ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం ఆయన ఉయ్యాలవాడలోని నైస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి శిక్షణ తరగతులను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు క్రమబద్ధంగా చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అనంతరం పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరవాలన్నారు. చెల్లిన ఓట్లను మాత్రమే సంబంధిత అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సుల్లో వేయాలని, చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు లోబడి, పారదర్శకంగా సాగాలన్నారు. ఓట్ల లెక్కింపు మొత్తం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మూడంచెల భద్రత కల్పించడం, స్ట్రాంగ్రూంల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, ఆర్డీఓ సురేష్బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసీల్దార్ తబితారాణి తదితరులున్నారు.


