బరిలో నిలిచేదెవరో..
పోరు నుంచి వైదొలిగేందుకు కొందరు ససేమిరా
● రెబల్స్ పోరు తప్పించేందుకు నేతల ప్రయత్నాలు
● నామినేషన్ల ఉపసంహకరణకు నేడే ఆఖరు
● సాయంత్రం 3 గంటల వరకే బీఫారాల స్వీకరణ
● చివరి నిమిషంలోనే చేతికి ఇచ్చేలా వ్యూహరచన
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకే గడువు మిగిలి ఉంది. సాయంత్రం 3 గంటలలోగా అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహకరణకు అవకాశం ఇవ్వనుండగా.. ఈ క్రమంలో ఎంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహకరించుకుంటారో.. తుది పోరులో ఎంత మంది ఉంటారో అన్నది సాయంత్రానికి తేలనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఒకరికి మించి నామినేషన్లు దాఖలు చేసిన చోట అభ్యర్థులను బుజ్జగించేందుకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ బీఫారాలను సమర్పించేందుకు సైతం మంగళవారమే ఆఖరు కాగా.. పలుచోట్ల ఇప్పటి వరకు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వలేదు. దీంతో పార్టీ బీఫారాల విషయంలో చివరి వరకు ఉత్కంఠ తప్పడం లేదు.
ముఖ్యనేతల మల్లగుల్లాలు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పలుచోట్ల అభ్యర్థులు ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పార్టీ తరపున బీఫారం ఎవరికి ఇవ్వాలన్న దానిపై పార్టీల ముఖ్యనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్లో అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెబెల్స్ పోరుతో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ముగ్గురు, కొల్లాపూర్లో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది నామినేషన్లను ఉపసంహకరించుకున్నారు. ఇందులో బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులున్నారు. నామినేషన్ల ఉపసంహకరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉండటంతో నేతల ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
బరిలో నిలిచేదెవరో..


