breaking news
Mahabubnagar District Latest News
-
బడ్జెట్లో అన్ని వర్గాల అభివృద్ధికి ఊతం
పాలమూరు: ప్రపంచంతో పోటీపడే విధంగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా 2026–27 బడ్జెట్ రూపొందించారని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రకటిస్తే దీంట్లో మూడు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషమన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వరకు 570 కి.మీటర్ల దూరం రూ.1.75 లక్షల కోట్ల హైస్పీడ్ కారిడార్ పట్టాలెక్కుతుందని, అన్ని జిల్లా కేంద్రాల్లో స్టాప్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి పుణె వరకు 550 కిలోమీటర్లు రూ.1.65 లక్షల కోట్లు, హైదరాబాద్ నుంచి చైన్నె వరకు 700 కిలోమీటర్లు రూ.2.10 లక్షల కోట్ల అంచనాతో ఏర్పాటు అవుతున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5.50 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్లు పూర్తవుతాయని తెలిపారు. గతం కంటే ఈసారి తెలంగాణకు బడ్జెట్ రూ.1,100కోట్లు అదనంగా పెరిగిందని, రాష్ట్రానికి ఏడు నవోదయ పాఠశాలలు మంజూ రు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో బాలికల వస తి గృహం ఏర్పాటు నిర్ణయం ద్వారా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. రూ.7.84 లక్షల కోట్లు కేటాయింపు కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రూ.7.84 లక్షల కోట్లు కేటాయించారని, విద్యా రంగానికి రూ.1.39 లక్షల కోట్లు, వైద్య రంగానికి రూ.1.4 లక్షల కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. 17 రకాల క్యాన్సర్ మందులపై ధరలు తగ్గించారని పేర్కొన్నారు. మహబూబ్నగర్ను 3 టైర్ మున్సిపాలిటీగా గుర్తించడం వల్ల ఈ సారి నగర అభివృద్దికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో ఏ రంగానికి కాకుండా.. గద్వాల, మహబూబ్నగర్కు ఇంతా అని ప్రత్యేకంగా ఉండదన్నారు. పాలమూరు– రంగారెడ్డిపై ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వడం లేదనే తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టుకు విభజన చట్టంలో జాతీయ హోదా ఎందుకు పెట్టలేదు.. ఆ తప్పు ఎవరిదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, పడకుల బాలరాజు, కృష్ణవర్ధన్రెడ్డి, అంజయ్య, రాములు పాల్గొన్నారు. -
ఒకే నామినేషన్.. ఏకగ్రీవం లాంఛనమే
మహబూబ్నగర్ కార్పొరేషన్లో 16 మంది ఉప సంహరణ పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కలిపి 516 మంది అభ్యర్థులు బరిలో ఉండగా సోమవారం 16 మంది తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం పోటీలో 500 మంది నిలిచారు. ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు వరకు అవకాశం ఉంది. కాగా.. 58వ డివిజన్లో రెండు నామినేషన్లు ఉండగా సోమవారం ఒకరు ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన చలువగాలి రమాదేవి నామినేషన్ ఒకటే ఉండడంతో ఆమె ఏకగ్రీవం కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత నేడు అధికారులు ధ్రువీకరించనున్నారు. ఇక దేవరకద్ర మున్సిపాలిటీలో నలుగురు, భూత్పూర్లో ఆరుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. -
రమణీయం.. రథోత్సవం
● గోవింద నామస్మరణతో దద్దరిల్లిన మన్యంకొండ ● మాఘపౌర్ణమి వెన్నెల్లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం ● భక్తిశ్రద్ధలతో గరుడవాహన సేవ, ఎస్పీ ప్రత్యేక పూజలు మహబూబ్నగర్ రూరల్: మాఘ పౌర్ణమి వెన్నెల్లో మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం సోమవారం తెల్లవారుజామున రమణీయంగా సాగింది. భక్తుల గోవింద నామస్మరణ మధ్యసాగిన ఘట్టం ఆధ్యాత్మిక కాంతులను నింపింది. స్వామివారి దివ్యదర్శనార్థం వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, తేరు మైదానం, కోనేరు, ఘాట్రోడ్లు, పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తులు గోవిందా.. గోవిందా నామాన్ని స్మరిస్తూ రథాన్ని లాగగా, ప్రతి అడుగులో భక్తి వెల్లివిరిసింది. వెన్నెల వెలుగుల్లో అలంకరించిన తేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల హరినామస్మరణతో మునులకొండలు పులకించిపోయాయి. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. సుమారు లక్షకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం అధికారుల అంచనా. నిండుపౌర్ణమి వెన్నెల్లో.. ఒకపక్క నిండు పౌర్ణమి వెన్నెల.. మరోపక్క ఫ్లడ్లైట్ల వెలుతురులో తేరు మైదానం మెరిసిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు తరించారు. రథం ఎదుట కాల్చిన బాణా సంచా హైలైట్గా నిలిచింది. ఒకపక్క తారాజువ్వల సందడి మరోపక్క బాణాసంచా పేలుళ్లతో తేరు మైదానం మారుమోగింది. రథోత్సవం అనంతరం స్వామివారిని గరుడవాహనంపై మెట్లమార్గం గుండా గర్భగుడిలోకి తీసుకెళ్లారు. విస్తృత ఏర్పాట్లు రథోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు, రెవెన్యూ, ఆలయ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టారు. అన్నప్రసాద వితరణ, తాగునీటి సదుపాయాలు ఏర్పాటుతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. మన్యంకొండలో లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం గరుడ వాహనంపై తేరు మైదానానికి.. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని గర్భగుడి నుంచి శోభాయమానంగా అలంకరించిన గరుడవాహనంపై సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య స్వామివారు గరుడవాహనంపై ఊరేగుతూ తేరు మైదానానికి చేరుకున్నారు. బంగారు ఆభరణాలు, కాగడాల వెలుతురలో పూలమాలధారణతో పద్మావతి, లక్ష్మీదేవి సమేత స్వామివారు మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఎస్పీ జానకి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్నారు. -
బాదేపల్లి టు జడ్చర్ల
మలి చైర్మన్ గుబ్బ విశ్వనాథం తొలి చైర్మన్ కొత్త కేశవులు 2021 ఏప్రిల్లో ఎన్నికలు రెండో పర్యాయం మున్సిపాలిటీగా మారిన తరువాత అనేక ఒడిదొడుకుల మధ్య 2021 ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. మే 5న నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కారణంగా పాలక వర్గానికి ఈ ఏడాది మే 4 వరకు గడువు ఉండటంతో ఎన్నికలు జరగటం లేదు. రెండోసారి మున్సిపాలిటీ అయ్యాక తొలి చైర్పర్సన్గా దోరేపల్లి లక్ష్మి ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు కొనసాగాక అవిశ్వాసంతో వైదొలగాల్సి వచ్చింది. ఆ తరువాత కోనేటి పుష్పలత చైర్పర్సన్గా ఎన్నికై కొనసాగుతున్నారు. ఈ పర్యాయం రిజర్వేషన్ జనరల్ (అన్రిజర్వుడు)గా రావడంతో మున్ముందు ఉత్కంఠ రేపనుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో 27 వార్డులు ఉన్నాయి. 2019లో బాదేపల్లి మున్సిపాలిటీ పేరును జడ్చర్ల మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీంతో విలీనం ప్రక్రియలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. బాదేపల్లి పేరు చరిత్రలో నిలిచిపోయింది. 2020 డిసెంబర్ 15తో జడ్చర్ల పంచాయతీ పాలకవర్గం గడువు ముగియడంతో విలీన ప్రక్రియ సమాప్తం అయ్యింది. నాటి నుంచి జడ్చర్ల మున్సిపాలిటీ అధికారికంగా మారిపోయింది. మున్సిపాలిటీ పరిధిలో బాదేపల్లి, బూరెడ్డిపల్లి, నాగసాల, జడ్చర్ల, కావేరమ్మపేట, శంకరాయపల్లితండా, నక్కలబండ తండాలు ఉన్నాయి. మున్సిపాలిటీగా ప్రారంభమైన చరిత్ర గ్రామ పంచాయతీగా, నగర పంచాయతీగా, మున్సిపాలిటీగా అనేక రూపాలు మారింది. 2019లో జడ్చర్ల మున్సిపాలిటీగా మార్పు -
ప్రజలకు మెరుగైన పాలన అందించాలి
అచ్చంపేట: ప్రభుత్వ అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక పట్టణ గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల క్షేత్రస్థాయి శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనలో సామర్థ్యం పెంపొందించడంలో క్షేత్రస్థాయి పరిశీలన ఆధారిత శిక్షణ తరగతులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. గ్రూప్–1 అధికారులకు శిక్షణలో భాగంగా నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, స్టడీటూర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలనలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ విధానాల అమలుపై ప్రాయోగిక అవగాహన కల్పించడమే శిక్షణ తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక దేవాలయాలు, ప్రకృతి సౌందర్య ప్రదేశాలు, వన్యప్రాణులు, వివిధ రకాల పక్షులు, జంతువులతో పాటు చెంచు, గిరిజనుల జీవన విధానం, నైపుణ్యాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు. స్టడీ టూర్లో భాగంగా తొలిరోజు నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం, అక్కమహాదేవి ఆలయాలను సందర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని దట్టమైన అడవులను సందర్శించి అధ్యయనం చేయాలన్నారు. అధ్యయన పర్యటన ద్వారా అనేక అనుభూతులను అందిపుచ్చుకొని శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, కంబైనన్డ్ ఫౌండేషన్ కోర్స్ కోఆర్డినేటర్, తిరువెంగళాచారి తదితరులు పాల్గొన్నారు. నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ -
ఒకే పార్టీ నుంచి ఇద్దరికి బీ–ఫాం ఇస్తే..!
పాలమూరు: కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించనున్న నేపథ్యంలో.. గుర్తింపు పొందిన రిజిస్టర్, ఎన్నికల సంఘం వద్ద ఏదైనా గుర్తుతో నమోదైన పార్టీలు తమ అభ్యర్థులకు బీ–ఫామ్ అందిస్తే ఆయా గుర్తులను వారికి కేటాయించడం ఆనవాయితీ. ప్రస్తుత ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ముగుస్తుంది. ఈ లోపు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు బీ–ఫామ్ అందిస్తే వారికే ఆయా పార్టీ గుర్తు కేటాయిస్తారు. ఒక వార్డు నుంచి బరిలో ఉన్నవారిలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఏదైనా పార్టీ బీ–ఫామ్లు అందిస్తే ఏంటి పరిస్థితి? అయితే దీనికి ఒక నిబంధన ఉంది. ముందుగా నామినేషన్ పత్రం ఎవరు దాఖలు చేస్తారో వారికే పార్టీ గుర్తును కేటాయించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. బీ–ఫామ్ ఇచ్చిన మరో వ్యక్తిని అదే పార్టీ అభ్యర్థిగా పరిగణించరు. రిటర్నింగ్ అధికారులు ఆ అభ్యర్థిని స్వతంత్రుడిగా ప్రకటిస్తారు. -
గద్వాల కాంగ్రెస్లో బీ–ఫామ్ల పంచాయితీ
గద్వాల: స్థానిక కాంగ్రెస్ పార్టీలో బీ–ఫామ్ల లొల్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మాజీ జెడ్పీచైర్పర్సన్ సరితల మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఇక మిగిలింది బీ–ఫామ్లు సమర్పించడమే. అయితే బీ–ఫామ్ల పంచాయతీ ఓపట్టాన కొలిక్కి రాకపోవడంతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రి, సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, సరితతో మంతనాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్ సైతం ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. గద్వాల మున్సిపాలిటీకి సంబంధించిన బీ–ఫామ్లను ఎమ్మెల్యే వర్గానికే ఇవ్వాలని అధిష్టానం మొగ్గుచూపినట్లు సమాచారం. ఇందులో మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకుడు గంజిపేట శంకర్కు బీ–ఫామ్ ఇవ్వటానికి సయోధ్య కుదిరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అసమ్మతి వర్గం లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ల మధ్య కుదరని సయోధ్య ఏఐసీసీ కార్యదర్శి సంపత్ రాయబారం సోషల్ మీడియా ఖాతాలపై నిఘా కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. అభ్యర్థులు తమ ప్రచారానికి వేగంగా సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలు, మాటల పేరుతో ఇతరులను రెచ్చగొట్టేలా, మతాలకు తావిచ్చేలా ఎవరూ పోస్టులు, కామెంట్లు పెట్టినా కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లపై ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల వాతావరణం నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చినా, చట్టవిరుద్ధంగా చర్యలు చేపట్టినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు, నామినేషన్ దాఖలు సమయంలో ర్యాలీలు, సమావేశాలు, వాహనాల వినియోగానికి స్పష్టమైన పోలీసు సిబ్బంది అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. లౌడ్ స్పీకర్లు నిబంధనల ప్రకారం మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉంటుందని, దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పేర్కొంటున్నారు. -
నిబంధనల ప్రకారమే గుర్తుల కేటాయింపు
● కలెక్టర్ విజయేందిర బోయి ● ఆర్ఓలకు ఒక రోజు శిక్షణ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు నిబంధనల ప్రకారమే గుర్తులు కేటాయించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం రాత్రి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్ఓలకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వివిధ రాజకీయ పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఆయా గుర్తులను కేటాయించాల్సి ఉంటుందన్నారు. డివిజన్లు/ వార్డుల వారీగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే వారందరూ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ) హ్యాండ్బుక్కును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిబంధనల ప్రకారమే ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ట్రైనీ నోడల్ అధికారి, డీఈఓ ప్రవీణ్కుమార్, మహబూబ్నగర్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి, సీఎంఓ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో పోటీ చేసే ప్రతి బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా డివిజన్లలో పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ల అభ్యర్థులతో సోమవారం ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రావడం ఇదే సమయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలోని పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. బూత్స్థాయి కార్యకర్తల సమావేశం కావడం అధిక సంఖ్యలో తరలిరావాలని, సభా స్థలానికి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేరుకోవాలన్నారు. సాధారణ పబ్లిక్ మీటింగ్ కాదని, పార్టీ జెండా మోసే బీజేపీ కార్యకర్తల సమావేశం కావడం వల్ల నాయకులు అధికంగా రావాలన్నారు. నగరం మొత్తం బీజేపీ బ్యానర్లు, కమలం జెండాలతో అలంకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి, పద్మజారెడ్డి, నాగురావు నామాజీ, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రతంగ్పాండురంగారెడ్డి, దిలీపాచారి, శ్రీనివాస్రెడ్డి, రమేష్కుమార్, నాయకులు బాలరాజు, కృష్ణవర్ధన్రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు. ● ఈ నెల 4న నగరంలో ఎంవీఎస్ మైదానంలో బీజేపీ ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రామచందర్రావుతో పాటు మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలర్తో కలిసి పరిశీలించారు. మధ్యాహ్నం నుంచి మొదలు కానున్న సమావేశంలో ఎలాంటి లోపాలు, ఇబ్బందులు రాకుండా కచ్చితమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్ల పరిశీలన -
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి
● మనిషి మనుగడకు ప్రకృతి అవసరం ● రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మహబూబ్నగర్ న్యూటౌన్: సమాజంలో మనిషిగా మన కర్తవ్యాలను నిర్వహించే క్రమంలో ప్రకృతిని కాపాడుతూ వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విజ్ఞానదర్శిని, నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమాన్ని జేపీఎన్సీఓ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం స్వావలంబనకు శాసీ్త్రయ దృక్పథం, ఆధునిక భారత్, నెహ్రూ దార్శనికత అనే అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. జనవరి 27న ప్రారంభమైన యాత్ర ఈ నెల 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ జన్యుపరంగా మానవుడికి కులమతాల భేదం లేదని, అవి మనం సృష్టించుకున్నవే అని పేర్కొన్నారు. ప్రకృతిని వైజ్ఞానికంగా పరిశీలించడం ద్వారానే సైన్స్ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకృతిని తనను తాను కాపాడుకోగలదని, మనిషిగా మనం మనుగడ సాధించాలంటే ప్రకృతి ఉండాల్సిన అవసరముంది. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డా.గుమ్మడి వెన్నెల, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రముఖ గేయ రచయిత జయరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్రెడ్డి, జన విజ్ఞాన వేదిక డా.రమేశ్, జేపీఎన్సీఓ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ లింగం నాయక్, సీపీఎం నాయకులు కిల్లెగోపాల్, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టండి
మహబూబ్నగర్ క్రైం: కార్పొరేషన్తో పాటు రెండు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి పెట్టాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎన్నికలపై జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని, పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది కేటాయింపు గస్తీ, చెక్పోస్టులు, సీసీటీవీ పర్యవేక్షణ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలు, క్విక్రె స్పాన్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని సూచించారు. మద్యం, నగదు, ప్రలోభాల పంపిణీపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతగా పని చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీలు ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎన్నికల సెల్ డీఎస్పీ గిరిబాబు, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, గాంధీనాయక్, రామకృష్ణ, బాలరాజు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
డివిజన్లు, వార్డుల వారీగా చిట్టా తీసిన పోలీసులు
● ఎన్నికల వేళ పాత నేరస్తుల కదలికలపై దృష్టి ● జిల్లాలో రౌడీషీటర్ల సమాచార సేకరణ ● నగరంలో 42 మంది పాత నేరస్తులుబైండోవర్ మహబూబ్నగర్ క్రైం: కార్పొరేషన్/మున్సిపల్ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మేయర్/చైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా రోజురోజుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో వలసలు ఊపందుకున్నాయి. ప్రచార వ్యయాలను లెక్క చేయకుండా అత్యధిక డివిజన్లు/వార్డుల్లో గెలుపే లక్ష్యంగా సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీస్శాఖ సన్నద్ధం అవుతోంది. శాంతిభద్రతలు గాడి తప్పకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా సాంకేతికతను వినియోగించుకోనున్నారు. అవసరం మేరకు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నట్లు సమాచారం. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా పోలీసులు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల్లో రౌడీషీటర్లు, నేరప్రవృత్తి గల వారు దౌర్జన్యాలు, గొడవలకు కారణమవుతుంటారు. ఇలాంటి వారిని జిల్లా పోలీసులు ముందుగానే గుర్తించి వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ను నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీల తరఫున నజరానాలు అందించడం తదితర అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడానికి జిల్లావ్యాప్తంగా నిఘాను కొనసాగించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో మూడంచెల విధానం అమలు చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. వార్డుల వారీగా సమాచారం.. నగరంలో 60డివిజన్లతో పాటు దేవరకద్రలో 12 వార్డులు, భూత్పూర్లో 10 వార్డులలో ఉన్న పాత నేరస్తులు, రౌడీషీటర్ల సమాచారంపై ఇప్పటికే లెక్కలు తీశారు. పోలీసులు వార్డుల వారీగా సమాచారం సేకరించడంతో పాటు సామాజిక వర్గాల వారీగా ఓటర్లు, హద్దులు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల వివరాలతో పాటు స్వతంత్రుల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఎన్నికలు జరిగే సమస్యాత్మక డివిజన్, వార్డులలో సీసీ కెమెరాల ద్వారా పని తీరును పరిశీలించడానికి కసరత్తు చేస్తున్నారు. గతంలో వార్డుల పరిధిలో ఏమైనా ఘటనలు జరిగాయా అనే సమాచారం సిద్ధం చేశారు. దీని ఆధారంగానే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయి. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టే అవకాశాలున్నాయి. ● నగరంతో పాటు పట్టణాల్లోని పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. గతంలో ఎన్నికల సందర్భంగా అల్లర్లకు కారకులైన వారిని అవసరమైతే బైండోవర్ చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు వార్డుల్లో బెల్ట్ దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక వార్డులపై కలెక్టర్, ఎస్పీ స్థాయిలో జరిగిన సమావేశంలో చర్చించారు. పోలింగ్కేంద్రాలు 320జనవరి 27 నుంచి సీజ్ చేసిన మద్యం 37.21 లీటర్లు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 190ఎస్పీ కార్యాలయంలో డిపాజిట్ చేసిన గన్స్ 25 బైండోవర్లు 42 ఎస్ఎస్టీ బృందాలు 44 చెక్పోస్టులు ఏర్పాటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటానికి జిల్లా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బయటి ప్రాంతాల నుంచి నగదు, మద్యం సరఫరా కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా సరిహద్దు జిల్లాల పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో రెండు, భూత్పూర్, దేవరకద్రలో ఒక్కో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన ఉజ్వల విశ్రాంత మహిళా ఉపాధ్యాయ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్నగర్ అభివృద్ధి కోసం రూ.రెండు వేల కోట్లతో వివిధ పనులకు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే నగర అభివృద్ధికి రూ.150 కోట్లు వెచ్చించామన్నారు. అంతకుముందు విశ్రాంత మహిళా ఉపాధ్యాయ ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్గా విశ్వరూప, కో–కన్వీనర్గా పుష్పలత, కార్యదర్శిగా సావిత్రి, కోశాధికారిగా జయంతి, సలహాదారుగా పీజే డెబోర, కార్యవర్గ సభ్యురాలిగా షాహిన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ఎస్.వినోద్కుమార్, గట్టు వెంకట్రెడ్డి, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు పాల్గొన్నారు. పరీక్షలను పరిశీలించిన పీయూ రిజిస్ట్రార్ మహబూబ్నగర్ న్యూటౌన్: పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలనుయూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. రమేశ్బాబు సోమవారం పరిశీలించారు. అలాగే పీజీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలను పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.మధుసూదన్రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రకిరణ్, హెచ్ఓడీ డా.పండుగ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. మహిళా జట్టు శుభారంభం మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో సోమవారం ప్రారంభమైన సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా మహిళా జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 10 వికెట్ల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు మహబూబ్నగర్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. మహబూబ్నగర్ బౌలర్లు అనిత 3 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, ప్రవళిక కాట్రావత్ 4 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ మహిళల జట్టు 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. జట్టులో ఆర్యని 14, అక్షర రాథోడ్ 17 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. -
చేతికి చిక్కులు..!
