పరువు హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు
బిజినేపల్లి: కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమ జంటలపై హత్యలు జరుగుతున్నాయని, వాటిపై పోలీస్, న్యాయశాఖ కఠినంగా ఉండేలా సూచించామని ఎంపీ మల్లురవి అన్నారు. చట్టబద్ధంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు పోలీస్, తహసీల్దార్లు, తాము సహకరిస్తామని, వారి భవిష్యత్, ఉపాధి కోసం ప్రభుత్వం తరపున రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కులాంతర వివాహాల్లో పరువు హత్యలు జరుగుతున్నాయని, ఈ హత్యలకు పాల్పడిన వారిపట్ల చట్టం కఠినంగా వ్యవహరించాలన్నారు. దళితుల సొంత భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తనను ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకుంది వారి కోసం పని చేయడానికేనని, టీఏ, డీఏల కోసమో.. చేపల పులుసు, నాటుకోడి కూర తినడానికి కాదని, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని వారి సమస్యలు తీర్చడానికి తిరుగుతున్నానని చెప్పారు. అర్హులైన వారు కొందరు గృహజ్యోతి లబ్ధి పొందలేకపోతున్నారని, దీని పరిష్కారం కోసం విద్యుత్ శాఖతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిష్కరిస్తానన్నారు. ప్రజా పాలన దరఖాస్తులో కొందరు టిక్ మార్కులు పెట్టకపోవడం వలన కొన్ని పథకాలకు అర్హులు కాలేకపోతున్నారన్నారు. గృహజ్యోతి పథకం కోసం స్థానిక ఏఈకి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ శివలీల, నాయకులు రాములు, వాల్యనాయక్, తిరుపతయ్య, శ్రీనివాస్, వెంకట్, పరశురాములు, గోవింద్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


