‘అంగన్ వాడీ’ నిర్వహణలో అలసత్వం వహించొద్దు
బల్మూర్: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి హెచ్చరించారు. బుధవారం రాంనగర్ రైతువేదికలో బల్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని లింగాల, బల్మూర్, ఉప్పునుంతల మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు ఐసీడీఎస్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటిస్తూ.. ప్రీ స్కూల్ కార్యక్రమాలను ప్రణాలికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం ఆరోగ్యలక్ష్మి భోజనం అందించాలన్నారు. ప్రతినెలా 5వ తేదీలోగా ఐదేళ్లలోపు చిన్నారులు, బాలింతల ఎత్తు, బరువు చూసి.. ఎన్హెచ్టీఎస్, పోషణ ట్రాకర్ యాప్ల్లో నమోదు చేయాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్కార్డు ఉండేలా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా బాల్యవివాహం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే 1098 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ దమయంతి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ విజ్ఞాన్ పాల్గొన్నారు.