పాలమూరు: టికెట్ ఆశించి భంగపడిన ఆశావహుల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి నిరసన సెగ తగులుతోంది. అనేక డివిజన్ల నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వలాలు ఎగిసిపడ్డాయి. కొందరు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం మధ్యాహ్నం డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేశారు. ఆయా డివిజన్లలో టికెట్ ఆశించి.. తుది జాబితాలో పేరు లేకపోవడంతో ఆశావహులు ఒక్కొక్కరు డీసీసీ కార్యాలయానికి చేరుకొని.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పలువురు నేతలు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 30వ డివిజన్కు చెందిన పలువురు మాజీ కౌన్సిలర్ షేక్ ఉమర్ భార్యకు టికెట్ కేటాయించాలని ఆందోళన చేశారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ను చుట్టుముట్టారు. కొత్వాల్తో పలువురు నాయకులు వాగ్వివాదానికి దిగారు. జిల్లా నేతలకు వ్యతిరేకంగా డౌన్డౌన్ నినాదాలు చేశారు. తమ నేతలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదని కార్యకర్తలు గట్టిగా ప్రశ్నించారు. అలాగే 1వ డివిజన్ నుంచి మేఘ్యనాయక్కు టికెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో డీసీసీ కార్యాలయానికి తరలివచ్చి నిరసన తెలిపారు. 45వ డివిజన్లో కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్ని, పార్టీ బలోపేతం కోసం పని చేసిన సల్మాన్ షరీఫ్కు టికెట్ కేటాయించకపోవడంతో ఆ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. 39 డివిజన్ నుంచి తమకు టికెట్ కేటాయించలేదని మరో అభ్యర్థి అవేదన వ్యక్తం చేశాడు. ఏఐసీసీ కార్యదర్శికి విన్నపాలు టికెట్లు దక్కని పలు డివిజన్లకు చెందిన ఆశావహుల అనుచరులు కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్లుకు విన్నవించారు. డీసీసీ చాంబర్లో ఆయన నాయకులతో సమావేశమయ్యారు. పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నారని, వారికి టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మొదటి విడతలో టికెట్ల కేటాయింపులు అన్యాయం జరిగిందని సరిచేయాలని కోరారు. రెండో విడత జాబితాలో తమకు టికెట్లు కేటాయించాలని కోరారు. అధికార పార్టీలో రె‘బెల్స్’ గుబులు పలు డివిజన్లలో సంతృప్తి రాగాలు కార్పొరేషన్లో 36 మందితో కూడిన తొలి జాబితా విడుదల డీసీసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన టికెట్లు రాని ఆశావహులు -
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి
పాలమూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం పాలమూరుకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జాతీయ అధ్యక్షుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం ఒకటి గంటలకు బయలుదేరి నేరుగా ఎంవీఎస్ కళాశాల మైదానానికి చేరుకుంటారని ఎంపీ డీకే అరుణ అన్నారు. తొలిసారి జిల్లాకు వస్తున్న క్రమంలో భారీగా స్వాగతం పలకాలని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తారన్నారు. గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని, బూత్స్థాయి కార్యకర్తల నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు. ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో పోటీ చేసే అవకాశం వచ్చిన ప్రతి అభ్యర్థి దీనిని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కార్పొరేషన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. గెలుపు అవకాశాలు అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థిని పార్టీ ఎంపిక చేసిందని, డివిజన్లో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు రమేష్, పద్మజారెడ్డి, బాలరాజు, కృష్ణవర్ధన్రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయానికి బలమైన అడుగు
● సఖిలకు ముగిసిన ఐదు రోజుల శిక్షణ ● రైతు భవిష్యత్కు దిశానిర్దేశం మహబూబ్నగర్ (వ్యవసాయం): కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకం నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ కింద జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమం సఖిలలో విజయవంతంగా ముగిసింది. గత నెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు కొనసాగిన ఈ శిక్షణలో జిల్లాలో ఎంపికై న 20 క్లస్టర్లకు చెందిన కమ్యూనిటీ రిపోర్ట్స్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం కేవలం సమాచారానికి పరిమితం కాకుండా, వ్యవసాయ విధానంలో మౌలిక మార్పులకు బీజం వేసిన కార్యక్రమంగా నిలిచింది. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, నేలలో సారవంతం తగ్గుదల, రసాయన కాలుష్యం, దిగుబడుల నాణ్యత తగ్గడం తదితర అన్నింటికీ ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ శిక్షణకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ఇవీ ప్రధానాంశాలు.. శిక్షణ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం యొక్క తత్వం, అవసరం, దీర్ఘకాల ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా నేల ఆరోగ్యం ప్రాధాన్యత, పంటల మార్పిడి, రసాయన రహిత ఎరువుల తయారీ, వినియోగం, పురుగు, తెగుళ్ల నివారణకు కషాయాలు, జీవసారాలు, సమగ్ర, సుస్థిర వ్యవసాయ విధానం, దేశవాళి విత్తనాల వినియోగం వంటి అంశాలను శాసీ్త్రయంగా, ఆచరణాత్మకంగా వివరించారు. రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులపై ఆధారపడటం వల్ల ఏర్పడుతున్న ఆరోగ్య, పర్యావరణ సమస్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో.. ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించడం. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల జీవ వైవిధ్యాన్ని పెంపొందించి, వాయు– నీరు– నేల కాలుష్యాన్ని తగ్గిస్తూ.. రైతు ఆదాయాన్ని స్థిరంగా పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. ఇది కేవలం ఒక పద్ధతి కాకుండా, రైతు జీవన విధానంలో మార్పు తీసుకొచ్చే ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్రామ స్థాయికి విస్తరణ.. క్లస్టర్ కమ్యూనిటీ రిపోర్ట్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన వ్యూహం. వీరు గ్రామ స్థాయిలో రైతులకు మార్గదర్శకులుగా మారడం. ఈ 20 మంది శిక్షణార్థులు తమ తమ క్లస్టర్ల పరిధిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేసి, రైతులు ఆచరణకు ప్రోత్సహించే కీలక పాత్ర పోషించనున్నారు. ముగింపు కార్యక్రమం శిక్షణ చివరిరోజు కృషి సఖిలలో ముగింపు కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రైతు ఆరోగ్యానికే కాకుండా.. సమాజం, పర్యావరణ భవిష్యత్కూ అవసరం అని పేర్కొన్నారు. ముగింపు మాట మొత్తంగా చూస్తే, ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి బలమైన పునాది వేసినట్టుగా భావించవచ్చు. ఇది మొదటి అడుగే అయినప్పటికీ.. భవిష్యత్లో మరింత మంది రైతులు ఈ మార్గంలో నడిచేలా చేస్తే, సుస్థిర వ్యవసాయంతో సమృద్ధమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
రమణీయం.. నృసింహస్వామి రథోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం సింహగిరిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుప్రభాతం, చతుస్థానార్చనలు, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, అలంకారం తదితర పూజలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనసేవలో స్వామి వారిని ఊరేగించారు. రాత్రి స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీలక్ష్మీ, నరసింహుల ఉత్సవ విగ్రహాలను రథంలో ఊరేగించారు. భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, పురోహితుల వేద మంత్రాల మధ్య నిర్వహించిన రమణీయమైన వేడుకలను తిలకించి.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గోవింద నామస్మరణలతో సింహగిరి మార్మోగింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి చక్రతీర్థం పూజలు నిర్వహిస్తారు. స్వామివారి రథోత్సవం సూర్యప్రభ వాహనసేవలో భక్తులు -
ఈసారీ.. నిరాశే
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు దక్కని కేటాయింపులు సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర బడ్జెట్ ఈసారి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లావాసులకు నిరాశే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక రంగ అభివృద్ధితో పాటు గద్వాల– మాచర్ల రైల్వేలైన్కు ఎలాంటి కేటాయింపులు దక్కలేదు. కొత్తగా అలంపూర్– నల్లగొండ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించినా భంగపాటు ఎదురైంది. వెనుకబడిన జిల్లాలో ఉపాధి కల్పనకు ప్రత్యేకంగా పరిశ్రమల ఏర్పాటు ఉంటుందని ఆశించగా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే హైదరాబాద్– బెంగళూరు రైల్వే మార్గంలో హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహంతో ఉమ్మడి జిల్లాకు కాసింత ప్రయోజనం కలగనుంది. ఊసే లేని గద్వాల– మాచర్ల కొత్త లైన్ ఉమ్మడి పాలమూరులో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన కరువైంది. గద్వాల– మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించగా నిరాశే మిగిలింది. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్ల ప్రతిపాదనలు అలాగే మిగిలిపోయాయి. ఉమ్మడి జిల్లా అలంపూర్ సమీపంలోని పుల్లూరు నుంచి నల్లగొండ వరకు నూతన జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వే సైతం నిర్వహించగా.. ఈసారి బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదు. చేనేత కార్మికులకు దన్ను.. మహాత్మగాంధీ గ్రామ్ స్వరాజ్, సమర్థ్ 2.0 కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉన్న మరమగ్గాలు, చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరనుంది. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా బ్రాండింగ్తోపాటు మార్కెట్ లింకేజీ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచనున్నారు. చదువు.. ఉపాధి విద్యాభివృద్ధిలో భాగంగా బాలికల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో బాలికల భాగస్వామ్యం పెంచడంతోపాటు విద్యాభివృద్ధి కోసం ఈ హాస్టళ్లను ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా బాలికలకు చదువుతోపాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను కల్పించనున్నారు. ● యువతకు చదువుతో పాటు నేరుగా ఉపాధి కల్పించే విధంగా నైపుణ్యాలను పెంచేందుకు ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, కంటెంట్ క్రియేషన్ ల్యాబ్లను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. సామాన్యులకు వ్యతిరేకం.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రంతోపాటు వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ప్రస్తావన కూడా లేదు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులు పెంచలేదు. నిరుద్యోగులు, నిత్యావసర ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు కనిపించలేదు. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ రాష్ట్రంపై నిర్లక్ష్యం.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రా న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు. పర్యాటకరంగ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దృష్టిపెట్టలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైల్వేతోపాటు జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి హైస్పీడ్ రైల్వే కారిడార్.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రైల్వే మార్గాన్ని హైస్పీడ్ రైల్వే కారిడార్గా మార్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు వేగాన్ని పుంజుకోనున్నాయి. పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా మార్చడంతోపాటు ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. తద్వారా వేగంగా చేరుకోవడంతో పాటు ఇతర రైల్వే నెట్వర్క్, రోడ్లపై రద్దీ భారం తగ్గనుంది. ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ ద్వారా ఉమ్మడి జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దక్కని జాతీయ హోదా.. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటనతో పాటు పనులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు అందించాలన్న డిమాండ్ ఏళ్లుగా వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర బడ్జెట్లో దీనిపై కనీస ప్రస్తావనకు నోచుకోలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు చేసే భారమంతా రాష్ట్రం మీదే పడింది. అలాగే ఉమ్మడి జిల్లాలో ఐదోశక్తి పీఠమైన అ లంపూర్ జోగుళాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద ప్రత్యేకంగా నిధులు అందుతాయని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా భంగపాటు తప్పలేదు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రస్తావన కరువు గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్లు, నూతన జాతీయ రహదారులకు తప్పని భంగపాటు హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైల్వే కారిడార్తో ప్రయోజనం ప్రతి జిల్లాలోనూ బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుతో మేలు -
‘మహాకేఫ్’ పునఃప్రారంభం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ జంక్షన్లో ఆదివారం ‘మహాకేఫ్’ను పునఃప్రారంభించారు. గతేడాది ఆగస్టు 18న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. అయితే హడావుడిగా హనుమాన్పురాకు చెందిన ఆర్పీ పద్మకు మెప్మా అధికారులు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె సరిగా నిర్వహించలేక పోవడంతో ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు వేరే వారికి కేటాయించాలని ఆదేశించారు. దీంతో గత నవంబర్ 21 నుంచి ‘మాహాకేఫ్’ను మూసివేయించారు. ఈ మొత్తం వ్యవహారంపై గత ఏడాది డిసెంబర్ 9న ‘సాక్షి’లో ‘ముచ్చటగా 3 నెలలకే..! జిల్లా కేంద్రంలో మూతబడిన మహాకేఫ్’ శీర్షికన కథనం ప్రచురితమైంది.స్పందించిన ఉన్నతాధికారులు చివరకు గత నెల 26న మరో ఆర్పీ వందనకు చెందిన గ్రూపునకు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘మహాకేఫ్’ను ఇప్పుడు తిరిగి తెరిచారు. దేవరకద్ర కోర్టుకు గెజిట్ విడుదల దేవరకద్ర: దేవరకద్రలో ఏర్పాటు చేసే జూనియర్ సివిల్ జడ్జి మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు సంబంధించి గెజిట్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కోర్టుకు సంబంధించి పరిపాలన అనుమతులు ఇస్తూ గెజిట్లో వెల్లడించారు. దేవరకద్ర కోర్టు పరిధిలో చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, దేవరకద్ర రెవెన్యూ మండలాలను చేర్చుతూ గత నెల 22న విడుదల చేసిన గెజిట్ నోట్లో పేర్కొన్నారు. అయితే కోర్టుకు సంబంధించిన గెజిట్ నోట్ శనివారం సాయంత్రం అందడంతో ఆదివారం ఈ విషయం ప్రకటించారు. కాగా.. దేవరకద్రలో కోర్టు ఏర్పాటు కోసం ఇప్పటికే భవనం సిద్ధం చేశారు. పాత మండల పరిషత్ కార్యాలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. కోర్టుకు కావాల్సిన గదులను సమకూర్చారు. గతంలోనే పలుమార్లు జిల్లా జడ్జిలు కోర్టు భవనాన్ని పరిశీలించి వెళ్లారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత కోర్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
పేలవంగా ఉంది..
