నిర్లక్ష్యమే పాపమైంది
కుమ్మెర ఘటనకు అధికారుల వైఫల్యమే కారణం
వారిపై ఇలాంటిదాడులుంటాయా?
పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పైనే దాడులు కొనసాగుతున్నాయని, ఉన్నత వర్గాలపై ఇలాంటి దాడులు ఎక్కడైనా ఉంటాయా అని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ప్రశ్నించారు. ఉన్నత వర్గాల, పెత్తందారుల చేతుల్లో దాడికి గురైతే పోలీసులు మాత్రం బాధితులపైనే మొదట కేసులు పెట్టారన్నారు. ప్రజాసంఘాల ఒత్తిడితో మాత్రమే తర్వాత నిందితులపై కేసు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసిన నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని, అందరినీ రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు.
బాధితులకు న్యాయం జరగాలి
కుమ్మెరలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఎంపీ మల్లు రవి చెప్పారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతర నిర్వహణ మొదలు, దాడి ఘటన, తర్వాత కేసుల దర్యాప్తులోనూ అధికారుల నిర్లక్ష్యం కనిపించిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. మంగళవారం జిల్లాలోని నాగర్కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఆలయం వద్ద సంఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల బృందం పరిశీలించింది. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికను పరామర్శించారు. వారి నుంచి ఘటనకు కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర బీసీ కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, సమగ్ర విచారణ చేపడుతున్నట్టు వివరించారు. కుమ్మెర గ్రామంలో ఆలయ పరిసరాలు, సంఘటనా స్థలం, బాధిత కుటుంబం ఇంటిని పరిశీలించిన తర్వాత పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, భద్రతాలోపాలు తేటతెల్లమయ్యాయని వెల్లడించారు.
10 వేలకు మించి భక్తులు..
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, టి.సురేందర్, బాలలక్ష్మి బృందం కుమ్మెర గ్రామాన్ని సందర్శించారు. 10 వేలకు మించి భక్తులు పాల్గొనే జాతర నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఆలయంలో టికెట్, నిర్వహణ విషయంలో ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా.. పూర్తిగా సర్పంచ్, గ్రామ పెద్దల పెత్తనమే కొనసాగిందన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీస స్థాయిలో ఏర్పాట్లు లేవన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి పర్యవేక్షణ, ఏర్పాట్లు లేవని చెప్పారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొనే జాతరలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఆర్డీఓ సురేశ్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర వివరాలను నివేదిక అందించాలని ఆదేశించారు.
రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ కరువు
చిన్నారి మృతిపై విచారణ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు
జిల్లాకేంద్రంలో నాలుగోరోజు కొనసాగిన నిరసనలు
నేడు కేటీఆర్ రాక..
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.


