ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
కందనూలు: ఎలాక్ట్రానిక్ వేస్టేజ్ పర్యావరణానికి పెను సవాల్గా మారిందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ప్రతినిధి చైతన్య అన్నారు. హరిథాన్ ఎకో హ్యాకథాన్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈ–వేస్ట్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఈ–వేస్ట్ పర్యావరణానికి పెను ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్న కొద్దీ.. వాటి వ్యర్థాలు అధికమవుతున్నాయన్నారు. వాటిని సరైన విధంగా నిర్వహించకపోతే భూమి, నీరు, గాలి కాలుష్యానికి దారితీస్తాయని తెలిపారు. పాడైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు వంటి పరికరాల్లో ఉండే హానికర రసాయనాలు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. యువత ఈ విషయంపై చైతన్యం పెంపొందించుకొని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా, సరైన విధానంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఈ–వేస్ట్ను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం పాత ఎలక్ట్రానిక్ పరికరాలను రీ సైక్లింగ్కు పంపించడం.. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవడం.. కాలుష్య నియంత్రణపై అవగాహన పెంపొందించడం వంటి సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


