అచ్చంపేట: అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం లబ్ధిదారులకు అందించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలకపల్లి రోడ్డులో చౌకధరల దుకాణాలను ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలో చౌకధరల దుకాణాలు ఒకేచోట కాకుండా ప్రతి కాలనీలో లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలనలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం జరిగిందన్నారు. ఒక రూపాయికే పేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు. ఐటీ కారణంగా కొంతమంది రేషన్ కార్డులు రద్దు అయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, తిరిగి అందరికీ రేషన్ కార్డులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ నిరుత్సాహ పడవద్దని చెప్పారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ సైదులు, మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు పాల్గొన్నారు.


