దుర్మార్గులకు శిక్ష పడాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోండి
● కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర ఘటనలో దాడికి పాల్పడిన నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని, అందరికీ శిక్షపడేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి కమిషన్ తరపున రూ.లక్ష చెక్కును అందజేశారు. కుమ్మెరలో కుటుంబం జీవించలేని పరిస్థితులు ఉన్నాయని వారికి రక్షణ కల్పించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు ఏర్పాటు, గణేశ్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు.


