లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కల్వకుర్తి టౌన్: గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఎవరో అని చెబితే నిర్వాహకులు, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆధునిక యుగంలో కూడా అమ్మాయిలపై వివక్ష వలన కొందరు స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని అబార్షన్లు చేయించుకోవడం వలన జిల్లాలో వెయ్యి మంది అబ్బాయిలకు 894 అమ్మాయిలకు జన్మనిస్తున్నారని, దీని వలన లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలతో సమానంగా పోటీపడుతూ అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అమ్మాయిలపై వివక్ష తగదన్నారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో నిర్వహిస్తున్న పరీక్షలు, రికార్డులు, ఫాం–ఎఫ్లను ఆయన తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం బోర్డులను తప్పనిసరిగా స్కానింగ్ సెంటర్లో ప్రదర్శించాలని వైద్యులకు సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, ప్రోత్సహించిన వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే లాబోరేటరీ పరీక్షల రేట్ల పట్టికను బయట ప్రదర్శించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి తదితరులున్నారు.


