‘ప్రజల దృష్టి మళ్లించేలా కాంగ్రెస్ డ్రామాలు’
● మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
నాగర్కర్నూల్ రూరల్: కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసుల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులు అందించి, విచారణకు రావాలని పిలవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి, వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టిన కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పదని ఆయన హితువు పలికారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం కమీషన్లని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేటీఆర్, హరీశ్రావు, సంతోష్రావును వేధిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు పని చేయకుండా కేసుల చుట్టూ తిరిగేలా చేయాలనే రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.


