తొలి పరీక్షకు 276 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉరుకులు పరుగుల మధ్య చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. అధికారులు, సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, పేపర్–1 పరీక్ష నిర్వహించగా.. 7,265 మంది విద్యార్థులకు గాను 6,989 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,565 మందికి గాను 5,387 మంది, ఒకేషనల్ విభాగంలో 1,700 మందికి గాను 1,602 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 178 మంది, ఒకేషనల్ విభాగంలో 98 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
తొలి పరీక్షకు 276 మంది గైర్హాజరు


