తీర్పు రిజర్వ్..
● 19 పురపాలికల్లో మొత్తంగా 75 శాతం పోలింగ్
● గద్వాల జిల్లాలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం
● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు
● రేపు ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి
ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్’
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరులో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు జిల్లాల పరిధిలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో మొత్తం 373 డివిజన్లు/వార్డు స్థానాలకు బుధవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. 11 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తంగా 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో రిజర్వ్ కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 14న మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, వైస్ చైర్లన్లు.. కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత 16న పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
బద్ధకించిన కార్పొరేషన్ ఓటర్లు..
జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా 78.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 67.73 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నగర ఓటర్లు ఓటెత్తుతారని అందరూ భావించారు. ఇందుకు విరుద్ధంగా అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతోందని రాజకీయ పార్టీల నేతలు డివిజన్ల వారీగా లెక్కల్లో మునిగారు. నాగర్కర్నూల్ 77.64 శాతంతో రెండు, వనపర్తి 75.56 శాతంతో మూడు, నారాయణపేట 74.04 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి.
మొత్తం ఓట్లు 6,12,827.. పోలైంది 4,53,090
మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్తోపాటు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మిగిలిన పురపాలికలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్, అలంపూర్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ ఆరోవార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. మొత్తంగా 59 డివిజన్లు, 314 వార్డుల్లో జరిగిన పోలింగ్లో 6,12,827 మంది ఓటర్లకు గాను 4,53,090 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పట్టణ మహిళల వెనుకంజ..
ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ జరిగిన పురపాలికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో వారే వెనుకబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తగా.. పుర పోరుకు వచ్చేసరికి అతివలు ఓటుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్గనర్, నాగర్కర్నూల్ జిల్లాలో సరాసరిగా పురుషులు, మహిళల ఓటింగ్ శాతం సమానంగా ఉండగా.. మిగతా జిల్లాల్లో ఒక్క శాతానికి పైగానే తేడా ఉంది.మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే మహబూబ్నగర్, దేవరకద్ర, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు, గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, నారాయణపేట, మక్తల్, మద్దూర్, కొల్లాపూర్లో మహళలు ఓటుకు దూరంగా ఉన్నారు. భూత్పూర్, కోస్గి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో మాత్రమే అతివల ఓటింగ్ శాతం పురుషుల కంటే కొంత మేర మెరుగ్గా ఉంది.
35 మందిలో
16 మంది..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎన్నికలు జరిగిన పుర పాలికల్లో ఇతరులు ఓట్లరు 35 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అర్ధరాత్రి మారిన పరిణామాలతో..
ఉమ్మడి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారినట్లు తెలుస్తోంది. పురపాలికల్లో డివిజన్లు/వార్డుల వారీగా పలువురు అభ్యర్థులు ఓటుకొక రేటు చొప్పున వెదజల్లినట్లు సమాచారం. పార్టీల వారీగా ఫండ్ రాగా.. ఒక్కో వార్డులో ఆయా అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పటివరకు గెలుపు అంచనాల్లో మునిగిన అభ్యర్థులు తెల్లారేసరికి పరిస్థితులు మారడంతో నోరెళ్లబెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానం మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్, మక్తల్, వనపర్తి తదితర మున్సిపాలిటీల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు రాత్రికిరాత్రే చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతుండగా.. పలువురు అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు.
తీర్పు రిజర్వ్..
తీర్పు రిజర్వ్..


