అటవీ సంరక్షణకు సహకరించాలి
లింగాల: నల్లమల అటవీ ప్రాంతం, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ సహకరించాలని డీఆర్ఓ జయదేవ్ కోరారు. గురువారం మండలంలోని చెన్నంపల్లి, పద్మన్నపల్లి గ్రామాల్లో అడవుల రక్షణ, వన్యప్రాణులను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో అడవికి నిప్పు పెడితే విలువైన సంపదతో పాటు అటవీ ఫలసాయాన్ని కోల్పోతామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిలో నిప్పు పెట్టొద్దని సూచించారు. అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులులు తరచుగా కొర్లకుంట, ఈర్లచెర్వు, మైసమ్మ చెర్వు ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని.. పశువులు, గొర్రెలకాపరులు అడవిలోకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు ఖాదర్పాషా, శివాజీ, బెస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


