాజిక న్యాయం కోసం తాము మరోపోరాటం చేస్తామని, అది నడిగడ్డ నుంచే మొదలుపెడతామని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె గద్వాల జిల్లా కేంద్రంలో రైతుల సంఘర్షణ సభలో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో నడిగడ్డ ప్రాంతం పూర్తిగా అన్యాయానికి గురైందన్నారు. మామ, బావ, అత్త, అల్లుడు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పాలిస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని, ఆయనకు ఏమైనా నిజాయితీ ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ అత్త, అల్లుడు రాజకీయానికి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని, అది నడిగడ్డకు వజ్రాయుధంగా మారుతుందన్నారు. మార్పు ఈ ప్రాంతం నుంచే మొదలుపెడతామన్నారు. సీడుపత్తి రైతులను ఆర్గనైజర్లు, కంపెనీలు నిండా ముంచుతున్నాయని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. -
కొలిక్కిరాని జడ్చర్ల వేంకటేశ్వరస్వామి భూముల వ్యవహారం
నెట్బాల్ చాంపియన్ మహబూబ్నగర్ ● బాలుర, బాలికల విభాగంలో జిల్లా జట్ల ప్రతిభ ● రన్నరప్లుగా మేడ్చల్, నారాయణపేట ● ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్బాల్ పోటీలు – మహబూబ్నగర్ క్రీడలు ఆందోళన.. అయోమయం● -
క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభ
నాగర్కర్నూల్ క్రైం: పోలీసు సిబ్బంది క్రమ శిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభచాటి పతకాలు సాధించవచ్చని ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడలలో జిల్లా పోలీస్ అధికారులు జోగుళాంబ జోన్ తరపున క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినట్లు సోమవారం ఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారని, జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐ శివాజీ, గౌస్ లాన్ టెన్నిస్ నాన్ గెజిటెడ్ పోలీస్ ఆఫీసర్స్ టీం ఈవెంట్ విభాగంలో పాల్గొని మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన సాధన దృఢ సంకల్పంతో విజయం సాధించారని, మున్ముందు మరిన్ని క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కందనూలు: జిల్లాలో పదో తరగతి పరీక్షలను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా మొత్తం 60 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 10,683 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. అందులో 5,264 మంది బాలురు, 5,394 మంది బాలికలు ఉన్నారన్నారు. జిల్లాలోని 257 ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఇతర మాధ్యమాల పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రతి పరీక్షకు మధ్య నాలుగు రోజుల వ్యవధి ఉండటం విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పారు. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు అవసరమైన విద్యా మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ప్రతి విద్యార్థి పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు చెప్పారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఈఓ రమేష్కుమార్, డీపీఓ శ్రీరాములు, డీఎంహెచ్ఓ రవికుమార్, ఏసీ రాజశేఖర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రగులుతున్న కుమ్మెర
దాడి ఘటనపై ముమ్మరమైన విపక్షాల నిరసనలు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు రానున్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, బీజేపీతోపాటు ప్రజాసంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించి హామీ ఇచ్చినా నిరసనల పర్వం ఆగడం లేదు. బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు నిందితులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
50 ఏళ్ల క్రితమే తారుమారు..
జడ్చర్ల వేంకటేశ్వరస్వామి ఆలయానికి 102 ఎకరాల భూమి ఉంది. ఇందులో జడ్చర్ల శివారులోని సర్వే నంబర్లు 125, 157, 160, 215, 267, 268లలో 63 ఎకరాల భూమి ఉంది. అలాగే భూత్పూర్ మండలంలోని తాటిపర్తి గ్రామ శివారులో 39 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ కూడా దేవాదాయ భూమి ఆక్రమణకు గురైంది. వీటికి భూరికార్డులు 50 ఏళ్ల క్రితమే తారుమారయ్యాయి. ఈ భూములకు సంబంధించి దేవాలయ నిర్వహణ చూస్తున్న కొందరు అర్చకులు తమ పేరు మీద రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అవి తమకు వంశపారపర్యంగా వచ్చిన భూములుగా పేర్కొంటూ దశల వారీగా విక్రయించారు. దీంతో ఆ భూములు పలువురి చేతులు మారాయి. రియల్ వ్యాపారులు ఆ భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్లు విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వందలాది మంది ఇళ్లు సైతం నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జడ్చర్ల సరస్వతీకాలనీ, మధురానగర్, ఆ చుట్టుముట్టు కొన్ని కాలనీలు దేవాదాయశాఖకు సంబంధించిన భూముల్లోనే వెలిశాయి. జడ్చర్ల శివారులో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్టు ఐదు దశాబ్దాల క్రితమే రికార్డులు తారుమారు చేతులు మారిన భూముల్లో వెలసిన వెంచర్లు, కాలనీలు ఆలస్యంగా మేల్కొన్న దేవాదాయ శాఖ అధికారులు క్రయవిక్రయాలు నిలిపివేత.. ఆందోళనలో కొనుగోలుదారులు జడ్చర్ల వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల వ్యవహారం చేంతాడులా సాగుతోంది. దశాబ్దాల తరబడి ఉలుకుపలుకు లేని దేవాదాయశాఖ అధికారులు మూడేళ్ల క్రితం మేల్కొని హడావుడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారు. దీంతో ఆ భూముల వ్యవహారం ఓ కొలిక్కిరాకుండా పోవడంతో పాటు ఆ భూముల్లో ఇళ్ల కట్టుకున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఆలయ భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో క్రయవిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతులను నిలిపివేయడంతో వందలాది మంది కొనుగోలుదారులలో ఆందోళన నెలకొంది. – జడ్చర్ల -
రెండు రోజుల పాటు కొనసాగిన నిరసనలు..
ఈనెల 18న కుమ్మెర ఆలయంలో దాడి ఘటన చోటుచేసుకోగా, శనివారం శిశువు మృతి చెందింది. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ రోడ్డుపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం సైతం ఉదయం నుంచి పోలీస్స్టేషన్ ఎదుట నిరసన కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీసీ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఎస్సీ, బీసీ కులసంఘాలు, బీఎస్పీ పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈనెల 18న ఫిర్యాదు ఇస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులను ప్రశ్నించారు. మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేస్తే ముగ్గురిని మాత్రమే అదుపులో తీసుకుంటామని చెప్పడం నిందితులను కాపాడటమేనని అన్నారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి బంధువులు అయినందుకే వారిని కాపాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. కుమ్మెర గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించారు. -
మహిళల ప్రగతి చక్రం
●ప్రతినెలా చెల్లింపు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 10 డిపోల పరిధిలో ఇందిరా మహిళా శక్తి కింద మొత్తం 32 బస్సులు నడుస్తున్నాయి. ప్రతినెలా హైదరాబాద్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి మండల మహిళా సమాఖ్యల ఖాతాలో డబ్బు జమ అవుతుంది. 84 నెలల తర్వాత బస్సులను తిరిగి ఆర్టీసీ అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వచ్చే ఆదాయం సమాఖ్యలకు చేరుతుంది. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ గ్రామ సంఘాలకు రుణం.. ప్రభుత్వం మా మండల సమాఖ్యకు ఆర్టీసీ బస్సు అందజేసింది. ఈ బస్సు మండల సమాఖ్య పేరిట రిజిస్టర్ కాగా.. అచ్చంపేట డిపో పరిధిలో నడుస్తోంది. ఆర్టీసీ నుంచి ప్రతినెలా మండల సమాఖ్య ఖాతాకు రూ.69,654 జమ చేస్తున్నారు. ఆర్టీసీ నుంచి వస్తున్న డబ్బులను గ్రామ సంఘాలకు రుణంగా ఇచ్చి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాం. – లలిత, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఉప్పునుంతల అచ్చంపేట: మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తిని కేటాయించడంతో ఆర్టీసీ బస్సుల ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రక్రియ.. ఇప్పుడు మహిళా సమాఖ్యల ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులను అప్పగించిన మహిళా సమాఖ్యలకు యాజమాన్యం క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తుండటంతో ఈ పథకం ద్వారా మహిళా సభ్యులకు మంచి ఫలితాలు అందుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వం బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టగా.. గతంలో రెండు నెలల అద్దెలు విడుదల కాగా.. ఇటీవల ఆరు నెలల అద్దెలను ఆర్టీసీ యాజమాన్యం మహిళా సమాఖ్యలకు చెల్లించింది. 64 బస్సులకు ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)కు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయించారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం 64 బస్సుల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 32 బస్సులు కొనుగోలు చేసి మహిళా సమాఖ్యలకు అందజేసింది. ప్రభుత్వం మహిళా సంఘాలకు బస్సుల కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వగా.. రూ.9.60 కోట్లతో ఇప్పటి వరకు 32 బస్సులు మహిళా సంఘాల ద్వారా సమకూర్చారు. వీటిలో నాగర్కర్నూల్ జిల్లాలోని వంగూరు, పెద్దకొత్తపల్లి, తిమ్మాజిపేట, బల్మూర్, ఉప్పునుంతల, నాగర్కర్నూల్, కల్వకుర్తి మండల సమాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున 7 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షల చొప్పున నిధులు సమకూర్చారు. వీటిలో మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు చెల్లించగా.. ప్రభుత్వం రూ.30 లక్షలను సీఏఎఫ్ (క్రెడిట్ ఆవిడంట్ ఫండ్)గా మంజూరు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మండల సమాఖ్యలకు ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారితకు పటిష్టమైన పునాదులు పడుతున్నాయి. నెలకు రూ.69,468 ఆదాయం ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 32 మండలాల మహిళా సమాఖ్యలకు చెందిన 32 బస్సులను 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున ఈఎంఐ (అద్దె రూపంలో ఆదాయం అందుతోంది. గత ఆరు నెలల కాలానికి గాను ప్రతి మండల సమాఖ్య ఖాతాలో రూ.4,16,808 జమ అయ్యాయి. మహిళా సమాఖ్యలు కేవలం రూ.6 లక్షల పెట్టుబడి పెట్టగా.. ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షల వరకు వెచ్చించింది. మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించిన బస్సులకు ప్రతినెలా సంస్థ సంబంధిత మహిళా సమాఖ్యలకు అద్దెలు చెల్లిస్తోంది. గత ఆరు నెలల కాలానికి ఆర్టీసీ జిల్లాకు సంబంధించి మొత్తం 32 బస్సులకు గాను రూ.1,33,37,856 చెల్లించింది. 84 నెలలపాటు ఒప్పందం ఆర్టీసీ బస్సులతో మహిళా సమాఖ్యలకు భారీ ఆదాయం ఈఎంఐలు సకాలంలోచెల్లింపుతో సభ్యుల ఊరట ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32 బస్సుల కొనుగోలు ఇది బ్యాంకు రుణం కాదని, ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అందజేసిన ఒక గొప్ప ఆర్థిక అవకాశం అని ఆధికారులు పేర్కొంటున్నారు. 84 నెలల ఒప్పందం ముగిసిన తర్వాత ఈ బస్సులను తిరిగి సంఘాలకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వచ్చే ఈ ఆదాయం మహిళా సమాఖ్యల బలోపేతానికి, మండల స్థాయిలో సామాజిక కార్యక్రమాలకు ఎంతో దోహదపడనుంది. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు సంబంధించిన అద్దెలను చెల్లించడంతో జిల్లాలోని మహిళా సమాఖ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా బస్సులను కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అప్పగించడం ద్వారా తాము యజమానులం కాగలిగామని, ఇది తమ ఆర్థిక ఎదుగుదలకు మరో అడుగుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.10 డిపోల పరిధిలో.. ఇందిరా మహిళా శక్తి కింద ఉమ్మడి జిల్లాకు కేటాయించిన మండల మహిళా సమాఖ్యల ఆర్టీసీ బస్సులు 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ఇందులో అచ్చంపేట డిపోలో 2, గద్వాలలో 4, కల్వకుర్తిలో 2, కొల్లాపూర్లో 2, కోస్గిలో 1, మహబూబ్నగర్లో 5, నాగర్కర్నూల్లో 2, నారాయణపేటలో 3, షాద్నగర్లో 4, వనపర్తిలో 7 చొప్పున ఉన్నాయి. -
రమణీయం.. రథోత్సవం
శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు వెల్దండ మండలం గుండాలలో ఆదివారం తెల్లవారుజామున శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా శివనామస్మరణ మార్మోగింది. రథంపై ఊరేగుతున్న స్వామివారిని భక్తులు దర్శించుకొని భక్తిపారవశ్యంతో పులకించిపొయారు. రథోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. – వెల్దండ -
ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష
కందనూలు: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి రెగ్యులర్, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీ నిమిత్తం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. మొత్తం 7,546 మంది విద్యార్థులకు గాను, 7,263 మంది హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జోనల్ అధికారి విద్యుల్లత తెలిపారు. పుర ఫలితాలే ప్రజాపాలనకు నిదర్శనం చిన్నంబావి: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు పురపాలికల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని వెల్టూరులో కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ కళ్యాణరావుతో కలిసి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ, మండల కేంద్రంలో దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందజేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారన్నారన్నారు. రెండేళ్ల ప్రజాపాలనలో పేదలకు అనేక సంక్షేమ పఽథకాలు అందించడమేగాక ప్రశాంత వాతావరణం కల్పించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో పాలనపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని పథకాలు అమలు చేస్తామని వివరించారు. బాధిత కుటుంబాలకు పరామర్శ.. వెల్టూరులో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలకిష్టయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన బాలీశ్వరి ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. బాలిశ్వరి పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, కృష్ణప్రసాద్ యాదవ్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంపై నిరసన సెగ
వివాదాస్పదంగా పోలీసుల తీరు ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలింపు.. కుమ్మెర ఆలయంలో భక్తులపై దాడికి పాల్పడిన నిర్వాహకుల్లో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కుమ్మెర గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మధుసుదన్రెడ్డిని పోలీసులు అదుపులోకి రిమాండ్ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. శిశువు మృతిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించినట్టు చెప్పారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగించి విచారణను పూర్తిచేస్తామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర ఆలయంలో భక్తులపై నిర్వాహకుల దాడి ఘటనలో రెండు నెలల శిశువు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసుల తీరుపై ఆదివారం బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. ఆదివారం జిల్లాకేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాలో వివిధ సంఘాల నేతలు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసుల వైఖరిపై మండిపాటు.. కుమ్మెర మల్లన్న ఆలయానికి ఈనెల 18న గ్రామానికి చెందిన చంద్రకళ, కీర్తి, గణేశ్, మౌనిక దర్శనం కోసం వెళ్లారు. రూ.100 ఎంట్రీ టికెట్ విషయంలో నిర్వాహకులకు, భక్తులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భక్తులు గణేశ్, చంద్రకళపై నిర్వాహకులు దాడి చేశారు. ఆలయం పక్కన కొబ్బరికాయల గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మౌనికపై సైతం దాడికి పాల్పడటంతో రెండు నెలల శిశువు సైతం కిందపడిపోయింది. కాగా, ఈనెల 21న శిశువు మరణించింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాడి కారణంగా కాకుండా వేరే కారణంతో మరణించి ఉండవచ్చని తమనే బెదిరింపులకు గురిచేశారని బాధితురాలు మౌనిక వాపోయారు. మల్లన్న జాతర దాడి ఘటనలో శిశువు మృతి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ బాధితుల ఆరోపణ పోలీస్స్టేషన్ ఎదుట ప్రతిపక్షాల నిరసన ఎట్టకేలకు ముగ్గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు -
బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక సేవాలాల్
కల్వకుర్తి టౌన్: సమాజంలో సమానత్వం, సేవాభావం, నిజాయతీ విలువలను బలపరిచిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేశ్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ బోధనలు సమాజానికి మార్గదర్శనీయమని.. ఆయన బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడిస్తే సమాజం మరింత సుస్థిరంగా, సమానంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతకు ముందు పట్టణంలోని హరిహర టౌన్ షిప్లో ఉన్న సేవాలాల్ మహారాజ్ భవనంలో ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయ వేషధారణలో బంజారా మహిళలు, యువతు లు నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమా కాంత్ రెడ్డి, తహసీల్దా ర్ ఇబ్రహీం, కాంగ్రెస్ నాయకులు ఆనంద్కుమార్, గణేశ్, హన్మానాయక్ పాల్గొన్నారు. -
చిన్నారి మృతి కారకులను శిక్షించాలి
నాగర్కర్నూల్ క్రైం: నాగర్కర్నూల్ మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో చంద్రకళతోపాటు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి.. రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి కుల సంఘాల ఆధ్వర్యంలో ఽజనరల్ ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11 గంటల వరకు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. జనరల్ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ చిన్నారి మృతికి కారణమైన కుమ్మెర గ్రామ సర్పంచ్ తుకారాంరెడ్డి, సతీష్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పట్టుబట్టారు. ధర్నా నాలుగు గంటలపాటు కొనసాగడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితులు, కుల సంఘాల నాయకులు ఎంతకూ ధర్నా విరమించలేదు. దీంతో డీఎస్పీ శ్రీనివాస్ ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో ఫోన్లో మాట్లాడించినప్పటికీ ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి 11 గంటల సమయంలో ప్రయాణికులు కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేయడంతో ధర్నాను విరమించారు. ధర్నాలో బీఎస్పీ అధ్యక్షుడు రామచందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు కొనసాగిన ధర్నా -
అదృష్టంగా భావిస్తాం..
