‘హంగు’..ఆర్భాటాలు!
ఉమ్మడి పాలమూరులో పుర ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన ఆరు పురపాలికల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. గద్వాల, నారాయణపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఏఐఎఫ్బీ అభ్యర్ధి కాంగ్రెస్ రెబల్, స్వతంత్ర బీజేపీ రెబల్ కాగా.. వారు ఆయా పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విధంగా జరిగిన పక్షంలో బీజేపీకి 12, కాంగ్రెస్ ఫిగర్ ఎనిమిదికి చేరనుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
● గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉండగా.. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 11, బీజేపీకి ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన వారి బలం 19 కాగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. తమ అభ్యర్థులను ఎవరికి వారు క్యాంప్లకు తరలించిన ముఖ్యులు చెరో రెండున్నరేళ్లు మున్సిపల్ పీఠాన్ని పంచుకునేలా పావులు కదుపుతున్నారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ విప్ జారీ చేసే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో దేవరకద్రలో కాంగ్రెస్, అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనున్నాయి.
● అమరచింతలో 10 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఫలితాలకు ముందే బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు క్యాంప్నకు వెళ్లగా.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన వాహనంలో క్యాంప్కు తరలించారు. ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. చెరి రెండున్నరేళ్లు చైర్మన్ గిరిని పంచుకునేలా ఒక అవగాహనకు రానున్నట్లు చర్చ జరుగుతోంది.
దాదాపుగా అంతటా క్యాంప్ రాజ‘కీ’యాలు
గద్వాలలో హైడ్రామా.. బేరసారాలు
ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు
ఎక్స్ అఫీషియో
ఓట్లే కీలకం
‘హంగు’..ఆర్భాటాలు!


