ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
కొల్లాపూర్: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పోలింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాల ని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద లైటింగ్, టాయిలెట్లు, తాగునీరు, భోజన ఏర్పాట్లు ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు.
ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ స్థలం పరిశీలన
పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం నుంచి ఏపీలోని సంగమేశ్వరం ప్రాంతాల మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి స్థలాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. వంతెన నిర్మాణానికి సంభందించిన అంశాలు, భూసేకరణ అంశాల గురించి రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. వంతెన నిర్మిస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే వారికి 90 కి.మీ., మేరకు దూరభారం తగ్గుతుందని, బ్రిడ్జి నిర్మాణం వల్ల కృష్ణానది పరిసర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని వివరించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఆయన జటప్రోల్ గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పనుల పురోగతిని రెగ్యులర్గా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ భన్సీలాల్ ఉన్నారు.