వేణిసోంపురం గ్రామంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు మంత్రాలయంలో చేసిన విధంగానే ఆలయ అర్చకులు నిష్టగా పూజలు చేస్తారు. గోకులాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఉత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ గ్రామంలో వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉండడంతో మా గ్రామానికి ప్రత్యేకత వచ్చింది. – రవిగౌడ్, వేణిసోంపురం మాది మారుమూల గ్రామం. గతంలో నదీతీర ప్రాంతంలో మా గ్రామం విసిరివేసినట్లుగా ఉండేది. ఆలయం వెలిసినప్పటి నుంచి మా గ్రామానికి యాత్రికులు వచ్చి వెళ్తున్నారు. దాని వలన మా గ్రామానికి చాలా గొప్ప పేరు వచ్చింది. ఆలయంలో శ్రీకృష్ణుడు కుడికాలుపై ఎడుమకాలు వేసుకొని ఉండడం ఇక్కడి విశిష్టత. – శ్రీను, వేణిసోంపురం -
ముందుకు సాగునీరా
ఉమామహేశ్వర.. మైలారం శివారులో మొదలైన రిజర్వాయర్ ఆనకట్ట పనులు ●ఉమామహేశ్వర రిజర్వాయర్ ఆనకట్ట 6.5 కి.మీ పొడవు ఉంటుంది. 54 ఎకరాల ప్రభుత్వ భూమిలో 400 నుంచి 600 మీటర్ల పొడవైన ఆనకట్ట పనులు మొదలయ్యాయి. ఇప్పటికే పీడీ, 1,700 ఎకరాల్లో సర్వే పూర్తయ్యాయి. కొంత భాగం పీఎన్ వేయగా మరో 126 ఎకరాలకు సంబంధించి పీఎన్ వేయా ల్సి ఉంది. రెవెన్యూ రికార్డు పహాణి ప్రకారం అవార్డు వేసేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. నీటిని తీసుకునే విషయంపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాలి. భూ సేకరణ కోసం జీఓ 42 ప్రకారం ముందుకెళ్తున్నాం. – అమర్సింగ్, ఈఈ ఇరిగేషన్ శాఖ, అచ్చంపేట -
జిల్లాలో 6 సివిల్ సప్లయ్ గోదాంల ఏర్పాటు
లింగాల: జిల్లాలో అనుకూలంగా ఉన్న 6 గోదాంలలో సివిల్ సప్లయ్ బియ్యం నిల్వలను భద్రపరుస్తున్నట్లు జిల్లా అధికారి రాజేందర్ శనివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 56 రైస్మిల్లుల నుంచి సేకరించిన దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను ఆయా గోదాంలలో ఉంచడం జరుగుతుందని డీఎం తెలిపారు. ఈ క్రమంలోనే లింగాలలోని గోదాంలో సైతం బియ్యం నిల్వలు ఉంచుతామని, ఈ నిల్వలను ప్రతినెలా జిల్లాలోని వివిధ సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్లకు పంపిస్తామని వెల్లడించారు. కాగా లింగాలలోని గోదాంకు రెండు రోజుల నుంచి భారీగా వాహనాలు బియ్యం లోడ్లతో చేరుకున్నాయి. ఇక్కడి గోదాంలో 31 వేల బస్తాలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో వరి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం, అదే తరహాలో దిగుబడులు కూడా అధికం కావడంతో ప్రభుత్వం గోదాంలను సమకూరుస్తున్నట్లు సమాచారం. -
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్లో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రితోపాటు కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరే ప్రతిఒక్కరికి సేవాలాల్ మార్గదర్శకుడు అన్నారు. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. తండాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో సేవాలాల్ మందిరం నిర్మిస్తామని ప్రకటించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ భరత్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, సైకాలజిస్టు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా.. కొల్లాపూర్ రూరల్: మండలంలోని అంకిరావుపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, వ్యవసాయం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం తదితర గ్రామ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని ఆదేశించారు. అనంతరం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేష్, నాయకులు రామకృష్ట, విజయ్, ఉపసర్పంచ్ కుర్మయ్య, ఆనంద్, మధు పాల్గొన్నారు. -
వేణిసోంపురం
మహిమాన్వితం.. మరో మంత్రాలయంగా ఖ్యాతిగడించిన మారుమూల గ్రామం ● నదీతీరంలో చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి ఆలయం ● రెండు పాయలుగా చీలి తుంగభద్ర నది ప్రవాహం ● వెంకట రామాచార్యుల రాకతో మారిన రూపురేఖలు ● నదీగర్భంలో కలిసిపోయిన నల్లని రాతిబండలు ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని వేణిసోంపురం గ్రామం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. వేణిసోంపురం గ్రామాన్ని గతంలో సోంపురంగా పిలిచేవారు. ఈ గ్రామానికి కుడిపక్క తుంగభద్ర నది, ఎడుమ పక్కన నల్లని రాతిబండ ఉండేది. పక్కనున్న కేశవరం గ్రామం నుంచి సోంపురం మీదుగా పెద్దధన్వాడ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర నల్లని రాతిబండలు జడలా అల్లుకొని ఉండడంతో గ్రామానికి వేణిసోంపురం అనే పేరు వచ్చింది. సంస్కృతంలో వేణి అంటే జడ, పురం అంటే గ్రామం అని అర్థం. – అలంపూర్ (అయిజ) తుంగభద్ర నది వేణిసోంపురం గ్రామం సమీపంలో రెండు పాయలుగా విడిపోయి పారుతుండడం విశేషం. వ్యాసతత్వ తీర్థులకు వృద్ధాప్యం రావడంతో కి.మీ. దూరంలో ఉన్న నదికి ప్రతిరోజు ఉదయం, సాయత్రం వెళ్లి స్నానం చేసి స్వామివారి పూజలు చేయడం కష్టంగా అనిపించింది. అప్పుడు వ్యాసతత్వ తీర్థులు ఒక కర్రను తీసుకొని స్వామివారి ముందు పెట్టి ప్రత్యేక పూజలు చేసి అనంతరం నదిలోకి వెళ్లి ఆ కర్రతో ఆయన ఇంటి వరకు గీత గీశారు. అప్పుడు నుంచి తుంగభద్ర నదీ ప్రవాహం రెండు పాయలుగా చీలి ఒక పాయ వ్యాసతత్వ తీర్థుల ఇంటిని ఆనుకొని పారుతుందని చరిత్రలో రాయబడింది. అలాగే కాలక్రమంలో నదిలో ఇసుకమేటలు వేయడంతో రాతిబండలు కనిపించకుండాపోయాయి. ●వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించడంతో ఆ ప్రదేశానికి ప్రత్యేకత ఏర్పడి ఆ గ్రామం పేరు వెలుగులోకి వచ్చింది. ఆలయ నిర్మాణానికి ముందు చుట్టూ ప్రదేశాల్లో అక్కడక్కడ కొన్ని ఇళ్లు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది వచ్చి ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 800 జనాభా ఉంది. గ్రామం పక్కన నది ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతం పరిశీలన
కొల్లాపూర్: మండలంలోని సోమశిల సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి ప్రాంతాన్ని కేంద్ర అటవీ శాఖ ఐజీఎఫ్ త్రినాథ్కుమార్ శనివారం పరిశీలించారు. జాతీయ రహదారి–167కేతోపాటు బ్రిడ్జి నిర్మాణ కోసం వినియోగించనున్న అటవీ భూముల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ భూమికి బదులుగా ప్రభుత్వం అప్పగించే రెవెన్యూ భూముల వివరాలపై వాకబు చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను పరిశీలించి.. పరిహారం అంశాలపై చర్చించారు. తాము పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఐజీఎఫ్ త్రినాథ్కుమార్ వెల్లడించారు. ఆయన వెంట జిల్లా అటవీ అధికారి రేవంత్చంద్ర, ఎఫ్డీఓ చంద్రశేఖర్, రేంజర్ ఈశ్వర్, సిబ్బంది కాశన్న, ముజీబ్ఘోరీ, శివకుమార్, బయ న్న, నాగార్జున, మహేష్, శ్యాం తదితరులున్నారు. -
బాలికల సాధికారతకు కేజీబీవీలు దోహదం
కందనూలు: గ్రామీణ బాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పానికి కేజీబీవీలు బలమైన వేదికలుగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. బాలికల సాధికారత, నాణ్యమైన విద్య, ఉన్నత లక్ష్యాల సాధనలో కేజీబీవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ల్యూమినస్ లీగ్ ఆఫ్ కేజీబీవీలు, ప్రేరణ కార్యక్రమం, ఎస్సెస్సీ– ఇంటర్ విద్యార్థుల సన్మానోత్సవం, పూర్వ విద్యార్థులు, ఉత్తమ ఉద్యోగుల సత్కార కార్యక్రమానికి అదనపు కలెక్టర్తోపాటు డీఈఓ రమేష్కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. నిరంతర శ్రమ, పట్టుదల, సమయపాలనతోనే ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చన్నారు. విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్లో గొప్ప విజయాలకు దారితీస్తాయన్నారు. తల్లిదండ్రులు, గురువుల ఆశలను నెరవేర్చేలా చదువుపై పూర్తి దృషి్ాట్సరించాలని సూచించారు. డీఈఓ రమేష్కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రేరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాల సాధన దిశగా జిల్లా విద్యా శాఖ చర్యలు చేపడుతోందని, రానున్న ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను ఆరో స్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. కేజీబీవీల పర్యవేక్షణాధికారి శోభారాణి మాట్లాడుతూ జిల్లాలోని 20 కేజీబీవీల్లో విద్యార్థినులకు అందిస్తున్న విద్య, వసతి, సహ పాఠ్య కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కేజీబీవీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వివిధ స్థాయి ఉద్యోగులను అదనపు కలెక్టర్ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, సమగ్ర శిక్ష అభియాన్ ఫైనాన్స్ అధికారి మధుసూదన్రెడ్డి, ఎంఈఓలు భాస్కర్రెడ్డి, త్యాగరాజు, శ్రీనివాస్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు వెంకటయ్య, నూరుద్దీన్, కిరణ్కుమార్, కేజీబీవీల ఎస్ఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
కందనూలు: రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంలో సీఎస్, డిపార్టుమెంట్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రశ్నపత్రాల భద్రత, సమయపాలన, సిబ్బంది బాధ్యతలు, పర్యవేక్షణ విధానాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, బెంచీలు, శుభ్రమైన మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని హెచ్చరించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు, నోడల్ అధికారి కుర్మయ్య, ఎంఈఓ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి అమ్రాబాద్: అటవీ శాఖ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ వినయ్కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం అమ్రాబాద్ అభయారణ్యం ఫరహాబాద్ బేస్ క్యాంపులను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. వేసవి నేపథ్యంలో అడవుల్లో మంటలు వ్యాపించి.. వన్యప్రాణులు, అడవులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెంట ఎఫ్డీ సునీల్ హెరామత్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర తదితరులున్నారు. త్వరలోనే బీచుపల్లి ఆయిల్ మిల్లు ప్రారంభం ఎర్రవల్లి: జిల్లాలో ఆయిల్పాం తోటలు సాగు చేసిన రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని త్వరలోనే బీచుపల్లి ఆయిల్ మిల్లు ప్రారంభమవుతుందని తెలంగాణ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీచుపల్లి ఆయిల్ మిల్లులో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్, సివిల్, నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయిల్ మిల్లులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీచుపల్లిలో నూతన ఆయిల్ మిల్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. బీచుపల్లిలో ఆయిల్మిల్లు 95.20 ఎకరాల్లో ఉందని అందులో రూ.47 కోట్ల వ్యయంతో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈటీపీ వంటి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన జంగిల్ క్లియరెన్స్, సివిల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల మిల్లులో ఉన్న 11 భవనాలకు ఎన్డీటీ బృందం నాణ్యతా ప్రమాణ పరీక్షలను నిర్వహించి కేవలం రిఫైనరీ ఒకటి మాత్రమే నాణ్యత లేదని నిర్ధారించిందన్నారు. అలాగే రైతు సేవా కేంద్రం నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులకు ఆయిల్పాం పంటలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆయిల్పాం పంటలకు అవసరమైన డ్రిప్, ఎరువులు, హార్వెస్టింగ్, పరికరాలు కూడా త్వరలోనే ఆయిల్ మిల్లులో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. -
అంతర్గత తనిఖీలు
ఇంటర్నల్ మార్కులు.. పదో తరగతి విద్యార్థుల ప్రగతి పరిశీలన ● జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాల సర్వే ● ఒక్కో కమిటీకి 4 పాఠశాలల బాధ్యతల అప్పగింత ● ప్రైవేట్లో ఇష్టానుసారంగా కేటాయించినట్లు ఆరోపణలు ● ఈ నెల 25 వరకు పూర్తి వివరాల సేకరణ ●ఇంటర్నల్ మార్కులకు సంబంధించి ప్రతి పాఠశాలలో తనిఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలంలో రెండు నుంచి నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. నాలుగు ఎఫ్ఏలు, సబ్జెక్లుల వారీగా విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్లిప్ టెస్టుల ప్రకారం 20 మార్కులు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన మార్కుల లిస్టు ఎంఈఓలకు అందజేయాల్సి ఉంది. వారి నుంచి డీఈఓకు వచ్చాయి. అన్నీ పరిశీలించి ఎస్సెస్సీ బోర్డుకు పంపిస్తాం. – రమేష్కుమార్, డీఈఓ అచ్చంపేట: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పాఠశాలల్లో ఇచ్చిన ఇంటర్నల్ మార్కుల తనిఖీపై విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల మార్కులపై విద్యాశాఖ పరిశీలన కోసం బృందాలను ఏర్పాటు చేసింది. పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్, ప్రాజ్టెకుల మార్కుల నమోదు పరిశీలన ఈ నెల 16 నుంచి 25 వరకు పూర్తిచేయాల్సి ఉంది. డీఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు మండలాల వారీగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టాయి. ఆ తర్వాత జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో హెచ్ఎంలు మార్కులను ఎస్సెస్సీ బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది. 20 మార్కుల కేటాయింపు పదో తరగతిలో ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు సీసీఈ విధానంలో నాలుగు ఫార్మేటివ్ అసైన్మెంట్ పరీక్షల ఫలితాలు, విద్యార్థులు రాసే రికార్డుల ఆధారంగా కేటాయిస్తారు. పదో తరగతి విద్యార్థి భవిష్యత్కు ఈ మార్కులు కీలకంగా మారిన నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధ్యానం సంతరించుకుంది. విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్స్, చేతి రాత, ఎఫ్ఏలో వచ్చిన మార్కులను ఈ బృందాలు సూక్ష్మంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మేటివ్ పరీక్షల్లో వాస్తవ మార్కులు వేశారా.. ఇష్టానుసారంగా నమోదు చేశారా అన్న విషయాన్ని తనిఖీ బృందాలు పరిశీలించనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు అశాసీ్త్రయంగా అంతర్గత మార్కులు వేశారనే ఆరోపణలు దుమారం రేపాయి. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్టులో విద్యార్థికి అతి తక్కువ మార్కులు వచ్చినా.. ప్రాజెక్టు వర్క్ చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని తప్పుబట్టిన విద్యాశాఖ వాస్తవ పరిస్థితి కోసం ప్రైవేట్తోపాటు ప్రభుత్వ స్కూళ్లలో సైతం క్షేత్రస్థాయి విచారణ బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టింది. ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో ప్రతి పేపరు 80 మార్కులకు ఉంటుంది. మరో 20 మార్కులు తరగతి గదిలో ఆయా సబ్జెక్టుల వారీగా కనబరిచే ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్గా కేటాయిస్తారు. సరిగా ఐదేళ్ల క్రితం కంటిన్యూస్ అండ్ కాంప్రెహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) విధానంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. దీంతో ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్ స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్టు ప్రకారం మార్కులు కేటాయిస్తున్నారు. ఇలా కేటాయించిన మార్కులను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ ద్వారా టెస్టు పరీక్ష విభాగానికి డీఈఓల ద్వారా పంపాల్సి ఉంటుంది. కాగా.. ఇవేవి నిర్వహించకుండానే ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా గరిష్ట మార్కులు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ పాఠశాలలు 257 ఉన్నాయి. వీటి పరిధిలో 10,658 మంది రెగ్యులర్, 25 మంది ప్రైవేట్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 59 పరీక్ష కేంద్రాలు, ప్రైవేట్ విద్యార్థుల కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల నమోదుపై పాఠశాలలు సందర్శించి తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి మండల పరిధిలో జీహెచ్ఎం నేతృత్వంలో ఎఫ్ఏసీ హెచ్ఎం, లాంగ్వేజీ పండిత్, మరో నాన్ లాంగ్వేజీ ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్తోపాటు మరి కొందరు ఉపాధ్యాయులు కలిసి ఐదుగురు నుంచి ఏడుగురు ఉంటారు. ఒక్కో బృందం ఆయా మండలాల్లో ఉన్న పాఠశాలల సంఖ్యను బట్టి రెండు నుంచి 4 పాఠశాలల బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రక్రియ ఈ నెల 25లోగా పూర్తి చేసి ఉన్నత కమిటీకి నివేదిక సమర్పించనున్నాయి. ఆ తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మేటివ్ టెస్టులు నిర్వహించడంతోపాటు ప్రాజెక్టులు, రికార్డులను పరిశీలించి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయుల మార్కుల నమోదు చేసిన విషయం తెలిసిందే. -
నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు
నల్లమల అభయారణ్యంలో అరుదైన నక్షత్ర తాబేలు కనిపించింది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట (బ్రహ్మగిరి) నుంచి ఐటీడీఏ వైద్యాధికారి కల్యాణ్సాగర్ వాహనంపై మన్ననూర్ వస్తుండగా వటువర్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో ఆయన దానిని పట్టుకొని మన్ననూర్లో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నక్షత్ర తాబేలు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటని ఈ ప్రాంతంలో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని ఎఫ్ఆర్ఓ అబ్దుల్ సుగేర్, ఎఫ్ఎస్ఓ నరేంద్ర తెలిపారు. ఇటీవల మంటలు వ్యాపించిన నేపథ్యంలో తాబేలు బయటికి వచ్చి ఉంటుందని వారు పేర్కొన్నారు. – అమ్రాబాద్ -
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
కందనూలు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి డివిజన్లోని 116 గ్రామాలకు చెందిన సర్పంచ్లకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రెండో విడత శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళా శక్తికి మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. ● మహిళా సర్పంచులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో నిధులు, విధులను పారదర్శకంగా నిర్వహిస్తూ.. సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ లోటుపాట్లను అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని కోరారు. పన్నులు, ఇతర వనరుల ద్వారా సమకూరే ఆదాయం దృష్టి కేంద్రీకరించాలని, ఆదాయం సమకూరితే ప్రజోపయోగ పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపర్చాలన్నారు. రెండో విడతలో కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, చారకొండ, వంగూరు మండలాలకు చెందిన సర్పంచ్లకు ఐదు రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు, పారదర్శక పాలన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు డీపీఓ శ్రీరాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, నూతన సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తప్పని యూరియా తిప్పలు
జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సీజన్ ప్రారంభమై సగం గడిచిపోయినా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పెద్దకొత్తపల్లిలోని సింగిల్ విండోకు యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. అయితే యాప్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ధర్నాకు దిగారు. తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, బుకింగ్ గురించి తమకు తెలియదని వాపోయారు. పాసుపుస్తకాల ప్రకారం యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
‘డి–8’ పనులు పూర్తయ్యేనా?
మేజర్–2 కాల్వకు తరచూ గండి పడుతున్న వైనం ● స్ట్రక్చర్లు, మైనర్ కాల్వల నిర్మాణం పూర్తయితే అడ్డుకట్ట పడే అవకాశం ● 227 స్ట్రక్చర్లకుగాను 106 పూర్తి ● త్వరగా పనులు పూర్తి చేయాలంటున్న రైతులు – కొల్లాపూర్ ●మా పొలాలకు మేజర్–2 కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది. కాల్వ ప్రారంభంలో కేవలం రెండు గూనలు ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు నీరు అధికంగా, మరికొన్నిసార్లు తక్కువవగా రావడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం కాల్వ ప్రారంభంలో గండి పడింది. దీంతో రెండు గూనలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. గూనలు కాకుండా స్ట్రక్చర్ నిర్మించాలి. – చంద్రశేఖర్, మాజీ వైఎస్ ఎంపీపీ, గోపాల్పేట ఏటా పనులు చేపట్టేందుకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ముందుకు సాగడం లేదు. మేజర్–2 కాల్వ ప్రారంభంలో బుధవారం గండిపడి రెండు గూనలు కొట్టుకుపోయాయి. సమాచారం అందగానే పరిశీలించి వెంటనే తల్పునూరు వద్ద గేట్ను మూసి వేయించాం. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే స్ట్రక్చర్ నిర్మిస్తాం. – వెంకటరమణమ్మ, డీఈ, నీటిపారుదలశాఖ గోపాల్పేట: జిల్లా రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 29లో భాగంగా డి–8 కాల్వ నిర్మాణం ప్రారంభించారు. ప్రధాన కాల్వకు 11.6 కిలోమీటరు నుంచి డి–8 కాల్వ ప్రారంభమవుతుంది. సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 34.4 కిలోమీటర్ల పొడవు కాల్వ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్లుగా పనులు కొనసాగుతున్నా నేటికీ పూర్తి కాలేదు. అధికారులు ఏటా కాంట్రాక్టర్తో కొంతమేర పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మేజర్ కాల్వల పనులు అక్కడక్కడా తప్ప దాదాపు పూర్తయ్యాయి. మైనర్ కాల్వలు 17కుగాను ఇప్పటి వరకు ఆరు మాత్రమే నిర్మించారు. పనులు సరిగా చేపట్టడం లేదని సుమారు ఏడాదిన్నర కిందట టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీని తొలగించి మరో ఏజెన్సీకి అప్పగించారు. డి–8 కాల్వలో భాగమైన సింగిల్లైన్, (ఎస్ఎల్ఆర్బీ), డబుల్లైన్ (డీఎల్ఆర్బీ) వంతెనలు తదితర నిర్మాణాలతో కలిపి మొత్తం 227పైగా స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 106 వరకు స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగతావి వచ్చే ఏడాది వరకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వేసవిలోనైనా పూర్తిస్థాయి స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని గోపాల్పేట, రేవల్లి, పాన్గల్, వనపర్తి మండలాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు డి–8 కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది. ఇందులో ఏడు మేజర్, 17 మైనర్ కాల్వలు నిర్మించాల్సి ఉండగా.. మేజర్ కాల్వల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడా చిన్న చిన్న పనులు మిగిలాయి. మైనర్ కాల్వలు ఇప్పటి వరకు ఆరు మాత్రమే పూర్తికాగా.. మిగతావి నిర్మించాల్సి ఉంది. మేజర్–1 కాల్వ ద్వారా లక్ష్మీదేవిపల్లి, చెన్నారం, మేజర్–2 ద్వారా ఏదుట్ల, గోపాల్పేట, మేజర్–3 ద్వారా రేమద్దుల, తిర్మలాపూర్, అప్పాయిపల్లి, వనపర్తి మండలాలకు సాగునీరు అందుతోంది. మేజర్–4 ద్వారా రేమద్దుల, కిష్టాపూర్, కిష్టాపూర్తండా, గోప్లాపూర్, దావాజిపల్లి, దత్తాయిపల్లి, చందాపూర్ గ్రామాలకు, మేజర్–6 కాల్వ ద్వారా రాజాపూర్, శాగాపూర్, మాధవరావుపల్లికి సాగునీరు అందుతోంది. వర్షాలు అధికంగా కురిస్తే రాజాపూర్, సింగాయిపల్లికి నీరు అందుతుండగా.. వర్షాలు తక్కువగా కురిస్తే ఆయా గ్రామాలకు సాగునీరు అందదు. అధికారులు కాల్వల బాగుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ● గోపాల్పేట నుంచి ఏదుట్ల వెళ్లే దారిలో ఉన్న మేజర్–2 కాల్వకు ప్రారంభంలో బుధవారం బుధవారం గండి పడింది. రైతులు నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈ వెంకటరమణమ్మ పరిశీలించారు. -
‘కల్వకుర్తి రూపురేఖలు మారుస్తాం’
కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, అందుకు తగినట్టుగా పట్టణాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ఇప్పటికే సుమారు రూ.70 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అందరూ కలిసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో నియోజకవర్గానికి నిధులు ఇప్పిస్తామంటే బీజేపీ కౌన్సిలర్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని, రాజకీయ విద్వేషాలకు తావులేకుండా సమన్యాయంగా సమాంతర పాలన అందించాలని చెప్పారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులను చూసి ఖర్చు చేయాలని, ఏదో ఆదరాబాదరాగా అవసరం లేనిచోట ఖర్చు చేస్తే నిధుల దుర్వినియోగం అవుతుందే తప్ప అభివృద్ధి జరగదన్నారు. అంతకు ముందు చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ఖాన్ వారి చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు పలువురు నాయకులు, పట్టణ ప్రజలు చైర్పర్సన్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, డీఎస్పీ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, కాంగ్రెస్ నాయకులు ఆనంద్కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
19 రోజులు.. రూ.164.18 కోట్లు
● మున్సిపల్ ఎన్నికల్లో భారీగా మద్యం విక్రయాలు ● అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లోనే.. మహబూబ్నగర్ క్రైం: సాధారణంగా ఎన్నికలు అంటేనే మద్యం, డబ్బు ఏరులై పారాల్సిందే. ప్రధానంగా ప్రచార సమయంలో ఓటర్లు మద్యం మత్తులో ఊగుతుంటారు. అలాంటిది మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అంటే భారీగా లిక్కర్ పంపకాలు చేయడం సర్వసాధారణం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో నిలబడిన ప్రతి అభ్యర్థి ఆయా వార్డులు, డివిజన్లలో ఉన్న ప్రతి ఓటరుకు మద్యం సీసాలు అధిక మొత్తంలో పంపిణీ చేయడం జరిగింది. ఒక్కో వార్డు లేదా డివిజన్లో ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 8 మంది వరకు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఒకరిని చూసి మరొకరు పోటీపడి విచ్చలవిడిగా ఓటర్లకు మద్యం పంపిణీ చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో మద్యం అధికంగా పంపిణీ కావడం విశేషం. చిన్న మున్సిపాలిటీల్లో సాధారణ మద్యం ఇవ్వగా.. కార్పొరేషన్, కొద్దిగా పెద్ద మున్సిపాలిటీల్లో బ్రాండెండ్ లిక్కర్ ఓటర్లకు అందించారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కేవలం మద్యం కోసమే రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసిన సందర్భం కన్పించింది. ఫిబ్రవరి 1 నుంచి గురువారం వరకు ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాల పరిధిలో రూ.168.18 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో అధిక మొత్తం ఈ నెల 4 నుంచి 9 తేదీల మధ్య జరగడం విశేషం. మద్యం అమ్మకాల్లో ప్రధానంగా మహబూబ్నగర్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. డిపో ఐఎంఎల్ బీర్లు నగదు (రూ.కోట్లలో..) తిమ్మాజిపేట 97,600 1,17,400 102.08 కొత్తకోట 60,300 65,500 62.10 లిక్కరే అధికం ఎన్నికల్లో అభ్యర్థులు అధిక మొత్తంలో లిక్కర్ కాటన్లు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. అయితే ఓటర్లకు దాదాపు 99 శాతం లిక్కర్ బాటిల్స్ అందించగా చాలా తక్కువగా బీరు బాటిల్స్ ఇచ్చిన ఘటనలు కనిపించాయి. సాధారణ ఓటర్లకు ఇంటింటికి తిరిగి లిక్కర్ బాటిల్స్ మాత్రమే పంపిణీ చేశారు. రెండు డిపోల పరిధిలో విక్రయాలు ఇలా.. ఉన్నతాధికారులకు విన్నవించాం.. ధ్రువపత్రాలు, ప్రొసీడింగ్లు, ఇతర కార్యాలయ పనులు చాలావరకు టీసీసీఓలతోనే చేయిస్తాం. ఏళ్లుగా వారి సేవలు వినియోగిస్తున్నాం. కార్యాలయంలో వారి అవసరం చాలానే ఉంది. తొలగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సైతం నివేదించాం. మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. జిల్లాకేంద్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు లేకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలకు సరైన సేవలు అందించలేం. – రమేష్రెడ్డి, తహసీల్దార్, వనపర్తి -
గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో గర్భిణులకు తప్పనిసరిగా హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఐసీటీసీ కౌన్సెలర్లు, ఎన్జీఓ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారితో సమావేశమై జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో హెచ్ఐవీ నివారణకు వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. హెచ్ఐవీ నిర్ధారణ అయిన గర్భిణులు ఏఆర్టీ మందులు వాడటం ద్వారా జన్మించే శిశువులకు హెచ్ఐవీ వ్యాపించకుండా అరికట్టగలమని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న జాతర్లు, గ్రామాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై అవగాహన శిబిరాలను ఏర్పాటుచేసి.. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో దిశ సీపీఎం జ్యోతి, సీఎస్ఓ రవీందర్రెడ్డి, డీఎండీఓ సాయికుమార్ తదితరులు ఉన్నారు. -
అంగన్వాడీలపై ఫోకస్
సర్పంచ్లకు కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ● పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు చర్యలు ● గర్భిణులు, చిన్నారులకు మేలు జరిగే అవకాశం గాడిన పడేనా.. సర్పంచ్ల పర్యవేక్షణతో అంగన్వాడీ కేంద్రాలు గాడిన పడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయా కేంద్రాలను ఐసీడీఎస్ పీడీ, సీడీపీఓలు, సూపర్వైజర్లు పర్యవేక్షించాల్సి ఉంది. వీరిలో చాలా మంది కార్యాలయానికే పరిమితం కావడం.. చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడమే తప్పా ఎలాంటి ప్రయోజం లేకుండా పోతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆయా కేంద్రాల్లో చిన్నారులు లేకపోయినా సరుకులను లబ్ధిదారులకు ఇచ్చినట్లుగా కొంత మంది నమోదు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ల పర్యవేక్షణతో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కానుంది. ఇక్కడ చదివిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 11 మందితో కమిటీ.. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు సంబంధించి 11 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి సర్పంచ్ చైర్పర్సన్గా, అంగన్వాడీ టీచర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఏఎన్ఎం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో మున్సిపల్ పరిధిలోని కేంద్రాలను మినహాయించి.. గ్రామ పంచాయతీల్లోని కేంద్రాలకు సర్పంచ్లు చైర్మన్గా ఉంటారు. అచ్చంపేట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్లకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం గ్రామ పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో కొత్త కమిటీల ద్వారా పర్యవేక్షణ పెంచాలని నిర్ణయించింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందనుంది. అలాగే సిబ్బంది సమయపాలన మెరుగుపడటంతో పాటు అక్రమాలకు చెక్ పడనుంది. పనిచేస్తున్న ఆయాలు 667 ఆయాల ఖాళీలు 467 -
ఉద్యోగం.. ప్రశ్నార్థకం!
