భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచండి
కందనూలు: సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచి.. ముంపు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో సంబంధిత అధికారులతో వారు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పురోగతి, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల్లో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు న్యాయమైన పరిహారం, సమగ్ర పునరావాస ప్యాకేజీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మార్లపాడుతండా, కేశ్యతండా ప్రజల ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించి.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పరిహారం అందించాలన్నా రు. అలాగే ఆర్అండ్ఆర్ కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సదుపాయాలను సమగ్రంగా కల్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. అందుకు అనుగుణంగా భూ సేకరణ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
‘నక్కలగండి’ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
అచ్చంపేట రూరల్: నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు అన్నారు. అచ్చంపేట మండలంలోని మార్లపాడుతండా, కేశ్యతండా నిర్వాసితులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం కల్పించి.. బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ముందుగా బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటికే ఆలస్యమైందని.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ త్వరగా అందించి పునరావాసం కల్పించాలని ముంపు బాధితులు డిమాండ్ చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ సైదులు, ఆర్ఐ బాల్రాం తదితరులు ఉన్నారు.
నిర్వాసితులకు పునరావాసంకల్పించడంలో అలసత్వం వద్దు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ బదావత్ సంతోష్


