అంతర్గత తనిఖీలు
అంతర్గత మార్కులు ఇలా..
ప్రైవేట్లో దుమారం..
జిల్లా పరిధిలో ఇలా..
ఇంటర్నల్ మార్కులు..
పదో తరగతి విద్యార్థుల ప్రగతి పరిశీలన
● జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాల సర్వే
● ఒక్కో కమిటీకి 4 పాఠశాలల
బాధ్యతల అప్పగింత
● ప్రైవేట్లో ఇష్టానుసారంగా
కేటాయించినట్లు ఆరోపణలు
● ఈ నెల 25 వరకు పూర్తి వివరాల
సేకరణ
●
ఇంటర్నల్ మార్కులకు సంబంధించి ప్రతి పాఠశాలలో తనిఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలంలో రెండు నుంచి నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. నాలుగు ఎఫ్ఏలు, సబ్జెక్లుల వారీగా విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్లిప్ టెస్టుల ప్రకారం 20 మార్కులు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన మార్కుల లిస్టు ఎంఈఓలకు అందజేయాల్సి ఉంది. వారి నుంచి డీఈఓకు వచ్చాయి. అన్నీ పరిశీలించి ఎస్సెస్సీ బోర్డుకు పంపిస్తాం.
– రమేష్కుమార్, డీఈఓ
అచ్చంపేట: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పాఠశాలల్లో ఇచ్చిన ఇంటర్నల్ మార్కుల తనిఖీపై విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల మార్కులపై విద్యాశాఖ పరిశీలన కోసం బృందాలను ఏర్పాటు చేసింది. పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్, ప్రాజ్టెకుల మార్కుల నమోదు పరిశీలన ఈ నెల 16 నుంచి 25 వరకు పూర్తిచేయాల్సి ఉంది. డీఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు మండలాల వారీగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టాయి. ఆ తర్వాత జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో హెచ్ఎంలు మార్కులను ఎస్సెస్సీ బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది.
20 మార్కుల కేటాయింపు
పదో తరగతిలో ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు సీసీఈ విధానంలో నాలుగు ఫార్మేటివ్ అసైన్మెంట్ పరీక్షల ఫలితాలు, విద్యార్థులు రాసే రికార్డుల ఆధారంగా కేటాయిస్తారు. పదో తరగతి విద్యార్థి భవిష్యత్కు ఈ మార్కులు కీలకంగా మారిన నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధ్యానం సంతరించుకుంది. విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్స్, చేతి రాత, ఎఫ్ఏలో వచ్చిన మార్కులను ఈ బృందాలు సూక్ష్మంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మేటివ్ పరీక్షల్లో వాస్తవ మార్కులు వేశారా.. ఇష్టానుసారంగా నమోదు చేశారా అన్న విషయాన్ని తనిఖీ బృందాలు పరిశీలించనున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు అశాసీ్త్రయంగా అంతర్గత మార్కులు వేశారనే ఆరోపణలు దుమారం రేపాయి. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్టులో విద్యార్థికి అతి తక్కువ మార్కులు వచ్చినా.. ప్రాజెక్టు వర్క్ చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని తప్పుబట్టిన విద్యాశాఖ వాస్తవ పరిస్థితి కోసం ప్రైవేట్తోపాటు ప్రభుత్వ స్కూళ్లలో సైతం క్షేత్రస్థాయి విచారణ బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టింది.
ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో ప్రతి పేపరు 80 మార్కులకు ఉంటుంది. మరో 20 మార్కులు తరగతి గదిలో ఆయా సబ్జెక్టుల వారీగా కనబరిచే ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్గా కేటాయిస్తారు. సరిగా ఐదేళ్ల క్రితం కంటిన్యూస్ అండ్ కాంప్రెహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) విధానంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. దీంతో ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్ స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్టు ప్రకారం మార్కులు కేటాయిస్తున్నారు. ఇలా కేటాయించిన మార్కులను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ ద్వారా టెస్టు పరీక్ష విభాగానికి డీఈఓల ద్వారా పంపాల్సి ఉంటుంది. కాగా.. ఇవేవి నిర్వహించకుండానే ప్రైవేట్ స్కూళ్లు ఇష్టానుసారంగా గరిష్ట మార్కులు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ పాఠశాలలు 257 ఉన్నాయి. వీటి పరిధిలో 10,658 మంది రెగ్యులర్, 25 మంది ప్రైవేట్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 59 పరీక్ష కేంద్రాలు, ప్రైవేట్ విద్యార్థుల కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల నమోదుపై పాఠశాలలు సందర్శించి తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి మండల పరిధిలో జీహెచ్ఎం నేతృత్వంలో ఎఫ్ఏసీ హెచ్ఎం, లాంగ్వేజీ పండిత్, మరో నాన్ లాంగ్వేజీ ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్తోపాటు మరి కొందరు ఉపాధ్యాయులు కలిసి ఐదుగురు నుంచి ఏడుగురు ఉంటారు. ఒక్కో బృందం ఆయా మండలాల్లో ఉన్న పాఠశాలల సంఖ్యను బట్టి రెండు నుంచి 4 పాఠశాలల బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రక్రియ ఈ నెల 25లోగా పూర్తి చేసి ఉన్నత కమిటీకి నివేదిక సమర్పించనున్నాయి. ఆ తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మేటివ్ టెస్టులు నిర్వహించడంతోపాటు ప్రాజెక్టులు, రికార్డులను పరిశీలించి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయుల మార్కుల నమోదు చేసిన విషయం తెలిసిందే.
అంతర్గత తనిఖీలు


