13 వరకు ‘ప్రజావాణి’ రద్దు
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 13 వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని, జిల్లా ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.
గిరిజన భాషా, సంస్కృతిని కాపాడుకోవాలి
కొల్లాపూర్ రూరల్: గిరిజన జాతుల భాషా, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని గిరిజన ఆదివాసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగానాయక్ అన్నారు. ఆదివారం మండంలోని సోమశిలలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలల్లో గెలుపొందిన గిరిజన సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన తండాలో మన రాజ్యం’ రావాలని నినాదంతో ఎంతో మంది పోరాటాలు చేశారని, వారి త్యాగాల వల్ల గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యాయన్నారు. నియోజకవర్గంలో 22 మంది సర్పంచ్లు, 16 మంది ఉపసర్పంచ్లు గెలుపొందారన్నారు. మంత్రి జూపల్లి సహకారంతో తండాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు హనుమంతునాయక్ పాల్గొన్నారు.
వేరుశనగ ధర రూ.10,607
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం రైతులు పెద్ద ఎత్తున వేరుశనగ పంటను అమ్మకానికి తెచ్చారు. అత్యధికంగా క్వింటాల్కు రూ.10,607, కనిష్టంగా రూ.8,565, సరాసరి రూ.9,469కు వ్యాపారులు కొనుగోలు చేశారు. 168 మంది రైతులు 4,862 బస్తాలలో 1,458 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తెచ్చారని మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు.
దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షలు
గద్వాల: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా దివ్యాంగులు వివాహం చేసుకుంటే రూ.2లక్షల నగదు ఇవ్వనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే వారి పేరిట రూ.2 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని, ఈ పథకం జనవరి 17, 2026 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. అర్హులైన వారు www. epass.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
13 వరకు ‘ప్రజావాణి’ రద్దు


