చేనేత రుణమాఫీకి బ్రేక్!
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
అమరచింత యూనియన్ బ్యాంక్లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ చెల్లిస్తూ రుణాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో చెల్లించలేదు. ఇప్పుడు ఏడాది అవుతుందని.. వడ్డీ చెల్లించి పునరుద్ధరించుకోవాలని మేనేజర్ వత్తిడి చేస్తున్నారు. డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. – కొంకతి శకుంతలమ్మ,
చేనేత కార్మికురాలు, అమరచింత
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీపై ప్రకటన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా.. నేటికీ సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి.
– వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, చేనేత సహకార సంఘం, అమరచింత
అమరచింత: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా గతేడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించారు. 16 నెలలు గడుస్తున్నా.. నేటి వరకు సగం నిధులు మాత్రమే విడుదల చేసి వాటిని కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయొద్దని ఆదేశాలిచ్చింది. పూర్తిస్థాయిలో విడుదల చేసిన తర్వాతే కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో చెల్లించాలని చెప్పడంతో చేనేత రుణమాఫీ ప్రక్రియ నిలిచిపోయింది. రుణమాఫీకి అర్హులైన వారి వివరాలను చేనేత జౌళిశాఖ అధికారులు బ్యాంకర్ల నుంచి సేకరించి నివేదికను రాష్ట్ర కమిటీకి అందజేసినా.. నిధులు మాత్రం జమకాలేదు. అప్పుడు.. ఇప్పుడంటూ ఏడాదిన్నరగా కాలం వెళ్లదీస్తున్నారని, బ్యాంకర్లు మాత్రం తీసుకున్న రుణం చెల్లించాలని వత్తిడి పెంచడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. చేనేత రుణాలు తీసుకున్న వారి ఖాతాల లావాదేవీలను అమరచింత యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిలిపివేయడంతో ఆయన తీరును తప్పుబడుతూ బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రుణమాఫీ నిధులు వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,321 మంది చేనేత కార్మికులు రుణమాఫీకి అర్హులని జిల్లా అధికారులు గుర్తించి రూ.15.36 కోట్లు అవసరమని రాష్ట్ర జౌళిశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం మాత్రం మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలకు మొత్తం నిధులు.. జోగుళాంబ గద్వాల, వనపర్తికి సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావించి అన్ని జిల్లాలకు మొత్తం నిధులు మంజూరయ్యే వరకు రుణమాఫీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం.
జిల్లా కార్మికుల మంజూరు
సంఖ్య కావాల్సిన నిధులు
(రూ.కోట్లలో..)
జో. గద్వాల 1,792 11.79
వనపర్తి 338 2.50
నారాయణపేట 122 0.70
మహబూబ్నగర్ 54 0.27
నాగర్కర్నూల్ 15 0.09
ఏడీ ఖాతాలో సగం నిధులు మాత్రమే
వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో చేనేత రుణాలు తీసుకున్న కార్మికుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. వీటికి సంబంధించి ప్రభుత్వం సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. పూర్తిస్థాయి నిధులు మంజూరైన వెంటనే నేత కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం.
– గోవిందయ్య, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల
పూర్తిస్థాయిలో మంజూరయ్యే
వరకు నిలిపివేయాలని ఆదేశాలు
ఉమ్మడి జిల్లాలో 2,321 మంది కార్మికులు
డబ్బులు చెల్లించాలంటూ బ్యాంకర్ల వత్తిడి
ఆందోళనలో నేతన్నలు
చేనేత రుణమాఫీకి బ్రేక్!


