బిజినేపల్లి: ఆరోగ్య మిషన్–99లో భాగంగా ఒకేచోట అన్నిరకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా.రవికుమార్ నాయక్ అన్నారు. బుధవారం బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, డెంటల్, కంటి వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ప్రత్యేక వైద్యశిబిరాల్లో పాల్గొని ప్రజలకు సమగ్ర సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా, వైద్యశిబిరంలో అందిస్తున్న వైద్యసేవల నాణ్యతను ఆయన సమగ్రంగా పరిశీలించారు. రోగుల నమోదు విధానం, చికిత్స విధానం, మందుల పంపిణీ, రికార్డుల నిర్వహణ తదితర వివరాలను తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డా.సృజన, సిబ్బంది పాల్గొన్నారు.


