సా..గుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ
జిల్లాలో ఐదు నెలలైనా 40 శాతం దాటని వైనం
సంక్షేమ పథకాలకు తప్పనిసరి..
క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు
నెల రోజుల్లో పూర్తిచేస్తాం..
ఉపయోగాలు ఇవే..
● రైతులకు అవగాహన లేకపోవడమే అసలు కారణం
● సాంకేతిక సమస్యలతోనూ తప్పని
ఇబ్బందులు
అచ్చంపేట: దేశాభివృద్ధిలో అన్నదాతల ప్రాముఖ్యత గుర్తించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా ఆధార్ తరహాలోనే పదకొండు అంకెలతో కూడిన యూనిక్ ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. గతేడాది మే 5న ప్రారంభమైన ఇంత వరకు రైతుల వివరాల నమోదు 40 శాతం దాటలేదు.
జిల్లాలోని 20 మండలాల్లో 3,35,013 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. ఇందులో పీఎం కిసాన్ రైతులు 1,60,375 మంది ఉండగా.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 87,339 మందికి ఐడీ క్రియేట్ అయ్యింది. పీఎం కిసాన్ వంటి ఇతర కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో క్లస్టర్ల వారీగా ఏఈఓలు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించకపోవడంతోనే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది.
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమీపంలో ఉన్న ఏఈఓలు, మీసేవా కేంద్రాల వద్దకు వెళ్తుండగా.. వారికి అనేక రకాల సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీ సమయానికి రాకపోవడం, రైతులతో ఫోన్లు లేకపోవడం, ఉన్నా ఆధార్ లింకు కాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఒకే రైతుకు రెండుచోట్ల భూమి ఉండటం, భూమి ఉన్నవారు స్థానికంగా లేకపోవడం, మరణించిన వారి పేరుమీద భూమి ఉండటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ వివరాల నమోదుకు ప్రస్తుతం తుది గడువు లేదని, వచ్చే పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ముందు గడువు పెట్టే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
వ్యవసాయ క్లస్టర్లు 143
మొత్తం భూమి 7,59,793 ఎకరాలు
మొత్తం రైతులు 3,35,013
ఫార్మర్ రిజిస్ట్రీ
నమోదు చేసుకున్నవారు 87,339
ఫార్మర్ రిజిస్ట్రేషన్కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల ఎదరువుతున్నాయి. కొందరు రైతుల ఆధార్ నంబరు ఎంట్రీ చేస్తే సరైన వివరాలు రావడం లేదు. మరికొందరు స్థానికంగా లేకపోవడం సమస్యగా మారింది. మరో నెలరోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
– యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయధికారి
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు, పట్టా పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ లింకు అయిన మొబైల్ నంబరుతో స్థానిక ఏఈఓలను సంప్రదించాలి. అలాగే మీసేవా కేంద్రాల్లో సైతం రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకసారి ఐడీ పూర్తయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు. పీఎం కిసాన్ సాయం పొందేందుకు ఐడీ తప్పనిసరి చేశారు. ఒకే ఐడీ ఉండడం ద్వారా లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థికసాయం అందజేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన రాయితీలు, రుణాలు, పథకాలు త్వరగా అందుతాయి. భవిష్యత్లో అమలు చేసే పథకాల ప్రయోజనాలు స్పష్టమైన గుర్తింపుతో పక్కదారి పట్టే అవకాశం ఉండదు.
సా..గుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ


