ప్రయోగ పరీక్షలకు సిద్ధం
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
● ప్రత్యేక నిధులు కేటాయింపు
● సీసీ కెమెరాల మధ్య పర్యవేక్షణ
● జిల్లా వ్యాప్తంగా
33 కేంద్రాల్లో నిర్వహణ
కందనూలు: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇందులో ప్రైవేటు 19, ప్రభుత్వ 16, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ మొత్తం 54 కళాశాలల్లో 9,861 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఇందులో ఒకేషనల్ విద్యార్థులు 4,704 మంది కాగా.. జనరల్ విద్యార్థులు 5,157 మంది పరీక్ష రాయనున్నారు.
రూ.50వేలు..
ప్రాక్టికల్ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. విద్యార్థులతో ప్రయోగాలు చేయించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేశారు. జిల్లాలో ప్రభుత్వ, కస్తూర్బా, మోడల్ కళాశాలలు కలిపి మొత్తం 27 కళాశాలున్నాయి. ప్రతి కళాశాలకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.13.50 లక్షలు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ ఖాతాలోకి జమ చేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారుల పర్యవేక్షణలో కలెక్టర్ అనుమతితో కళాశాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రైవేట్ కళాశాలలకు సెల్ఫ్ సెంటర్
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం తమ సొంత కళాశాలల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు రాసే అవకాశం లేదు. ఇంటర్ అధికారులు నిర్ధేశించిన కళాశాలలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలలు మాత్రం సెల్ఫ్ సెంటర్లలోనేపరీక్షలు రాసుకునే అవకాశం కల్పించారు. ప్రైవేటు కళాశాలలు ర్యాంకులే పరమావధిగా ప్రాక్టికల్స్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని ప్రతి ఏడాది ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సారి ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్రతి ల్యాబ్లో నాలుగు మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటికి వాయిస్, వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఈ కెమెరాలు నేరుగాఇంటర్బోర్డు కమిషనర్ కార్యాలయానికి అనుసంధానం చేశారు.