●ఉద్యోగాల తొలగింపు సరికాదు.. తహసీల్దార్ కార్యాలయంలో 2008 నుంచి కంప్యూటర్ ఆపరేటర్గా చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నాం. మూడు, నాలుగు నెలలకు ఓసారి వేతనం చెల్లిస్తుండగా.. ఎప్పటికై నా కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని భావించాం. కానీ ఏకంగా ఉన్న ఉద్యోగాన్ని తొలగించి బయటకు పంపే ప్రయత్నం చేస్తారని ఊహించలేదు. – రమేష్, కంప్యూటర్ ఆపరేటర్, వనపర్తి ఉద్యోగ భద్రత, పే స్కేల్ ఇవ్వాలి.. తహసీల్దార్ కార్యాలయాల్లో కీలకంగా పని చేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పే స్కేల్ అమలు చేసి ప్రతినెలా వేతనం ఇవ్వాలి. ఏళ్లుగా పనిచేస్తున్న మేము ఇప్పుడు బయటకు వచ్చి కొత్తగా ఉద్యోగం వెదుక్కొనే పరిస్థితి కల్పించొద్దు. వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, కుటుంబం మాపై ఆధారపడి జీవిస్తున్న విషయం ప్రభుత్వ పెద్దలు గుర్తించి న్యాయం చేయాలి. – రఘు, కంప్యూటర్ ఆపరేటర్, ఆత్మకూరు వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. దీంతో రెవెన్యూశాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఏళ్లుగా అతి తక్కువ వేతనంతో పని చేస్తున్న టీసీసీఓ (టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్)లను శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ప్రస్తుత నడివయస్సులో మరో పని ఎక్కడ చూసుకోవాలనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు కనీసం ప్రత్యామ్నాయం చూపించే దిశగా ఆలోచించకుండా రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్లను నియమించి తమను తొలగించడం ఏమిటనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం ధరణి చట్టాన్ని అమలుచేసే క్రమంలో చోటు చేసుకున్న తప్పిదాలు, అక్రమాలను సైతం ప్రస్తుతం విధులు నిర్వర్తించే టీసీసీఓలకు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తాము ధరణి, భూ భారతి వెబ్సైట్లోగాని, రిజిస్ట్రేషన్ విభాగంలోగాని పని చేయలేదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 76 మందికి పైగా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మార్చి 31న రెన్యూవల్ చేయాల్సిన ఔట్సౌర్సింగ్ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లు 76 మందికి పైగా ఉన్నారు. వీరిలో సుమారు 18 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్నవారు సైతం ఉండటం గమనార్హం. వీరి జీవితం సగం ఇక్కడే గడవగా.. ప్రస్తుతం మరో ఉద్యోగం చూసుకోవాలంటూ బయటకు పంపడం, వారి కుటుంబాలు వీధిన పడుతాయనే ధ్యాస లేకపోవడం శోచనీయం. హైదరాబాద్ ఉద్యోగులకు మినహాయింపు.. వీరితోపాటే 300 హెడ్లో వేతనం పొందుతున్న హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తించే వారిని మినహాయించి మిగతా 32 జిల్లాల్లో పనిచేసే వారిని తొలగించాలని నిర్ణయించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూశాఖ ఉద్యోగ సంఘాల నేతల వద్ద సమాధానం లేకపోవడం శోచనీయం. నాగర్కర్నూల్ 10 గద్వాల 11 రెవెన్యూశాఖలో టీసీసీఓల తొలగింపునకు రంగం సిద్ధం? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 76 మంది ఆందోళనలో కుటుంబాలు న్యాయం చేయాలంటూ అధికారులు, పాలకులకు వేడుకోలు ఇన్నాళ్లూ కీలకంగా పనిచేసి.. నాలుగు సాధారణ ఎన్నికలు, ఎల్ఆర్యూపీ, భూమి (వెబ్ ల్యాండ్), ఐఎల్ఆర్ఎంఎంస్, అకాల వర్షాలు, రెగ్యులర్ సర్టిఫికెట్లు, ఎన్నికల సమయంలో ఫారం–7, 8, 8ఏ తదితర పనులు టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లతో ఆయా మండలాల తహసీల్దార్లు దగ్గరుండి చేయించారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా రెవెన్యూ సదస్సులు, ఇతర పనుల సమయంలో రాత్రింబవళ్లు వీరి సేవలను వినియోగించారు. కానీ ఇటీవల ఎక్కడో ఒకచోట చోటుచేసుకున్న పొరపాట్లను తమకు ఆపాదించి తొలగించే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని అఽధికారులు, పాలకులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
● రైతులు సేంద్రియ ఎరువులపై దృష్టిసారించాలి ● రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వంగూరు/చారకొండ: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి.. రైతులకు అండగా నిలుస్తోందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. గురువారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన రైతు అవగాహన సదస్సుకు రైతు కమిషన్ సభ్యులతో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే విధంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టిసారించాలన్నారు. తద్వారా రైతులకు అధిక దిగుబడులు వస్తాయన్నారు. గతంలో భూసార పరీక్షలు చేయించుకునేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేవి కావని.. ప్రస్తుతం భూ సారం, ఎరువుల వాడకం తదితర అంశాలను తెలుసుకునేందుకు నేరుగా రైతులకే భూసార పరీక్షల కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు భూ సారానికి అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. అనంతరం పలువురు రైతులకు భూసార పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. అదే విధంగా చారకొండ మండలం జూపల్లి శివారులో రైతు రంగప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న పంటలను రైతు కమిషన్ సభ్యులు రాములునాయక్, ఎం.సునీల్కుమార్, రాంరెడ్డి, గోపాల్రెడ్డి, గంగాధర్, కేవీఎన్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానితో కలిసి చైర్మన్ కోదండరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు సుచిత్ర, అడిషనల్ డైరెక్టర్ సంధ్యారాణి, డీఏఓ యశ్వంత్రావు, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు భజేంద్ర, డా.రాంప్రసాద్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సీఎం వెంకటేఽశం, హార్టికల్చర్ అధికారి మహేశ్వరి, ఏఓ సురేశ్, హెచ్ఈఓ శివలీల, సర్పంచ్ వెంకటయ్య పాల్గొన్నారు. -
నిర్వాసితుల గోడు పట్టదా?
చారకొండ: గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి.. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను ముంపు నుంచి మినహాయించాలని మూడు నెలలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం బాధాకరమని నిర్వాసితులు సూగూరి ప్రకాశ్, శ్రీరాములు, పెద్దయ్య, పర్వతాలు, నాగయ్య నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 80వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్వాసితుల గోడును ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరించడం సరైంది కాదన్నారు. వెంటనే పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలని కోరారు. నేడు డయల్ యువర్ డీఎం కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఉమాశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 94937 33602 నంబర్కు సంప్రదించి రవాణాపరంగా సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ సెమిస్టర్–1కి సంబంధించి రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పీయూలోని పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి తదితరులు తనిఖీ చేశారు. పరీక్షలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పీయూ పరిధిలో మొ త్తం 1,851 మంది విద్యార్థులకు గాను 11 కేంద్రా లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మొదటిరోజు పరీక్షకు 1,506 మంది హాజరవగా.. 346 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతుండగా అధికారులు డిబార్ చేశారు. -
పునరావాస కష్టాలు?
భూత్పూర్, నేరెడుగాం ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటు పట్టని ప్రభుత్వం భూత్పూర్ రిజర్వాయ ర్లో గ్రామస్తులు సర్వ స్వం కోల్పోయారు. వ్యవ సాయ భూములకు మా త్రమే నామమాత్రపు పరిహారం అందింది. పునరావాసం కల్పించడంలో జాప్యం చేస్తున్నారు. రిజర్వాయర్లో నీటి నిల్వతో గ్రామంలో ఊటనీరు వస్తోంది. ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆదుకోవాలి. – కుర్వ హన్మంతు, మాజీ సర్పంచ్, భూత్పూర్ భూత్పూర్లో తేమశాతం అధికంగా ఉండటంతో ఇళ్లు పాడవుతున్నాయి. ఇళ్లల్లో నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. ముంపునకు గురైన గ్రామంలో అధికారులు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి. – ఆనంద శేఖర్, భూత్పూర్ సంగంబండ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన మా గ్రామ సమస్యను ఏళ్ల తరబడి పరిష్కరించడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలు ఎవ రికీ పట్టడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు చేయాలి. – ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ, నేరెడుగాంనారాయణపేట జిల్లాలో భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. 15 ఏళ్లుగా పునరావాసానికి నోచుకోక ముంపు గ్రామాల్లోనే భయంభయంగా కాలం వెల్లదీస్తున్నారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కట్టకు ఆనుకొని ఉన్న భూ త్పూర్, నేరెడుగాం గ్రామాలను సీపేజ్ కింద ఎంపిక చేశారు. అయితే నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అడుగు ముందుకు పడటంలేదు. ఫలితంగా ముంపు గ్రామాల్లో ఊటనీటితో నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. మట్టి ఇళ్లు కూలిపోతుండటంతో నిర్వాసితులు భయాందోళన చెందుతున్నారు. తమకు పునరావాసం కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తు న్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సాగునీటి రిజర్వాయర్లలో సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన నేరెడుగాం, భూత్పూర్ గ్రామాల ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో కలిసి ముంపు గ్రామాలను పరిశీలించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే ఆర్అండ్ఆర్ పనులు మొదలుపెడతాం. – రాజేందర్గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముంపు గ్రామాల్లోనే నిర్వాసితుల నివాసం 15 ఏళ్లుగా అవస్థల నడుమ జీవనం పునరావాసం కల్పించాలని వేడుకోలు రిజర్వాయర్ల నిర్మాణం కోసం వందలాది ఎకరాల భూమిని త్యాగం చేశారు. పుట్టి పెరిగిన గ్రామంతో తెగతెంపులు చేసుకుని పిల్లాపాపలతో పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి. కానీ వారికి ఆర్అండ్ఆర్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో ముంపు ప్రాంతాల్లోనే గడుపుతున్నారు. భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలో సర్వం కోల్పోయిన నిర్వాసితులు దాదాపు దశాబ్దన్నరగా అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలంలో ఊటనీరు వచ్చి.. ఇళ్లు కూలిపోతున్నా.. బిక్కుబిక్కుమంటూ అక్కడే గడుపుతున్నారు. – మక్తల్ -
కాంగ్రెస్లో జోష్
అన్నిచోట్ల ఢీలా పడిన బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల సమరాన్ని మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడు తూ, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే ము న్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజే పీ శ్రేణులను నైరాశ్యానికి గురిచేశాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాషాయ పార్టీ ఢీలా పడింది. కల్వకుర్తిలోనే బీజేపీకి అత్యధికంగా 5 వార్డు స్థానాలు దక్కాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీతో పాటు కొల్లాపూర్లో బీజేపీకి కనీసం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఇప్పటివరకు బోణి కొట్టలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపుతామని పార్టీ శ్రేణులు భావించగా.. ఫలితాల్లో మాత్రం నిరాశే మిగిలింది. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీలో జోష్ నింపగా.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో నైరాశ్యాన్ని నింపింది. మూడు ప్రధాన పార్టీలు రాజకీయ గుర్తులతో క్షేత్రస్థాయిలో తలపడిన పురపోరులో ఫలితాలపై ఎవరికి వారు విశ్లేషణల్లో మునిగిపోయారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. తగ్గిన కారు జోరు.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు తగ్గింది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. గత పంచాయతీ ఎన్నికల్లో మోస్తరుగా సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అంచనాలు పెరిగాయి. అయితే అత్యధికంగా నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోనే బీఆర్ఎస్కు 6 వార్డు స్థానాలు దక్కాయి. కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో మూడేసి చొప్పున స్థానాలకే పరిమితమైంది. కల్వకుర్తిలో బీజేపీకి 5 స్థానాలు వస్తే.. బీఆర్ఎస్ 3 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ ఉండగా.. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. ప్రాదేశిక ఎన్నికలకు సన్నద్ధం.. మున్సిపల్ ఎన్నికల పర్వం ముగియడంతో రాజకీయ పార్టీల దృష్టి ప్రాదేశిక ఎన్నికలపై పడింది. మున్సిపల్ ఎన్నికల ప్రభావం రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చూపిస్తుందన్న విషయంలో అంచనాలు మొదలయ్యాయి. పట్టణ ఓటర్లు, పల్లె ఓటర్లకు తారతమ్యం ఉండొచ్చన్న భావనతో పార్టీలు వ్యూహరచనకు సిద్ధమవుతున్నాయి. రాజకీయ గుర్తులతో తమ అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రాదేశిక ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి పై‘చేయి’.. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ ఏకంగా 16 స్థానాలను గెలుచుకుంది. సామాన్య వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన రెడ్డి జ్యోతికి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం దక్కింది. కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డు స్థానాలకు గాను కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ చైర్మన్ పీఠం జనరల్కు రిజర్వు కాగా.. బీసీ వర్గానికి చెందిన రత్నమాల చైర్పర్సన్ అయ్యారు. నాగర్కర్నూల్ పురపాలికలో 24 వార్డులు ఉండగా, అత్యధికంగా 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ బీసీ జనరల్కు రిజర్వు కాగా.. 23 వార్డు నుంచి గెలుపొందిన యువ కౌన్సిలర్ తీగల సునేంద్రకు చైర్మన్గా అవకాశం దక్కింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ మ్యాజిక్ ఫిగర్కు మించి కాంగ్రెస్ అత్యధిక స్థానాలతో పై‘చెయ్యి’గా నిలిచింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో హస్తం హవా కొల్లాపూర్, కల్వకుర్తిలో మూడు స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ నాగర్కర్నూల్, కొల్లాపూర్లో బోణీ కొట్టని కాషాయ పార్టీ -
భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచండి
కందనూలు: సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచి.. ముంపు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో సంబంధిత అధికారులతో వారు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పురోగతి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల్లో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు న్యాయమైన పరిహారం, సమగ్ర పునరావాస ప్యాకేజీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మార్లపాడుతండా, కేశ్యతండా ప్రజల ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించి.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పరిహారం అందించాలన్నా రు. అలాగే ఆర్అండ్ఆర్ కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సదుపాయాలను సమగ్రంగా కల్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. అందుకు అనుగుణంగా భూ సేకరణ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘నక్కలగండి’ నిర్వాసితులకు న్యాయం చేస్తాం అచ్చంపేట రూరల్: నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అన్నారు. అచ్చంపేట మండలంలోని మార్లపాడుతండా, కేశ్యతండా నిర్వాసితులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం కల్పించి.. బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ముందుగా బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటికే ఆలస్యమైందని.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ త్వరగా అందించి పునరావాసం కల్పించాలని ముంపు బాధితులు డిమాండ్ చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, ఆర్ఐ బాల్రాం తదితరులు ఉన్నారు. నిర్వాసితులకు పునరావాసంకల్పించడంలో అలసత్వం వద్దు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ బదావత్ సంతోష్ -
బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి
అమ్రాబాద్: ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డీటీఎఫ్ రాష్ట్ర కారదర్శి జక్క రామస్వామి కోరారు. బుధవారం అమ్రాబాద్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన డీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యారంగానికి అరకొర నిధులను కేటాయిస్తూ.. ప్రభుత్వ విద్యను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఆరోపించారు. తండాలు, గూడాల్లో వివిధ కారణాలతో పా ఠశాలలు మూసివేయడం తగదన్నారు. ప్రభు త్వం అన్ని పాఠశాలలను కొనసాగించాలని, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చే శారు. సమావేశంలో నాయకులు ఎల్లయ్య, పాండు, భీమయ్య, విజయ్, రాజేశ్వరి ఉన్నారు. -
‘అంగన్ వాడీ’ నిర్వహణలో అలసత్వం వహించొద్దు
బల్మూర్: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి హెచ్చరించారు. బుధవారం రాంనగర్ రైతువేదికలో బల్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని లింగాల, బల్మూర్, ఉప్పునుంతల మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు ఐసీడీఎస్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటిస్తూ.. ప్రీ స్కూల్ కార్యక్రమాలను ప్రణాలికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం ఆరోగ్యలక్ష్మి భోజనం అందించాలన్నారు. ప్రతినెలా 5వ తేదీలోగా ఐదేళ్లలోపు చిన్నారులు, బాలింతల ఎత్తు, బరువు చూసి.. ఎన్హెచ్టీఎస్, పోషణ ట్రాకర్ యాప్ల్లో నమోదు చేయాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్కార్డు ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా బాల్యవివాహం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే 1098 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ దమయంతి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ విజ్ఞాన్ పాల్గొన్నారు. -
నాసిరకం భోజనంపై విద్యార్థుల ఆందోళన
కొల్లాపూర్ రూరల్: పట్టణంలోని పీజీ కళాశాల వసతిగృహంలో మెనూ పాటించకపోవడంతో పాటు నాసిరకం భోజనం అందిస్తున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్లో వండిన భోజనంతో పీజీ కళాశాల ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కళాశాల హాస్టల్లో కొంతకాలంగా మెనూ అమలు చేయకపోవడంతో పాటు నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై నెలరోజుల క్రితం ప్రిన్సిపాల్కు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నాణ్యత లేని భోజనం తిని గత నెల 26న ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వాపోయా రు. తమకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇకపై మెనూ ప్రకారం భోజనం అందిస్తామని ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్ విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళనకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆది మద్దతు తెలిపి పాల్గొన్నారు. -
జనరల్లోనూ బీసీలు
ఉమ్మడి జిల్లాలో జనరల్ స్థానాల్లో బీసీల హవా సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల పాలకవర్గాలు కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలోని 8 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు జనరల్కు రిజర్వ్ అయ్యాయి. వీటిలో ఏకంగా ఏడు స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వనపర్తి మున్సిపాలిటీ మినహా మిగతా అన్రిజర్వ్డ్ మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీసీలే కై వసం చేసుకున్నారు. కల్వకుర్తి, గద్వాల, కోస్గి, నారాయణపేట, మక్తల్, అమరచింత, పెబ్బేర్ మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు అన్రిజర్వ్డ్గా ఉండగా ఆయా చోట్ల బీసీలు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ● ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు 8 చోట్ల మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు అన్రిజర్వ్ అయ్యాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్పర్సన్గా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన భృంగి రత్నమాల ఎన్నికయ్యారు. గద్వాల మున్సిపాలిటీలో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల జయలక్ష్మి చైర్పర్సన్ అయ్యారు. కోస్గి మున్సిపాలిటీలో బీసీ వర్గానికి చెందిన నాగులపల్లి నరేందర్, నారాయణపేటలో బీజేపీ నుంచి యాదవ వర్గానికి చెందిన కొండ శ్వేత ఎన్నికయ్యారు. మక్తల్లో చైర్మన్ స్థానం జనరల్గా ఉండగా ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ వాకిటి మానసకు అవకాశం దక్కింది. అమరచింతలో యాదవ సామాజిక వర్గానికి చెందిన జింక సువర్ణ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. పెబ్బేర్లో చైర్మన్గా అక్కి శ్రీనివాస్గౌడ్కు అవకాశం దక్కింది. వార్డుస్థానాల్లో అత్యధికంగా బీసీల ఎన్నిక.. మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్రిజర్వ్డ్ వార్డుల్లోనూ అత్యధిక స్థానాల్లో బీసీలు గెలుపొందారు. ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 159 వార్డులు జనరల్కు కేటాయించగా, వీటిలో 84 మంది బీసీలు కౌన్సిలర్లుగా గెలుపొందారు. అత్యధికంగా గద్వాల మున్సిపాలిటీలో 15 మంది బీసీలు జనరల్ స్థానాల్లో విజయ ఢంకా మో గించారు. వనపర్తి మున్సిపాలిటీలో 14 మంది, నారాయణపేటలో 9 మంది, కొల్లాపూర్ లో 8 మంది, మహబూబ్నగర్ కార్పొరేషన్లో 8 మంది బీసీలు గెలుపొందారు. వీరితో పాటు మరో 8మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీ లు జనరల్గా ఉన్న వార్డుల్లో విజయం సాధించారు. కల్వకుర్తిలో రెండు జనరల్ స్థానాల్లో ఎస్టీలు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. అన్ రిజర్వ్డ్గా ఉన్న 8 పురపాలికల్లో 7 చోట్ల బీసీలే చైర్మన్లు కల్వకుర్తి, గద్వాల, అమరచింత, కోస్గి, మక్తల్, నారాయణపేట, పెబ్బేరులో చైర్మన్ స్థానాలు బీసీల వశం వనపర్తిలో మాత్రమే ఓసీలకు దక్కిన చైర్మన్ పీఠం 143 జనరల్ వార్డుల్లో 84 మంది బీసీలు కౌన్సిలర్లుగా గెలుపు -
వైద్య శిబిరాలను వినియోగించుకోండి
అమ్రాబాద్: జిల్లా వైద్య శాఖ, ఐటీడీఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను చెంచులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని మొల్కమామిడి, మాచారంకాలనీలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాలను సందర్శించి ఆయన పరిశీలించారు. శిబిరంలో చెంచులకు అందుతున్న నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెంచుల ఆరోగ్య సమస్యల కోసమే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికై నా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్య సిబ్బందిని సంప్రదించి ప్రభుత్వం నుంచి ఉచితంగా అందిస్తున్న సేవలను పొందాలని సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం ఉంటే పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవాలన్నారు. రక్తపోటు మధుమేహం నిర్ధారణ పరీక్షలు చేయించుకొని పూర్తిస్థాయిలో చికిత్స పొందాలని చెప్పారు. కార్యక్రమంలో మన్ననూర్ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుధాకర్, మోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పాడితో రైతులకు అదనపు ఆదాయం
ఉప్పునుంతల: రైతులు వ్యవసాయంతోపాటు పాడి ఆవులు, గేదెలను పెంచుకుంటే అదనపు ఆదాయం పొందడంతోపాటు వాటి నుంచి వచ్చే ఎరువులను వేసుకుంటే పొలాలు సారవంతమవుతాయని జిల్లా పశువైద్య శాఖాధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాపూర్లో పశుసంవర్ధశాఖ, పశుగణాభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాడి పశువులకు సకాలంలో గర్భకోశ వ్యాధి పరీక్షలు చేయించి చికిత్స అందిస్తే సకాలంలో ఎదకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పాడి రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచు బరిగెల శ్రీకాంత్, ఉప సర్పంచు రేణయ్య, పశువైద్యాధికారులు వెంకటేశ్వర్లు, ప్రవీణ్కుమార్, బుచ్చమ్మ, సిబ్బంది శ్రీను, హబీబ్, మిరాజ్, సూపర్వైజర్ మురళీధర్రెడ్డి, గోపాలమిత్రలు, పాడిరైతులు పాల్గొన్నారు. -
‘ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీ అభివృద్ధి’
కొల్లాపూర్: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషాతో కలిసి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీకి తాగునీటిని సరఫరా చేసే సింగోటం ట్యాంకును మంత్రి పరిశీలించారు. పట్టణంలో తరచూ తాగునీటి సమస్యలు ఏర్పడడానికి గల కారణాలపై అధికారులతో చర్చించారు. నీటి లీకేజీలు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని, ఇందుకోసం తన నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. సింగోటం ట్యాంకు నుంచి కాకుండా ర్యాపిడ్ ఫోర్స్ ద్వారా కొల్లాపూర్కు తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న భవనాన్ని మంత్రి పరిశీలించి.. ఆ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పూర్తయితే అందులో నిరుద్యోగులకు ఉపయోగపడేలా డాటా సెంటర్ ఏర్పాటు అంశాన్ని ఆలోచించాలన్నారు. ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులకు చెప్పారు. మంత్రి వెంట కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు ఉన్నారు. -
