తిరువనంతపురం: కేరళలో అధికారమే లక్ష్యంగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్లతో పాటు బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది.
కేరళలో అధికారంలోకి వస్తే నిరుపేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. పేద కుటుంబాలకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు పలు వరాలు గుప్పించింది. రాష్ట్రానికి ఎయిమ్స్, ప్రార్థనా స్థలాల పరిరక్షణకు చట్టం తదితర హామీలు ఇచ్చింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఎన్డీఏ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
హామీలు ఇవే..
నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.3,000 పెన్షన్
వితంతువులకు, 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు కూడా నెలకు రూ.3,000 పెన్షన్
ఓనం, క్రిస్మస్ పండుగలకు ఒక్కోటి చొప్పున నిరుపేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్
మెడికల్, కిరాణా దుకాణాల్లో నెలకు రూ.2,500 మేరకు కొనుగోళ్లకు వీలుగా ప్రతి పేద మహిళకూ భక్ష్య, ఆరోగ్య సురక్ష కార్డు.


