అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సొంత ఆలోచనలు అమలు చేయకుండా.. సమన్వయంతో, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో పీఓలు, ఏపీఓలు, ఓపీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్లో ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 8న రెండో విడత శిక్షణ తరగతులు ఆయా మున్సిపాలిటీల పరిధిలో నిర్వహిస్తామని, అదేరోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల అధికారులు 10న మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్కు సకాలంలో చేరుకొని సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. 11న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి.. సాయంత్రం 5 గంటల వరకు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.


