పురం.. ఎవరి పరం
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పు శుక్రవారం వెలువడనుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు ఎన్నికలు 243 మంది బరిలో నిలిచారు. వీరికి సంబంధించి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్లకు సంబంధించిన కౌంటింగ్ను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోనే ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మొత్తం మూడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తిచేయనున్నారు. దీంతో మధ్యాహ్నం వరకే పార్టీల వారీగా వచ్చే స్థానాలపై స్పష్టత రానుంది. మొత్తంగా జిల్లాలోని మూడు పురపాలికలు ఎవరిపరం కానున్నాయో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మూడు రౌండ్లు.. 8 టేబుళ్లు
నాగర్కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ను ఉయ్యాలవాడలోని పుల్లారెడ్డి తోటలో ఉన్న నైస్ పాఠశాలలో చేపట్టనున్నారు. కల్వకుర్తిలో మహబూబ్నగర్ రోడ్డులోని భ్రమరాంబ మల్లికార్జున ఎడ్యుకేషన్ సొసైటీలో, కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ను పీజీ కళాశాల సెంటర్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సిద్ధం చేయడంతోపాటు కౌంటింగ్పై సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్లో 8 టేబుళ్లలో పోలింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో టేబుల్పై మూడు వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ముందుగా పోస్టల్ బ్యాలెట్.. తర్వాత వార్డుల వారీగా మొదటి, రెండు, మూడో రౌండ్లలో అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తా రు. తొలి రెండు గంటల్లోనే మొదటి, రెండు రౌండ్ల ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మొత్తం పోలింగ్ ప్రక్రియలో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
16న చైర్మన్ ఎన్నిక..
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన అనంతరం సోమవారం మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. పరోక్ష విధానంలో వార్డు సభ్యులు చైర్మన్ను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సంబంధిత ఆర్డీఓలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా పరిస్థితిని బట్టి గెలిచిన అభ్యర్థులతో క్యాంపులు నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.
చెంచుల పండుగ..
నల్లమలలోని భౌరాపూర్ భ్రమరాంబ అమ్మవారి ఉత్సవాలు శనివారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
–IIలో u
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
కల్వకుర్తి టౌన్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులెవరూ ర్యాలీలు, విజయ యాత్రలు నిర్వహించరాదని, ప్రజలను గుమిగూడే విధంగా చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
65 వార్డుల్లో.. 243 మంది పోటీ
మధ్యాహ్నం వరకే
ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
గెలుపుపై ఎవరి ధీమా వారిదే


