మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
కొల్లాపూర్/ కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటుదామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను బలపర్చిన స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలిచి మెజార్టీ స్థానాలు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ బీఆర్ఎస్ బోల్తా పడుతుందన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మౌళిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయని విమర్శించారు.
● కల్వకుర్తిలో చివరిరోజు నిర్వహించిన ర్యాలీలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీక అని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి బంగారు భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీలకు దాదాపు రూ.150 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ప్రజల అవసరాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మున్ముందు పకడ్బందీ ప్రణాళికలతో రెండు పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