దేశంలోనే అతిపెద్ద సేవాలాల్ విగ్రహం
● బంజారాల సంస్కృతి, సంప్రదాయాలుప్రతిబింబించేలా ఏర్పాటు ● సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్రాజ్ అచ్చంపేట: బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గిరిజనుల ఆరాధ దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహం నిర్మిస్తామని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్రాజ్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ విగ్రహ స్థాపనకు ప్రతిపాదించిన 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించి.. స్థానిక అధికారులతో అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది నెలల్లో పక్కా ప్రణాళికలు రూపొందించి విగ్రహ ఏర్పాటు చేస్తామని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహం నిర్మించాలనే సంకల్పంతో సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రతిపాదిత స్థలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో భౌగోళిక పరిస్థితులు, భద్రతా అంశాలు, రవాణా సౌకర్యం, ప్రజలకు మెరుగైన వసతులు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించి సీఎంకు సమర్పిస్తామన్నారు. ● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు ముందుకు తీసుకుపోయే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందన్నారు. విగ్రహ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమన్వయం చేస్తూ రానున్న ఏడా దిలోగా పూర్తిచేసేలా కృషిచేస్తామని వెల్లడించారు. ● గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ విగ్రహాన్ని నల్లమలలో ఏర్పాటు చేయడం గిరిజనుల అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీ బల్రాంనాయక్ అన్నారు. నల్లమలలో ఏర్పాటు చేసే విగ్రహం దేశ ప్రతిష్టను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్సీ శంకర్నాయక్ అన్నారు. మద్దిమడుగులో ఏర్పాటు చేసే సంత్ సేవాలాల్ విగ్రహం దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆధ్యాత్మికతకు నిలయమైన నల్లమలలో ఏర్పాటు చేయడం వల్ల మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్నాయక్, ఆలిండియా బంజారాల నాయకుడు రామ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోటితో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి
అమ్రాబాద్: అమ్రాబాద్ వ్యవసాయ మార్కెట్ లో అభివృద్ధి పనులు మొదలుపెట్టి త్వరలోనే కొనుగోళ్లు చేపడుతామని మార్కెటింగ్ శాఖ డీఈ మునీందర్ తెలిపారు. అచ్చంపేట వ్యవ సాయ మార్కెట్ వైస్చైర్మన్ వెంకటయ్యతో కలిసి సోమవారం ఆయన ఉప వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రై తులు పండించిన పంటల అమ్మకంలో ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇందుకోసం రూ.కోటి వ్యయంతో మార్కెట్ను అభివృద్ధి పరుస్తామన్నారు. మార్కెట్ పరిసరాలలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించేందుకు అధికారులను ఆదేశించామన్నారు. ముందుగా ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదులు పరిష్కరించండి నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 3 భూ తగాదా, 2 తగు న్యాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ చెప్పారు. పాఠశాలల మూసివేత ఉపసంహరించుకోవాలి అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసివేయాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి అన్నారు. సోమవారం మండలంలోని హాజీపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన డీటీఎఫ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జీఓ నం.25న వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ జీఓ ద్వారా గ్రామాలు, తండాల్లో పాఠశాలలను మూసివేయడం అనేది సరికాదన్నారు. పాఠశాలల విలీనాన్ని, మూసివేయకుండా ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, తరగతికి ఒక ఉపాధ్యాయుని, తరగతికొక గది నిర్మాణం చేసి పేదవర్గాల బిడ్డలకు నైపుణ్యం కలిగిన గుణాత్మకమైన విద్యను అందించాలని కోరారు. ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, విద్యారంగంలో వస్తున్న మార్పులను పేద వర్గాలకు అనుకూలంగా ఉండే శాసీ్త్రయ, సమానమైన విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలన్నారు. అనంతరం అచ్చంపేట మండల డీటీఎఫ్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విజయ్కుమార్, ఉపాధ్యక్షులుగా గోపాలమ్మ, శంకర్, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్కుమార్, కార్యదర్శులుగా రామంజలి, విజయశాంతి, ఖాదర్పాషా, జోత్స్న జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నర్సింహులు, మోతీరాం, నాగేశ్వరరావు, ఆడిట్ కమిటీ కన్వీనర్గా కృష్ణవేణి, సభ్యులుగా రాజు, కృష్ణయ్య ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి వనపర్తి: రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జోగుళాంబ జోన్–7 క్రీడాకారులు ప్రతిభకనబరిచి సత్తా చాటాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలకు వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు చెందిన 122 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు క్రీడాకారులకు ప్రేరణాత్మక సందేశం అందించి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి క్రీడలు పోలీస్శాఖ ప్రతిష్టకు ప్రతీక అని అన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభకనబరచి జోన్–7 గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు. క్రీడాస్ఫూర్తే అసలైన గుర్తింపు కావాలని.. క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల బస్సులను వారు జెండా ఊపి పంపించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, రిజర్వు ఎస్ఐలు వినోద్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి దాకా సస్పెన్స్..
● నాగర్కర్నూల్ చైర్మన్గా తీగల సునేంద్ర, కల్వకుర్తిలో రత్నమాల ● కొల్లాపూర్లో చైర్పర్సన్గా అనూహ్యంగా రెడ్డి జ్యోతికి చాన్స్ ● నిరాశతో వెనుదిరిగిన ఆశావహులు ● కల్వకుర్తి, కొల్లాపూర్లో వైస్ చైర్మన్లుగా మైనార్టీలకు అవకాశం సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. నాగర్కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా తీగల సునేంద్ర, వైస్చైర్మన్గా బాదం రమేశ్ ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్గా భృంగి రత్నమాల, వైస్చైర్మన్గా షానవాజ్ఖాన్, కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్గా రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్గా షేక్ రహీంపాషా ఎన్నికయ్యారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో వార్డులను సొంతం చేసుకోగా.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సైతం ఎలాంటి నామినేషన్లు లేకుండా అన్నిచోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులతో నేతలు క్యాంపులను నిర్వహించారు. సోమవారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ సభ్యులు చేరుకున్నారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గ సభ్యులు, చైర్మన్, వైస్చైర్మన్లతో ఆర్డీఓలు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించి ఎన్నికై న వారి పేర్లను ప్రకటించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి కోసం కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ కొనసాగింది. చైర్పర్సన్ ఎన్నికపై చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. ఇక్కడ చైర్పర్సన్ పదవి కోసం పట్టుబట్టిన వారికి కాకుండా మరొకరికి అవకాశం దక్కింది. చైర్పర్సన్ కోసం అనూష, శ్రీదేవి, రమ్యకుమారి పోటీపడగా.. వీరెవరికి కాకుండా అనూహ్య రీతిలో రెడ్డి జ్యోతికి అవకాశం కల్పించారు. ఈ కుటుంబం మొదటి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావుకు విధేయులుగా ఉంటున్నారు. తీవ్ర పోటీ నేపథ్యంలో చివరికి జ్యోతికే చైర్పర్సన్గా పట్టం కట్టారు. చైర్పర్సన్ పదవి కోసం గంపెడాశలతో ఎదురుచూసిన ఆశావహులు కౌన్సిల్ సమావేశం నుంచి నిరాశతో వెనుదిరిగారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ముందస్తుగానే ఖరారు కాగా.. వైస్ చైర్మన్ పదవి కోసం మాత్రం చివరి వరకు ఊగిసలాట కొనసాగింది. వైస్ చైర్మన్ కోసం పార్టీలోని ఇరువర్గాలు పట్టుపట్టడంతో తెగని పంచాయతీగా మారింది. ఈ క్రమంలో చైర్మన్ ఎన్నిక సమయానికి ఇరువర్గాల మధ్య ఒప్పందానికి వచ్చినట్టు తెలిసింది. వైస్ చైర్మన్ పదవిని మొదటి రెండేళ్లపాటు ఒకరు, మిగతా మూడేళ్ల పాటు మరొకరు చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్ స్థానాల్లో బీసీలే ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. ఈ స్థానంలో బీసీ వర్గానికి చెందిన రత్నమాలకు అవకాశం దక్కింది. నాగర్కర్నూల్ మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్కు కేటాయించగా తీగల సునేంద్ర ఎన్నికయ్యారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ కాగా బోయ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి జ్యోతి ఎన్నికయ్యారు. దీంతో మూడు మున్సిపాలిటీల్లోనూ చైర్మన్ స్థానాల్లో బీసీలకే అవకాశం దక్కింది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో వైస్చైర్మన్లుగా మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు అవకాశం దక్కింది. కొల్లాపూర్ మున్సిపాలిటీ వైస్చైర్మన్గా రహీంపాషా, కల్వకుర్తి మున్సిపాలిటీ వైస్చైర్మన్గా షానవాజ్ఖాన్ ఎన్నికయ్యారు. నాగర్కర్నూల్లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన బాదం రమేశ్కు వైస్చైర్మన్గా అవకాశం దక్కింది. -
పారదర్శకంగా పుర పరిపాలన
కొల్లాపూర్: మున్సిపాలిటీ ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషాతోపాటు కౌన్సిలర్లకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎన్నికకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఎన్నిక అనంతరం వారిని శాలువాలు కప్పి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 19 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు, చైర్పర్సన్, వైస్చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు కౌన్సిలర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయొద్దని, ప్రజా తీర్పును శిరసావహిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించాలని సూచించారు. అవినీతికి అవకాశం లేని పాలన అందించాలని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. -
ముహూర్తం నేడే..
నాగర్కర్నూల్పురాల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు ● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు ● వడ్డేపల్లితో కలిపి కాంగ్రెస్కు మొత్తంగా 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యం ● మహబూబ్నగర్, దేవరకద్ర కూడా వారి ఖాతాలోనే.. ● గద్వాలలో సైతం హస్తానికే అవకాశం ● నారాయణపేటలో బీజేపీకే మొగ్గుచూపుతున్న పరిస్థితులు ● అయిజతోపాటు అలంపూర్లో బీఆర్ఎస్కు లైన్క్లియర్ ● అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ కూటమికే.. వాతావరణం ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగా, సాయంత్రం ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది. సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు ఎన్నికలు జరిగిన ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆయా పురపాలికల్లో సోమవారం నిర్వహించే కొత్త పాలక మండళ్ల సమావేశానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఎన్నికై న కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మహబూబ్నగర్ బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, డిప్యూటీ చైర్మన్/డిప్యూటీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. భూత్పూర్, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కోస్గి, మద్దూర్తో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బీ మ్యాజిక్ ఫిగర్ను సాధించగా.. గెలుపొందిన ఎనిమిది మంది చేయి అందుకున్నారు. మ్యాజిక్ ఫిగర్కు ఒకటి, రెండు అడుగుల దూరంలో ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీ, మహబూబ్నగర్ కార్పొరేషన్లో పీఠం హస్తానికి దక్కడం ఖాయమైంది. ఇప్పటివరకు మొత్తంగా 14 పురపాలికల్లో ఆ పార్టీ పాగా వేయనుంది. -
పట్టాభిషేకానికి సిద్ధం
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ● నాగర్కర్నూల్ పుర చైర్మన్గా సునేంద్ర పేరు ఖరారు ● కల్వకుర్తి చైర్పర్సన్గా రత్నమాల.. వైస్చైర్మన్ విషయంలో అధికార పార్టీలో వర్గపోరు ● కొల్లాపూర్ చైర్పర్సన్ ఎన్నికపై వీడని ఉత్కంఠ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాగర్కర్నూల్తో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్ బల్దియాల్లో చైర్మన్ ఎన్నికతో పాటు కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాలను సోమవారం నిర్వహించనున్నారు. చైర్మన్ ఎన్నికకు ఆర్డీఓలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనుండగా.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లాలోని మూడు మున్సిపల్ చైర్మన్ పీఠాలను హస్తం పార్టీనే దక్కించుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపులకు తరలిన కాంగ్రెస్ అభ్యర్థులు.. అక్కడి నుంచి నేరుగా చైర్మన్ ఎన్నిక సమావేశానికి హాజరుకానున్నారు. కల్వకుర్తిలో వైస్చైర్మన్ కోసం పంచాయితీ.. కల్వకుర్తి బల్దియాల్లో చైర్మన్ పదవిని ముందుగానే ఖరారు చేసినప్పటికీ.. వైస్ చైర్మన్ విషయంలో నేతల మధ్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల మధ్య నెలకొన్న వర్గపోరు బయటపడుతోంది. మొదటి నుంచి వైస్చైర్మన్ రేసులో షానవాజ్ పేరు వినిపించింది. ఈ విషయంపై చివరి క్షణంలో పార్టీలో పంచాయితీ నెలకొంది. చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కాగా.. చైర్మన్ పదవి బీసీ వర్గానికి కేటాయించారు. ఈ క్రమంలో వైస్చైర్మన్ పదవిని ఓసీలకు కేటాయించాలని పార్టీలోని మరో వర్గం పట్టుపడుతోంది. వైస్చైర్మన్ కోసం షానవాజ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రమాకాంత్రెడ్డి తల్లి పసుల లలిత పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్కు మించి స్థానాలు లభించాయి. నాగర్కర్నూల్లో మొత్తం 24 స్థానాలకు గాను 18 స్థానాలు, కొల్లాపూర్లో 19 స్థానాలకు గాను 16, కల్వకుర్తిలో మొత్తం 22 స్థానాలకుగాను 13 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. చైర్మన్ ఎన్నికలకు అవసరమైన బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టిపెట్టింది. కల్వకుర్తిలో 8వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా గెలుపొందిన కోడెల లలిత యాదవ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్లో చేరారు. జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్గా రత్నమాల పేరును ఇప్పటికే ప్రకటించారు. కొల్లాపూర్తో పాటు నాగర్కర్నూల్ పురపాలిక చైర్మన్లు ఎవరనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ నెలకొంది. సోమవారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ సమావేశంలోనే వారి పేర్లను ప్రకటించనున్నారు. నాగర్కర్నూల్లో చైర్మన్గా తీగల సునేంద్ర, వైస్చైర్మన్గా బాదం రమేశ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొల్లాపూర్లో చైర్మన్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రధానంగా వంగ అనూష రాజశేఖర్గౌడ్, శ్రీదేవి గౌతమ్గౌడ్, మేకల రమ్యకుమారి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి చైర్మన్గా అవకాశం దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. వైస్ చైర్మన్ పదవికి సైతం ఇక్కడ తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. కొల్లాపూర్లో 14వ వార్డు నుంచి గెలిచిన నరసింహారావుతో పాటు రహీమ్పాషా వైస్చైర్మన్ కోసం ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్లుగా అదృష్టం ఎవరికి వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
సాంకేతిక అభివృద్ధికి సైన్సే కారణం
అచ్చంపేట రూరల్: ప్రస్తుత సమాజంలో మానవ మనుగడ, ప్రగతికి సైన్సే మూలమని.. సైన్స్ లేనిది జీవితం లేదని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ కార్యదర్శి ఆశా మిశ్రా అన్నారు. పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం దాసరి నరేందర్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర 5వ వార్షిక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాసీ్త్రయ ఆలోచనా విధానంతోనే సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్పొరేట్ శక్తులు సాంకేతికతను వినియోగించుకుంటూ పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు చేపడుతూ.. మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తెస్తున్నాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. మేధావుల జ్ఞానాన్ని ప్రజలకు పంచి చైతన్యవంతం చేసేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్లాస్టిక్ వినియోగం అధికమైందన్నారు. ఫలితంగా కష్టపడి సంపాదించిన సొమ్ములో 20శాతం వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన వలంటీర్లు కనుమరుగవుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని కోరారు. మూఢ నమ్మకాల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు బీఎన్ రెడ్డి, రామచంద్రయ్య, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, రామకృష్ణ, బలరాం, గోపా ల్, దశరథం బాబురావు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పాలమూరుపై పీఠ‘ముడి’!
క్యాంప్ నుంచి హైదరాబాద్కు బయలుదేరే ముందు నియోజకవర్గ ముఖ్యనేత మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేతుల్లోకి వెళ్లిందని.. తన చేతిలో ఏమీ లేదని.. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో ఆ ముఖ్యనేత వర్గంలో నిరాశ అలుముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు డిప్యూటీ చైర్మన్గా 11వ డివిజన్ నుంచి గెలుపొందిన ఎం.సురేందర్రెడ్డి ఖాయమై నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. ఈ పదవిని మైనార్టీ ముస్లిం వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ హైదరాబాద్కు మారగా కాగా.. సోమవారం ప్రమాణ స్వీకార సమయంలోనే మేయర్ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు కేవలం రెండడుగుల దూరంలో ఉన్నా.. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో హస్తానికి పీఠం దక్కేది ఖాయమైంది. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. తొలి పదవిని ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ పదవిపై 49వ డివిజన్ నుంచి గెలుపొందిన ప్రసన్న ఆనంద్ గౌడ్తో పాటు ఎన్పీ వెంకటేష్ కూతురు ఎన్పీ నేహా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న నేహా, స్వప్న ఓటమి పాలు కావడంతో ప్రసన్నకే పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులతో నేతలు చీరాల, విజయవాడ క్యాంప్నకు తరలివెళ్లారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ఆదివారం క్యాంప్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు పాలమూరులో హీట్ తెప్పించాయి. ఆదివారం అలజడి.. క్యాంప్లో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులతో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ పదవికి ఎవరైతే బాగుంటుంది.. మీరు ఎవరిని కోరుకుంటున్నారంటూ కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిని ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించుకుని అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతతో పాటు ఆయన వర్గం కాంగ్రెస్ నాయకుడైన మైనార్టీవర్గానికి చెందిన సిరాజ్ఖాద్రీ భార్య 39వ డివిజన్లో గెలుపొందిన హజీరాబేగం పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ అనంతరం అందరూ ఆ మైనార్టీ నాయకుడి భార్యనే ప్రతిపాదించారంటూ రాష్ట్రస్థాయిలో పెద్ద నేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం ఒయటకు పొక్కడంతో క్యాంప్లో అలజడి చెలరేగినట్లు సమాచారం. ముందు రోజే ప్రతిపాదన.. చీలిన నేతలు సిరాజ్ఖాద్రీ భార్యకు మేయర్ పదవి అంశాన్ని జిల్లాలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ నాయకుడు, ఓ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మైనార్టీ నేత వద్ద నియోజకవర్గ ముఖ్యనేత, ఆయన వర్గం శనివారమే ప్రస్తావించినట్లు సమాచారం. ఇరువురు నాయకుల మధ్య సంభాషణ కొనసాగుతుండగానే ఒకానొక దశలో మేయర్ పదవికి 40వ డివిజన్ నుంచి తొలిసారిగా కార్పొరేటర్గా ఎన్నికై న సీబీ పూజిత పేరు సైతం వచ్చినట్లు వినికిడి. ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చిన వారు.. తొలి కార్పొరేషన్లో పట్టు ఉన్న వ్యక్తికే పదవి ఇస్తే బాగుంటుందని.. అనుభవం చాలా ముఖ్యమని.. తొలిసారే కార్పొరేటర్గా గెలిచిన వారికి ఇవ్వడం సరికాదని వారించినట్లు తెలిసింది. అయినా ముఖ్యనేత వర్గం పట్టు వీడకపోవడంతో అదే రోజు రాత్రి మహబూబ్నగర్కు పయనమైనట్లు సమాచారం. హైదరాబాద్, ఢిల్లీ టు మంత్రులు మేయర్ పదవిపై చోటుచేసుకున్న రాజకీయాలు పార్టీ నేతల మధ్య చీలికకు కారణం కాగా.. తొలుత హైదరాబాద్లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు పెద్దల వద్దకు చేరినట్లు తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీకి చేరగా.. సమష్టి నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మేయర్ పదవి ఎంపిక బాధ్యతను ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సంహికు అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆదివారం సాయంత్రం చీరాల క్యాంప్ నుంచి కార్పొరేటర్లతో కలిసి నేతలు హైదరాబాద్కు బయల్దేరారు. అదేవిధంగా అర్ధంతరంగా క్యాంప్ నుంచి తిరిగి మహబూబ్నగర్కు చేరుకున్న నేతలు సైతం పట్నం బాట పట్టారు. సోమవారం ప్రమాణ స్వీకార సమయం వరకు వీరందరూ మహబూబ్నగర్కు చేరుకోనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్.. రంగంలోకి కీలక నేతలు మేయర్ పీఠంపై క్యాంప్లో చోటుచేసుకున్న రాజకీయాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నగరంలో ఆయా సామాజిక వర్గాల మధ్య చాటింగ్ల యుద్ధం కొనసాగింది. పలు సంఘాల నేతలు ముఖ్యనేత, ఆయన వర్గం తీరును దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఈ లొల్లి హైదరాబాద్, ఢిల్లీలోని పార్టీ పెద్దల వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో కొందరు కీలక నేతలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. నియోజకవర్గ నేత, ఆయన వర్గం ప్రతిపాదన? విభేదించిన పలువురు నాయకులు.. పార్టీలో చీలిక నగరంలో వైరల్గా మారిన క్యాంప్ రాజకీయాలు రంగంలోకి ‘పెద్ద’ నేతలు.. మంత్రులకు బాధ్యతలు ప్రమాణ స్వీకార సమయంలోనే తేలనున్న మేయర్ అభ్యర్థిత్వం -
పాక్షిక శనిత్రయోదశి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ట్విస్ట్లపై ట్విస్ట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులో హంగ్ ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్, ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితులు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్లు, క్యాంప్లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, ట్విస్ట్లపై ట్విస్ట్లు హీటెక్కిస్తున్నాయి. నారాయణపేటలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హంగ్.. ‘జంగ్’ ! నారాయణపేట, గద్వాలలో హైడ్రామా ఒకరికొకరు చేదోడువాదోడుగా బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాయబారాలు -
ప్రతి చిన్నారికి వ్యాక్సిన్
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సురేష్బాబు అన్నారు. శనివారం మండలంలోని మల్కాపూర్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు యూవిన్ పోర్టల్ నందు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి అన్ని టీకాలు వేయించడం అత్యంత అవసరమన్నారు. జిల్లాలో ప్రతి అర్హులైన చిన్నారికి డ్యూ లిస్ట్ ప్రకారం టీకాలు అందేలా చూడాలని, ఒక్కరిని కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రికార్డు నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, ఆన్లైన్ నమోదులోనూ కచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఏపీఓ చారి, వీసీసీఎం దివ్య తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి కందనూలు: ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం అమలుపరుస్తున్న ఏజెన్సీ విధానాన్ని రద్దుపరిచి.. నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నారు. పీఆర్సీలోని స్లాబ్ విధానాన్ని రద్దుపరిచి, క్యాడర్ బేసిక్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుభాష్, జిల్లా అధ్యక్షుడు రామచందర్జీ, కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. పల్లీ @ రూ.9,700 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.9,700, కనిష్టంగా రూ. 6,512, సరాసరిగా రూ.9,467 ధర లభించింది. కాగా.. మార్కెట్ యార్డుకు 89 మంది రైతు లు 725 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తీసుకువచ్చారని కార్యదర్శి శివరాజు తెలిపారు. -
చెల్లని ఓట్లతో చిక్కులు..
