భూముల రీ సర్వేతో రైతులకు మేలు
లింగాల: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని అంబట్పల్లిలో భూభారతి పథకంలో భాగంగా భూముల రీ సర్వేపై గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనే భూముల రీ సర్వే కోసం అంబట్పల్లిని పైలెట్ ప్రాజెక్ట్గా ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. పార్టీలకతీతంగా సర్వే జరుగుతుందని, ఈ రీసర్వే వల్ల ప్రతి ఇంచు భూమి గుర్తించడం జరుగుతుందన్నారు. సర్వే ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని చెప్పారు. భూములకు పక్కా సరిహద్దులు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల మధ్య వివాదాలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. అంబట్పల్లిలో త్వరలో బ్యాంకు శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంబట్పల్లి శివారులో 915 సర్వే నంబర్లు ఉండగా 6,492 ఎకరాల పట్టా భూములు, మరో 788 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. డీజీపీ, రోవర్స్ పరికరాల ద్వారా భూముల సర్వే చేయడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో 4 గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్గా గుర్తించి పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామ సరిహద్దు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, రహదారులు, కాల్వలు, పట్టా భూములు సైతం రీ సర్వే చేస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 150 మంది లైసెన్సు సర్వేయర్లు ఉన్నారని, మరో 100 మంది సర్వేయర్లు రానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ నాగేందర్, తహసీల్దార్ వెంకటేష్, సర్పంచ్ శ్రీవాణి, ఉప సర్పంచ్ మల్లేష్, మండల సర్వేయర్ రాంబాబు, సింగిల్ విండో మాజీ చైర్మన్ హన్మంత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


