వడివడిగా.. మల్లన్న సన్నిధికి
అచ్చంపేట: హరహర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ శ్రీశైలం జాతీయ రహదారి భక్తుల శివనామస్మరణతో మార్మోగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలం తరలివెళ్తున్నారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా కొండలు, గుట్టలు, బండరాళ్లను, ముళ్లకంపలను అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాత్మికానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కై లాస ద్వారం చేరుకుంటున్నారు. గతంలో ఈఓగా పనిచేసిన శంకరరెడ్డి శివదీక్షను 1996లో ప్రారంభించి విశేష ప్రాధాన్యతను పెంపొందించేలా కృషి చేశారు. కాళ్ల నొప్పులు, పాదాలు పగలడం, బొబ్బలెక్కడం ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా శ్రీశైలేశుని దర్శనం కోసం బారులు తీరుతున్నారు. భక్తిని మించిన మరే శక్తిలేదని శివదీక్షాస్వాములు స్పష్టం చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న శివస్వాములు రాత్రివేళ మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అర్ధరాత్రి 2 గంటల తర్వాత తిరిగి నడక సాగిస్తున్నారు.
రాత్రివేళ చలి, పగలు ఎండల్లో శివమాలధారుల పాదయాత్ర
అభయారణ్యంలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణం
నల్లమల దారిపొడవునా
యాత్రికులకు దాతల చేయూత