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు. గుర్తులు తెలియక తికమక.. ఈవీఎం ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. ఈవీఎం బ్యాలెట్పై నోటాకు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. బ్యాలెట్పై సరైన గుర్తును ఎంచుకుని అదే గుర్తుపై ఓటు వేయడంలో చాలామంది ఓటర్లు పొరపాట్లు చేశారు. అయోమయంలో రెండు గుర్తులపై ముద్ర వేయడం, గుర్తులపై బొటనవేలితో ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్పై ఓటు వేయకుండా ఖాళీగా బాక్స్లో వేయడం కనిపించింది. అలాగే బ్యాలెట్ పేపర్లో ఒక గుర్తుపై వేసిన ఇంక్ ముద్ర మరో గుర్తుపై పడకుండా ఉండేందుకు పేపర్ను నిలువుగా మడత పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు నిలువుగా కాక అడ్డంగా మడిచి బ్యాలెట్ వేయడంతో ఇంకు ముద్ర మరో గుర్తుపై కూడా పడి చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. తక్కువ మెజార్టీతో పోటాపోటీగా ఉన్న వార్డుల్లో చెల్లని ఓట్ల ప్రభావంతో అభ్యర్థులు ఆవేదనకు లోనయ్యారు. పోలైనవి...1012, చెల్లనివి 216 మహబూబ్నగర్ కార్పొరేషన్కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలలో చెల్లని ఓట్లతో పాటు నోటాకు అధికంగా ఓట్లు వీటి ప్రభావంతో అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అయినట్టుగా అంచనాలు పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్లోనూ చెల్లని ఓట్లు -
ఎక్స్ అఫీషియో.. ప్రభావమెంత?
గద్వాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్స్ అఫీషియో ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఇటువైపు చూడండి. ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నారాయణపేట, అమరచింత, అలంపూర్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. సంపూర్ణ మెజారీటి లేకపోతే.. మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ వర్గానికి చెందిన ఒకరిని చైర్మన్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంపూర్ణ మెజార్టీ లేనప్పుడు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యాంగబద్ధ కమిటీకి చైర్మన్ ఇలా ఎవరైనా సరే వారి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునే వీలుంటుంది. దీనినే ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–19 ఆర్టికల్ 243–ఆర్ రిట్ పిటిషన్ నంబర్ 20262/2021 ప్రకారం రాష్ట్ర హైకోర్టు ఎక్స్ అఫీషియో ఓట్లపై కీలక తీర్పునిచ్చింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో లోక్సభ ఎంపీ, రాష్ట్ర శాసన సభ్యులు వారి నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా మున్సిపాలిటీ ఏరియాలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ఎమ్మెల్సీలు ఆయా మున్సిపాలిటీల్లో అప్పటికే ఓటరుగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అలా ఉన్న మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. రాజ్యాంగబద్ధ కమిటీలో చైర్మన్లుగా ఉన్నవారు అంతకు పూర్వమే వారి మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. అలా ఉన్న మున్సిపాలిటీ ఏరియాలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోచ్చు. ఎన్నికల సంఘం నూతన నిబంధనలతో తప్పని ఇబ్బందులు దీని ఆధారంగానే సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్? -
చైర్మన్గిరి..!
నీ మీద నాకు మనసాయెనే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్యను కాంగ్రెస్ సాధించింది. ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే మూడుచోట్ల చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోనుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. ఇందుకు ఆదివారం మధ్యాహ్నం వరకు సమయం ఉండగా.. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కల్వకుర్తి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యేలు సైతం ఆదివారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జిల్లా లోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు వచ్చినా ముందు జాగ్రత్త చర్యగా పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. వారంతా సోమ వారం ఉదయం నేరుగా మున్సిపాలిటీల చైర్మ న్ ఎన్నిక సమావేశానికే హాజరుకానున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాలను కై వసం చేసుకుంది. అయితే చైర్మన్ పదవి కోసం ఆ పార్టీలో గెలిచిన కౌన్సిలర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సోమవారం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనుండగా.. ఎవరికి చైర్మన్ పదవి వరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటికే చైర్మన్గా రత్నమాల పేరు ప్రకటించగా.. నాగర్కర్నూల్తోపాటు కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పేరును ఖరారు చేయలేదు. ఎన్నికల్లో మూడుచోట్ల కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాగర్కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ నేతలు క్యాంపులకు తరలించారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో చైర్మన్గా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికలకు ముందు నుంచే ప్రధానంగా చైర్మన్ కోసం తీగల సునేంద్రతోపాటు పొడుగు శ్రీను ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నుంచి చైర్మన్ ఆశించిన పొడుగు శ్రీను అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో సునేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు వైస్చైర్మన్ రేసులో బాదం రమేశ్ ఉన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్గా మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్ సతీమణి రత్నమాల పేరును ఖరారు చేశారు. ఇక్కడ వైస్చైర్మన్ పదవిని షానవాజ్ ఆశిస్తున్నారు. అయితే వైస్ చైర్మన్ కోసం కాంగ్రెస్లోని మరో వర్గం సైతం పట్టుబడుతుండటంతో చివరికి ఎవరి నిర్ణయం నెరవేరుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పుర ప్రథమ పదవి కోసం హస్తం పార్టీలో పోటాపోటీ కొల్లాపూర్లో గెలిచిన వారంతా ఆశావహులే నాగర్కర్నూల్లోనూ పేరును ప్రకటించని నేతలు కల్వకుర్తి చైర్పర్సన్గా రత్నమాల ఖరారు వైస్చైర్మన్ కోసమూ కౌన్సిలర్ల మధ్య తీవ్రమైన పోటీ -
‘సింహ’గర్జన..!
● నాడు కొల్లాపూర్, అయిజలో.. నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీలో.. గత పుర పాలక ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్కు చెందిన మంత్రి జూపల్లి అప్పుడు బీఆర్ఎస్లో ఉండగా అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో పొసగని పరిస్థితి ఉండేది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులు ఉండగా.. తన వర్గానికి చెందిన వారిని ఏఐఎఫ్బీ నుంచి బరిలో నిలిపారు.. 11 స్థానాల్లో వారే గెలుపొందారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తిరుమల్రెడ్డి తన వర్గాన్ని ఏఐఎఫ్బీ నుంచి బరిలో దించారు. 20 వార్డులు ఉండగా.. 10 స్థానాల్లో వారే విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించింది. మొత్తం పది వార్డులు ఉండగా.. ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు. -
నాడు కానిస్టేబుల్.. నేడు కార్పొరేటర్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ పాతపాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.రమేష్బాబు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూడగా.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో తనను ఓడించిన అభ్యర్థిపైనే 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. దీంతో పాతపాలమూరులో రమేష్బాబు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. – మహబూబ్నగర్ రూరల్ -
చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్ఎస్కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ.. ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఐదింటిలో హంగ్ బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ తారుమారైన బీజేపీ అంచనాలు ‘పేట’లో ఆధిక్యత.. అయినా ఊగిసలాట దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్క్లియర్ అలంపూర్లో బీఆర్ఎస్కు అవకాశం గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోబూచులాట -
‘హంగు’..ఆర్భాటాలు!
ఉమ్మడి పాలమూరులో పుర ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన ఆరు పురపాలికల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. గద్వాల, నారాయణపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఏఐఎఫ్బీ అభ్యర్ధి కాంగ్రెస్ రెబల్, స్వతంత్ర బీజేపీ రెబల్ కాగా.. వారు ఆయా పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విధంగా జరిగిన పక్షంలో బీజేపీకి 12, కాంగ్రెస్ ఫిగర్ ఎనిమిదికి చేరనుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ● గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉండగా.. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 11, బీజేపీకి ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన వారి బలం 19 కాగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. తమ అభ్యర్థులను ఎవరికి వారు క్యాంప్లకు తరలించిన ముఖ్యులు చెరో రెండున్నరేళ్లు మున్సిపల్ పీఠాన్ని పంచుకునేలా పావులు కదుపుతున్నారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ విప్ జారీ చేసే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో దేవరకద్రలో కాంగ్రెస్, అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనున్నాయి. ● అమరచింతలో 10 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఫలితాలకు ముందే బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు క్యాంప్నకు వెళ్లగా.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన వాహనంలో క్యాంప్కు తరలించారు. ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. చెరి రెండున్నరేళ్లు చైర్మన్ గిరిని పంచుకునేలా ఒక అవగాహనకు రానున్నట్లు చర్చ జరుగుతోంది. దాదాపుగా అంతటా క్యాంప్ రాజ‘కీ’యాలు గద్వాలలో హైడ్రామా.. బేరసారాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం -
విజేత.. ఆశా కార్యకర్త
కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడం.. భర్త బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. – కొత్తకోట రూరల్ -
జీఎమ్మార్.. స్టార్ ‘లీడర్’
● దేవరకద్రలోని 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలుపు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి (జీఎమ్మార్) స్టార్ లీడర్గా పేరు సాధించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగగా.. అన్ని పీఠాలను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకుని ఈ మున్సిపాల్టీలను హస్తానికి చేజిక్కకుండా రాజకీయాలు నడిపాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు కలిసి ప్రచారం చేపట్టాయి. అయినా భూత్పూర్, కొత్తకోటలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్నా.. ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పార్టీకే పీఠం దక్కనుండడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్శ్రేణులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు సంబరాల్లో మునిగారు. ● 16 స్థానాల్లోనూ హస్తం అభ్యర్థుల గెలుపు ● సీఎం ఇలాకా కావడంతో హాట్టాపిక్ ● గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దక్కిన పీఠం ● ప్రతీకారం తీర్చుకున్నారంటున్న రేవంత్ అభిమానులు -
23 ఏళ్లకే కౌన్సిల్లోకి...
వరుసగా ఐదోసారి నెగ్గి.. స్థానిక పురపాలికలోని ఆరో వార్డు నుంచి 23 ఏళ్ల పుట్టా రేణుక కాంగ్రెస్పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం, అనుకూలమైన రిజర్వేషన్ రావటంతో ఎన్నికల బరిలో నిలిచానని.. వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. – కల్వకుర్తి టౌన్ -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం ఆయన ఉయ్యాలవాడలోని నైస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి శిక్షణ తరగతులను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు క్రమబద్ధంగా చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అనంతరం పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరవాలన్నారు. చెల్లిన ఓట్లను మాత్రమే సంబంధిత అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సుల్లో వేయాలని, చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు లోబడి, పారదర్శకంగా సాగాలన్నారు. ఓట్ల లెక్కింపు మొత్తం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మూడంచెల భద్రత కల్పించడం, స్ట్రాంగ్రూంల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, ఆర్డీఓ సురేష్బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసీల్దార్ తబితారాణి తదితరులున్నారు. -
బాలికలు సృజనాత్మకతతో ఆలోచించాలి : డీఈఓ
కందనూలు: పోటీ ప్రపంచంలో బాలికలు కేవలం పుస్తక జ్ఞానంతో మాత్రమే కాకుండా సృజనాత్మకత, సమయస్ఫూర్తి, వివేకంతో కూడిన ఆలోచనలను అలవర్చుకుని ముందుకు సాగాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. గురువారం నాగర్కర్నూల్ మండలంలోని నాగనూల్ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థినులకు నిర్వహించిన ఫేర్వెల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితానికి తొలిమెట్టు వంటివని చెప్పారు. పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ప్రతి బాలిక తనలోని ప్రతిభను గుర్తించి, సృజనాత్మకతను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. మహిళా విద్య సమాజాభివృద్ధికి చాలా కీలకమని పేర్కొన్నారు. చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కేంద్రం నాగర్కర్నూల్ రూరల్: దేశంలో ఉన్న పదిమంది పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాలు మార్చి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. గురువారం దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను పట్టణంలోని కార్మిక సంఘాలు విజయవంతంగా కొనసాగించారు. ఈ సందర్భంగా గాంధీ పార్కు వద్ద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసులు, శివశంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, వీబీజీ రాంజీ జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం వేతనం అమలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పీఎఫ్ తదితర సౌకర్యాలు వెంటనే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతాలు, జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య, నాయకులు రవీందర్, శంకర్గౌడ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, జయమ్మ, వరలక్ష్మి, కవిత, జస్వంత్, అలివేలమ్మ, బాలీశ్వర్, కుర్మయ్య, చింతలయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పురం.. ఎవరి పరం
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పు శుక్రవారం వెలువడనుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు ఎన్నికలు 243 మంది బరిలో నిలిచారు. వీరికి సంబంధించి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్లకు సంబంధించిన కౌంటింగ్ను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోనే ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మొత్తం మూడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తిచేయనున్నారు. దీంతో మధ్యాహ్నం వరకే పార్టీల వారీగా వచ్చే స్థానాలపై స్పష్టత రానుంది. మొత్తంగా జిల్లాలోని మూడు పురపాలికలు ఎవరిపరం కానున్నాయో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు రౌండ్లు.. 8 టేబుళ్లు నాగర్కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ను ఉయ్యాలవాడలోని పుల్లారెడ్డి తోటలో ఉన్న నైస్ పాఠశాలలో చేపట్టనున్నారు. కల్వకుర్తిలో మహబూబ్నగర్ రోడ్డులోని భ్రమరాంబ మల్లికార్జున ఎడ్యుకేషన్ సొసైటీలో, కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ను పీజీ కళాశాల సెంటర్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సిద్ధం చేయడంతోపాటు కౌంటింగ్పై సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్లో 8 టేబుళ్లలో పోలింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో టేబుల్పై మూడు వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ముందుగా పోస్టల్ బ్యాలెట్.. తర్వాత వార్డుల వారీగా మొదటి, రెండు, మూడో రౌండ్లలో అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తా రు. తొలి రెండు గంటల్లోనే మొదటి, రెండు రౌండ్ల ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మొత్తం పోలింగ్ ప్రక్రియలో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 16న చైర్మన్ ఎన్నిక.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన అనంతరం సోమవారం మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. పరోక్ష విధానంలో వార్డు సభ్యులు చైర్మన్ను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సంబంధిత ఆర్డీఓలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా పరిస్థితిని బట్టి గెలిచిన అభ్యర్థులతో క్యాంపులు నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. చెంచుల పండుగ.. నల్లమలలోని భౌరాపూర్ భ్రమరాంబ అమ్మవారి ఉత్సవాలు శనివారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. –IIలో uపటిష్ట బందోబస్తు ఏర్పాటు కల్వకుర్తి టౌన్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులెవరూ ర్యాలీలు, విజయ యాత్రలు నిర్వహించరాదని, ప్రజలను గుమిగూడే విధంగా చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం 65 వార్డుల్లో.. 243 మంది పోటీ మధ్యాహ్నం వరకే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం గెలుపుపై ఎవరి ధీమా వారిదే -
నల్లమలలో ఆక్వా కల్చర్ సెంటర్
అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్లతో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ముదిరాజ్లకు చెరువులపై పూర్తి హక్కులు కల్పించేందుకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. రాష్ట్రంలో పండుగ సాయన్న విగ్రహాల ఏర్పాటు, ముదిరాజ్ భవనాలను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తామన్నారు. అచ్చంపేట ముదిరాజ్ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. చంద్రసాగర్కు రెండు కాల్వలు చంద్రసాగర్ ప్రాజెక్టుకు ఉమామహేశ్వరం రిజర్వాయర్, పెనిమిళ్ల రెండు కాల్వల ద్వారా నీరు పారుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 365 రోజులు నీరు నిల్వ ఉంటుందని, ఇక్కడి నుంచి అమ్రాబాద్కు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాల్వల పనులు వారం రోజుల్లో మొదలవుతాయని, 13 ఎకరాల్లో ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేయడం వల్ల నీటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ యాదగిరి, గ్రంథాయల చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివానులు, అంతటి మల్లేష్, తహసీల్దార్ సైదులు, మత్స్య శాఖ ఏడీ నర్సింగ్రావు, వెటర్నరీ ఏడీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రూ.50 కోట్లతో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకు చర్యలు అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.37.64 లక్షలు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.37,64,907 ఆదాయం వచ్చింది. ఇటీవలి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం 7 గంటలకు సాగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఇన్స్పెక్టర్ వీణ, ఐడీబీఐ మేనేజర్ మల్లిఖార్జున్, సత్యసాయి సమితి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. -
77.96%
2020లో‘పుర’ ఎన్నికల్లో 0.52 శాతం తగ్గిన పోలింగ్ 78.48%2026లోసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గత పురపాలక ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి పాలమూరులో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట.. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర, మద్దూర్ మినహాయించి మిగిలిన 17 మున్సిపాలిటీల్లో 2020లో మొత్తంగా 78.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అవే పురపాలికల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో 77.96 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్ 0.52 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ.. ఎలా అంటే.. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్లో గత ఎన్నికల్లో 67.17 శాతం మంది ఓటేశారు. ఈ ఎన్నికల్లో 67.73 శాతం పోలింగ్ నమోదు కాగా.. స్వల్పంగా 0.56 శాతం పెరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో 0.75, పెబ్బేరులో 0.60, అమరచింతలో 2.89, జోగులాంబ జిల్లాలోని గద్వాలలో 0.47, అలంపూర్లో 1.15, వడ్డేపల్లిలో 0.02 శాతం పోలింగ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో ఈ సారి అత్యధికంగా 4.04 శాతం పోలింగ్ తగ్గింది. అదేవిధంగా నారాయణపేటలో 0.75, కోస్గిలో 0.24, నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్లో 2.91, కల్వకుర్తిలో 0.04, కొల్లాపూర్లో 1.32, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో 2.37, మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్లో 1.54, వనపర్తి జిల్లాలోని వనపర్తిలో 1.45, ఆత్మకూరులో 0.53 శాతం మేర పడిపోయింది. 10 మున్సిపాలిటీల్లో తగ్గుదల.. మరో ఏడింటిలో పెరుగుదల అత్యధికంగా మక్తల్లో 4.04 శాతం మేర పడిపోయిన ఓటింగ్ అమరచింతలో 2.89 శాతం మేర పైకి.. -
వడివడిగా.. మల్లన్న సన్నిధికి
అచ్చంపేట: హరహర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ శ్రీశైలం జాతీయ రహదారి భక్తుల శివనామస్మరణతో మార్మోగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలం తరలివెళ్తున్నారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా కొండలు, గుట్టలు, బండరాళ్లను, ముళ్లకంపలను అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాత్మికానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కై లాస ద్వారం చేరుకుంటున్నారు. గతంలో ఈఓగా పనిచేసిన శంకరరెడ్డి శివదీక్షను 1996లో ప్రారంభించి విశేష ప్రాధాన్యతను పెంపొందించేలా కృషి చేశారు. కాళ్ల నొప్పులు, పాదాలు పగలడం, బొబ్బలెక్కడం ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా శ్రీశైలేశుని దర్శనం కోసం బారులు తీరుతున్నారు. భక్తిని మించిన మరే శక్తిలేదని శివదీక్షాస్వాములు స్పష్టం చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న శివస్వాములు రాత్రివేళ మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అర్ధరాత్రి 2 గంటల తర్వాత తిరిగి నడక సాగిస్తున్నారు. రాత్రివేళ చలి, పగలు ఎండల్లో శివమాలధారుల పాదయాత్ర అభయారణ్యంలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణం నల్లమల దారిపొడవునా యాత్రికులకు దాతల చేయూత -
తీర్పు రిజర్వ్..