కేంద్ర బడ్జెట్ పేలవంగా ఉంది. బడ్జెట్లో కీలక కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు కేటాయింపుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మహిళలు, రైతులు, యువతకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. మధ్య, దిగువ తరగతి వర్గాల కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహక చర్యలు తీసుకోలేదు. – లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ కార్పొరేట్కే మేలు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను భ్రమలో ముంచేలా ఉంది. కార్పొరేట్కు మేలు చేసే బడ్జెట్ ఇది. పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని మార్చి వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి కూలీలకు 125 పనిదినాలు కల్పిస్తామని ప్రగల్బాలు పలికి తీరా బడ్జెట్లో గతం కంటే తక్కువ కేటాయింపులు చేయడం చూస్తే పేదలపై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది. ప్రస్తుత బడ్జెట్ మొత్తంలో 28 శాతం అప్పులకే పోగా.. మిగతా వాటిలోనూ కార్పొరేట్కే అగ్రభాగం కేటాయించడం దారుణం. – రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి, మహబూబ్నగర్ పాలమూరుకు మొండిచేయి.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేవ లం మాటల గారడీ తప్పా సామాన్యుడికి, ముఖ్యంగా పాలమూరు ప్రాంతానికి జరిగిన మేలు శూన్యం. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్లో కూడా మొండిచేయి చూపారు.. ఈ ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తారని ఆశించిన జిల్లా ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. జిల్లా నుంచి ముంబయి, హైదరాబాద్ వంటి నగరాలకు జరుగుతున్న వలసలను ఆపేలా స్థానిక పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. బడ్జెట్లో యువతకు ఉద్యోగాల ఊసేలేదు. – సంజీవ్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కాంగ్రెస్ ప్రభు త్వం కక్షపూరితంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను వేధిస్తే రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఫోన్ టాంపరింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు చట్టవిరుద్ధంగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ గా వెళ్లి అంబేడ్కర్ చౌరస్తాలో భైఠాయించి నినాదాలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూ స్తుందన్నారు. హైకోర్టు నిబంధనల ప్రకారం ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేయాలని, పోలీసులు నిబంధన పక్కకు పెట్టి గోడకు నోటీసులు అంటించడం దుర్మార్గం అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించిన కేసీఆర్ను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పోలీస్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయవద్దని, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేసిందని, రెండేళ్ల తర్వాత మళ్లీ వస్తాం.. మీ తప్పుడు కేసులకు.. బెదిరింపులకు వెనక్కి తగ్గమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసులు, జైళ్లకు భయపడలేదని, కొట్లాడి తెలంగాణ సాధించిన వాళ్లమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పుర ఎన్నికల బరిలో దిగుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అలీ మస్కతి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రెహమాన్, నాయకులు గణేష్, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్, నవకాంత్, సాయిలు, సుధాకర్ పాల్గొన్నారు. -
పుర బరిలో భార్యాభర్తలు
కల్వకుర్తి టౌన్: ఒకే ఇంటి నుంచి ఇద్దరికి సామాన్యంగా గుర్తింపు పొందిన పార్టీలు టికెట్లను కేటాయియించటం అసాధారణం. అలాంటిది మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులకు భార్యాభర్త ఇద్దరూ పోటీలో ఉన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో 7వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బృంగి రత్నమాల, ఆమె భర్త ఆనంద్కుమార్ 13 వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. గతంలో భర్త 2014 కౌన్సిలర్గా ఉన్నారు. ఎలాగైనా ఇద్దరూ గెలిచి కౌన్సిల్లో ఉండి ప్రజలు తమవంతు సేవ చేస్తాం అంటున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేయటం చర్చనీయాంశంగా మారింది. -
పరిశీలన తర్వాత మారిన లెక్క
● మొత్తం నామినేషన్లు 781.. అభ్యర్థులు మాత్రం 516 మంది ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో 6 నామినేషన్ల తిరస్కరణ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను 781 నామినేషన్లు వచ్చినట్లు ఆదివారం ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇందులో ముందుగా చెప్పినట్లు 521కి బదులుగా 516 మందే అభ్యర్థులు ఉన్నట్లు లెక్క తేల్చారు. పార్టీల వారీగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి 216, బీఆర్ఎస్ నుంచి 99, బీజేపీ నుంచి 78, ఇండిపెండెంట్లు 64, ఇతరులు 25 మంది, ఎంఐఎం నుంచి 23, బీఎస్పీ నుంచి 7, ఆప్ నుంచి 2, సీపీఎం నుంచి 2 ఉన్నారు. ఇక డివిజన్ నంబర్ 14 నుంచి మాజీ కౌన్సిలర్ మునీరుద్దీన్ వేసిన నామినేషన్తో పాటు వివిధ డివిజన్ల నుంచి మరికొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ వేసిన వాటిలో మరో ఐదు ఇలా మొత్తం 6 తిరస్కరణకు గురయ్యాయి. చివరకు వీటికి సంబంధించిన నివేదికను జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు. -
జములమ్మా.. సల్లంగ చూడమ్మా..
గద్వాలన్యూటౌన్: డోళ్ల సప్పుళ్లు.. వాయిద్యాలు.. భక్తుల పూనకాల మధ్య.. కొంగుబంగారంగా విరాజిల్లుతున్న జములమ్మ అమ్మవారి పౌర్ణమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు 60వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సల్లంగా.. చూడమ్మ జములమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. వైభవంగా వేడుకలు పౌర్ణమి వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున 4గంటలకు 108 కలశాలతో అమ్మవారికి పూజలు జరిపించారు. పంచామృతా భిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో 5గంటలకు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3:30 గంటల నుంచే క్యూలైన్లో నిల్చున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు, ఏపీ, కర్ణాటక, మహరాష్ట్రల నుంచి దాదాపు 60వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మధ్య్యాహ్నం 12గంటల ప్రాంతంలో భక్తుల రద్దీ పెరిగింది. డప్పుల మోతలు...డోళ్ల సప్పుళ్లతో ఆలయ ప్రాంగణానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. కోళ్లు, మేకపోతులు అర్పించారు. సాయంత్రం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో ఉంచి ఆలయ ప్రాంగణ పరిసరాల్లో పల్లకీసేవ చేశారు. పకడ్బందీ ఏర్పాట్లు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈఓ పురందర్కుమార్, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా పర్యవేక్షించారు. పోలీస్, ఆలయ సిబ్బంది క్యూలైన్లో తోపులాటలు జరగకుండా నియంత్రించారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. తాగునీటి వసతి కల్పించారు. ఎండవేడిమిని తట్టుకోలేక చాలామంది భక్తులు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళ కింద సేదతీరడం కన్పించింది. పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అమ్మవారి పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దంపతులు తెల్లవారుజామున ఆలయాన్ని సందర్శించారు. అధికారులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు జరిపించారు. మాజీ జెడ్పీ చైర్మన్ సరిత ఆలయాన్ని సందర్శించారు. అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు జరిపించారు. వైభవంగా మాఘపౌర్ణమి వేడుకలు అమ్మవారిని దర్శించుకున్న 60 వేల మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు ఘనంగా పల్లకీసేవ -
మట్టి దిబ్బలు పడి బాలుడు దుర్మరణం
పాన్గల్: మట్టి దిబ్బలు మీద పడి బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏదుల మండలం గుండ్యా వాల్యా నాయక్ తండాకు చెందిన లావుడ్యచంద్రు, లాలమ్మల కుమారుడు లావుడ్యరాముడు (15) కూలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇదే తండాకు చెందిన కాట్రావత్మోహన్ మట్టి తీసుకొచ్చేందుకు లావుడ్యరాముడు, లావుడ్యప్రసాద్, కాట్రావత్ లాలు నలుగురు కలిసి గత నెల 31న కిష్టాపూర్ గ్రామ శివారులో గల ముత్తదోన గట్టు దగ్గర వెళ్లారు. మట్టి తవ్వుతుండగా మట్టి పెడలు పడి లావుడ్యరాముడుకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఆదివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
డిపాజిట్ అంటే తెలుసా?
కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్/కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్నికల సంఘం కొన్ని అర్హతలను నిర్దేశించింది. అభ్యర్థుల నుంచి నామినేషన్ వేసేందుకు కొంత రుసుం వసూలు చేస్తుంది. నిర్దేశిత ఓట్లు వచ్చిన వారికి ఆ రుసుం తిరిగి చెల్లిస్తారు. దీనినే డిపాజిట్ అని పిలుస్తారు. ● మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరికి చెందిన అభ్యర్థులు రూ.1,250, కార్పొరేషన్లో రూ.2,500, ఇతరులు మున్సిపాలిటీలో రూ.2,500, కార్పొరేషన్లో రూ.5,000 చొప్పున నామినేషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ● ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీస ఓట్లు వస్తేనే డిపాజిట్ తిరిగిస్తారు. ● డిపాజిట్ తిరిగి పొందాలంటే ఎన్నికలో నమోదైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు అభ్యర్థి పొందాలి. అంటే 100కు దాదాపుగా 17 ఓట్లు పొందాల్సి ఉంటుంది. -
మున్సిపాలిటీల్లో చెక్ పవర్ కమిషనర్లదే..!
పాలమూరు: ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విధులు ఎంత కీలకంగా ఉంటయో అదే స్థాయిలో కమిషనర్కు రెట్టింపు అధికారులు ఉంటాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చెక్పవర్ కమిషనర్కు మాత్రమే వర్తిసుంది. వ్యక్తులు లేదా సంస్థలకు చెక్కులు ఇవ్వాలంటే ఎందుకు చెల్లింపులు జరపాలని ముందుగా గుర్తించాలి. ఉదాహరణకు ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో రూ.లక్షతో సామగ్రి కొనుగోలు లేదా అభివృద్ధి పనులు చేపట్టిన బిల్లులను సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి.. కమిషనర్కు సమర్పించాలి. వాటి వివరాలను కమిషనర్ సరి చూసుకోవాలి. వీటిని కమిషనర్ ధ్రువీకరిస్తూ పాలకవర్గ(కౌన్సిల్) అనుమతి పొందాలి. అందుకు సంబంధించిన ఫైల్పై మున్సిపల్ చైర్మన్ లేదా చైర్పర్సన్ లేదా కార్పొరేషన్ మేయర్ సంతకం తీసుకోవాలి. అనంతరం ఆయా వివరాలు క్యాష్బుక్లో నమోదయ్యాక కమిషనర్ చెక్కు జారీ చేస్తారు. చెక్కు వివరాలు ఏ వ్యక్తికి ఎందుకిస్తున్నారో క్యాష్ బుక్లో నమోదు చేసే బాధ్యతను సదరు కమిషనర్, అకౌంటెంట్ చూసుకోవాలి. ఒకవేళ పాలకవర్గ గడువు ముగిస్తే ప్రత్యేకాధికారి అనుమతి తీసుకొని చెక్కులు జారీ చేస్తారు. దీనిలో ఏ నిబంధనను ఉల్లంఘించినా నేరంగా పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ బిల్లులు, తప్పుడు సమాచారంతో చెక్కులు జారీచేస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెట్టి సొమ్మును స్వాధీన చేసుకునే ఆస్కారముంది. -
జనసంద్రం.. మన్యంకొండ
● గోవింద నామస్మరణతో మార్మోగిన గిరులు ● ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న లక్ష మంది భక్తులు ● రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం బుధవారం భక్తజన సందోహంతో పులకించిపోయింది. గోవింద.. గోవింద అనే నామస్మరణతో ఆలయ గిరులు మార్మోగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండో తిరుపతిగా పేరుగాంచిన పుణ్యక్షేత్రానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున జరగనున్న ప్రధాన ఘట్టమైన రథోత్సవంలో పాల్గొనేందుకు ఒక్కరోజే సుమారు లక్ష మందికిపైగా భక్తులు వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భారీగా తరలివచ్చిన జనంతో మన్యంకొండ గుట్టలు జనసంద్రంగా మారాయి. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరుగాంచిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా దర్శించుకుంటే తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి.. మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలు తీరుతాయని నమ్మే భక్తజనులు పెద్దఎత్తున తరలివచ్చి ఎప్పుడెప్పుడు మహోన్నతమైన రథోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించాలని ఎదురుచూస్తున్నారు. కుటుంబాలతో వచ్చిన భక్తులు, పిల్లల చేతుల్లో లడ్డూలు, తలపై పూలమాలలతో స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. కొందరు భక్తులు మెట్లపై మోకాళ్ల మీద నడుచుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించి, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో పోలీసు బందోబస్తు పెంచడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు. ఆర్టీసీ పలు డిపోల నుంచి మన్యంకొండకు ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన భక్తులు సులభంగా ఆలయానికి చేరుకున్నారు. మహబూబ్నగర్– రాయిచూర్ ప్రధాన రహదారి పక్కన స్వామివారి ముఖద్వారం నుంచి ఆలయం వరకు భక్తుల రాకపోకలతో సందడి నెలకొంది. భక్తుల రాక దృష్ట్యా వసతి సౌకర్యాలు మెరుగుపర్చారు. జాతర ప్రాంగణంలో ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ట్యాంకులకు ముందుగానే నీరు నిల్వ ఉంచుతున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మన్యంకొండ దేవస్థానంతోపాటు చుట్టూ కొండలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో కొండలన్నీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మన్యంకొండ క్షేత్రం భక్తిపారవశంతో పులకించిపోయింది. -
నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ
● నేడు అమ్మవారి సన్నిధిలో పౌర్ణమి వేడుకలు ● శోభాయమానంగా ఆలయ సముదాయం ముస్తాబు ● 50వేల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ● అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు గద్వాలన్యూటౌన్: నడిగడ్డ ప్రజల ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారం.. శ్రీజములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలకగట్టమైన పౌర్ణమి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. దాదాపు 50 వేల మంది వేడుకలకు హాజరై అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా. పౌర్ణమి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పౌర్ణమి వేడుకలు జములమ్మ సన్నిధిలో పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 4గంటలకు 108 కళశాలతో అమ్మవారికి అభిషేకం జరిపిస్తారు. 5గంటలకు విశేష పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి అలంకరణ, తదనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. పౌర్ణమి వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచేకాక ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 50వేల మంది దాక భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకోనున్నారు. పోలీస్ బందోబస్తు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ శ్రీను పర్యవేక్షణలో నలుగురు ఎస్ఐలు, 55మంది ఏఎస్ఐ, కానిస్టేబుల్స్, హోంగార్డులు బందోబస్తు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతంలో మూడు ఔట్పోస్టులు ఏర్పాటు చేశారు. దొంగతనాలు జరగకుండా ఆలయ సముదాయం నుంచి మొయిన్రోడ్డు వద్ద ఉన్న ఆర్చి వరకు పలుచోట్ల సీసీ కెమారాలు ఏర్పాటు చేశారు. ఇల్కల్ టు జమ్మిచేడు నడిగడ్డలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించే పౌర్ణమి వేడుకలకు కర్ణాటక రాష్ట్రం ఇల్కల్ నుంచి జములమ్మ పాదయాత్ర మండలి సభ్యులు ఏటా 250కి.మీ. పాదయాత్రగా జములమ్మ ఆలయానికి వస్తారు. 12ఏళ్ల నుంచి ఈ తంతు సాగుతోంది. 13వసారి కూడా ఇల్కల్ నుంచి 120మంది భక్తులు ఏడురోజులు పాదయాత్రతో శనివారం ఉదయం 11గంటలకు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. భక్తులకు ఈఓ పురందర్కుమార్, సిబ్బంది స్వాగతం పలికారు. వసతి కల్పించి పండ్లు అందించారు. విద్యుద్దీపాల వెలుగులో జములమ్మ అమ్మవారి ఆలయం ఏర్పాట్లు పూర్తి చేశాం పౌర్ణమి వేడుకలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. తాగునీరు, అందుబాటులో వైద్యసేవలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. క్యూలైన్ల వద్ద తోపులాట జరగకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులు దేవాదాయశాఖ సిబ్బందికి సహకరించాలి. – పురందర్ కుమార్, ఆలయ ఈఓ -
ఉత్తరాఖండ్పై హైదరాబాద్ విజయం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన టర్ఫ్ పిచ్పై శనివారం మొదటిసారిగా జాతీయస్థాయి మ్యాచ్ నిర్వహించారు. హైదరాబాద్–ఉత్తరాఖండ్ జట్ల మధ్య ఇన్విటేషన్ వన్డే మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఇందులో హైదరాబాద్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ నిర్ణీత 40 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. జట్టులో నీలం భరద్వాజ్ 71, నందిని కౌషిక్ 49 పరుగులు, ఇంద్రాని రాయ్ 39 పరుగులు, కంచన్ పరిహర్ 29 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో యశశ్రీ, సాక్షిరావు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మహిళలు 38.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. జట్టులో ఓపెనర్ సంధ్యగోర అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 98 (89 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. వంకపూజ (35), ఎం.సాక్షిరావు (28) రాణించారు. ● జిల్లాకేంద్రంలో తొలిసారిగా జరుగుతున్న జాతీయస్థాయి మ్యాచ్ను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, హెచ్సీఏ ప్రతినిధి బస్వరాజ్ తదితరులు తిలకించారు. ఇరు జట్ల క్రికెటర్లను పరిచయం చేసుకొని వారిని ఘనంగా సన్మానం చేశారు. మ్యాచ్కు నగరంలోని పలు విద్యాసంస్థలు, జేపీఎన్సీఈ కళాశాలకు చెందిన విద్యార్థినులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ వి.మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, సభ్యుడు క్రిష్ణమూర్తి, కోచ్లు గోపాలకృష్ణ, మన్నాన్, ముఖ్తార్ అలీ, నారాయణపేట రమణ, సీనియర్ క్రీడాకారులు ఆబిద్, రంజిత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ● ఎండీసీఏలో ఉత్సాహంగాహైదరాబాద్–ఉత్తరాఖండ్ మ్యాచ్ ● మ్యాచ్ను తిలకించిన రాష్ట్ర ప్రభుత్వ క్రీడలసలహాదారు ఏపీ జితేందర్రెడ్డి -
