కుషీనగర్: ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖడ్డా ప్రాంతంలో వైభవంగా జరుగుతున్న ‘చైత్ బర్నీ’ మేళాలో విషాదం అలముకుంది. జాతరలో ఏర్పాటు చేసిన ‘స్వింగ్ రైడ్’లో సందర్శకులు ఉత్సాహంగా ఊగుతున్న సమయంలో అది ఒక్కసారిగా తెగిపడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న సందర్శకులు ప్రాణభయంలో పరుగులు తీశారు.
క్షణాల్లో మారిన దృశ్యం
రంగురంగుల విద్యుత్ దీపాలతో సందడిగా ఉన్న జాతర ప్రాంగణంలో క్షణాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాలిలో తిరుగుతున్న ‘స్వింగ్ రైడ్’ అకస్మాత్తుగా విరిగి కిందపడటంతో అందులో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
#WATCH | Kushinagar, UP: A major accident occurred at Chait Barni Fair in Kushinagar's Khadda area after a swing ride collapsed while in operation, injuring many people. Injured persons are shifted to the nearby hospital. Police and administration on the spot; relief and rescue… pic.twitter.com/6Qe8KHV2jj
— ANI (@ANI) April 1, 2026
ఎమ్మెల్యే స్పందన
ఈ ఘటనపై ఖడ్డా నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద్ పాండే స్పందించారు. ఆయన ‘ఏఎన్ఐ’వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఘటన జరిగిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశాం. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షిస్తున్నాం. స్వల్ప గాయాలైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. పరిస్థితి విషమంగా ఉన్న వారిని జిల్లా ఆస్పత్రికి తరలించాం’ అని తెలిపారు. బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
దర్యాప్తు ప్రారంభం
ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలకు ఎవరూ ఆటంకం కలిగించవద్దని, సందర్శకులంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జాతర ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొనకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: సురేష్ గోపి నిజంగా గెలవలేదా?