● 19 పురపాలికల్లో మొత్తంగా 75 శాతం పోలింగ్ ● గద్వాల జిల్లాలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం ● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు ● రేపు ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరులో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు జిల్లాల పరిధిలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో మొత్తం 373 డివిజన్లు/వార్డు స్థానాలకు బుధవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. 11 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తంగా 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో రిజర్వ్ కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 14న మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, వైస్ చైర్లన్లు.. కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత 16న పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. బద్ధకించిన కార్పొరేషన్ ఓటర్లు.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా 78.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 67.73 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నగర ఓటర్లు ఓటెత్తుతారని అందరూ భావించారు. ఇందుకు విరుద్ధంగా అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతోందని రాజకీయ పార్టీల నేతలు డివిజన్ల వారీగా లెక్కల్లో మునిగారు. నాగర్కర్నూల్ 77.64 శాతంతో రెండు, వనపర్తి 75.56 శాతంతో మూడు, నారాయణపేట 74.04 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి. మొత్తం ఓట్లు 6,12,827.. పోలైంది 4,53,090 మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్తోపాటు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మిగిలిన పురపాలికలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్, అలంపూర్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ ఆరోవార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. మొత్తంగా 59 డివిజన్లు, 314 వార్డుల్లో జరిగిన పోలింగ్లో 6,12,827 మంది ఓటర్లకు గాను 4,53,090 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ మహిళల వెనుకంజ.. ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ జరిగిన పురపాలికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో వారే వెనుకబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తగా.. పుర పోరుకు వచ్చేసరికి అతివలు ఓటుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్గనర్, నాగర్కర్నూల్ జిల్లాలో సరాసరిగా పురుషులు, మహిళల ఓటింగ్ శాతం సమానంగా ఉండగా.. మిగతా జిల్లాల్లో ఒక్క శాతానికి పైగానే తేడా ఉంది.మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే మహబూబ్నగర్, దేవరకద్ర, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు, గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, నారాయణపేట, మక్తల్, మద్దూర్, కొల్లాపూర్లో మహళలు ఓటుకు దూరంగా ఉన్నారు. భూత్పూర్, కోస్గి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో మాత్రమే అతివల ఓటింగ్ శాతం పురుషుల కంటే కొంత మేర మెరుగ్గా ఉంది. 35 మందిలో 16 మంది.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎన్నికలు జరిగిన పుర పాలికల్లో ఇతరులు ఓట్లరు 35 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అర్ధరాత్రి మారిన పరిణామాలతో.. ఉమ్మడి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారినట్లు తెలుస్తోంది. పురపాలికల్లో డివిజన్లు/వార్డుల వారీగా పలువురు అభ్యర్థులు ఓటుకొక రేటు చొప్పున వెదజల్లినట్లు సమాచారం. పార్టీల వారీగా ఫండ్ రాగా.. ఒక్కో వార్డులో ఆయా అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పటివరకు గెలుపు అంచనాల్లో మునిగిన అభ్యర్థులు తెల్లారేసరికి పరిస్థితులు మారడంతో నోరెళ్లబెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానం మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్, మక్తల్, వనపర్తి తదితర మున్సిపాలిటీల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు రాత్రికిరాత్రే చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతుండగా.. పలువురు అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. -
వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన కలెక్టర్
కందనూలు: జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లోని 131 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అనంతరం జిల్లాకేంద్రం మున్సిపాలిటీలోని 15వ వార్డు క్రిస్టియన్కాలనీ, 14వ వార్డు సంత బజార్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లతో మాట్లాడి.. వారికి అందుతున్న సౌకర్యాలు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలని ఏజెంట్లకు సూచించారు. జిల్లాకేంద్రంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
మహదేవప్ప కుటుంబానికి పరామర్శ
మక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పా ర్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేసిన కేంద్ర మంత్రి -
పురవిప్పిన ఓటరు
● జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 77.64 శాతం ఓటింగ్ నమోదు ● ఉదయం 7 గంటల నుంచే బారులుదీరిన ఓటర్లు ● కల్వకుర్తిలో అత్యధికంగా 80.80, నాగర్కర్నూల్ లో అత్యల్పంగా 73.98 శాతం పోలింగ్ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో పట్టణ ఓటరు పురివిప్పారు. ఎన్నికలు జరిగిన మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 77.64 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో 80.80 శాతం ఓటింగ్ జరగగా.. కొల్లాపూర్లో 80.10 శాతం, నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 73.98 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉదయం నుంచే కేంద్రాలకు ఓటర్ల రాక ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ కాస్త మందకొడిగా కొనసాగగా, ఆ తర్వాత పుంజుకుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65 వార్డులకు సంబంధించి 131 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ జిల్లాకేంద్రంలోని పలు పోలింగ్కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. జిల్లాకేంద్రంలో తగ్గిన పోలింగ్ శాతం.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇక్కడ మొత్తం 35,378 మంది ఓటర్లకు గానూ 26,171 మంది మాత్రమే ఓటు వేశారు. ఉదయం 9 గంటలకల్లా మిగతా మున్సిపాలిటీల కన్నా ఎక్కువగా పోలింగ్ జరగ్గా, సాయంత్రానికి ఓటింగ్ శాతం తగ్గింది. కల్వకుర్తిలో అత్యధికంగా 80.80 శాతం నమోదైంది. మొత్తం 26,023 మంది ఓటర్లకు గానూ 21,027 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొల్లాపూర్లో మొత్తం 19,356 మంది ఓటర్లకు 15,505 మంది ఓటింగ్లో పాల్గొనగా 80.10 శాతం నమోదైంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. పోలింగ్ ముగిసే 5 గంటల సమయానికి పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటుహక్కు కల్పించారు. కల్వకుర్తి, నాగర్కర్నూల్లోని పలు వార్డుల్లో సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ కొనసాగింది. 243 మంది అభ్యర్థులు.. పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి ఆయా మున్సిపాలిటీల్లోని స్ట్రాంగ్ రూం వద్దకు తరలించారు. బ్యాలెట్ బాక్సుల్లో జిల్లాలోని 65 వార్డుల్లో బరిలో ఉన్న 243 మంది అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. దొంగ ఓటర్ల హల్చల్.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొద్దిసేపు వివాదం చోటుచేసుకుంది. మైనర్లతో ఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలింగ్ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కా ర్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సైతం పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. -
నాగర్కర్నూల్
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలుప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ ● మైక్రో అబ్జర్వర్ల ద్వారా నిశిత పరిశీలన ● జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 202616న చైర్మన్ ఎన్నిక.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఈ నెల 16న చైర్మన్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. పరోక్ష ఎన్నిక విధానంలో వార్డు సభ్యులు చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్డీఓ అధికారులు ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నట్టు చెప్పారు. మూడు రౌండ్లలో కౌంటింగ్.. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఉయ్యాలవాడలోని నైస్ పాఠశాలలో, కల్వకుర్తిలో మహబూబ్నగర్ రోడ్డులోని భ్రమరాంబ మల్లికార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ను పీజీ కళాశాల సెంటర్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారు. అదేరోజున ఫలితాల వెల్లడితోపాటు గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుండగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేశామన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి మహబూబ్నగర్ రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. –IIలో u -
భూముల రీ సర్వేతో రైతులకు మేలు
లింగాల: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని అంబట్పల్లిలో భూభారతి పథకంలో భాగంగా భూముల రీ సర్వేపై గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనే భూముల రీ సర్వే కోసం అంబట్పల్లిని పైలెట్ ప్రాజెక్ట్గా ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. పార్టీలకతీతంగా సర్వే జరుగుతుందని, ఈ రీసర్వే వల్ల ప్రతి ఇంచు భూమి గుర్తించడం జరుగుతుందన్నారు. సర్వే ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని చెప్పారు. భూములకు పక్కా సరిహద్దులు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల మధ్య వివాదాలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. అంబట్పల్లిలో త్వరలో బ్యాంకు శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంబట్పల్లి శివారులో 915 సర్వే నంబర్లు ఉండగా 6,492 ఎకరాల పట్టా భూములు, మరో 788 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. డీజీపీ, రోవర్స్ పరికరాల ద్వారా భూముల సర్వే చేయడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో 4 గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్గా గుర్తించి పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామ సరిహద్దు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, రహదారులు, కాల్వలు, పట్టా భూములు సైతం రీ సర్వే చేస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 150 మంది లైసెన్సు సర్వేయర్లు ఉన్నారని, మరో 100 మంది సర్వేయర్లు రానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ నాగేందర్, తహసీల్దార్ వెంకటేష్, సర్పంచ్ శ్రీవాణి, ఉప సర్పంచ్ మల్లేష్, మండల సర్వేయర్ రాంబాబు, సింగిల్ విండో మాజీ చైర్మన్ హన్మంత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ప్రజలు నిర్భయంగా ఓటేయాలి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ వద్ద పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు గాను 131 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇందులో 62 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్కు సంబంధించి 828 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 3 ఎఫ్ఎస్టీ బృందాలు, 3 ఎస్ఎస్టీ బృందాలు చురుకుగా పనిచేస్తాయన్నారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూటర్ సెంటర్, కౌంటింగ్ హాల్ను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. వైద్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అమలుపరుస్తున్న మాతాశిశు సంరక్షణ, టీకాకరణ, అసంక్రమిత వ్యాధులు, క్షయ, కుష్టు తదితర కార్యక్రమాలపై వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రజలకు సేవలు అందేలా చూడాలన్నారు. ఏఎన్ఎంలు, పర్యవేక్షణ సిబ్బంది, వైద్యాధికారులు ప్రతిఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లాలో భ్రూణ హత్యలు నివారించేందుకు స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు భరత్కుమార్రెడ్డి, తారాసింగ్, భీమానాయక్, ప్రోగ్రాం అధికారులు లక్ష్మణ్, సురేష్కుమార్, ప్రదీప్, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
కొల్లాపూర్: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పోలింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాల ని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద లైటింగ్, టాయిలెట్లు, తాగునీరు, భోజన ఏర్పాట్లు ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ స్థలం పరిశీలన పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం నుంచి ఏపీలోని సంగమేశ్వరం ప్రాంతాల మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి స్థలాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. వంతెన నిర్మాణానికి సంభందించిన అంశాలు, భూసేకరణ అంశాల గురించి రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. వంతెన నిర్మిస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే వారికి 90 కి.మీ., మేరకు దూరభారం తగ్గుతుందని, బ్రిడ్జి నిర్మాణం వల్ల కృష్ణానది పరిసర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని వివరించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఆయన జటప్రోల్ గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పనుల పురోగతిని రెగ్యులర్గా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ భన్సీలాల్ ఉన్నారు. -
పోలింగ్ డే
నేడే పురపాలిక ఎన్నికల సమరం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ /సాక్షి, నాగర్కర్నూల్: పురపాలిక పోరుకు వేళయింది. పది రోజుల నుంచి తలపడిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించే తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయంలో లోగా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో 1,573 మంది అభ్యర్థులు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉండగా.. అచ్చంపేట, జడ్చర్ల పురపాలికల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటిలో మొత్తం 376 వార్డులు, డివిజన్లు ఉండగా.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్కు చెందిన రమాదేవి, అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్గా విక్రం (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 374 వార్డుల్లో 1,573 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మక్తల్లోని 6వ వార్డులో బీజేపీకి చెందిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రత పెరిగింది. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా అలంపూర్లో 36 మంది పోటీ చేస్తున్నారు. దేవరకద్ర, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులను ముద్రించారు. ఎన్నికల సమయంలో తప్పుల సవరణకు అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లను వివిధ దశల్లో అధికారులు నిశితంగా పరిశీలించారు. ● ఉమ్మడి జిల్లాలో 376 వార్డుల్లో 6,18,516 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,03,793 మంది, మహిళలు 3,14,688 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు. వీరి కోసం 971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఎన్నికలకు ముందు రోజు వరకు అభ్యర్థులు ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. ఒకరి కన్నా మరొకరు పోటీపడుతూ అంచనాకు మించి ఖర్చు చేశారు. వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించారు. ఓటుకు రూ. 2 వేల నుంచి 4 వేల వరకు వెచ్చిస్తూ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు పూర్తిచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీతో అభ్యర్థులు యథేచ్చగా ప్రలోభాలకు పాల్పడినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచే వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ఒక్కో కేంద్రంలో ఒక బ్యాలెట్బాక్సును ఏర్పాటుచేశారు. ఒక్కో పోలింగ్కేంద్రంలో కనీసం ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించనున్నారు. ఈనెల 11 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ మహబూబ్నగర్ 58వ డివిజన్,అలంపూర్ 10వ వార్డు ఏకగ్రీవం బీజేపీ అభ్యర్థి మృతితో మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా మిగిలిన 373 వార్డులు/ డివిజన్లలో 1,570 మంది అభ్యర్థులు బరిలో.. పోలింగ్కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిశిత పరిశీలన -
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సహకరించండి
కల్వకుర్తి టౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలకు పాల్పడకుండా పోలీసులకు, ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 7, 16, 17, 18 వార్డుల్లో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఎవరైనా కోడ్ను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు కోడ్ ముగిసే వరకు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంచామని, ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్ మొదలైన వాటిలో విద్వేషపూరిత లేదా ప్రజలను రెచ్చగొట్టే, తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు చేయరాదన్నారు. జిల్లాలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఏఈ షబ్బీర్, డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐలు మాధవరెడ్డి, వీరబాబు, రాజశేఖర్ తదితరులున్నారు. -
భూ సేకరణ గ్రామసభ బహిష్కరణ
బల్మూర్: జిల్లాలోని బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ బండ్ (కట్ట) నిర్మాణం కోసం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన అభిప్రాయసేకరణ గ్రామసభను రైతులు తీవ్ర నిరసనల మధ్య బహిష్కరించారు. బల్మూర్ శివారులోని 16 సర్వే నంబర్లలో 46 మందికి చెందిన 52.07 ఎకరాల లావణి పట్టా భూముల్లో బండ్ (కట్ట) నిర్మాణం కోసం భూమి అవసరమైనందున్న 10(ఏ) యాక్ట్ ప్రకారం భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సోమవారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా ఆర్ఐ సీతారాం భూ నిర్వాసితుల పేర్లు చదివి వినిపించగా.. స్పందించిన రైతులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామసభ పెట్టడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన అనుమతులు పొందకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించి రైతులను విడగొట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిల్లో రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెగేసి చెబుతూ.. సర్పంచ్ శిరీషతోపాటు రైతులు అధికారుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 2,200 ఎకరాల భూములను రైతులు ప్రాజెక్టులో కోల్పోతుండగా కేవలం 52.07 ఎకరాల్లో లావణి పట్టాలు కలిగిన నిర్వాసిత రైతులు 46 మంది పేర్లతో అధికారులు అభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సేకరణ అభిప్రాయ సేకరణ కోసం అధికారులు నిర్వహించిన గ్రామసభలో రైతుల నుంచి ఆందోళనలు జరుగుతాయని ముందస్తు సమాచారంతో అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేందర్, వెంకటేష్గౌడ్, వెంకట్రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు తమ డిమాండ్లను శాంతియుతంగా అధికారులకు తెలపాలని సూచించారు. దీంతో రైతులు పోలీసులతో తమ గొంతు నొక్కిస్తూ.. కేసులు పెట్టి భయభ్రంతులు గురిచేస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులు గ్రామసభను బహిష్కరించి వెళ్లడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాట్లాడుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి గ్రామసభ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న నిర్వాసిత రైతులు తమ మధ్య చీలిక తీసుకురావొద్దని ఆగ్రహం ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని వినతి బల్మూర్లో భారీగా పోలీసు బందోబస్తు రిజర్వాయర్కు సరైన అనుమతులు లేకపోవడంతో తాము జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించామని రైతులు రఘుమారెడ్డి, సుందర్రెడ్డి, ఇంద్రారెడ్డి, తిరుపతయ్య తెలిపారు. దీనిపై రిజర్వాయర్కు అవసరమైన అనుమతులు లేనిదే పనులు చేపట్టవద్దని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండురోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం రిజర్వాయర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రతులు, వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. దినిని ఉన్నతాధికారులకు నివేధించడంతో పాటు గ్రామసభలో రైతులు వ్యక్త పరిచిన ఆంశాలను తెలుపనున్నట్లు అధికారులు తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
కొల్లాపూర్/ కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటుదామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను బలపర్చిన స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలిచి మెజార్టీ స్థానాలు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ బీఆర్ఎస్ బోల్తా పడుతుందన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మౌళిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయని విమర్శించారు. ● కల్వకుర్తిలో చివరిరోజు నిర్వహించిన ర్యాలీలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీక అని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి బంగారు భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీలకు దాదాపు రూ.150 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ప్రజల అవసరాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మున్ముందు పకడ్బందీ ప్రణాళికలతో రెండు పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. -
నాగర్కర్నూల్
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ప్రచారం ముగిసె.. రేపు ప్రత్యేక సెలవు కందనూలు: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలకు ఆదేశించారు. పోలింగ్ నిర్వహణకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించగా ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు లోకల్ హాలిడే వర్తిస్తుందని చెప్పారు. కొనసాగుతున్న నిరసన దీక్షలు చారకొండ: మండలంలోని గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించాలని కోరుతూ చేపడుతున్న దీక్షలు 70 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం దీక్షలో కూర్చున్న నిర్వాసితులు మాట్లాడుతూ ప్రభుత్వంగా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి లింగాల: జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. సోమవారం మండలంలోని అంబట్పల్లి చెంచు కాలనీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని సీహెచ్సీలు, పీహెచ్సీల ద్వారా వైద్య సేవలను మెరుగుపరచడమే కాకుండా.. తరుచుగా చెంచు పెంటలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అంబట్పల్లిలో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యులు 150 మందిని పరీక్షించి.. 70 మందికి షుగర్, బీపీ తదితర పరీక్షలు జరపగా.. 12 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించారు. వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జిల్లా అదనపు వైద్యా ధికారి సురేష్బాబు, వైద్యులు శరత్, జయచంద్రప్రసాద్, గైనకాలజిస్టు శిరీష, సబ్ యూనిట్ అధికారి బిక్లాల్, సూపర్వైజర్ లక్ష్మమ్మ, హెచ్ఏ రామచందర్, మల్లేష్, ఏఎన్ఎంలు, ఆశాలు, ఐటీడీఏ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ప్రలోభాలు ఎగసె మున్సిపల్ ఎన్నికల్లో ముగిసిన ప్రచార పర్వం సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. గత పదిరోజులుగా పాటలు, ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. పెద్దసంఖ్యలో జనం, డీజే చప్పుళ్లు, మంది మార్బలంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా.. సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. బుధవారమే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. సోమవారం సాయంత్రానికి ప్రచారం పర్వం ముగియగా.. అభ్యర్థులు పెద్దఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. ప్రచారంలో పై‘చేయి’.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అధికార కాంగ్రెస్ ప్రచార పర్వంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ర్యాలీలతోపాటు ప్రచారంలో పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరిస్తూ బలప్రదర్శన నిర్వహించింది. మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఆయన తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీకే పరిమితమై పూర్తిస్థాయిలో సమయం కేటాయించారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి ఇద్దరూ అన్ని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోఆర్డినేటర్గా ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితోపాటు పీసీబీ మెంబర్ బాలాజీసింగ్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఖర్చులో ఎక్కడా తగ్గట్లే.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్రులు ఖర్చులో ఏమాత్రం వెనకాడటం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు మద్యం, డబ్బుతో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివసించే వలస ఓటర్లను ఓటింగ్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున చెల్లించడంతోపాటు ప్రయాణ ఖర్చులను ముందుగానే ముట్టజెప్పుతున్నారు. పలువురు అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా ఫోన్పే, గూగుల్పే ద్వారా నేరుగా ఓటర్ల ఖాతాలకు వేయిస్తున్నారు. కందనూలు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేందుకు గాను ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు గాను అవసరమైన సిబ్బందితోపాటు అదనంగా 20 శాతం సిబ్బందిని రిజర్వ్లో ఉంచామన్నారు. అలాగే బుధవారం పోలింగ్ ప్రక్రియకు అవసరమైన పీఓలు, ఏపీఓలు, ఓపీఓలను మూడో విడత ర్యాండమైజేషన్ ద్వారా నేరుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రమేష్కుమార్, ఈడీఎం నరేష్ పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ బదావత్ సంతోష్, ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయం తదితరులు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అభ్యర్థులు ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా పోటీపడుతున్నారు. ఇప్పటికే మద్యం, నోటు, మాంసం రూపంలో పెద్దఎత్తున ప్రలోభాలు కొనసాగుతుండగా ఎన్నికలకు ముందు రోజు భారీస్థాయిలో డబ్బు పంపిణీకి సన్నాహాలు పూర్తయ్యాయి. రిజర్వ్డ్, జనరల్ వార్డు తేడా లేకుండా ఎక్కడ చూసినా ఒక్కో అభ్యర్థి కనీసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వెచ్చించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పలుచోట్ల ఒక్కో ఓటుకు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట, చైర్మన్ ఆశావహులుగా ఉన్న వార్డుల్లో ఖర్చు మరింత పెరుగనుంది. పెద్దఎత్తున మద్యం, డబ్బుల పంపిణీకి ప్రయత్నాలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్న అభ్యర్థులు, నాయకులు గంపగుత్తగా ఓట్లు పొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం రేపే పుర సమరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పట్టణాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు జరిగే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. కాబట్టి పట్టణాల్లో ఎవరూ కూడా బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం పోలింగ్ ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని శుక్రవారం సైతం మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసే వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. -
మాటలు కాదు.. చేతల్లో చూపాలి
● విజన్ ఉన్న నాయకులనే ఎన్నుకోవాలి ● అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి ● డ్రెయినేజీ, పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి ● సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి ● ‘సాక్షి’ చర్చావేదికలో కందనూలువాసుల మనోగతం బస్టాండ్ విస్తరించాలి.. జిల్లాకేంద్రంలో సుమారు 30 ఏళ్ల కిందటి బస్డాండ్ భవనమే ఇప్పటికీ కొనసాగుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా బస్టాండ్ విస్తరణ చేపట్టాలి. చినుకు పడితే చాలు పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. టెలిఫోన్ ఎక్స్ఛేంజీతోపాటు పలుచోట్ల రోడ్లపైనే నీరు నిలుస్తోంది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలి. – తిరుపతయ్య, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ప్రలోభాలకు లొంగకూడదు.. ఎన్నికల్లో హామీలకే పరిమితమయ్యే వారు కాకుండా చేతల్లో పనులు చేసి చూపగలిగే వారినే ఎన్నుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకునేవారు కావాలి. కేవలం ఎన్నికల సమయంలో నోటు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగకూడదు. అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలి. – వెంకటస్వామి, రిటైర్డ్ ఉద్యోగి రోడ్ల నిర్మాణం చేపట్టాలి.. పట్టణంలో ప్రధానంగా సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. శివారు గ్రామాలతోపాటు చాలా వార్డుల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీలు లేవు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించినా మురుగు బయటకు పంపేందుకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకాలేదు. ప్రధాన సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలి. – పడిగె తిరుపతయ్య, నాగర్కర్నూల్ డంపింగ్ యార్డు సమస్య జిల్లాకేంద్రంలో ప్రధానంగా డంపింగ్యార్డుతోపాటు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించాలి. పట్టణం నుంచి మురుగు బయటకు వెళ్లే మార్గం లేక కేసరిసముద్రం చెరువులో కలుస్తోంది. నాలాలు ఆక్రమణకు గురికావడంతో వర్షపు నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోంది. చందాయిపల్లి శివారులో రైతులకు చెందిన భూముల్లో చెత్త డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నారు. – వావిలాల రాజశేఖరశర్మ, నాగర్కర్నూల్ ఇళ్లలోకి వర్షపు నీరు.. వర్షం పడితే జిల్లాకేంద్రంలో రాంనగర్కాలనీతోపాటు ఇళ్లలోకే నీరంతా చేరుతోంది. డ్రెయినేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి. ఎన్నికల్లో సరైన వ్యక్తులనే నాయకులుగా ఎన్నుకోవాలి. సేవాభావం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. – లక్ష్మణ్నాయక్, టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బస్టాండ్ ఎదుటే దుర్గంధం జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఎదుటే తీవ్రమైన పారిశుద్ధ్య సమస్య నెలకొంది. బస్టాండ్ చుట్టూ బహిరంగ మూత్రవిసర్జన చేయడంతో దుర్గంధం వస్తుంది. టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేదు. పెరిగిన ట్రాఫిక్, జనాభాకు అనుగుణంగా బస్టాండ్ సరిపోవడం లేదు. మహిళలు, ప్రయాణికులకు సరైన షెల్టర్ సౌకర్యం కల్పించాలి. – లక్ష్మణస్వామి, నాగర్కర్నూల్ సాక్షి, నాగర్కర్నూల్/ కందనూలు/ నాగర్కర్నూల్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే వారినే ఎన్నుకోవాలని పలువురు ఓటర్లు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మైదానంలో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో పట్టణ సమస్యలపై నిర్వహించిన చర్చావేదిక కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. నాగర్కర్నూల్ పట్టణంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే నాయకులనే ఎన్నుకుంటామని తెలిపారు. మాటల్లో కాదు.. చేతల్లో పనులను చూపే నాయకులను ఎన్నుకోవాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రెయినేజీల సమస్యలను తీర్చడంతోపాటు కోతులు, కుక్కల బెడదకు సైతం పరిష్కారం చూపాలని కోరారు. లో ఓల్టేజీ సమస్య.. జిల్లాకేంద్రంలో పలుకాలనీల్లో విద్యుత్ లో ఓల్టేజీతో తరచుగా సమస్య నెలకొంది. ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవుతున్నాయి. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉన్నా నీటి సరఫరా ఉండటం లేదు. సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలి. సమస్యలకు పరిష్కారం చూపేవారిని ఎన్నుకోవాలి. – గుడిపల్లి నిరంజన్, టీచర్ సమస్యలపై దృష్టిపెట్టాలి.. ఓటరు జాబితాలో ఇష్టానుసారంగా పేర్ల మార్పులు జరిగాయి. ఒకవార్డు ఓటర్లను మరో వార్డులో చేర్చారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలి. చెత్త సేకరణ నిత్యం కొనసాగాలి. కొన్నిచోట్ల రెండు, మూడు రోజులకు ఒకసారి చెత్త సేకరణ జరుగుతోంది. డంపింగ్ యార్డు నిర్వహణ సక్రమంగా చేపట్టాలి. – మురళీధర్రావు, వ్యాపారి రోడ్లన్నీ గుంతలమయం.. జిల్లాకేంద్రంలోని బీసీకాలనీలో రోడ్లన్నీ గుంతలుగా మారాయి. వర్షం వస్తే చాలు అడుగు వేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు సీసీరోడ్లు నిర్మించలేదు. డ్రెయినేజీలు ఏర్పాటుకాలేదు. పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్లు, డ్రెయినేజీలతోపాటు అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలి. – బ్రహ్మచారి, వ్యాపారి కుక్కల బెడద నివారించాలి.. జిల్లాకేంద్రంలో కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. కన్యకాపరమేశ్వరి ఆలయ సమీపంలోనే చెత్త డంపింగ్ యార్డు ఉండటంతో సమస్య ఉంది. అక్కడి నుంచి తరలించాలి. చెత్త సేకరణ సక్రమంగా ఉండేలా చూడాలి. బాధ్యత గల వారినే నాయకులుగా ఎన్నుకోవాలి. – నర్సింహ, వ్యాపారి మినీ స్టేడియం నిర్మించాలి.. జిల్లాకేంద్రంలో ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి. క్రీడల ప్రోత్సాహానికి వసతులు మెరుగుపర్చాలి. రోడ్ల మీదే చెత్తవేయడంతో పారిశుద్ధ్యం సక్రమంగా లేదు. పదవుల కోసం పాకులాడే వారిని కాకుండా ప్రజల కోసం పోరాటం చేసేవారినే ఎన్నుకోవాలి. – సాయిబాబు, లెక్చరర్ ప్రజాసేవే ముఖ్యం.. పట్టణంలో ఏళ్లుగా నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలి. ఈ రోజుల్లో డబ్బులు లేని వారు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల్లో ఆస్తులు ముఖ్యం కాదు.. సేవాభావం, నిబద్ధత ఉన్న వారినే ఎ న్నుకోవాలి. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధిపై అంకితభావం ఉన్నవారినే గెలిపించాలి. – పచ్చిపాల సుబ్బయ్య, టీచర్ -
ఏం చేద్దాం..ఎలా గెలుద్దాం!