ఆసియా లాక్రోస్ క్రీడలకు జిల్లా క్రీడాకారుడు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలోని మూసాపేట మండలం వేములకి చెందిన అనుదీప్రెడ్డి లాక్రోస్ క్రీడల్లో విశేష ప్రతిభ చాటుతున్నాడు. ఈ క్రీడలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నాడు. ఇప్పటికే అనుదీప్రెడ్డి నాలుగుసార్లు జాతీయస్థాయి లాక్రోస్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2024 సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగిన లాక్రోస్ ఫెడరేషన్ కప్, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో జరిగిన సీనియర్ నేషనల్ లాక్రోస్ చాంపియన్షిప్లో, మేలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగిన నేషనల్ లాక్రోస్ చాంపియన్షిప్లో, డిసెంబర్లో జమ్ముకాశ్మీర్ రాష్ట్రం కాట్రాలో జరిగిన ఫెడరేషన్ కప్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడాడు. ● రెండోసారి అంతర్జాతీయ లాక్రోస్ పోటీలకు అనుదీప్రెడ్డి ఎంపికయ్యాడు. గత ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు జపాన్ దేశం ఒకినొవాలో జరిగిన లాక్రోస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆదివారం నుంచి సౌదీ అరేబియా రియాద్లో జరగనున్న ఏషియన్ లాక్రోస్ గేమ్స్లో భారత జట్టుకు అనుదీప్రెడ్డి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మహబూబ్నగర్ గెలుపు మహబూబ్నగర్ క్రీడలు: సంగారెడ్డిలో శనివారం జరిగిన అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నమెంట్లో మహబూబ్నగర్ జట్టు 12 పరుగుల తేడాతో మెదక్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 49.4 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో బీరేంద్ర 125 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 84 పరుగులు, కేతన్కుమార్ 98 బంతుల్లో 7 ఫోర్లతో 73 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన మెదక్ జట్టు 45.4 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో రహెమత్ 81, హర్ష్దీప్ 60 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లు అభినవ్ 4, వంశీగౌడ్ 2 వికెట్లు తీశారు. జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సమోసాలో పంచ్ పిన్నులు బిజినేపల్లి: మండల కేంద్రంలోని ఒక స్వీటు దుకాణంలో సమోసా తింటున్న వ్యక్తికి అందులో పంచ్ పిన్ను కన్పించింది. ఈ ఘటన గురువారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. ఉమ్యాజీ స్వీట్హౌస్లో ఒక వ్యక్తి సమోసా కొని తింటుండగా అందులో పంచ్ పిన్ను కన్పించింది. ఇదేమిటని ప్రశ్నించిన సదరు యాజమాని విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మండల కేంద్రంలోని 2025 జూలైలో శ్రీలక్ష్మి బెంగళూర్ అయ్యాంగార్ బేకరిలో కూడా బ్రెడ్కి బూజు పట్టడం స్థానికంగా కలకలం రేగింది. వినియోగదారు అప్పటి ఆహార భద్రత అధికారి నీలిమకు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా తనిఖీలు చేసి వెళ్లింది. సదరు వినియోగదారు తన ఫిర్యాదు ఏమైందని ఆ అధికారి నీలిమకు వందల సంఖ్యలో ఫోన్లు, మెసెజ్లు చేసినా స్పందించలేదు. అధికారి స్పందించడం లేదని కలెక్టర్ స్థాయిలో అధికారులకు సమస్యను వివరించినా.. ఆ అధికారి వారికి కూడా స్పందించలేదు. ఈ సమస్యల విషయమై ప్రస్తుత అధికారి శ్రీలత వివరణ కోరగా.. ఈ రెండు విషయాలు ఇప్పుడే తన దృష్టికి వచ్చాయని, త్వరలోనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. భారత జట్టుకు కెప్టెన్గా అనుదీప్రెడ్డి -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నవాబుపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స ిపొందుతున్న వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని చౌటపల్లికి చెందిన ఈడిగి ఆంజనేయులు(43) శుక్రవారం సొంత పనిమీద మండల కేంద్రానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. లోకిరేవు సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడి గాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్నవారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స ిపొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ విషయంలో మృతుడి భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ వివరించాడు. ● ఆంజనేయులు మృతిచెందిన వెంటనే కుటుంబ సభ్యులు మృతుడి కళ్లను సరోజిని కంటి ఆస్పత్రికి దానం చేశారు. దీనికి సంబంధించి శనివారం వారు ఆస్పత్రి సిబ్బందికి అంగీకారప్రతం అందజేశారు. కాగా, మరణం అనంతరం ఇతరులకు చూపునిస్తున్న మృతుడి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. -
వందశాతం స్కాలర్షిప్ మంజూరుకు చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/జడ్చర్ల: జిల్లాలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు వందశాతం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కార్యదర్శి బుద్ద ప్రకాశ్జ్యోతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయితో సమీక్షించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మంజూరుకు ఎస్సీ వసతిగృహాలు, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు సంఖ్య ఎంత.. ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు.. ఎంతమందికి మంజూరు చేశారు. ఎంతమంది అకౌంట్లో డబ్బులు జమ చేశారనే విషయాలపై ఆరాతీశారు. వసతిగృహ సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. అలాగే జడ్చర్లలోని ఎస్సీ గురుకులం, బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి విద్యాప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై సమీక్షించారు. 5వ తరగతి గదిని పరిశీలించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. వెల్నెస్ హెల్త్ సెంటర్, భోజనశాల, వసతిగృహాలు, క్రీడామైదానం, తాగునీటికి ఆర్ఓ ప్లాంట్ సదుపాయాలపై ఆరా తీశారు. అలాగే చిట్టింబోయిన్పల్లి గురుకులం 25ఏళ్లు పూర్తిచేసుకోవడాన్ని ఓ మైలురాయిగా గుర్తించాలని, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్స్, దుప్పట్లు, టవల్స్, కాస్మెటిక్స్ అవసరాలపై ఆరాతీశారు. 640మంది విద్యార్థులకు 32మంది సిబ్బంది ఉండడంపై చర్చించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నవీన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని సునీత, డీఈఓ ప్రవీణ్ కుమార్, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సుదర్శన్, ఎస్సీ వెల్ఫేర్ అదనపు కార్యదర్శి గీత, జాయింట్ సెక్రటరీలు సక్రునాయక్, శర్మ శ్రీనివాస్, జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కార్యదర్శి బుద్ద ప్రకాశ్జ్యోతి -
పక్కా నిఘా..
● మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారుల నియామకం ● జిల్లా ఎన్నికల అథారిటీగా కలెక్టర్ ● ఎన్నికల కోడ్ అమలుకు నిఘా బృందాలు వ్యయ పరిశీలకులు మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయ పరిశీలనకు ఒక్కో మున్సిపాలిటీకి సహాయ వ్యయ పరిశీలకులను నియమిస్తారు. పెద్ద మున్సిపాలిటీలకు ఇద్దరు చొప్పున నియమించే అవకాశం ఉంది. మండల గణాంకాల అధికారులు అభ్యర్థులు చేసే వ్యయాన్ని లెక్కిస్తారు. అభ్యర్థులు సమర్పించిన లెక్కలు, వీడియో బృందాలు సమర్పించిన లెక్కలను పరిశీలిస్తారు. ఆడిట్ అధికారులను జిల్లాకు ఒక వ్యయ పరిశీలకుడిని నియమించారు. అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు విధులు, బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించిన హ్యాండ్బుక్ను ఆన్లైన్లో విడుదల చేసింది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలకు పరిశీలకుల నియామకం పూర్తి చేసింది. ఆయా జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణ, కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు అధికారుల నియామకం పూర్తి చేసింది. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిఘా బృందాలను పటిష్టం చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా ప్రతి జిల్లాకు ఇతర ఐఏఎస్ స్థాయి అఽధికారులను నియమించారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, వారి విధులు తెలుసుకుందాం. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ జిల్లాలో జరిగే ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. సజావుగా ఎన్నికలు జరిపించడంలో కలెక్టరే కీలకం. సాధారణ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ చేపడుతారు. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. నోడల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కమిటీల నియామకం, ఆర్వోలు, ఏఆర్వోలు, సిబ్బంది నియామకం వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. సహాయ ఎన్నికల అధికారులైన కమిషనర్ పంపిన ప్రతిపాదనలు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తారు. అదనపు జిల్లా ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ అదనపు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తారు. డిప్యూటీ ఎన్నికల అధికారి జిల్లా ఉప ఎన్నికల అధికారిగా ఆర్డీఓలు ఉంటారు. తిరస్కరించిన నామినేషన్ పత్రాలపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు డిప్యూటీ ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకుంటే విచారించి పరిష్కరిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్ను తిరస్కరించడం లేదా ఆమోదించే అధికారం వీరికి ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన విభాగాల వారీగా జిల్లాస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తారు. వీరు సిబ్బంది శిక్షణ, సౌకర్యాల కల్పన, మానవ వనరుల సమీకరణ, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లుకు విభాగాల వారీగా అధికారులను నియమిస్తారు. ఎన్నికల్లో లోటుపాట్లు జరుగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీరికి అప్పగించారు. కలెక్టర్ పర్యవేక్షణలో వీరు పనిచేస్తారు. సహాయ ఎన్నికల అధికారులు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల జాబితా తయారీతోపాటు ముసాయిదా, తుది జాబితాను విడుదల చేస్తారు. అభ్యంతరాలు స్వీరించి పరిష్కరిస్తారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, సౌకర్యాల కల్పన చూడాల్సింది కూడా వీరే. సిబ్బంది శిక్షణ, సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్రూం ఏర్పాట్లు చూడాలి. నామినేషన్ల స్వీకరణకు కేంద్రాల ఎంపిక చేయాలి. ఆర్వోలు.. రిటర్నింగ్ అధికారులు(ఆర్వో)ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నియమిస్తారు. మూడు వార్డులకు ఒక ఆర్వో ఉంటారు. మూడు వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు వీరిదే పూర్తి బాధ్యత. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, తిరస్కరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు చేపట్టి వీరే ఫలితాలు ప్రకటిస్తారు. ఏఆర్వోలు.. రిటర్నింగ్ అధికారికి వీరు సహాయంగా ఉంటారు. వీరు కాకుండా రూట్ అధికారులు, జోనల్ అధికారులు ఉంటారు. వీరంతా పోలింగ్ నిర్వహణ, సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలింపు, తిరిగి వారిని రిసెప్షన్ కేంద్రాలకు చేర్చి స్ట్రాంగ్రూంలో భద్రపరిచే వరకు వీరిదే బాధ్యత. స్టాటిక్ సర్వేలైన్స్ బృందం: మున్సిపల్ సరిహద్దులో ఉన్న చెక్పోస్టుల వద్ద వాహనాల తనఖీ చేపడుతారు. ఇందులో ఆర్ఐ, ఆ పైస్థాయి అధికారి, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. డబ్బులు, మద్యం అక్రమ రవాణాపై దృష్టి పెడతారు. ఒక్కో మున్సిపాలిటీకి స్టాటిక్ సర్వేలైన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద మున్సిపాలిటీలో రెండు ఉంటాయి. అందులో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారి, పోలీస్ అధికారిని నియమిస్తారు. వీడియోగ్రాఫర్ను ఆయా మున్సిపల్ కమిషనర్ల స్థానికంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ : డబ్బు, మద్యం పంపిణీ, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. పట్టుబడితే సహాయ ఎన్నికల అధికారికి నివేదించి, కేసు నమోదు చేస్తారు. వీరి వెంట వీడియోగ్రాఫర్ ఉంటారు. మున్సిపాలిటీ విస్తీర్ణం మేరకు ఏర్పాటు చేస్తారు. వీడియో సర్వేలైన్స్ బృందం : ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. ప్రవర్తన నియామవళి ఉల్లంఘన, వాహనాలు, పొల్గొన్న ప్రజలు, నాయకులు, అభ్యర్థుల ప్రసంగాలు, అక్రమాలను చిత్రీకరిస్తారు. వీడియో వ్యూయింగ్ బృందం వీడియో సర్వేలైన్స్ బృందాలు తీసిన వీడియోను వ్యూయింగ్ బృందం పరిశీలిస్తుంది. సభలు, ర్యాలీలు, ప్రచారాల్లో ఎంత మంది పాల్గొన్నారు. జెండాలు, వాహనాల వినియోగం, ఖర్చు లెక్కించి వ్యయ పరిశీలకుడికి అందజేస్తారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ప్రచారాల్లో అభ్యర్థులు చేసే ఖర్చుల పరిశీలన, లెక్కింపు కోసం జిల్లా ఎన్నికల అధికారులు కమిటీలు వేస్తారు. అధికారులకు వచ్చే ఫిర్యాదుల మేరకు తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లను ఒక్కో మున్సిపాలిటీలో విడివిడిగా ఏర్పాటు చేస్తారు. బృందాల్లో ఒక అధికారి, ఒక పోలీస్ అధికారితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. వీటిని వీడియోల్లో చిత్రీకరిస్తారు. ఆయా బృందాలకు ఒక వీడియోగ్రాఫర్ను స్థానిక సహాయ ఎన్నికల అధికారులు నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రకటన జారీ నాటి నుంచి ఈ బృందాలు కార్యాచరణ చేపడుతాయి. -
ఉచిత న్యాయ సేవలపైఅవగాహన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గ్రామీణుల్లో న్యాయ అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, జడ్జి డి.ఇందిర అన్నారు. శనివారం మన్యంకొండ జాతరలో లీగల్ సర్వీసెస్ స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సమస్యలపై మార్గనిర్దేశం చేయడానికి పారా లీగల్ వలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. కాగా బాధితులకు ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల హక్కులు, కుటుంబ సమస్యలు, భూమి వివాదాలు, గృహహింస, పోక్సో చట్టాలు తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ ఢిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీంద్రనాయక్, ప్రతినిధులు ఎం.యోగేశ్వరావు, మల్లారెడ్డి, శివరాజ్ పాల్గొన్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టాలి
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. నగరంలో వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శనివారం రాత్రి ఎస్పీ పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లు అవసరం అవుతాయని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు కీలకంగా వ్యవహరించాలన్నారు. నగరంతో పాటు ఇతర రెండు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటికి అనుగుణంగా బందోబస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పటి నుంచే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేన నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ముందు నుంచే గస్తీ పెంచాలని, అ సాంఘిక కార్యకలాపాలపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా సిబ్బంది కేటాయింపులు, వాహనాల తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టడం వంటి చర్యలు ముందుగానే చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి జరగకుండా గమనించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్పయ్య, ఎస్ఐ శీనయ్య పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎన్నికల నిబంధనల మేరకు అర్హత గల ఓటర్ల నుంచి పోస్టల్ బ్యాలెట్ జారీకి దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న వ్యక్తులు (పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, పోలీసులు తదితరులు) పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ఈ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పూర్తి చేసిన వీటిని తమ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదు మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో యూరియా సరఫరా యాప్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తెలిపారు. మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా ఏ విధంగా రైతులకు సరఫరా చేస్తున్నారో పరిశీలించారు. జిల్లాలో యూరియా ఎలాంటి కొరత లేదని, ప్రస్తుతం 15,825 బ్యాగుల యూరియా సరఫరాకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 58,288 మంది రైతులకు 2,05,222 యూరియా బస్తాలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట ఏడీఏ రాంపాల్, ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. 450 పోలీస్ సిబ్బందితో బందోబస్తు మహబూబ్నగర్ క్రైం: మన్యంకొండ జాతర కోసం మొత్తం 450 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ ఎన్బీ రత్నం వెల్లడించారు. మన్యంకొండ దగ్గర శనివారం బందోబస్తు ఏర్పాట్లను ఏఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రథోత్సవంతో పాటు జాతరలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక అదనపు ఎస్పీతో పాటు ఇద్దరూ డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 75 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుల్స్, 250 కానిస్టేబుల్స్, 60 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా క్యూలైన్ల నిర్వహణ, ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం రాకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు జేబు దొంగతనాలు లేకుండా, ఇతర అవాంచనీయ ఘటనలు జరగకుండా మఫ్టీలో బందోబస్తుతో పాటు నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేరుశనగ @ రూ.10,521 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్కు శనివారం 3,311 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా క్వింటా గరిష్టంగా రూ.10,521, కనిష్టంగా రూ.9586 ధరలు లభించాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ రూ.2,450, పత్తి గరిష్టంగా రూ.7,001, కనిష్టంగా రూ.5,800, కందులుగరిష్టంగా రూ. 8,210, కనిష్టంగా రూ.5,239, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,941, కనిష్టంగా రూ.1,711, మినుములు గరిష్టంగా రూ.8,301, పెబ్బర్లు రూ.6,269 ధరలు లభించాయి. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
పాలమూరు/మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) పూర్తయింది. మొత్తం 60 డివిజన్లకు గాను మూడు రోజుల్లో 781 నామినేషన్లు దాఖలు కాగా... ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల సమక్షంలోనే ఆయా డివిజన్ల వారీగా నామినేషన్లను ఎన్నికల అధికారులు (ఆర్ఓలు) క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. సాయంత్రం ఆరు గంటల వరకే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయినా.. ఆన్లైన్ నమోదులో బాగా ఆలస్యమైంది. వాస్తవానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారికంగా ప్రకటించాల్సిన మున్సిపల్ అధికారులు తాత్సారం చేశారు. చివరకు రాత్రి 11 గంటల తర్వాతే లెక్కలు తేల్చినా పార్టీల వారీగా పూర్తి వివరాలు ఇవ్వలేకపోయారు. కేవలం 521 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నట్లు మాత్రమే వెల్లడించారు. దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులకు 53 మందికి సంబంధించి 96 నామినేషన్లు, భూత్పూర్ మున్సిపాలిటీ 10 వార్డులకు 69 మంది అభ్యర్థులకు సంబంధించిన 96 నామినేషన్లు రాగా.. అన్నింటికి ఆమోదం తెలిపారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఒక్కో అభ్యర్థికి సంబంధించిన పరిశీలనను పది నిమిషాల్లో పూర్తి చేశారు. ప్రధాన ముఖద్వారం దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి అభ్యర్థితో పాటు ఒక ప్రతిపాదకుడిని మాత్రమే లోపలికి అనుమతించారు. ప్రక్రియను జిల్లా జనరల్ పరిశీలకురాలు కాత్యాయనిదేవి కమిషనర్ రామాంజులరెడ్డితో కలిసి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడారు. ఎస్పీ డి.జానకి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ దగ్గర ఏర్పాటు చేసిన బందోబస్తును తనిఖీ చేశారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఆరు తిరస్కరణ 60 డివిజన్లలో 521 మంది నామినేషన్లు ఒకే.. 49వ డివిజన్లో అభ్యంతరాలు.. కాసేపు ఉద్రిక్తం ప్రక్రియ పూర్తయిన 5 గంటల తర్వాతే అధికారిక ప్రకటన దేవరకద్ర, భూత్పూర్లో అన్నింటికీ ఆమోదం -
ఈసారైనా.. పట్టాలెక్కేనా?!
సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈసారైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయింపులు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లకు ఈసారి బడ్జెట్లో నిధులు మంజూరవుతాయన్న ఆశలు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు కొత్త రైల్వేలైన్లకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ప్రతిసారి కొత్త రైల్వేలైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం.. సర్వేలకే పరిమితం చేస్తుండటం నిరాశ కలిగిస్తోంది. కానీ, ఈసారి బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి. 30 ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే.. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ వరకు 87 కి.మీ., మేర రైల్వే లైన్ కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఐదుసార్లు సర్వే పూర్తిచేసినా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు మంజూరుకావడం లేదు. ● గద్వాల– డోర్నకల్ లైన్కు 20 ఏళ్ల కిందట రూ.190 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడుసార్లు సర్వే పనులు పూర్తిచేసినా.. బడ్జెట్లో మాత్రం కేటాయింపులు దక్కడం లేదు. ● కొత్తగా అచ్చంపేట– మహబూబ్నగర్– తాండూరు మార్గంలో సుమారు 180 కి.మీ., కొత్త రైల్వేలైన్ కోసం రూ.360 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే నిధులు కేటాయించకపోవడంతో ఆ ఆమోదం ప్రతిపాదనలకే పరిమితమైంది. ● గద్వాల– వనపర్తి– నాగర్కర్నూల్– గుంటూరులోని మాచర్ల వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఈ ఊసే కనిపించడం లేదు. ఏళ్లుగా పెండింగ్లోనే గద్వాల–మాచర్ల రైల్వేలైన్ ఇంకా ప్రారంభం కాని మహబూబ్నగర్– డోన్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ నేటి కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు మహబూబ్నగర్– డోన్ రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం మూడేళ్ల కింద కేంద్రం రూ.60 కోట్లు కేటాయించింది. అయితే ఈ మేరకు పనులు పూర్తికాలేదు. మేడ్చల్– ముద్ఖేడ్, మహబూబ్నగర్– డోన్ సెక్షన్ల మధ్య విద్యుద్దీకరణ కోసం మొత్తం రూ.122.81 కోట్లు అవసరమని అంచనా వేసినా, ఇందుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ మార్గంలో రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు బైపాస్ లైన్, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది. వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి కోసం ఎలాంటి పరిశ్రమలు లేక ఇక్కడి నుంచి పనికోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులతోపాటు కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉంది. -
4న పాలమూరుకు నితిన్ నబీన్
● ఎంవీఎస్ కళాశాలలో కార్యకర్తలసమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ● ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఫిబ్రవరి 4వ తేదీన మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి జిల్లా బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరవుతున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని బీజేపీ నేతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు అది కూడా పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, బూత్ కమిటీల సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అన్ని రకాల మోర్చా అధ్యక్షులు ఇతర కార్యవర్గం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటుందని యువత అధికంగా కమలం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతుందన్నారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. -
హనుమత్ వాహనంపై వేంకటేశ్వరుడు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్ వాహన సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామచ్చరణల మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూల అలంకరణల మధ్య స్వామివారు హనుమత్ వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. అలాగే ప్రభోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవను చూసి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. -
తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. అయినా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం ఆశావహులకు పరీక్షలా మారింది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిగా, బీజేపీ పలు డివిజన్లకు అభ్యర్థులను ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో చివరి రోజు ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు అధిక సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు పోటెత్తారు. అనిశ్చితి, ఆందోళనల మధ్యే నామినేషన్ పత్రాలు సమర్పించారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అందరూ రెండు సెట్లు (పార్టీ తరఫున, స్వతంత్రంగా) దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. భూత్పూర్: 10 వార్డులు.. 101 నామినేషన్లు ఈ మున్సిపాలిటీలో మొత్తం పది వార్డులు ఉన్నాయి. మొత్తం 101 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 29 మంది, బీఆర్ఎస్ నుంచి 27 మంది, బీజేపీ నుంచి 23 మంది, స్వతంత్రులు 21 మంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీల్లోనూ ఇద్దరికి మించి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్కవార్డుకు కనిష్టంగా ఇద్దరు.. గరిష్టంగా నలుగురు వరకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి నామినేషన్లు వేసిన వారిలో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా సైతం మరో సెట్ దాఖలు చేశారు. వ్యూహాత్మకమేనా.. దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో చివరి రోజు నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయా రాజకీయ పార్టీలు అట్టహాసంగా నిర్వహించాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు తమతమ పార్టీల అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు డివిజన్ల పరిధిలో ర్యాలీ చేపట్టారు. రెబల్స్ ప్రభావం అధికంగా ఉందని గ్రహించిన ఆయా పార్టీల ముఖ్య నేతలు ర్యాలీలు నిర్వహించినా.. వ్యూహాత్మకంగానే అధికారికంగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ రోజే బీపాంలు అందజేసే అవకాశం ఉందని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వార్డుల వారీగా ఫైనల్ అయిన అభ్యర్థులకు ఫోన్ చేసి మీ పని మీరు చేసుకోండని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెబల్ అభ్యర్థులను బుజ్జగించేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు సంప్రదింపులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్: 60 డివిజన్లు.. 781నామినేషన్లు కొత్తగా ఆవిర్భవించిన ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. గడువు ముగిసే నాటికి మొత్తంగా 781నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 328, బీఆర్ఎస్ నుంచి 153, బీజేపీ నుంచి 112, ఎంఐఎం నుంచి 28, జనసేన తరఫున 20, బీఎస్పీఎనిమిది డివిజన్లలో, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ముగ్గురు, ఆప్, సీపీఎం నుంచి ఇద్దరేసి చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. మరో 125 మంది స్వతంత్రులు/ఇతరులు నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు కనిష్టంగా ముగ్గురు నుంచి గరిష్టంగా పది మంది వరకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో గరిష్టంగా ఒక్కో డివిజన్లో ఆరుగురు, బీఆర్ఎస్లో గరిష్టంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దేవరకద్ర: 12 వార్డులు.. 96 నామినేషన్లు నూతనంగా ఏర్పడిన ఈ పురపాలికలో 12 వార్డులు ఉండగా.. మొత్తం 96 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం అభ్యర్థుల మధ్య పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కాంగ్రెస్ తరఫున 28, బీఆర్ఎస్ తరఫున 35, బీజేపీ అభ్యర్థులుగా 22 మందితో పాటు స్వతంత్రులుగా 11 మంది నామినేషన్లు వేశారు. సగటున వార్డుకు సుమారు ఎనిమిది మంది చొప్పున.. ప్రధాన పార్టీల్లో కనిష్టంగా ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగిసినా ఖరారు కాని అభ్యర్థిత్వాలు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోనూ కొనసాగుతున్న అనిశ్చితి ఎంఎంసీలో చివరి రోజు పోటెత్తిన కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తంగా 978.. ఒక్కొక్కరు దాదాపు 2 సెట్లు దాఖలు రెబల్స్ కట్టడికి ప్రధాన పార్టీల వ్యూహాత్మక అడుగులు సంప్రదింపులు, బుజ్జగింపులకు శ్రీకారం ఉపసంహరణ రోజే బీఫాంలు.. -
షికారుతో పాలిట్రిక్స్!
గద్వాలలో కీలక రాజకీయ పరిణామాలు ● బండ్ల, సరిత వర్గ పోరులో మారిన పుర ఎన్నికల ముఖచిత్రం ● కాంగ్రెస్లో టికెట్ల నిరాకరణతో సరిత వర్గీయుల నారాజ్ ● బీఆర్ఎస్ నుంచి పలు వార్డుల్లో పోటీకి రంగం సిద్ధం ● మరికొందరు స్వతంత్రంగా బరిలోకి.. ● నామినేషన్ల చివరి రోజు బహిర్గతం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆధిపత్య, వర్గ రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లాలో మరోసారి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పుర ఎన్నికల వేళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య చోటుచేసుకున్న టికెట్ల లొల్లి కాంగ్రెస్లో చిచ్చు రాజుకోగా.. పట్ణణంలో పోరు ముఖచిత్రాన్ని మార్చేసింది. నామినేషన్ల ఘట్టం చివరి రోజు శుక్రవారం అనూహ్యంగా తారుమారు పాలి‘ట్రిక్స్’తెరపైకి రాగా.. ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. బీఫాంలు ఎవరికో.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య లొల్లి కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు కాంగ్రెస్లో చేరినా.. వారి మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ఇరు వర్గాలు పోటీ పడినప్పటికీ.. పార్టీ గుర్తుపై జరిగేటివి కాకపోవడంతో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్రపడ్డారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేటివి కావడంతో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు కొందరు సరిత వర్గీయులు ఇటు కాంగ్రెస్తోపాటు అటు బీఆర్ఎస్ తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో బీఫాంలు ఎవరికి దక్కుతాయి.. ముఖ్య నేతలు సయోధ్యకు చొరవ తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే.. గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. పురపాలికలకు ఎన్నికల కసరత్తు జరుగుతున్న క్రమంలో తన వర్గానికి 20 కేటాయించాలని సరిత అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కూడా ఆమె ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇందుకు ససేమిరా అంటూ నిరాకరించినట్లు సమాచారం. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో కౌన్సిలర్, పుర పీఠం ఎలా దక్కించుకోవాలో తనకు తెలుసని.. ఆ వర్గానికి ఒక్క టికెట్ కేటాయించినా మీ ఇష్టమని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో 20 నుంచి 12.. ఆ తర్వాత పది టికెట్లయినా కేటాయించాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు తన వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు టికెట్లు ఖరారు చేయాలని కోరగా.. తనకు వారు నేరుగా ఫోన్ చేస్తే కేటాయిస్తానని చెప్పినట్లు వినికిడి. ఇందులో ఒకరు ఫోన్ చేయగా.. ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించగా.. ఈ కార్యక్రమానికి సరిత, ఆమె వర్గీయులు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్తో టచ్లోకి.. ఆ వెంటనే.. టికెట్ల నిరాకరణతో నారాజ్లో ఉన్న సరిత వర్గీయులు నామినేషన్ల చివరి రోజు కీలక అడుగులు వేశారు. దాదాపు 15 వరకు వార్డుల్లో ఆమె మద్దతుదారులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున కాకుండా కొందరు స్వతంత్రంగా, మరికొందరు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. మూడు, నాలుగు రోజుల క్రితమే పలువురు బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్లడం.. వారి అంగీకారంతోనే పలు వార్డులకు వారు ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు నామినేషన్ల అనంతరం కారెక్కేందుకు వారు రంగం సిద్ధం చేసుకోవడం ముందస్తు స్కెచ్లో భాగమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిని కట్టడి చేయలేక సరిత చేతులెత్తేసిందా.. ఎమ్మెల్యేను ఢీ కొట్టేందుకే తన వ్యూహంలో భాగంగా వారిని ఆ పార్టీలోకి పంపించిందా అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. -
మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్నందున, విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా విని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పొందాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఏర్పడితే, ప్రిసైడింగ్ అధికారులకు అందజేసిన కరదీపికను జాగ్రత్తగా అధ్యయనం చేసి, చట్టబద్ధంగా స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఎవరికి కేటాయించిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు సకాలంలో చేరుకొని, ఫారం–12కు సంబంధించిన అన్ని ఎన్నికల సామగ్రిని పూర్తిగా పరిశీలించి, ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. తమకు కేటాయించిన సిబ్బందిని సమన్వయంతో సమీకరించి, అందరూ కలిసికట్టుగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సీఎంఓ సుధాకర్రెడ్డి, మాస్టర్ శిక్షకులు బాలు యాదవ్, నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు. సమావేశంలోమాట్లాడుతున్న కలెక్టర్ -
కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడం ఎన్నికల స్టంట్
● మహబూబ్నగర్ మేయర్గా బీజేపీకి అవకాశం ఇవ్వండి ● స్పీకర్ సైతం కోర్టులను మోసం చేయడం దారుణం ● రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలవాలని ఎమ్మెల్యే బండ్లకు సవాల్ : ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలను మోసం చేసేందుకు ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారిందని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెచ్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ఉన్న అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఈ–కార్ రేస్ నివేదికలు వచ్చాయి..ఈ రెండేళ్లలో ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవగాహన ఒప్పందంలో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడానికి సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటామని చెప్పే నాటకం తప్పా, చర్యలు తీసుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నాడని స్పీకర్ చెబుతుంటే.. కాంగ్రెస్కు ఓటు వేయాలని సదరు ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. స్పీకర్ సైతం కోర్టులను మోసం చేయడం చూస్తుంటే.. ఇంతకన్నా దారుణం ఇంకా ఏదీ ఉండదన్నారు. ఫిరాయింపులపై రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. మహబూబ్నగర్ నగర ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని, ఈ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగుర వేయడానికి ప్రజలు సహకరించాలన్నారు. మహబూబ్నగర్ మేయర్గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. -
సూర్యప్రభవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండలో శుక్రవారం రాత్రి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సూర్యప్రభవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవను చూసి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్వాహన సేవ, ప్రభోత్సవం నిర్వహిస్తారు. -
భద్రత లోపాలు లేకుండా పటిష్టమైన చర్యలు: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కడ భద్రత లోపాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. నగరంలోని కార్పొరేషన్తో పాటు భూత్పూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. నామినేషన్ల కేంద్రాల దగ్గర బందోబస్తు విధానాన్ని పరిశీలించారు. ఎన్నికల నియమావళిని అమలు చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం అయిన చోట అదనపు బలగాలు ఏర్పాటు చేయడం జరగాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా.. నగరంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ అప్పయ్య, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ సీఐతో పాటు పదిమంది ఎస్ఐలు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి వేణుగోపాల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో పీఓ, ఏపీఓలకు ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారు ఫారం–12 పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, వీటిని నింపి ఫిబ్రవరి 3 తేదీ వరకు మునిసిపల్ కార్యాలయంలో గానీ కలెక్టరేట్ లేదా నోడల్ ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఎలక్షన్ సిబ్బంది మునిసిపల్ కార్యాలయంలో ఫిబ్రవరి 7వ తేదీన ఏర్పాటు చేయు ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా ఓటు వేయ వచ్చని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్, డ్రైవర్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి రక్షణ దళాలలో పనిచేసే పోస్టల్ బ్యాలెట్కు అర్హులు అని పేర్కొన్నారు. -
