హడలెత్తిస్తున్న పెద్ద పులి
మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ మండలం అటవీ సరిహద్దులో పెద్ద పులి హడలెత్తిస్తోంది. ప్రతినిత్యం వ్యవసాయ పొలాల సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా మండలంలోని జంగంరెడ్డిపల్లి, తెలుగుపల్లి, కల్ములోనిపల్లి, మాచారం, మన్ననూర్ గ్రామాల రైతులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, వేరుశనగ, మినుములు, ఆముదాలు వంటి పంటలు సాగు చేశారు. ఈ పంట పొలాలు మొత్తంగా అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉండటంతో తరుచుగా వన్యప్రాణులు జింకలు, అడవి పందులు దాడులు చేస్తాయనే ఉద్దేశంతో రాత్రి సమయంలో కాపలా వెళ్తారు. ప్రస్తుతం ఈ గ్రామాల పరిసర వ్యవసాయ పొలాల సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇదే అదునుగా వన్యప్రాణులు పంట పొలాలపై గుంపులు గుంపులుగా దాడులు చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి.
20 ఎకరాల్లో పంటలు..
మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామ రైతులు ఎల్లస్వామి, కమలేశ్వర్, వజ్రమ్మ, అర్జునయ్య తదితరులు సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలను అడవి పందులు నాశనం చేశాయని రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటల నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు గ్రామాల సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
● శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై కుంచోనిమూల సమీప అడవిలోనూ ప్రయాణికులకు పెద్దపులి తారస పడింది. ముఖ్యంగా సమీప గ్రామాల ప్రజలు ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి గ్రామాల సమీపంలోని చిట్టడవిలో సంచరిస్తున్న పెద్దపులిని అభయారణ్యంలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అమ్రాబాద్ అటవీ సరిహద్దుప్రాంతంలో తరుచూ సంచారం
పంట పొలాలకు వెళ్లేందుకు
జంకుతున్న అన్నదాతలు
కాపలా వెళ్లకపోతే జింకలు, అడవి పందులు నాశనం చేస్తాయని ఆందోళన
బెడద తప్పించాలని
అటవీ అధికారులకు వేడుకోలు
హడలెత్తిస్తున్న పెద్ద పులి