నగర డివిజన్లలో అభ్యర్థుల గెలుపు వ్యూహాలు పాలమూరు: మరికొన్ని గంటల్లో కార్పొరేషన్/మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడును పెంచుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు కార్నర్ మీటింగ్లు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. చాలావార్డుల్లో త్రిముఖ, కొన్నింటిలో చతుర్ముక పోరు ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు, కొన్నివార్డుల్లో ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, రెబల్స్ బరిలో ఉన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర, భూత్పూర్లలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఇటీవల జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా నిర్వహించిన సభ ద్వారా కమలంలో ఒక జోష్ వచ్చింది. దీనికితోడు స్థానిక ఎంపీ డీకే అరుణ అభ్యర్థుల గెలుపు బాధ్యత తన భుజాలపై వేసుకొని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు, కోస్గి, నారాయణపేట, మద్దూరులో ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలో రోజుకు మూడు నాలుగు డివిజన్లలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం సాగిస్తున్నాడు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పురపాలికల్లో ప్రతి రోజూ ప్రచారంలో పాల్గొంటున్నారు. నగరంలో ఎంఐఎం కూడా ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 9న షాషాబ్గుట్ట చౌరస్తాలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. శనివారం రాత్రి మదీనా మజీద్ చౌరస్తాలో ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభ జరిగింది. నాగర్కర్నూల్లో మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ధీటుగానే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సైతం వ్యూహాలు పన్నుతున్నారు. బీజేపీ కూడా పోటీలో ఉండడంతో దాదాపు అన్ని వార్డుల్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలో ఐదు పురపాలికలున్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తమ అనుచరులను గెలిపించుకునేందుకు వనపర్తి, పెబ్బేరులో ప్రతిరోజూ ఓటర్లను కలుస్తున్నారు. 50 మంది ఓటర్లకో ఇన్చార్జిగా నియమించి బాధ్యతల అప్పగింత ప్రత్యేక సమావేశాలు.. రహస్య మంతనాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేటితో ముగియనున్న ప్రచారం బరిలో ఉన్న అభ్యర్థులు కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, మైనార్టీలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి నేను కౌన్సిలర్గా గెలవగానే ఎమ్మెల్యేతో మాట్లాడి మీ పనులన్నీ చేసి పెడుతానంటూ హామీలు గుప్పిస్తున్నారు. రేషన్కార్డులిప్పిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం..గుడి కట్టిస్తాం.. రోడ్లు వేయిస్తాం.. కమ్యూనిటీ భనాలు నిర్మిస్తాం.. అంటూ అభ్యర్థులు ఓటర్లకు హామీలిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. డబ్బుల పంపిణీ కోసం కొంతమంది ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడనేది గుర్తించి అందుకు అదనంగా మరింత ఇచ్చే విధంగా కొందరు వ్యూహరచన చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు చేస్తూ ఓటు వేయడానికి రమ్మని అభ్యర్థిస్తున్నారు. మొత్తంగా గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్ను చేపడుతున్నారు. -
సరైన సమయానికి టీకాలు ఇవ్వాలి
బిజినేపల్లి/ తిమ్మాజిపేట: ప్రతి చిన్నారికి సరైన సమయానికి టీకాలు ఇవ్వాలని, డ్యూలిస్ట్ ఉన్న చిన్నారులకు తక్షణమే టీకాలు అందించి పూర్తిచేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సురేష్బాబు అన్నారు. శనివారం ఆయన స్థానిక పీహెచ్సీని సందర్శించి.. టీకా రికార్డులు, నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న రొటీన్ టీకా సేవల అమలు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదు, పెండింగ్ డ్యూ కేసులు, గుర్తింపు తదితర అంశాలను సమీక్షించారు. టీకా రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ నమోదులో నిర్లక్ష్యం చేయరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిమ్మాజిజేట మండలంలోని గుమ్మకొండ ఆరోగ్య ఉపకేంద్రం, తిమ్మాజిపేటలోని పీహెచ్సీని సందర్శించి వ్యాక్సిన్ రికార్డులు, డ్యూలిస్టు జాబితాను పరిశీలించారు. ఆయన వెంట ఏపీఓ చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, డాక్టర్ ఇస్మాయిల్ తదితరులున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 82 మంది గైర్హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 2,000 మంది విద్యార్థులకు గాను 1,918 మంది హాజరుకాగా.. 82 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. -
లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది. సర్దుబాట్లతో కలసిన పార్టీలు.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు.. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం. చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం.. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత సర్దుబాట్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఓ వర్గం బీఆర్ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
కొల్లాపూర్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టి.. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇంకా రెండున్నరేళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు నిరాటంకంగా చేసుకోవచ్చన్నారు. ప్రజలు వృథా ఖర్చులు తగ్గించుకోవాలని, ఆడంబరాలకు పోయి అప్పుల పాలు కావొద్దని హితవు పలికారు. పిల్లల కోసం రూ.లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు విద్యాలయాల్లో చేర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు. వైద్యసేవలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పొందాలని చెప్పారు. మోటార్ సైకిళ్లను విరివిగా వినియోగించడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందని, ప్రతిఒక్కరూ సైకిల్ వాడకాన్ని పెంచి.. కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఆయన సైకిల్ తొక్కుతూ ఎన్నికల ప్రచారం చేశారు. -
ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
లింగాల: ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచుతూ వారికి జీవనోపాధి కల్పించాలని అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. శనివారం ఆమె మండలంలోని లింగాల, జీల్గుపల్లిలో పర్యటించి.. ఉపాధి పథకంలో చేపట్టిన వివిధ పనులను పరిశీలించారు. వ్యవసాయ పనులు ముగుస్తున్న ఈ సమయంలో కూలీలకు పనులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించాలని చెప్పారు. పనుల్లో పారదర్శకత ఉండాలని, నిబంధనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి పంచాయతీ పరిధిలోని నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టాలని, నర్సరీల పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. ఇప్పటికే నాటిన మొక్కల చుట్టూ కంచెలను ఏర్పాటు చేసి కాపాడాలని కోరారు. అలాగే ఉపాధి పథకంలో చేపట్టిన కోళ్ల పెంపకం, నర్సరీలు, మొక్కల చుట్టూ కంచె ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ ఇమాంఅలీ, టీఏలు శివకుమార్, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పక్కాగా పాటించాలి
కందనూలు: ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సజావుగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలలో ఈ నెల 13న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీఓలు, ఏపీఓలు, ఇతర అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు విధానం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మాస్టర్ ట్రైనర్ గోపాల్నాయక్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సిబ్బంది అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని.. టేబుళ్ల వద్ద పోటీ చేస్తున్న అభ్యర్థుల పార్టీల గుర్తుల ప్రకారం బాక్సులు సిద్ధం చేసుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అనంతరం పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓపెన్ చేయాలని సూచించారు. చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్ పాల్గొన్నారు. -
సా..గుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ
● రైతులకు అవగాహన లేకపోవడమే అసలు కారణం ● సాంకేతిక సమస్యలతోనూ తప్పని ఇబ్బందులు అచ్చంపేట: దేశాభివృద్ధిలో అన్నదాతల ప్రాముఖ్యత గుర్తించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా ఆధార్ తరహాలోనే పదకొండు అంకెలతో కూడిన యూనిక్ ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. గతేడాది మే 5న ప్రారంభమైన ఇంత వరకు రైతుల వివరాల నమోదు 40 శాతం దాటలేదు. జిల్లాలోని 20 మండలాల్లో 3,35,013 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. ఇందులో పీఎం కిసాన్ రైతులు 1,60,375 మంది ఉండగా.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 87,339 మందికి ఐడీ క్రియేట్ అయ్యింది. పీఎం కిసాన్ వంటి ఇతర కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో క్లస్టర్ల వారీగా ఏఈఓలు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించకపోవడంతోనే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమీపంలో ఉన్న ఏఈఓలు, మీసేవా కేంద్రాల వద్దకు వెళ్తుండగా.. వారికి అనేక రకాల సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీ సమయానికి రాకపోవడం, రైతులతో ఫోన్లు లేకపోవడం, ఉన్నా ఆధార్ లింకు కాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఒకే రైతుకు రెండుచోట్ల భూమి ఉండటం, భూమి ఉన్నవారు స్థానికంగా లేకపోవడం, మరణించిన వారి పేరుమీద భూమి ఉండటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ వివరాల నమోదుకు ప్రస్తుతం తుది గడువు లేదని, వచ్చే పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ముందు గడువు పెట్టే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ క్లస్టర్లు 143 మొత్తం భూమి 7,59,793 ఎకరాలు మొత్తం రైతులు 3,35,013 ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకున్నవారు 87,339 ఫార్మర్ రిజిస్ట్రేషన్కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల ఎదరువుతున్నాయి. కొందరు రైతుల ఆధార్ నంబరు ఎంట్రీ చేస్తే సరైన వివరాలు రావడం లేదు. మరికొందరు స్థానికంగా లేకపోవడం సమస్యగా మారింది. మరో నెలరోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయధికారి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు, పట్టా పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ లింకు అయిన మొబైల్ నంబరుతో స్థానిక ఏఈఓలను సంప్రదించాలి. అలాగే మీసేవా కేంద్రాల్లో సైతం రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకసారి ఐడీ పూర్తయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు. పీఎం కిసాన్ సాయం పొందేందుకు ఐడీ తప్పనిసరి చేశారు. ఒకే ఐడీ ఉండడం ద్వారా లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థికసాయం అందజేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన రాయితీలు, రుణాలు, పథకాలు త్వరగా అందుతాయి. భవిష్యత్లో అమలు చేసే పథకాల ప్రయోజనాలు స్పష్టమైన గుర్తింపుతో పక్కదారి పట్టే అవకాశం ఉండదు. -
మిగిలింది 2 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంలో వేగం.. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ఉదయం నుంచే ప్రచార రథాలు, మైక్లతో హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ప్రత్యేక పాటలతో రోజంతా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియదిరుగుతున్నారు. వారితోపాటు సతీమణులు, కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీరిక లేకుండా ప్రచారంలోనే నిమగ్నమవుతున్నారు. తమకు కలిసివచ్చే అంశాలపై దృష్టిపెడుతూ ఓట్ల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ను మరింత పెంచింది. అభ్యర్థులతోపాటు నేతలు ఉదయం నుంచి సాయంత్రం వ రకు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బలప్రదర్శనపై ఫోకస్.. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వలస ఓట్ల కోసం గాలింపు.. ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు మున్సిపల్ పోలింగ్కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. -
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
మేలురకం గ్రాసంతో పాల ఉత్పత్తుల పెంపు
ఉప్పునుంతల: పశువులు, గేదెలకు కృత్రిమ గర్భధారణతో ఆడ దూడలు పొందడం ద్వారా పాడి పశువుల సంఖ్య పెంపొందుతుందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మర్రిపల్లిలో జిల్లా పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి శాఖ మహబూబ్నగర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని స్థానిక సర్పంచు భూపాల్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ పాడి రైతులు పశువులకు రోగాలకు రాకుండా ముందస్తుగానే టీకాలు వేయించాలని, పాల ఉత్పత్తులు పెంచడానికి మేలురకం పశుగ్రాసం పెంచాలని, దాణా, మినరల్ మిక్చర్ వాడాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ప్రవీణ్కుమార్, వైద్యులు బుచ్చమ్మ, అనిల్, ఉప సర్పంచు కొండల్, పశువైద్య సిబ్బంది శ్రీను, హబీబ్, మిరాజ్, గోపాలమిత్ర సూపర్వైజర్ మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తిస్తున్న పెద్ద పులి
మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ మండలం అటవీ సరిహద్దులో పెద్ద పులి హడలెత్తిస్తోంది. ప్రతినిత్యం వ్యవసాయ పొలాల సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా మండలంలోని జంగంరెడ్డిపల్లి, తెలుగుపల్లి, కల్ములోనిపల్లి, మాచారం, మన్ననూర్ గ్రామాల రైతులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, వేరుశనగ, మినుములు, ఆముదాలు వంటి పంటలు సాగు చేశారు. ఈ పంట పొలాలు మొత్తంగా అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉండటంతో తరుచుగా వన్యప్రాణులు జింకలు, అడవి పందులు దాడులు చేస్తాయనే ఉద్దేశంతో రాత్రి సమయంలో కాపలా వెళ్తారు. ప్రస్తుతం ఈ గ్రామాల పరిసర వ్యవసాయ పొలాల సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇదే అదునుగా వన్యప్రాణులు పంట పొలాలపై గుంపులు గుంపులుగా దాడులు చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. 20 ఎకరాల్లో పంటలు.. మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామ రైతులు ఎల్లస్వామి, కమలేశ్వర్, వజ్రమ్మ, అర్జునయ్య తదితరులు సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలను అడవి పందులు నాశనం చేశాయని రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటల నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు గ్రామాల సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ● శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై కుంచోనిమూల సమీప అడవిలోనూ ప్రయాణికులకు పెద్దపులి తారస పడింది. ముఖ్యంగా సమీప గ్రామాల ప్రజలు ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి గ్రామాల సమీపంలోని చిట్టడవిలో సంచరిస్తున్న పెద్దపులిని అభయారణ్యంలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అమ్రాబాద్ అటవీ సరిహద్దుప్రాంతంలో తరుచూ సంచారం పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్న అన్నదాతలు కాపలా వెళ్లకపోతే జింకలు, అడవి పందులు నాశనం చేస్తాయని ఆందోళన బెడద తప్పించాలని అటవీ అధికారులకు వేడుకోలు -
దుప్పిని చంపేసింది..
