ముగిసిన నామినేషన్ల పరిశీలన
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలనను అధికారులు పూర్తిచేశారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు గాను మొత్తం 402 నామినేషన్లు రాగా.. ఎన్నికల అధికారులు అన్నింటికీ ఆమోదం తెలిపారు. దాఖలైన నామినేషన్లలో ఏవీ తిరస్కరణకు గురికాలేదు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 142 మంది అభ్యర్థులకు గాను మొత్తం 151 నామినేషన్లు, కల్వకుర్తి మున్సిపాలిటీలో 103 మంది అభ్యర్థులకు గాను 106 నామినేషన్లు, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 93 మంది అభ్యర్థులకు గాను దాఖలైన 145 నామినేషన్లను పరిశీలించి ఆమోదించారు.
పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ఏర్పాట్లు
కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి తప్పులకు తావివ్వకుండా చేపట్టాలని జిల్లా జనరల్ అబ్జర్వర్ రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఆమె స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రిటర్నింగ్ అధికారులు పూర్తిగా నామినేషన్లను పరిశీలించి ఎలాంటి తప్పిదాలు లేని వాటిని పరిశీలించి తుది జాబితాను ప్రకటించాలని సూచించారు. అనంతరం డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ ఏర్పాటు చేసే బీఈడీ కళాశాలను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల విధులకు వచ్చే అధికారులకు వీలుగా రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం, ఎన్నికల అనంతరం కౌంటింగ్ చేపట్టే హాల్ పరిసరాలను పరిశీలించారు. విధులకు వచ్చే అధికారులు, సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్కు సూచించారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి లోపాలకు తావివ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేలా అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎంపీడీఓ వెంకట్రాములు, మున్సిపల్ ఏఈ షబ్బీర్ తదితరులున్నారు.


