వందశాతం.. సాధ్యమేనా?
● మున్సిపాలిటీల్లో మందకొడిగా ఆస్తిపన్ను వసూళ్లు
● గడువులోగా లక్ష్యం
చేరికపై అనుమానాలు
నాగర్కర్నూల్: మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే ఆధారం. అయితే జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు మందకొడిగా కొనసాగుతుండటంతో వాటి అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. ఇప్పటి వరకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 20.22 కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7.57 కోట్లు మాత్రమే సిబ్బంది వసూలు చేయడం జరిగింది. అయితే మార్చి 31 వరకు ఈ గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయగా వందశాతం లక్ష్యం ఎలా చేరుకుంటారో వేచిచూడాలి.
ఎక్కడెక్కడ ఎంతెంత..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కల్వకుర్తి మినహా మిగతా మూడు మున్సిపాలిటీల్లో మాత్రం పన్నులు కొంత మెరుగ్గానే వసూలు అవుతున్నాయి. అచ్చంపేటలో రూ.4.02 కోట్ల పన్నులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1.87 కోట్లు (46 శాతం) వసూలు చేయడం జరిగింది. అలాగే కొల్లాపూర్లో రూ.1.30 కోట్లకు గాను రూ.56 లక్షలు (43 శాతం) వసూలు చేశారు. నాగర్కర్నూల్లో రూ.6.97 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.2.98 కోట్లు (42 శాతం) వసూలయ్యాయి. కల్వకుర్తిలో రూ.7.93 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.2.16 కోట్లు (27.29 శాతం) మాత్రమే వసూలు చేశారు. కాగా.. నాలుగు మున్సిపాలిటీల్లో మార్చి 31 నాటికి వందశాతం పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యం ఉండటంతో అధికారులు ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల సమయం కావడంతో..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వందశాతం పన్నుల వసూలు సాధ్యమవుతుందో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఈ సమయానికి పన్నుల వసూలుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది.
పన్ను
లక్ష్యం
రూ.20.22 కోట్లు
ఇప్పటి వరకు వసూలైంది
రూ.7.57 కోట్లు
మొత్తం
శాతం
37.43
చివరి
గడువు
మార్చి 31
వందశాతం.. సాధ్యమేనా?
వందశాతం.. సాధ్యమేనా?