అప్పులు చేసి సాగు చేసిన పంట అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. నిత్యం పంట పొలానికి రాత్రి సమయంలో కాపలా వెళ్లేవాళ్లం. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది. వారం రోజుల క్రితం మా పొలం పక్కనే పెద్దపులి ఒక దుప్పిని చంపేసింది. అటవీశాఖ అధికారులు పంట నష్టపరిహారం అందించడంతోపాటు పెద్దపులిని దట్టమైన అడవిలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలి. – నల్లపోతుల అర్జునయ్య, రైతు, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్ మండలం పులి కదలికలు వాస్తవమే.. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో పెద్ద పులుల సంఖ్య పెరిగింది. దీంతో ఒక్కో పులి ఒక ఏరియా అడవిలో సంచరించడం మామూలే. ప్రతాపరుద్రుని కోట పరిసర ప్రాంత అడవిలో పెద్ద పులి కదలికలు ఉన్నాయనే మాట వాస్తవమే. గతంలో వాటి సంరక్షణ కోసం సాసర్లలో నీరు కూడా పోశాం. రైతులు, ప్రయాణికులు రాత్రి సమయంలో అటవీ సరిహద్దు ప్రాంతంలో రాకపోకలు చేయడం క్షేమం కాదు. మా బాధ్యతగా ప్రజలు, రైతుల రక్షణ కోసం సహాయక చర్యలు చేపడుతాం. – వీరేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మన్ననూర్ ● -
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న నైస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసే ప్రతి టేబుల్ వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రతి అభ్యర్థికి ఒక ఏజెంట్ చొప్పున ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంలతోపాటు కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. 10న జరగనున్న పోలింగ్కు అవసరమైన సామగ్రి పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని ఆదేశించారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. బ్యాలెట్ పేపర్ల తనిఖీ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అలాగే రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్యాలెట్ పేపర్ల తనిఖీని పరిశీలించి, బ్యాలెట్ పేపర్లలోని వివరాలు ఫారం–7లో ఉన్న విధంగా ఉన్నాయో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలని చెప్పారు. ఎలాంటి తప్పులు, సందేహాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులందరికీ కౌంటింగ్ నోటీసులు తప్పనిసరిగా జారీ చేసి, ప్రతి ఒక్కరికీ సమాచారం అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భూ సేకరణ వేగవంతం చేయండి జిల్లాలో జాతీయ రహదారి–167కే కొల్లాపూర్, నాగర్కర్నూల్ పరిధిలో ఉన్న భూ సేకరణలో పురోగతి, పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో జాతీయ రహదారి, రెవెన్యూ శాఖల అధికారులతో భూ సేకరణ, నిర్మాణ పురోగతి పనులపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. భూ సేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. రెవెన్యూ జాతీయ రహదారి నిర్మాణ పనుల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులతో మాట్లాడి వారి ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశీఇటికాల భూసేకరణ నోటిఫికేషన్లు, పరిహారం, అవార్డుల ఖరారు వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో భూ సేకరణ అధికారి సత్యనారాయణ, డీఈ రమేష్బాబు, ఆర్డీఓలు సురేష్, బన్సీలాల్, జనార్దన్రెడ్డి, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలి
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి పర్యవేక్షణ బృందాలతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా తొమ్మిది పర్యవేక్షణ బృందాలు జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని పాఠశాలలో పరిశీలించిన అంశాలను తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి.. రికార్డుల నిర్వహణ, ఎఫ్ఎల్ఎన్ పరీక్ష విధివిధానాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా తరగతులు జరుగుతున్నాయనే అంశాలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి విద్యాప్రమాణాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ కిరణ్కుమార్, హెచ్ఎంలు వెంకటయ్య, నరహరి, బాలీశ్వర్, నాగరాజు, తనిఖీ బృందాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు
కందనూలు: డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీపై పీఎంశ్రీ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ టూల్స్ గూగుల్ షీట్స్, వలూమి సాఫ్ట్వేర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 పీఎంశ్రీ పాఠశాలల్లో ఐసీటీ, ఏఐ ద్వారా విద్యాబోధన చేయాలన్నారు. ల్యాప్టాప్లు, ట్యాబ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే డీఈఓ కార్యాలయంలో సమాచార హక్కుచట్టంపై ఎంఈఓలు, కార్యాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి ఎండీ షర్ఫుద్దీన్, రీసోర్స్ క్లస్టర్లు కృష్ణమోహన్, జహీర్, జంగయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలకు విశేష ప్రాముఖ్యత
అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతానికి విశేష ప్రాముఖ్యత ఉందని, ప్రధానంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధం ముడిపడి ఉందని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో గ్రూప్–1 అధికారులకు 2 బ్యాచ్లుగా మూడు రోజులుగా నిర్వహించిన నల్లమల అటవీ ప్రాంత ట్రెక్కింగ్, స్టడీ టూర్ శిక్షణ తరగతుల చివరిరోజు గురువారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు, అక్కడ పొందిన అనుభూతులను శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన శిక్షణ తరగతులలో అధికారులు ఆసక్తితో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను నేరుగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకొని సమర్థవంతమైన నిర్ణ యాలు తీసుకునేందుకు ఈ తరహా శిక్షణ భవిష్యత్ పాలనకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు బాధ్యతాయుతంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, పొందిన అనుభవాన్ని తమ విధి నిర్వహణలో అమలు చే యాలని సూచించారు. జిల్లా యంత్రాంగం మూడురోజులుగా గ్రూప్–1 అధికారుల శిక్షణ విజయవంతం చేసేందుకు ఎంతో కృషిచేయడం జరిగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ వివరించారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రెక్కింగ్కు శిక్షణ అధికారులతో కలిసి శాంతికుమారి వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు. చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు గౌరవించాలి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్టడీ టూర్ పాలనకు మార్గదర్శకం కావాలి ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి -
సులభంగా వాహన రిజిస్ట్రేషన్
అచ్చంపేట: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి వేచి చూడాల్సిన పనిలేదు. తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) లాగే.. శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం షోరూం డీలర్లకు అప్పగించింది. ఇందుకోసం రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేయగా.. జిల్లావ్యాప్తంగా ఈ నూతన ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. ద్విచక్రవాహనాలు, కార్లకు మాత్రమే షోరూంల్లో శాశ్వత రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే చేయించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలందించే ఆవకాశం ఉంటుంది. అయితే ఇటీవలే ప్రభుత్వం రోడ్డు భద్రత పేరుతో ప్రత్యేక సెస్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్లకు రూ.5 వేలకుపైగా చెల్లించాలి. వాహన కొనుగోలు సమయంలోనే సెస్ చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఇలా.. కొత్త వాహనం తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లడం కోసం చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేయించుకునే కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. షోరూంలో వినియోగదారులు వాహనం కొన్న వెంటనే టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)నంబర్ నమోదు చేస్తారు. తర్వాత షోరూం వారే రవాణా శాఖ వాహన్ పోర్టల్ టీఆర్ సంఖ్య, ధర (ఇన్వాయిస్) ఛాసిస్ నంబరు, వాహనం ఫొటో, బీమా పత్రం, అడ్రస్ ప్రూఫ్, వినియోగదారుడి ఫొటో, దరఖాస్తుదారుడి వివరాలు అప్లోడ్ చేస్తారు. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల హార్డు కాపీని షోరూం ప్రతినిధులు రవాణా శాఖ కార్యాలయానికి పంపిస్తారు. వాటి పరిశీలన అనంతరం అధికారులు వాహన నంబర్ను కేటాయిస్తారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విషయం సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) రూపంలో వాహనదారుడు, షోరూంలకు చేరుతుంది. సంబంధిత ఆర్సీ కార్డును లైసెన్స్డ్ డీలర్ ద్వారా షోరూంకు స్పీడ్ పోస్టు ద్వారా చేరుతుంది. అక్కడి నుంచి వాహనదారులు ఈ కార్డు తీసుకుంటారు. ఫ్యాన్సీ నంబర్కు.. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనానికి కోరుకున్న లేదా ఫ్యాన్సీ నంబర్ కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్తోపాటు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు రుసుం చెల్లిస్తే కావాల్సిన సంఖ్యను రవాణా శాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పట్టనుండగా.. అప్పటి వరకు ఆగాల్సి వస్తుంది. జిల్లాలో 24 షోరూంలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో వివిధ కంపెనీలకు సంబంధించిన ద్విచక్రవాహన షోరూంలు 20, కార్ల షోరూంలు 4 ఉన్నాయి. నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, బిజినేపల్లి పరిధిలో రోజుకు 10 నుంచి 20 ద్విచక్రవాహనాలు, 2 నుంచి 4 వరకు కార్లు, ఇతర వాహనాలు అమ్ముడవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాహనానికి సంబంధించి అన్ని లావాదేవీలు షోరూం డీలరు ముందే వసూలు చేసేవారు. వాహనానికి సంబంధించి తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఇచ్చేవారు. ఆ పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం మరీ ఎక్కువగా ఉండేది. ఇకపై ఆ సమస్య తీరనుంది. ఇకపై డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్లు, ద్విచక్రవాహనాలకు మాత్రమే అవకాశం వినియోగదారులకు డబ్బు, సమయం ఆదా ఆర్టీఏ అధికారులకు తగ్గనున్న పనిభారం తప్పనున్న మధ్యవర్తుల బెడద ప్రక్రియ ప్రారంభమైంది షోరూంలలో నూతన వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల 24 నుంచే ప్రారంభమైంది. టీఆర్ సంఖ్య వచ్చిన సాయంత్రానికే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలు అందుతాయి. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అన్ని పత్రాలను ఆన్లైన్లో సాఫ్ట్వేర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మా కార్యాలయంలో అన్ని పత్రాలు పరిశీలించి ఆమోదం తెలుపుతాం. –చిన్నబాలు, జిల్లా రవాణా అధికారి -
ఇంటర్ ప్రాక్టికల్స్కు 53 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కు 53 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లావ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 1,833 మంది విద్యార్థులకు గాను 1,783 మంది హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ పేర్కొన్నారు. నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశాల కోసం శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్రావు అన్నారు. గురువారం నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షల కోసం కేంద్రాల సూపరింటెండెంట్లు, కేంద్రస్థాయి పరిశీలకులకు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పి.భాస్కర్కుమార్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రావు మాట్లాడుతూ 9వ తరగతిలో 6, 11వ తరగతిలో 13 ఖాళీలకు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నిర్వహించే పరీక్షకు మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. విద్యుత్ సమస్యల గుర్తింపునకే పల్లెబాట పాన్గల్: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకే పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని అన్నారం గ్రామంలో ట్రాన్స్కో ఏఈ చందన్కుమార్రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. బీసీకాలనీలో మూడో విద్యుత్ తీగ ఏర్పాటు, ఎస్సీకాలనీలో రేషన్ దుకాణం వెనుక ఉన్న విద్యుత్ స్తంభాలకు తీగల బిగింపు, ధర్మరాజుగడ్డలో ఇళ్ల నడుమ ఉన్న విద్యుత్ తీగల తొలగింపు, బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో విద్యుత్ లైన్లు, పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, వ్యవసాయ బోరుబావులకు డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలనే సమస్యలను సర్పంచ్ వహీద్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
క్షయ నిర్మూలన దిశగా..
● జిల్లాలో వ్యాధి నియంత్రణకు చర్యలు ● గ్రామాల్లోనే అదునాతన యంత్రాలతో స్క్రీనింగ్ ● వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ అనుమానితులకు పరీక్షలు.. క్షయవ్యాధి నివారణ కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో వైద్య సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అదే విధంగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహిస్తున్నాం. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి.. లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందిస్తున్నాం. – డా.రవికుమార్, డీఎంహెచ్ఓ పోషకాహార లోపం లేకుండా.. జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార లోపం లేకుండా ఎస్బీఐ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న భవిష్య భారత్ సంస్థ ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తున్నాం. క్షయ వ్యాధిగ్రస్తులకు తమవంతు సహకారం అందిస్తూ.. వ్యాధి నివారణకు కృషి చేస్తున్నాం. – సజ్జద్ అలీ, భవిష్య భారత్ సంస్థ జిల్లా మేనేజర్ నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో క్షయవ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగిపోవడంతో పాటు ఇతరులకు సంక్రమిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్షయ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించి.. వారికి సకాలంలో చికిత్స అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను అందజేయడంతో పాటు పోషకాహార లోపం ఉండకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నిక్షయ మిత్ర’ కార్యక్రమం ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తోంది. ముమ్మరంగా అవగాహన.. క్షయవ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి.. అనుమానితులను గుర్తించడంతో పాటు అత్యాధునిక యంత్రాలతో పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారితో పాటు దీర్ఘకాలంగా సిగరేట్, మద్యం తాగే వారి కుటుంబసభ్యులు, ఎయిడ్స్ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి.. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి తెమడ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 734 మంది వ్యాధిగ్రస్తులు.. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో 734 మంది క్షయ వ్యాధిగ్రస్తులను అధికారులు గుర్తించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది పర్యవేక్షించడంతో పాటు అవసరమైన మందులు అందిస్తూ.. వ్యాధి నివారణకు కృషి చేస్తున్నారు. అదే విధంగా వివరాలను నిక్షయ్ పోర్టల్లో నమో దు చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అపోలో, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పరిధిలోని వ్యాధిగ్రస్తులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న భవిష్య భారత్ సంస్థ ద్వారా పోషకాహార కిట్లు అందిస్తున్నారు. పోషకా హార కిట్లలో బియ్యం, కందిపప్పు, పల్లీలు, బెల్లం, ప్రోటీన్ పౌడర్ తదితర బలమైన ఆహార పదార్థాలు ఉంటాయి. జిల్లాలో క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని.. వ్యాది లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. -
మిగిలింది 5 రోజులే..
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఇంకా ఐదు రోజులే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబల్స్ పోరుతో ఆందోళన.. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా మహబూబ్నగర్, గద్వాల మున్సిపాలిటీల్లో రెబల్స్ పోరు అఽధికంగా ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఇద్దరు అభ్యర్థుల పోటీతో ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. మహిళా ఓట్లకు గాలం.. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళల ఓట్లను పొందేందుకు మహిళా సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మహిళల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. వార్డుల వారీగా మహి ళా సంఘాల బాధ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి. ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షే.. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే సొంత పార్టీలోనే అభ్యర్థులు రెబల్స్గా పోటీ చేయడంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పార్టీలో ఏళ్లుగా కొనసాగిన సీనియర్ నాయకులు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టణ వీధుల్లో హోరెత్తిస్తున్నప్రధాన పార్టీలు వార్డులవారీగా పార్టీ ఇన్చార్జిలకు బాధ్యతలు అభ్యర్థుల ఖర్చులకు ప్రత్యేక నేతల నియామకం గద్వాల, పాలమూరులో రెబల్స్ పోరుతో ఆందోళన -
ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం మొత్తం 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 3,144 మంది విద్యార్థులకు గాను 3,006 మంది హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలి నాగర్కర్నూల్ క్రైం: క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్ అని అన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి మద్దతుగా ఉండటంతో పాటు మానసిక ధైర్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని.. తద్వారా సరైన వైద్యం అందించి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.రవికుమార్, ఆర్ఎంఓ డా.రవిశంకర్, గైనకాలజిస్ట్ డా.సుప్రియ, డా.అతిథి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.భరత్కుమార్ రెడ్డి, పాలియేటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్ డా.మౌనిక తదితరులు పాల్గొన్నారు. అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం కందనూలు: వివక్ష, అసమానతలు లేని సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ కార్యాలయంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఓ జగదీశ్, సిబ్బంది పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి కందనూలు: ఎస్సీ, స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు మార్చి 1న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న వారికి 5 నెలల ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి, స్టడీ మెటీరియల్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సెమీస్కు పాలమూరు మహిళల జట్టు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని సెమీఫైనల్కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు 10 వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. మహబూబ్నగర్ బౌలర్లు అనిత, మేఘన చెరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. జట్టులో అక్షర రాథోడ్ (46 నాటౌట్), ఆర్యాని (25 నాటౌట్)గా నిలిచారు.ఈనెల 6వ తేదీన మహబూబ్నగర్ జట్టు సెమీఫైనల్లో ఖమ్మం జట్టుతో తలపడనుంది. -
కమలంలో కొత్త జోష్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/పాలమూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ముందు కమల దళపతి రాకతో బీజేపీ శ్రేణుల్లో నూతన జోష్ వచ్చింది. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో కమల దళంలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఉండే బూత్ స్థాయి కార్యకర్తలు, వివిధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్నికల్లో పోటీ కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతిసి.. ఒక వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల రాజకీయాలను గమనించాలన్నారు. తెలంగాణలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ‘తెలంగాణలో ఎన్నికల ముందు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలనే కాదు.. రైతులను, బడుగు, బలహీన వర్గాలు, ఓబీసీలనూ మోసం చేసింది. రైతు భరోసా కింద రూ.15 వేలు, రుణమాఫీ, భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి దగా చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి నట్టేట ముంచింది. మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పినా.. ఇంత వరకు ఇవ్వడం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడింది. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అవలంబించి ప్రజాగ్రహానికి గురైంది. తెలంగాణలో అన్ని వర్గాలకూ న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. మోదీకి తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు మంజూరు చేసినా.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు కావాలని విమర్శిస్తున్నారు. రైల్వేరంగంలో హై స్పీడ్ కారిడార్, హైదరాబాద్–పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె రోడ్డు కారిడార్ మంజూరు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో తెలంగాణకు రూ.5,450 కోట్లు కేటాయించాం. యువ నాయకత్వం బీజేపీకి అండగా నిలుస్తోంది. బీజేపీ, మోదీ నాయకత్వాన్ని కోరుకుంటూ ప్రతి నగరం నుంచి ఎన్నికల కోసం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో, కుర్చీ కోసం కాదు. తెలంగాణ గౌరవం కోసం. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలాన్ని గెలిపించుకోవాలి.’ అని నితిన్ నబిన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షెలాన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, గౌతమ్రావు, నాయకులు పోతుగంటి రాములు, గువ్వల బాలరాజు, ఆచారి, భరత్, చికోటి ప్రవీణ్, కట్టా సుధాకర్రెడ్డి, నాగురావు నామాజీ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. పాలమూరు గడ్డ.. బీజేపీకి అడ్డా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ పార్టీకి అడ్డాగా నిలువబోతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణ పోరుయాత్రను సైతం పాలమూరులోని మక్తల్ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడకు వచ్చారన్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో ఏళ్లుగా చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుంటూనే ఉన్నామని చెప్పారు. మక్తల్, ఆమనగల్ చైర్మన్ స్థానాలను గతంలోనే దక్కించుకున్నామన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా తాము పాలమూరులో ఎంపీ సీటును గెలిచామని చెప్పారు. ఎవరితో పొత్తులు, అండ లేకుండానే ఒంటరిగా విజయాలను సాధించగలిగామని.. రానున్న రోజుల్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను నెరవేర్చలేక పోయారని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దళిత, బీసీ వర్గాలకు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాలంలోనూ పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇరుపార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. పాలమూరుకు ఇప్పటికీ అన్యాయమే: రాంచందర్రావు ఇక్కడి నుంచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినా పాలమూరు జిల్లాకు అన్యాయమే జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రెండేళ్లలో సీఎం ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నా లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. కేంద్ర నిధులతో మున్సిపాలిటీల అభివృద్ధి బాధ్యత బీజేపీ తీసుకుంటుందని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల శంఖారావం మోగించిన బీజేపీ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేసిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తెలంగాణ గౌరవం కోసమే బీజేపీ పోరాటం రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించండి -
బరిలో నిలిచేదెవరో..
పోరు నుంచి వైదొలిగేందుకు కొందరు ససేమిరా ● రెబల్స్ పోరు తప్పించేందుకు నేతల ప్రయత్నాలు ● నామినేషన్ల ఉపసంహకరణకు నేడే ఆఖరు ● సాయంత్రం 3 గంటల వరకే బీఫారాల స్వీకరణ ● చివరి నిమిషంలోనే చేతికి ఇచ్చేలా వ్యూహరచన సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకే గడువు మిగిలి ఉంది. సాయంత్రం 3 గంటలలోగా అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహకరణకు అవకాశం ఇవ్వనుండగా.. ఈ క్రమంలో ఎంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహకరించుకుంటారో.. తుది పోరులో ఎంత మంది ఉంటారో అన్నది సాయంత్రానికి తేలనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఒకరికి మించి నామినేషన్లు దాఖలు చేసిన చోట అభ్యర్థులను బుజ్జగించేందుకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ బీఫారాలను సమర్పించేందుకు సైతం మంగళవారమే ఆఖరు కాగా.. పలుచోట్ల ఇప్పటి వరకు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వలేదు. దీంతో పార్టీ బీఫారాల విషయంలో చివరి వరకు ఉత్కంఠ తప్పడం లేదు. ముఖ్యనేతల మల్లగుల్లాలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పలుచోట్ల అభ్యర్థులు ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పార్టీ తరపున బీఫారం ఎవరికి ఇవ్వాలన్న దానిపై పార్టీల ముఖ్యనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్లో అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెబెల్స్ పోరుతో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ముగ్గురు, కొల్లాపూర్లో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది నామినేషన్లను ఉపసంహకరించుకున్నారు. ఇందులో బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులున్నారు. నామినేషన్ల ఉపసంహకరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉండటంతో నేతల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
యాప్లోనే యూరియా
అచ్చంపేట: ఫెర్టిలైజన్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. సాగుతూ.. ఆగిన యూరియా బుకింగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నెల 31 నుంచి పక్కాగా అమలవుతుండటంతో బక్ చేసుకోకుండా ఎరువుల దుకాణానికి వెళ్లితే ఎరువులు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికారు. ఎరువుల డీలర్లు, సహకార సంఘాల సీఈఓలు తమ స్టాక్ రిజిస్టర్లు, ఐఎఫ్ఎస్సీ ఐడీలను తీసుకుని రైతు వేదికల వద్దకు రావాలని రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిల్వలకు సంబంధించి సమాచారం పూర్తిస్థాయిలో తెప్పించుకుని గురువారం ఉదయం నుంచే యాప్ ద్వారా విక్రయాలు ప్రారంభించారు. దీంతో యాప్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఒకసారి బుక్ చేసిన తర్వాత రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి కొనుగోలు చేశాకా రెండో విడత 15 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి. సాంకేతిక సమస్యలతో.. రెండు నెలల క్రితం యాసంగి సీజన్ మొదట్లోనే యూరియా పంపిణీకి ప్రభుత్వం యాప్ తీసుకొచ్చినా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సక్రమంగా పనిచేయలేదు. అధికారులు గ్రామాలకు వచ్చి రైతులకు కూపన్లు రాసిచ్చి సహకార సంఘాల ద్వారా సరఫరా చేశారు. క్యూలైన్ల బాధతప్పి సులభంగా యూరియా లభించింది. విడతల వారీగా సరఫరా.. రైతులు ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఎకరాల భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక యాప్తోనే బుకింగ్కు అవకాశం యాసంగిలోనే అమలులోకి వచ్చిన విధానం రైతులు ముందుగా బుక్ చేసుకోవాలి -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్/బల్మూర్: కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ ఉపాధి హామీ చట్టా న్ని వీబీజీ రామ్జీగా పేరు మార్చి రద్దు చేసే కుట్ర చేస్తోందని, పాత చట్టాన్ని కొనసాగించే వరకు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. సోమవారం అచ్చంపేట మండలంలోని బుడ్డతండా, బల్మూరు మండలం చెంచుగూడెం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ ఉపాధి కూలీల డబ్బులు కుదించాలని, దేవుడి పేరుతో గ్రా మీణ ప్రాంత కూలీల కడుపు కొట్టాలని చూస్తున్నార ని ఆరోపించారు. గాంధీ పథకం పేరు మార్చేశారని, మొన్నటి వరకు గ్రామసభలు నిర్వహించి పనులు చేపట్టేవారని.. ఇప్పుడు ప్రధాని చేయాలనుకునే పనులను మాత్రమే పథకంలో ఉంచాలని నిర్ణయించారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులను వారే నిర్ణయించుకోవాలని, ప్రధాని నిర్ణయాలకు ఆమోదం తెలపవద్దని సూచించారు. కూలీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని అందుకు తాము మద్దతుగా ఉంటామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడండి ఈ పోరులో కూలీలు, ప్రజలకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ -
ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
కందనూలు: జిల్లావ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లాలోని 33 కేంద్రాల్లో పరీక్ష జరగగా.. 3,148 మంది విద్యార్థులకు గాను 3,001 మంది హాజరవగా.. 147 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కల్వకుర్తి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీపాద శార్వాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థికి పీజీలో 55 శాతం మార్కులతోపాటు పీహెచ్డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారంలోగా కళాశాలలో అందజేయాలని సూచించారు. ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ కందనూలు: పనోరమ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్–2026లో భాగంగా ‘ది ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్’ అనే థీమ్తో జూమ్ వేదికగా నిర్వహించిన ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఆకట్టుకుంది. శూన్యం, బిగ్ బ్యాంగ్ పుస్తక రచనలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేటు టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్కుమార్ రైటర్స్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొనసాగిన కార్యక్రమంలో ఇండియా ప్రతినిధిగా పాల్గొని కవితాగానం చేశారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ అరుణ్ ‘అవని.. ప్రేమ కిరణాల కవనమై..!’ శీర్షికతో చదివిన కవిత ద్వారా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో విశ్వమంతా ప్రేమ మయమై, యుద్ధాలు లేని ప్రపంచంలో పర్యావరణ హితమై అందరూ సుఖశాంతులతో జీవించాలని, ప్లాస్టిక్ వినియోగ రహిత అవనిపై పచ్చని చెట్ల చిరునవ్వుల వెలుగుల మధ్య పుడమిపై పున్నమి వెన్నెల పూయాలని, లౌకిక తాత్విక స్ఫూర్తితో వసుదైక కుటుంబమై మనమంతా మెలగాలని.. తన అక్షరాలతో ప్రపంచానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ ఇరానీడౌరా కవడియా, సమన్వయకర్త రామకృష్ణ, రామ్మోహన్రావు, లక్ష్మీనారాయణ్ కొల్లి, వినోద్ కుత్తుం, మిరప మహేష్, సుధా మురళి, శ్రీ వశిష్ట సోమేపల్లి, మందారపు హైమావతి ప్రతినిధులుగా పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనడంపై వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు, మిత్రులు సోషల్ మీడియా వేదికగా అరుణ్కు అభినందనలు తెలిపారు. -
అభయారణ్యంలో శిక్షణ అధికారుల ట్రెక్కింగ్
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, అటవీ లోతట్టు ప్రాంతంలోని సలేశ్వరం, అక్కమదేవి గృహలు ప్రదేశాల్లో గ్రూప్–1 శిక్షణ అధికారులు స్టడీ టూర్లో భాగంగా సోమవారం ట్రెక్కింగ్ చేశారు. ఈ ప్రాంతానికి శిక్షణ కోసం వచ్చిన 280 మంది శిక్షణ అధికారులు రెండు గ్రూప్లుగా విడిపోయారు. ఈ క్రమంలో సుమారు 140 మంది అధికారులు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో అభయారణ్యంలోని సలేశ్వరం, అక్కమ్మదేవి గుహలకు ట్రెక్కింగ్ చేశారు. అక్క డి ప్రదేశాల ప్రాధాన్యత, విశిష్టత తదితర వివరాలను అధికారులకు వివరించారు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు జరిగే స్టడీ టూర్లో ప్రతినిత్యం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని అటవీశాఖ రేంజ్ అధికారి వీరేష్ తెలిపారు. మార్గమధ్యలో రాంపూర్ చెంచు పెంటలోని చెంచుల నివాసాలను అధికారులు పరిశీలించారు.


