మరోసారి భంగపాటే..
కేంద్ర బడ్టెట్లో జిల్లా ప్రజలకు మరోసారి భంగపాటు మిగిల్చింది. పేద, మధ్య తరగతి ప్రజలకు కేటాయింపులు ఇవ్వలేదు. ఏకలవ్య స్కూల్, కేంద్రీయ విద్యాలయం ఒక్కటి కూడా లేదు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ విస్మరించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాచర్ల–గద్వాల రైల్వేలైన్ ఊసే ఎత్తలేదు. రైతులు, యువతకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు లేవు. జిల్లాకే కాదు తెలంగాణకు సంబంధించి చెప్పుకోదన్న నిధుల కేటాయింపు జరగలేదు. విభజన హామీలను గాలికొదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. బడ్టెట్ పేదలకు నిరాశే మిగిలింది.
– డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, అచ్చంపేట
వికసిత్ భారత్ లక్ష్యం..
దేశాన్ని 2047కల్లా వికసిత్ భారత్గా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్రంలో ఉన్న సుస్థిత ప్రభుత్వ అభివృద్ధి కొనసాగేలా ఉంది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, రైతుల ఆదాయం పెరిగేలా పంటలను ప్రోత్సహించనున్నారు. పశుపోషణ, మత్స్యకారులకు ఆదాయం పెంచేందుకు చర్యలున్నాయి. హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైల్వే ద్వారా ఇక్కడి ప్రాంతానికి ప్రయోజనం ఉంటుంది.
– నరేందర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్
సంపన్నులకు మేలు చేసేలా..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సంపన్నులు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేదిగా ఉంది. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగేదేమి లేదు. అదే విధంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, పంట దిగుబడికి మద్దతు ధరకు ఎలాంటి భరోసా దొరకలేదు. వెంటనే బడ్జెట్ను సవరించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలి. జిల్లాలో రైలు మార్గాలు నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, వేగంగా పనులు పూర్తి చేయాలి. – వర్ధన్ పర్వతాలు, సీపీఎం జిల్లా కార్యదర్శి
●
మరోసారి భంగపాటే..
మరోసారి భంగపాటే..


