● కొల్లాపూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో మంత్రి జూపల్లి
కొల్లాపూర్: మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం పుర చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే పనులకు బడ్జెట్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పాలకవర్గానికి సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ అంశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. మున్సిపాలిటీకి మంజూరయ్యే నిధులతో పాటు అదనపు నిధుల మంజూరుకు కృషిచేస్తానని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ నీటి సరఫరాపై మంత్రి అధికారులతో సుదీర్ఘకంగా చర్చించారు.
రూ.31.42 కోట్లతో అంచనా బడ్జెట్..
2026–27 సంవత్సరానికి సంబంధించి రూ.31.42 కోట్ల అంచనా బడ్జెట్ను మున్సిపల్ పాలకవర్గం రూపొందించింది. వీటిలో ఇంటి ట్యాక్సుల ద్వారా రూ. 13.65లక్షలు, వాణిజ్య ట్యాక్స్లతో రూ. 23.65లక్షలు, డిపాజి ట్లు, రుణాల ద్వారా రూ. 37.08లక్షలు, ప్లానింగ్, నాన్ప్లానింగ్, ఇతర గ్రాంట్ల ద్వారా రూ. 26.50 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వీటితో ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, రుణాల చెల్లింపు, గ్రీన్ బడ్జెట్ ఖర్చులన్నీ కలిపి రూ. 2.84 కోట్లు.. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు రూ. 71.25 లక్షలు.. వార్డుల వారీగా నిర్వహణ ఖర్చులకు రూ. 44.03 లక్షలు, ప్లానింగ్ గ్రాంట్స్ ద్వారా అభివృద్ధి పనులకు రూ. 26.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం ఖర్చు రూ. 30.53 కోట్ల మేరకు ఉంటుందని అంచనా బడ్జెట్లో పేర్కొన్నారు. దీనికి పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రహీంపాషా, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు ఉన్నారు.


