ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న
15,173 మంది విద్యార్థులు
● నేటి నుంచి వచ్చేనెల 18 వరకు కొనసాగనున్న పరీక్షలు
వసతులపై ప్రత్యేక దృష్టి..
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వసతులు కల్పించడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స నిమిత్తం సిబ్బందిని ప్రతి పరీక్ష కేంద్రాల్లో నియమించడంతో పాటు తరగతి గదుల్లో చీకటి ఉండకుండా లైట్లు, ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రశ్నపత్రాలను తెరవడం.. సీజ్ చేయడం వంటి వాటిని సీసీ నిఘాలో నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలను కంట్రోల్ కమాండ్ రూమ్కు అనుసంధానం చేశారు.
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదివరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవి. ఈ నేపథ్యంలో గతేడాది నుంచి ఓటీపీ ద్వారా ఆన్లైన్లో హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్బోర్డు కల్పించింది. హాల్టికెట్పై ఉండే బార్కోడ్ స్కాన్ చేస్తే ఏ పరీక్ష కేంద్రం అనే విషయం తెలిసిపోతుంది.
పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి..
ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో 16 ప్రభుత్వ, 11 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక మైనార్టీ వెల్ఫేర్, ఒక సోషల్ వెల్ఫేర్, మూడు ఎంజేపీ, ఒక మోడల్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కొనసాగనున్నాయి. మొత్తం 15,173 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ 5,805 మంది, ఒకేషనల్ విభాగంలో 1,752 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్లో 5,837 మంది, ఒకేషనల్ విభాగంలో 1,779 మంది విద్యార్థులు ఉన్నారు.
అధికారుల నియామకం..
పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 34 మంది డిపార్టుమెంట్ అధికారులు, 11 మంది అడిషనల్ చీప్ సూపరింటెండెంట్లు, ఏడుగురు కస్టోడియన్లు, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటు హైపవర్ కమిటీని నియమించారు. మాస్ కాపీయింగ్కు ఎక్కడా ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు.
144 సెక్షన్ అమలు
నాగర్కర్నూల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని.. ఎలాంటి సౌండ్ స్పీకర్లు, డీజే పెట్టకూడదన్నారు. 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని తెలిపారు.
ఏర్పాట్లు పూర్తిచేశాం..
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వా తావరణంలో పరీక్షలు రాయాలి. ముఖ్యంగా గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటరమణ, డీఐఈఓ
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం