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. గురువారం ఆ పార్టీ క్యాంపు కార్యాఆలయంలో మహబూబ్నగర్ కార్పొరేషన్ డివిజన్ల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వారికి, గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ వస్తుందన్నారు. టికెట్ రాలేదని ఎవరూ నిరాశ పడొద్దని, భవిష్యత్లో పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మంచి స్థానం కల్పిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు కష్టపడి పని చేయాలన్నారు. మహబూబ్నగర్ పురపాలికలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాలు గల్లీగల్లీకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పుర ఎన్నికల పరిశీలకులు అలీ మస్కతి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
దేవరకద్ర: నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఎన్నికల నిబంధనల ప్రకారం జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. గురువారం దేవరకద్ర మున్సిపాలిటీలో జరుగుతున్న రెండోరోజు నామినేషన్ల ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, భద్రతా చర్యలు, నామినేషన్ స్వీకరణ విధానాన్ని నేరుగా పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయడంలో అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ద్వారా సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు. చెక్ లిస్టు ప్రకారం నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశఽం ఉందని, వచ్చిన అభ్యర్థులను క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని, అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. కచ్చితంగా నామినేషన్ల వివరాలు రిజిస్టర్లో సమయంతో సహా నమోదు చేయాలన్నారు. భద్రతాపరంగా పోలీసుశాఖతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతలు పటిష్టంగా నిర్వహించాలన్నారు. వారి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు. -
ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు
దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించడమే పోలీసు శాఖ ముఖ్య లక్ష్యం అని ఎస్పీ జానకి తెలిపారు. దేవరకద్రలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పక్రియలో భాగంగా గురువారం ఆమె నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలు, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, వంద మీటర్ల దూరంలో ఎలాంటి గుంపులు ఉండరాదని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాలలో ప్రవేశించే వ్యక్తుల సంఖ్య ఎన్నికల నిబంధన ప్రకారం ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రజలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఆమె వెంట భూత్పూర్ సీఐ రామకృష్ణ, దేవరకద్ర ఎస్ఐ నాగన్న, మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు ఉన్నారు. -
కార్పొరేషన్ను గెలిపించి.. సీఎంకు కానుకగా ఇద్దాం
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, కార్పొరేషన్ను గెలుపొంది సీఎం రేవంత్రెడ్డికి కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు మహబూబ్నగర్ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలు అని అన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేని అభివృద్ధి సీఎం రేవంత్రెడ్డితో సాధ్యమైందన్నారు. భవిష్యత్ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూ.603 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించేందుకు, విజన్ 2047 లక్ష్యంగా రూ.220 కోట్లతో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం సీఎం స్వయంగా వచ్చి శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు సర్వేలు, నేను వ్యక్తిగతంగా రెండో సర్వేలు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో విశ్వసనీయత, పార్టీపై నిబద్ధత, గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామని అన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వారినే పరిగణలోకి తీసుకుంటామన్నారు. పార్టీ లైన్ అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికపై తాను సూచన మాత్రమే చేయగలనని, తుది నిర్ణయం సీఎం, టీపీసీసీ, ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రులు తీసుకుంటారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. కార్పొరేషన్లో 60 డివిజన్లలో 50కిపైగా గెలుపొందడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, కాంగ్రెస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు హర్షవర్ధన్రెడ్డి, వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్గౌడ్, అమరేందర్రాజు, బెక్కరి అనిత, రాజేందర్రెడ్డి, సాయిబాబా పాల్గొన్నారు. -
నామినేషన్లకు నేడు ఆఖరు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. పార్టీ పరంగా అధికారికంగా టికెట్లు కేటాయించకపోయినా ఆశావహులు నామినేషన్లు వేసేందుకు పోటీపడ్డారు. జిల్లాలో 82 డివిజన్లు, వార్డులు ఉండగా.. తొలిరోజు 14 నామినేషన్లు వచ్చాయి. గురువారం రెండో రోజు 233 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సాయంత్రం 5 గంటలు దాటినా చాలా మంది నామినేషన్లు వేయడానికి రావడంతో ఏడు గంటల వరకు వారిని అనుమతించారు. అత్యధికంగా 4వ డివిజన్ నుంచి ఎనిమిది మంది దాఖలు చేయగా 3, 17, 21, 40, 41, 43, 54, 55, 58 డివిజన్ల నుంచి ఒక్కొక్కరే దాఖలు చేశారు. మొత్తం 60 డివిజన్లకు రెండోరోజు 186 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు దాఖలైన 9తో కలుపుకొని 195కు చేరుకున్నాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 102, బీజేపీ నుంచి 37, బీఆర్ఎస్ నుంచి 25, ఇండిపెండెంట్లు 21, ఇతరులవి రెండు ఉన్నాయి. భారీగా బిల్లుల వసూలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు ‘నో డ్యూ సర్టిఫికెట్’ కోసం తమ ఇంటి ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లించేందుకు క్యూ కడుతున్నారు. ఈనెల 27 నుంచి ఇప్పటివరకు ఆస్తిపన్ను కింద రూ.31.61 లక్షలు, నల్లా బిల్లు బకాయిలు ఏకంగా రూ.29.34 లక్షలు వసూలు కావడం గమనార్హం. దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు మొత్తం 30 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 నామినేషన్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి ఆరు, బీజేపీ నుంచి 9 మంది దాఖలు చేయగా.. మరో ఐదుగురు నామినేషన్లు వేశారు. భూత్పూర్ మున్సిపాలిటీలో రెండోరోజు 17 నామినేషన్లు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి ఒకటి, బీఆర్ఎస్ నుంచి నాలుగు, ఇతరులు నలుగురు ఉన్నారు. రెండో వార్డులో రెండు, 3వ వార్డులో నాలుగు, నాలుగో వార్డులో ముగ్గురు, ఐదో వార్డులో ఒకరు, ఆరోవార్డులో ఇద్దరు, ఏడో వార్డులో ఇద్దరు, ఎనిమిదో వార్డులో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా.. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటివరకు ప్రధాన పార్టీల నుంచి అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు. రెండోరోజు జోరందుకున్న ప్రక్రియ మహబూబ్నగర్ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు 233 నామినేషన్లు దాఖలు చివరి రోజు భారీగా వచ్చే అవకాశం -
ఎట్లైనా పోరుబాట..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి డివిజన్లు/వార్డుల వారీగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. బీఫాంలు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ అనిశ్చితి నెలకొంది. టికెట్పై మీమాంస కొనసాగుతుండగా.. పలువురు ఆశావహులు ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనా బరిలో నిలిచే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే పార్టీ మార్పు లేదంటే స్వతంత్రంగానైనా రంగంలోకి దిగేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ వైపు చూపు.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ ఖరారు కాని పక్షంలో పలువురు పార్టీ మారి.. బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఎక్కువ శాతం స్వతంత్రంగా పోటీలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన వారు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి డీకే అరుణ గెలుపొందగా.. అప్పుడు నగర పరిధిలో ఆ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ ఎన్నికలను కమలం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే 43 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 17 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిలువరించేందుకేనా.. అధికార కాంగ్రెస్లో భారీగా ఆశావహులు ఉండడం ఆ పార్టీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. జీపీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచినప్పటికీ.. బీఆర్ఎస్ సత్తా చాటింది. కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోనే ఇతర అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెబల్స్ను నిలువరించేందుకు ఆయన ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పలు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పొత్తులకు తెరలేపాయి. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని అమరచింతతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర పురపాలికలో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరుదామనుకున్నా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఓ నాయకుడు తన భార్యను చైర్మన్గా చేయాలనే లక్ష్యంతో పావులు కదిపినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచేలా స్కెచ్ వేయడంతో పాటు బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నారాయణపేటలో కాంగ్రెస్ ఎంఐఎం, అమరచింతలో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకునేలా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇదే రోజు ప్రధాన పార్టీలు డివిజన్లు/వార్డుల వారీగా తమ తమ కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. కొన్ని ఉదాహరణలు.. కాంగ్రెస్కు సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్ కోసం ఇద్దరికి మించి పోటీపడుతున్నారు. ఒకటో డివిజన్లో 19 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ డివిజన్లో ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో డివిజన్కు ముగ్గురు నామినేషన్లు వేశారు. 39వ డివిజన్లో ముఖ్య నాయకులు ఇద్దరు నామినేషన్లు వేయడం పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కార్పొరేషన్లోని 52వ డివిజన్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడైన మాజీ కౌన్సిలర్ ఒకరు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీజేపీ వైపు అడుగుల వేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ డివిజన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది. ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ ఆశావహుల ముందస్తు ఏర్పాట్లు కార్పొరేటర్/కౌన్సిలర్ బరిలో నిలిచేలా అడుగులు అవసరమైతే జంప్.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా.. బీజేపీ వైపు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల చూపులు ‘మహబూబ్నగర్’లో రసవత్తరంగామారిన రాజకీయాలు పలు మున్సిపాలిటీల్లో పార్టీల పొత్తుల ఎత్తుగడలు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు ఇదే రోజు పార్టీల వారీగా తేలనున్న అభ్యర్థిత్వాలు భారీగా ఆశావహులతో అనిశ్చితి.. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులకు పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ రెండు పర్యాయాలు, బీఆర్ఎస్ ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెలో తొలుత 376, ఆ తర్వాత 292 దరఖాస్తులు రాగా.. బీఆర్ఎస్లో 440 మంది వరకు అర్జీ పెట్టుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులతో ఆయా పార్టీల్లో అభ్యర్ధిత్వాల ఖరారుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రెబల్స్ ప్రభావం లేకుండా పార్టీల ముఖ్యులు ఆయా వ్యక్తులతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల ఫైనల్ జాబితా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. -
వైభవంగా హంసవాహన సేవ
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ పూజలు చేసి తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణలతో స్వామివారి సేవ ముందుకు సాగింది. శుక్రవారం రాత్రి స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
2.39 కిలోల గంజాయి పట్టివేత
కల్వకుర్తి టౌన్: బతుకుదెరువు కొరకు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి మత్తుకు అలవాటై ఈజీ మనీ కోసం స్థానికంగా గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడిన ఘటన ఊర్కొండలో బుధవారం చోటు చేసుకుంది. కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా భూంపూర్కు చెందిన లిట్టు మాలిక్, గర్మాటికి చెందిన అభిమన్యూ మాలిక్ ఇద్దరు స్థానిక సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో మిషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. వీరికి గంజాయి తాగే అలవాటు ఉండటంతో పాటు అక్కడి నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయించేవారు. ఈ క్రమంలో అభిమన్యూ మాలిక్ ఈ నెల 15న సొంత గ్రామానికి వెళ్లి 23వ తేదీన అదే రాష్ట్రంలోని కంపాడాలోని తెడీ బజార్ నుంచి చాచా అనే వ్యక్తి వద్ద 2.5 కేజీల గంజాయిని తీసుకొని మిల్లు వద్దకు తెచ్చాడు. అనంతరం మిల్లు ఎదుట ఉన్న చెట్ల పొదల్లో గంజాయి బ్యాగును దాచి, విక్రయాలు చేసేవారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్టు చేసి 2.39 కేజీల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కల్వకుర్తి కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. గంజాయి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ కృష్ణదేవ, కానిస్టేబుళ్లు హర్ష, తిరుపతయ్య, వెంకన్నను ఎస్పీ సంగ్రామ్సింగ్పాటిల్, డీఎస్పీ వెంకట్రెడ్డి అభినందించారు. ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు జడ్చర్ల: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది గాయాలపాలైన ఘటన మండల పరిధిలో బుధవారం జరిగింది. పోలేపల్లి సెజ్లోని పైపుల పరిశ్రమలో పనిచేసేందుకు కూలీలు ఆటోలో వెళ్తుండగా సెజ్ నుంచి సిబ్బందిని జడ్చర్లకు తీసుకొస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న దాదాపు 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. ● కార్మికులుగా వచ్చారు.. విక్రేతలుగా మారారు ● ఒడిశాకు చెందిన ఇద్దరు యువకుల అరెస్టు ● సూర్యలత స్పిన్నింగ్ మిల్లు కార్మికులుగా గుర్తింపు -
నిలకడగా ఉల్లి ధరలు
గందె అనసూయ దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్కు బుధవారం దాదాపు రెండు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వేలం ప్రారంభమైన తర్వాత ధరలు నిలకడగా కొనసాగాయి. నాణ్యంగా ఉన్న తెల్ల ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1800 పలికింది. రెండో రకం ఎర్రఉల్లి కనిష్టంగా రూ. 1000 వరకు పలికింది. అలాగే 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.900, కనిష్టంగా రూ.500 వరకు పలికింది. వేలం పాటకు స్థానిక వ్యాపారులతో పాటు ఇతర మార్కెట్ల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున వచ్చిన ధరలు పెరగలేదు. ఉల్లి తూకం తరువాత వ్యాపారం జోరుగా సాగింది. -
రెండురోజుల్లో రూ.20 లక్షల రాబడి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ/వనపర్తిటౌన్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పుణ్యాన ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, మున్సిపల్ కాంప్లెక్స్ల అద్దెబకాయిలు వసూలవుతున్నాయి. ఈనెల 27వ తేదీ సాయంత్రం ఎన్నికల నగారా మోగిన విషయం విదితమే. దీంతో ఈసారి మొత్తం 60 డివిజన్లకు పెరగడంతో అభ్యర్థులు సైతం అధిక సంఖ్యలో ఈ ఎన్నికల్లో నిలుచోవాలని భావిస్తున్నారు. అయితే వారు తమ ఇంటి పన్ను, నల్లా బిల్లులు ఏమైనా పెండింగ్లో ఉంటే ‘నో డ్యూ సర్టిఫికెట్’ ఇవ్వరు. దీనివల్ల పాత బకాయీలన్నీ చెల్లించేందుకు ప్రస్తుతం వారు ముందుకు వస్తున్నారు. అలాగే వారికి ష్యూరిటీ ఇచ్చేవారికి సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు చెబుతుండటంతో అందరూ కార్యాలయ ఆవరణలోని కళాభారతి సెల్లార్కు వచ్చి ఠంచన్గా అన్ని బకాయిలు చెల్లిస్తున్నారు. కేవలం ఈ రెండు రోజుల్లోనే కార్పొరేషన్కు వీటి ద్వారా సుమారు రూ.20 లక్షలు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈనెల 27 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మున్సిపల్ సిబ్బంది నగరంలోని ఆయా డివిజన్ల పరిధిలో ఈపాటికే రాజకీయ పార్టీల జెండాలు, నాయకులు ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను, ప్రచారం కోసం ఎక్కడికక్కడ అధికార పార్టీ తరఫున గోడలకు అంటించిన వాల్పోస్టర్లను తొలగిస్తున్నారు. ముఖ్యకూడళ్లలో ఎలాంటి ఫ్లెక్సీలు, ఇతర పోస్టర్లు లేకుండా చూస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీలో కూడా నో డ్యూ సర్టిఫికెట్ కోసం పోటీదారులు ఎగబడ్డారు. పురపాలికకు ఒక్కరోజులో రూ.10.70 లక్షల ఆదాయం వచ్చింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట అధికారులు ప్రతేక్యంగా నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసి నో డ్యూ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా రూ.3.85లక్షలు, కుళాయి పన్నుల ద్వారా రూ.6.85 లక్షలు వచ్చింది. -
తొలి పురపాలికం
పాలమూరులో నారాయణపేట మున్సిపాలిటీకి 81 ఏళ్లు ● నాడు మీర్ మజ్లిద్ బల్దియా.. నేడు గ్రేడ్–2 మున్సిపాలిటీ ● తొలి చైర్మన్గా రామచందర్రావు ● కాంగ్రెస్ నుంచి ఏడుగురు.. బీజేపీ నుంచి నలుగురు చైర్మన్లు ● బీఆర్ఎస్కు ఒక్కసారే దక్కిన అవకాశం నారాయణపేట పట్టణ వ్యూ నారాయణపేట: నిజాంపాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా 81 ఏళ్ల క్రితం నారాయణపేట 1945–46లో ఆవిర్భవించింది. అప్పట్లో మీర్ మజ్లిద్ బల్దియాగా నామకరణం చేశారు. మున్సిపల్ అండ్ కమిటీల చట్టం 1961 కింద 1962లో మొట్టమొదటిసారిగా వయోజన ఓటుహక్కు ప్రతిపాదికన ఎన్నికలు జరిగాయి. వాటిలో మూడు స్థానాలు నామినేటెడ్ సభ్యులతో భర్తీ చేసేవారు. తొలి చైర్మన్గా రామచందర్రావు కల్యాణి ఎన్నికయ్యారు. ఆ తర్వాతో 1962లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొంది తొలి మంత్రిగా చరిత్రలో నిలిచారు. పదవీకాలం పార్టీ చైర్మన్ 1954–59 కాంగ్రెస్ రాంచందర్రావు కల్యాణి 1961–66 కాంగ్రెస్ మల్లయ్య 1966–66 కాంగ్రెస్ దత్తాత్త్రేయ కల్యాణి 1967–72 కాంగ్రెస్ సాయిబన్న 1981–86 కాంగ్రెస్ సీతారామారావు 1989–94 బీజేపీ లలితాబాయి 1995–99 కాంగ్రెస్ సత్యమ్మ 2000–02 బీజేపీ సాయిబన్న 2002–03 టీడీపీ అరవింద్కుమార్గౌడ్ 2003–05 బీజేపీ రాంచందర్ సాఖరే 2005–10 కాంగ్రెస్ శశికళ 2010–13 ప్రత్యేకాధికారి పాలన 2014–19 బీజేపీ గందె అనసూయ (2017లో బీఆర్ఎస్లోకి..) 2020–25 బీఆర్ఎస్ గందె అనసూయ (2024లో కాంగ్రెస్లోకి..) 2025–26 ప్రత్యేక అధికారి పాలన నిజాం కాలంలోనే నారాయణపేటలో విద్యుత్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక జనరేటర్ సదుపాయంతో నీటి హౌజ్ను కట్టి అందులోంచి కరెంట్ ఉత్పత్తి చేసే పద్ధతిని కనుగొన్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి పట్టణంలో వీధిదీపాలు, ఇళ్లకు వెలుగులు నింపిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆ జన రేటర్ శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 1952లో కౌన్సిల్ స్థానాలు 24 ఉండేవి. అప్పటి నుంచి తగ్గుతూ... పెరుగుతూ వార్డు స్థానాలు 2020లో మళ్లీ 24 వార్డులయ్యాయిఅయ్యాయి. 1956 హైదరాబాద్ జిల్లా మున్సిపాలిటీ చట్టం కింద 1961లో రెండోసారి ఎన్నికల జరగగా కౌన్సిల్ స్థానాలను 17కు కుదించారు. వీటిలో ఒక సీటు షెడ్యూల్డ్ కులాలకు కేటాయించారు. 1965లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం కింద కౌన్సిల్ స్థానాలు 20కి పెంచారు. ఇందులో రెండు సీట్లు మహిళలకు, రెండు సీట్లు షెడ్యూల్డ్ కులాలకు కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా వ్యవహరించే వారు. ఒక కో–ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునే అధికారం కౌన్సిల్ పొందింది. 1994లో నారాయణపేట మున్సిపాలిటీ నగర పంచాయతీగా మారింది. కౌన్సిలర్ వార్డు స్థానాలు 20 కొనసాగాయి. 2004లో దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి చొరవతో నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చారు. కౌన్సిలర్, వార్డు స్థానాలు 23కు పెరిగాయి. వార్డుల పునర్విభజనతో 23 వార్డులకు గాను ఒక వార్డు పెరగడంతో 2020లో 24 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2026లో సైతం 24 వార్డులతో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ బల్జియాను మినహాయిస్తే నారాయణపేట మొట్టమొదటి మున్సిపాలిటీగా 1945–48 మూడో శ్రేణిగా అర్హత సాధించింది. నైజాం హయాం నుంచి గ్రేడ్–3గా ఉన్న మున్సిపాలిటీ 2014లో బీజేపీ నుంచి గెలుపొందిన గందె అనసూయ అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో 2017లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడంతో గ్రేడ్–2 మున్సిపాలిటీగా ప్రకటించారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీజేపీకి చెందిన వారు చైర్మన్లు అయ్యారు. గడ్డం సాయిబన్న గుండెపోటుతో మరణించడంతో ఆరు నెలలపాటు వైస్ చైర్మన్ అరవింద్కుమార్గౌడ్ ఇన్చార్జి చైర్మన్గా ఉన్నారు. 2020లో బీఆర్ఎస్కు చెందిన గందె అనసూయ చైర్పర్సన్ అయ్యారు. నారాయణపేట మున్సిపల్ కార్యాలయం -
పరిహారం కోసం రోడ్డెక్కిన రైతులు
● ఆర్బిట్రేషన్ తర్వాత అందని నోటీసులు, నష్టపరిహారం ● రెండో విడత పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు ● గంగిమాన్దొడ్డి వద్ద రోడ్డు పనులు అడ్డుకొని నిరసన గట్టు: భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన వారికి ఆర్బిట్రేషన్ తర్వాత రెండో విడతగా చెల్లించే నష్టపరిహారం అందకపోవడంతో బుధవారం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గంగిమాన్దొడ్డి వద్ద గట్టు, గంగిమాన్దొడ్డి గ్రామాలకు చెందిన రైతులు నష్టపరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్డు పనులను అడ్డుకుని రోడ్డుపై బైటాయించారు. ఏడాది కాలంగా తాము నష్ట పరిహారం కోసం కలెక్టరేట్తో పాటుగా గట్టులోని తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ పొలాల్లో రోడ్డు నిర్మాణం పూర్తయిందని, రెండవ విడత పరిహారం మిగతా రైతులకు అందజేసి, మాకేందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. నెల రోజుల క్రితం గద్వాల కలెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చి, మా నుంచి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారని, అయినా నష్టపరిహారం మాత్రం చెల్లించలేదన్నారు. -
జములమ్మ బ్రహ్మోత్సవాలు
● మెట్టినింటికి చేరుకున్న అమ్మవారు గద్వాలన్యూటౌన్: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జములమ్మ అమ్మవారు బుధవారం మెట్టినిల్లుకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పుట్టినిల్లు అయిన గుర్రంగడ్డ నుంచి ఎడ్లబండిపై తీసుకొచ్చారు. అనంతరం సంప్రదాయబద్దంగా నాగపడిగను ఎండ్లబండిలో ఉంచి, విశేష పూజలు చేస్తూ జమ్మిచేడులోని ఆలయానికి చేర్చారు. గుర్రంగడ్డ నుంచి జమ్మిచేడు వరకు మేళతాళాలు... డప్పుల మోతలు... కుర్వడోళ్ల సప్పుల్లు...పోతరాజుల విన్యాసాలు... వందలాది మంది భక్తుల భక్తిపారవశ్యం మధ్య ఉరేగింపుగా అమ్మవారు ఆలయానికి చేరుకున్నారు. ఎడ్లబండి ఆలయానికి చేరుకోగానే పూజారులు అమ్మవారి విగ్రహానికి నాగపడిగను ధరింపజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురందర్కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
కారు, డీసీఎం ఢీ: యువకుడి మృతి
వెల్దండ: మండల పరిధిలోని నారాయణపూర్గేట్ వద్ద బుధవారం కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వల్లపుదాసు వెంకటేష్గౌడు (28) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సరికొండకు చెందిన వెంకట్గౌడు మహేశ్వరంలోని ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయంలో డేటాఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కల్వకుర్తిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో నారాయణపూర్ గేట్ వద్దకు రాగానే కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం ఢీ కొట్టింది. ప్రమాదంలో వెంకట్గౌడుకు తీవ్రగాయాలు కాగా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకట్గౌడు కుటుంబాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకొని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అదే విధంగా మహేశ్వరం కార్యాలయ ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిశ్రీ,తో పాటు తోటి ఉద్యోగులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం వనపర్తి రూరల్: మేడిపల్లి దగ్గర జరిగిన కారు ప్రమాదంలో పట్టణంలోని ఆర్టీసి కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన నిఖిల్, సాయికిరణ్, వెంకట్, రాకేష్, అభినవ్, యశ్వంత్ సాత్విక్, హర్షవర్దన్ చిన్ననాటి స్నేహితులు. వీరంతా హైదారాబాద్లోని వేరు వేరు కళాశాలల్లో చదువు కుంటున్నారు. మంగళవారం హైదారాబాద్లోని పోచారం సద్భావన టౌన్ షిప్ నుంచి కారులో మౌలాలిలోని స్నేహితుని అన్న ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి హాస్టల్కు తిరిగి వస్తుండగా కారు బోడు ఉప్పల్ సమీపంలోని మేడిపల్లి దగ్గర ముందు వెళ్తున్న బైక్ను తప్పించ బోయి మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో నిఖిల్ (22) సాయికిరణ్ (23) అక్కడిక్కడే మృతి చెందగా వెంకట్, రాకేష్కు తీవ్ర గాయాలు కాగా అభినవ్, యశ్వంత్రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. స్వాతిక్, హర్షవర్దన్ ఎలాంటి గాయాలు లేకుండా బయట పడ్డారు. వయసుకు వచ్చిన కుమారులు చనిపోవడంతో నిఖిల్, సాయికిరణ్ కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. -
పురం పిరం..!
పురపాలికల్లో ఇదే రాజ‘కీ’యం ● ఆర్థిక స్థోమత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ● కౌన్సిలర్/కార్పొరేటర్ నుంచి చైర్మన్/మేయర్ వరకూ.. ● ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు.. అన్ని పార్టీలదీ ఇదే దారి ● కర్ణాటక సరిహద్దు జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి భలే గిరాకీ ● చైర్మన్ గిరికి పలికిన ధర సుమారు రూ.5 కోట్లు? ● ఎన్హెచ్పై ఉన్న మరో దాంట్లో ఆర్థిక బలమే పరమావధిగా.. -
ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్లైన్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎన్నికల సమాచారం, ఫిర్యాదులపై కలెక్టరేట్లో ఫిర్యాదుల పరిష్కారం కోసం హెల్ప్లైన్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కారం కోసం 08542–241165 నంబర్కు ఫోన్ చేసి, ఎన్నికల సంబంధించిన సమాచారం, ప్రవర్తన నియమావళి, ఉల్లంఘనపై సంప్రదించవచ్చచి పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్లో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. రిజిస్టర్ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. గడువులోగా అనుమతులు మంజూరు చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు గడవులోగా అనుమతులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో టీఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ఇద్దరికి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కింద రెండు ట్రాక్ట ర్లు, షెడ్యూల్డ్ తెగల వారికి ముగ్గురికి ట్రాక్టర్ అండ్ ట్రాలీ, ఇద్దరికి గూడ్స్ వాహనాల కోసం పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు ఆమో దం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో కనీస సదుపాయాలు సంబంధించి చిన్నచిన్న పను లు ఉంటే చేయాలని టీజీఐఐసీ జోనల్ మేనేజర్ను ఆదేశించారు. జిల్లాపరిశ్రమల జనరల్ మే నేజర్ యాదయ్య, అధికారులు పాల్గొన్నారు. టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలి స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ 60 డివిజన్లకు సంబంధించి పార్టీ నుంచి పోటీ చేయడానికి 292 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అన్ని డివిజన్లకు అభ్యర్థుల ఖరారు చివరిదశకు చేరిందన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కమిటీ చర్చించిన అనంతరం గురువారం అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. పార్టీ తరఫున ఆశావహులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సూచించారు. ఇండిపెండెంట్గా వేస్తే వారిని పరిగణలోకి తీసుకోమన్నారు. టికెట్ రానివారు నిరాశ చెందకుండా టికెట్ కేటాయించిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపట్ల విధేయులుగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అలాగే పార్టీని నమ్ముకొని కొత్తగా వచ్చిన వారికి కూడా టికెట్లు ఇస్తామని చెప్పారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు జహీర్ అఖ్తర్, చంద్రకుమార్గౌడ్, సీజె బెనహర్, నయీమ్, రాములుయాదవ్ పాల్గొన్నారు. -
వెంకటేశా.. నమోస్తుతే...
● మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. పల్లకీలో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి స్వామివారిని గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. తిరుచ్చిసేవలో స్వామివారు బంగారు ఆభరణాలు, వివిధ పూల అలంకరణలో ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. గురువారం స్వామివారికి హంసవాహనసేవ నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొదటిరోజు నామినేషన్లు స్వీకరించడానికి మొత్తం 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో మూడు డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకోవడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్, మొదటి ఫ్లోర్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు బుధవారం కలెక్టర్ విజయేందిర, జనరల్ ఎన్నికల పరిశీలకురాలు పి.కాత్యాయినీదేవి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సమయంలో నో డ్యూ సర్టిఫికెట్ కోసం మున్సిపాలిటీలో భవనం లోపల అధిక సంఖ్యలో జనాలు ఉండటంతో పోలీసులతో పాటు కార్పొరేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థితో సహా ముగ్గురికి మాత్రమే అనుమతి కల్పించాలని, నేటి నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు ఏ ఒక్కటి కూడా కార్పొరేషన్ కార్యాలయం లోపలికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోటీలో ఉండే అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా నిబంధనలపై కార్పొరేషన్ ఆవరణలో ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ ఫారాలు, నో డ్యూ సర్టిఫికెట్ కోసం రెండు ప్రత్యేక కౌంటర్లు బయట అందుబాటులో పెట్టాలన్నారు. కార్యాలయం లోపల అనవసరమైన గందరగోళం లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. 320 పోలింగ్ స్టేషన్లు.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు, దేవరకద్రలో 12, భూత్పూర్లో 10 కౌన్సిలర్ వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కలిపి 320 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటి పరిధిలో 2.20 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని, అన్నిచోట్ల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దానిని పర్యవేక్షించడానికి ఎఫ్ఎస్టీ, ఫ్లయింగ్స్వ్కాడ్, స్టార్టింగ్ సర్వేలైన్స్ బృందాలు ఏర్పాటు చేశామని వీరికి ప్రత్యేక అధికారులు ఉంటాయని తెలిపారు. ఖర్చులపై ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిబంధనలు అర్థమయ్యే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలి కలెక్టర్ విజయేందిర, ఎన్నికల జనరల్ పరిశీలకురాలు కాత్యాయనీదేవి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి శ్రీనివాస్బాబు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో నిబంధనలను పాటించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి శ్రీనివాస్బాబు సూచించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఎన్నికల ప్రచార ఖర్చు నిర్వహించేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలని, పోటీ చేయు అభ్యర్థి ప్రచారం కోసం చేసే ప్రతి ఖర్చు కూడా బ్యాంకు అకౌంట్ నుంచి విత్ డ్రా చేయాలని సూచించారు. కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థి వారి ప్రచార నిమిత్తం గరిష్టంగా రూ.1,50,000 వరకు, మున్సిపాలిటీలో వార్డుమెంబర్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1,00,000 వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అన్ని లావాదేవీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల ఖర్చులన్నింటినీ అభ్యర్థి ఎన్నికల ప్రయోజనం కోసం తెరిచిన బ్యాంకు ఖాతా నుంచి క్రాస్డ్ అకౌంట్ పే చెక్కు ద్వారా చెల్లించాలని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం దృష్ట్యా, అభ్యర్థి ఎన్నికల ప్రక్రియలో ఒకే వ్యక్తి లేదా సంస్థ నుంచి రూ.20 వేల కంటే ఎక్కువ విరాళం లేదా రుణాన్ని నగదు రూపంలో స్వీకరించరాదని సూచించారు. రూ 20 వేల కంటే ఎక్కువ ఉన్న అన్ని విరాళాలు/రుణాలను అభ్యర్థి ఖాతా చెల్లింపుదారు చెక్కు లేదా డ్రాఫ్ట్ లేదా ఖాతా బదిలీ ద్వారా స్వీకరించాలని సూచించారు. వాహనంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన ఏదైనా మద్యం, ఆయుధాలు ఇతర అక్రమ వస్తువులు దొరికితే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45రోజుల లోపు పోటీచేసిన ప్రతి అభ్యర్థి విధిగా తాము నిర్వహించిన ఎన్నికల ఖర్చుల వివరాలను సంబంధించిన మునిసిపల్ కమిషనర్కు సమర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, టైటస్పాల్, జగన్మోహన్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మొదటి రోజు మందకొడిగా..
మహబూబ్నగర్ మున్సిపాలిటీ/దేవరకద్ర/భూత్పూర్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రక్రియ తొలిరోజు మందకొడిగా సాగింది. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మొ త్తం 60 డివిజన్లకు గాను బుధవారం 9 నామినేష న్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ నుంచి నాలుగు, కాంగ్రెస్ నుంచి మూడు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. డివిజన్ల వారీగా చూస్తే 12, 22, 23, 32, 49, 53, 57 నుంచి ఒక్కొక్కటి, 42 డివిజన్లో రెండు వచ్చాయి. 49వ డివిజన్లో కాంగ్రెస్ తరఫున మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్ సతీమణి ప్రసన్న, 53వ డివిజన్లో బీజేపీ తరఫున ఎన్.రమేష్కుమార్, 23వ డివిజన్లో మెట్టుకాడి శ్రీనివాసులు, 57వ డివిజన్లో ఇండిపెండెంట్గా మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్ ఉన్నారు. కాగా, ఈ నామినేషన్లకు రెండు రోజులే గడువు ఉన్నందున ఈనెల29, 30వ తేదీల్లో ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి. ● దేవరకద్ర మున్సిపాలిటీలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 3వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాటం అనిత, బీజేపీ నుంచి పృథ్వీ, 4వ వార్డు నుంచి పిట్టల ఉమా , 7వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జెట్రం బీరప్ప నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. మున్సిపాలిటీలో 12 వార్డులకు ఐదు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎస్ఐ నాగన్న ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు, అధికారి సీత్యానాయక్ పర్యవేక్షణ నిర్వహించారు. ● భూత్పూర్ మున్సిపాలిటీలో ఎరుకలి ముత్తయ్య స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీలో 10 వార్డులకు 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా.. పోటీలో ఉన్న ఆశావహులు ఇంటిపన్ను, నీటి పన్ను చెల్లించడంతో పాటు నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఎగబడ్డారు. బుధవారం ఒక్కరోజే మున్సిపాలిటీకి రూ.3లక్షల ఆదాయం వచ్చింది. 14 నామినేషన్లు దాఖలు మహబూబ్నగర్ కార్పొరేషన్లో 8 డివిజన్లకు 9 నామినేషన్లు.. ఇంకా రెండురోజులు మాత్రమే గడువు -
నిర్లక్ష్యంతోనే అధిక శాతం ప్రమాదాలు: వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని పీయూ వీసీ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పీయూలో అధికారులు బుధవారం హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ నుంచి వన్టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించకుండా డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదాలతో జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిర్ణీత వేగంతో వెళ్లాలని, రోడ్డుపై సిగ్నల్స్ను గమనిస్తూ వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం తాగి వాహనాలను నడపొద్దని, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఏఎస్పీ రత్నం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, డీటీఓ నాగేశ్వర్రావు, మోటార్వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, రూబీనా పర్వీన్, ప్రవీణ్, రఘుబాబు, పీయూ అధికారులు కృష్ణయ్య, రవికుమార్, గాలెన్న, అర్జున్కుమార్, చిన్నాదేవి, ఈశ్వర్కుమార్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. -
ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
● జిల్లాకేంద్రంలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె స్టేషన్ మహబూబ్నగర్: ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని పలువురు బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు టీటీడీ కల్యాణమండపం ఎదుట మంగళవారం సమ్మె నిర్వహించారు. ఆయా బ్యాంకులకు చెందిన వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు వెన్నముక అని అన్నారు. గతంలో ఐదు రోజుల బ్యాంకింగ్ పని విధానం అమలు చేస్తామని అంగీకారం తెలిపినప్పటికీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి మల్లికార్జున్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఆయా బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెంకటేశ్వర్లు, నరేష్, తిరుమల్రెడ్డి, జెట్టి రాజేష్, జగన్నాథరెడ్డి, రాంభూపాల్రెడ్డి, ఎంఆర్.జయకర్, నరేష్, శ్రీనివాసులు, రవికుమార్, జ్యోతి, బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, ప్రజాసంఘాల ప్రతినిధులు కురుమూర్తి, రాంమోహన్ తదితరులు మద్దతు తెలిపారు. -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో బుధవారం నుంచి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులతో ఆమె వీసీలో మాట్లాడుతూ ఇప్పటికే శిక్షణ పొందిన ఆర్ఓలు, ఏఆర్ఓలు వారికి కేటాయించిన మున్సిపాలిటీలలో విధులకు హాజరు కావాల ని ఆదేశించారు. ఉదయం 9 గంటలకు రిటర్నింగ్ అధికారులు వార్డుల రిజర్వేషన్ వివరాలతో ఎన్నికల నోటీసును జారీ చేయాలన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థులఎంపికకు కమిటీ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారి నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ల కేటాయింపు కోసం పార్టీ పది మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.ఇందులో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సిములు, పట్టణ అధ్యక్షుడు శివరాజుతో పాటు మరో ఆరుగురు నాయకులున్నారు. వీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఇస్తారు. దీని ప్రకారం గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం 60 డివిజన్లకు 440 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా దివిటిపల్లికి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉత్సాహంగా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి సంగారెడ్డిలో హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కోచ్లు గోపాలకృష్ణ, ముఖ్తార్అలీ, క్రీడాకారుడు మహేష్ పాల్గొన్నారు. -
ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్నగర్లోని జడ్చర్ల, నాగర్కర్నూల్లోని అచ్చంపేట పురపాలికల పాలక వర్గాల పదవీ కాలం మే నెలలో ముగియనుంది. ఇవి పోనూ మిగిలిన 19 (ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు) వాటిలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఇదే జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న దేవరకద్ర, నారాయణపేట జిల్లాలో మద్దూరు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ మూడు పురపాలికల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. -
మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తప్పిదాలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాట్లుపై సూచించారు. జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ ఫారంలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాల్ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, రూట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి మాస్టర్ శిక్షకులు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించనున్నట్లు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు వీసీ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన వైద్యసేవలు అందిస్తాం
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి జనరల్ ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో నాణ్యతతో కూడిన వైద్యసేవలు అందిస్తామని, కొన్ని రకాల ల్యాప్ సర్జరీలు చేయడానికి సరిపడా పరికరాలు లేవని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మంగళవారం గతేడాది కాలంలో ఆస్పత్రిలో జరిగిన వైద్యసేవలపై వార్షిక నివేదిక విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పాత భవనంలో 650 పడకలు ఉన్న కూడా ఆ స్థాయిలో సర్దు బాటు చేయగలుగుతున్నామని, నూతన భవనం ప్రారంభం చేసుకుంటే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబా టులోకి వస్తాయని తెలిపారు. 2016లో మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత వైద్య విధాన పరిషత్ నుంచి జనరల్ ఆస్పత్రిగా మార్పు చేసి 450 పడకలకు పెంచడం జరిగిందని, 2024లో 650 పడకలకు పెరిగిందన్నారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 775 పడకలు ఉన్న ప్రస్తుతం 650 పడకల సామర్థ్యం ఉందన్నారు. ప్రతి రోజు 1,400 నుంచి 1,500 ఓపీ, 150 వరకు ఐపీ ఉంటుందని, నిత్యం 25 నుంచి 30 కాన్పులు అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 50 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని, పిల్లలకు ప్రత్యేక ఐసీయూ ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో కొత్తగా కీళ్ల మార్పి డి సర్జరీలు, తుంటి మార్పిడి సర్జరీలు, గాల్బ్లాడర్, ల్యాప్ సర్జరీలు ఇలా అత్యాధునిక శస్త్ర చికిత్సలు జీజీహెచ్లో చేస్తున్నట్లు వెల్లడించారు. 5,02,412 రోగులకు ఓపీ సేవలు.. గతేడాది కాలంలో 5,02,412 రోగులకు ఓపీ సేవలు, 41,607ఐపీ, ఐసీయూ సేవలు అందించినట్లు తెలిపారు. ఏడాదిలో 7,906 మందికి ప్రసవం చేశామని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 1,385 చేసినట్లు తెలిపారు. అన్ని రకాల సర్జరీలు 43,040, ల్యాబ్లలో పరీక్షలు 6,22,399, టీప్పాస్కాన్ 155, అల్ట్రాసౌండ్ 3,036, ఈసీజీ 31,937, సీటీ స్కాన్ 10,320 చేసినట్లు వివరించారు. ఇక హెచ్ఐవీ పరీక్షలు 19,796, క్షయ పరీక్షలు 3,872, డయాలసిస్ 7, 270, 456 క్యాన్సర్ రోగులకు చికిత్సలు, 240 మందికి కీమోథెరపీ, గృహసందర్శనలో 2,125 మందికి చికిత్సలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాముకాటు 911, కుక్కకాటు 11,522తో పాటు డెంటల్ విభాగంలో 3,206 మందికి చికిత్స చేసినట్లు చెప్పారు. అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ మాధవి, డాక్టర్ సునీల్, నాగరాజు, వంశీ, ప్రేరణ, ఆర్ఎంఓలు శిరీష, జరీనాభాను, దుర్గా, సమత, గణేష్, సీహెచ్ఓ రాములునాయక్, బ్లడ్బ్యాంక్ మధుసూదన్రెడ్డి, పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీలో సీటే లక్ష్యంగా శిక్షణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఐఐటీలో సీట్లు సాధించే లక్ష్యంగా పదో తరగతి విద్యార్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని బోయపల్లి వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 150 మంది విద్యార్థులకు 45 రోజుల శిక్షణ ఇచ్చి వారికి ట్రిపుల్ఐటీలో సీట్లు సాఽధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డిని ఒప్పించి జిల్లాకు ట్రిపుల్ఐటీ కళాశాలను తీసుకొచ్చామని, దానికి శాశ్వత భవనం నిర్మాణ చేసేందుకు శంకుస్థాపన కూడా చేశామన్నారు. నూతన ట్రిపుల్ఐటీ కళాశాలలో జిల్లాకు సంబంధించి ఎనిమిది మంది మాత్రమే చేరారని, ప్రస్తుతం శిక్షణ తీసుకునే వారు 45 రోజులు కష్టపడి చదివితే మంచి ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్కుమార్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, మాజీ డీఈఓ విజయ్కుమార్, జగపతిరావు, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పురపాలికం మద్దూరు
మద్దూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మద్దూరు గ్రామపంచాయతీని గతేడాది జనవరి 27న మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. మద్దూరు మేజర్ గ్రామపంచాయతీతో పాటు రెనివట్ల, భీంపూర్, నాగంపల్లి, సాపన్చెరవుతండా, ఏర్రగుంట తండా పంచాయతీలు కలిపి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 1955 నుంచి మద్దూరు, భీంపూర్, నాగంపల్లి, సాపన్చెరువుతండా కలిపి మద్దూరు గ్రామ పంచాయతీగా ఉండేది. అప్పటి నుంచి మొదటి సర్పంచ్ జయచారి, తర్వాత వెంకట్రావు కొత్తూరు బసిరెడ్డి, బర్ల అంజయ్య, కాశీమన్నగౌడ్, చంద్రశేఖర్, పార్వతమ్మ, సిపిరి వెంకటయ్య ఉమ్మడి మద్దూరు సర్పంచ్లుగా వ్యవహరించారు. తర్వాత తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో మద్దూరు పంచాయతీగా అరుణ చివరి సర్పంచ్గా ఉన్నారు. ప్రస్తుతం మద్దూరులో 12,701 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 6,171 మంది, మహిళలు 6,530 మంది ఉన్నారు. 16 వార్డులకు 21 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
‘మేజర్’నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్
దేవరకద్ర: మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా దేవరకద్రను అప్గ్రేడ్ చేశారు. 1947 నుంచి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో మేజర్ పంచాయతీగా గుర్తింపుతోపాటు పశువుల సంత, కూరగాయల సంత ప్రత్యేకత సంతరించుకున్న దేవరకద్ర గతేడాది మున్సిపాలిటీగా మారింది. నియోజకవర్గంలోని కొత్తకోట, భూత్పూర్ జిల్లాల పునర్విభజనలో మున్సిపాలిటీలుగా మారాయి. దేవరకద్ర విషయంలో ఆనాటి నాయకులు చిన్నచూపు చూడడంతోనే మున్సిపాలిటీగా మారలేదనే విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిలకు ముందు దేవరకద్రను మున్సిపాలిటీగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించారు. కాని ఫైల్ మూలన పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూలనపడ్డ ఫైల్ను కదిలించడంతో గతేడాది దేవరకద్ర మున్సిపాలిటీగా మారింది. నాలుగు గ్రామాలతో.. దేవరకద్ర మున్సిపాలిటీలో చౌదర్పల్లి, మీనుగోనిపల్లి, పెద్దగోప్లాపూర్, బల్సుపల్లి పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీగా మార్చారు. మొదటి సారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నాయి. మొత్తం 12 వార్డులుగా విభజించిన మున్సిపాలిటీలో 10,070 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 4,909, సీ్త్రలు 5,161గా ఉన్నారు. మొత్తం 23పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దేవరకద్ర మున్సిపల్ కార్యాలయం -
నోడ్యూ.. సర్టిఫికెట్కు పోటెత్తిన ఆశావహులు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆస్తి, నీటి పన్ను క్లియర్స్ సర్టిఫికెట్ (నో డ్యూ) పొందేందుకు పోటీచేసే అశావహులు, వారి అనుచరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి 6:30గంటల వరకు ఆశావహులు, వారి సంబంధీకులు కార్యాలయంలో అటు, ఇటు పరుగులు తీసిన అధికారులంతా హడావిడిగా కనిపించడంతో నోడ్యూస్ సర్టిఫికేట్కు కార్యాలయానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, స్వతంత్రుల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆఫీసర్ సాయిలు, డీఈ యూనుస్, శానిటరీ ఇన్స్ఫెక్టర్ ఉమా మహేశ్వర్రెడ్డి వారివారి చాంబర్లో బిజీగా ఉండడంతో మున్సిపాలిటీలోని వార్డు ఆఫీసర్లు, ఇతర అధికారులు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో నో డ్యూస్ సర్టిఫికేట్ పొందేందుకు కార్యాలయంలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. సమస్య తీవ్రతరం కావడంతో అసిస్టెంట్ ఎన్నికల అధికారి రాత్రి 7:15గంటలకు అధికారులను అప్రమత్తం చేశారు. వార్డులవారీగా నో డ్యూస్ సర్టిఫికేట్లను అటెండర్ ద్వారా పురపాలికలో పనిచేసే అన్నివార్డు ఆఫీసర్లకు అందజేసి ఆశావహులు సంప్రదిస్తే అందించాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఆదేశించారు. కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ లేకపోవడంతో వార్డులవారీగా వార్డు ఆఫీసర్లకు ఇచ్చిన నోడ్యూస్ సర్టిఫికేట్ల జారీలో అధికారుల అలసత్వంపై ఆశావహులు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని కొత్తకోట, పెబ్బేర్, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీలో నోడ్యూస్ సర్టిఫికేట్కు ఆశావహులు పరుగులు తీశారు. ఎన్నికల నిబంధనలు ఏమిటి? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహులు కమిషనర్ చాంబర్కు పరుగులు తీశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఏ పత్రాలు తెచ్చుకోవాలనే విషయాలను అడిగేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి అడిగారు. జనరల్ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం లేకపోయినా ఫర్వాలేదు.. కానీ రిజర్వుడ్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తెచ్చుకోవాలని, ప్రతి అభ్యర్థి వెంట నామినేషన్ వేసేందుకు ఇద్దరికి అవకాశం ఇస్తామని చెప్పారు. -
ముగిసిన లక్ష్మీచెన్నకేశవుడి జాతర
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఉదయం వేదపండితుల మంత్రోచ్ఛారణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో నిత్యహోమం జరిపించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజావరోహణం చేసి ఆలయ ప్రాంగణంలో స్వామి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించి చక్రతీర్థసేవ జరిపించారు. వీటితోపాటు ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగం, నాగబలి, దేవతోద్వాసన, సప్తవర్ణ సేవలు నిర్వహించారు. ఉత్సవాలు ముగిసినప్పటికీ భక్తులు మాత్రం స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ఆయా ప్రభుత్వశాఖల అధికారులు, గ్రామస్తులు, ఆలయ సిబ్బందికి ఈఓ దీప్తిరెడ్డి, సర్పంచ్ గిరిప్రసాద్యాదవ్ కృతజ్ఙతలు తెలిపారు. -
రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు
కొల్లాపూర్ రూరల్: ప్రకృతిపై ప్రేమ, వైజ్ఞానిక దృక్పథం, రాజ్యాంగ పరిరక్షణతోనే సమాజ శ్రేయస్సు అని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని సోమశిలలో కృష్ణానది తీరాన విజ్ఞానదర్శిని నెహ్రూసెంటర్, నేచర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రకృతి వైజ్ఞానిక యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వాలు చేపట్టాల్సిన సామాజిక బాధ్యతాయుతమైన పనిని స్వచ్ఛందంగా తమ భుజాలపై వేసుకొని ప్రజలను చైతన్యం చేస్తున్న జన విజ్ఞాన వేదిక నిర్వాకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా పట్టుదలతో చేస్తున్న పనితీరు అద్భుతమని కొనియాడారు. శాసీ్త్రయ ఆలోచన విధానంతో పాటు దేశ ప్రజలందరికి రక్షణ కవచమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మూఢ నమ్మకాలు, వివక్ష వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు యువత, మేధావులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమ నిర్వహణకు అయ్యే ఖర్చును రాష్ట్ర సాంస్కృతికశాఖ నుంచి మంజూరు చేస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. భవిష్యత్లో మరిన్ని వైజ్ఞానిక యాత్రలు నిర్వహించాలని కోరారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, కవి జయరాజ్ మాట్లాడారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్, జన విజ్ఞానదర్శిని సభ్యులు, సర్పంచ్ వెంకటలక్ష్మి, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. కోడ్ కూసింది.. ఫ్లెక్సీ తొలగింది..! నారాయణపేట: మోగిన మున్సిపల్ నగరా.. మున్సిపల్ ఎన్నికల కోడ్ రావడంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు మున్సిపల్ కమిషనర్ నర్సయ్య ఆదేశాలతో సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టారు. తొలగించిన బ్యానర్లను మున్సిపల్ వాహనాల్లో తీసుకెళ్లి కార్యాలయ ఆవరణలో ఉంచుతున్నారు. ఎవరైనా ప్రచార బోర్డులు పెడితే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ చెప్పుకోస్తున్నారు. బుధవారం నుంచి మొదలవుతున్న నామినేషన్ల స్వీకరణకు అధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పాలమూరు @ 75 ఏళ్లు
స్వర్ణోత్సవ వేడుకలు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 2002 ఆగస్టు 7న భారీస్థాయిలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు వారం రోజులపాటు ఈ వేడుకలు కొనసాగాయి. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ భవనం 1989 సంవత్సరంలో అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పి.చంద్రశేఖర్ ప్రారంభించారు. పాలమూరు నగరం వ్యూపాలమూరు: ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. 1951లో ఏర్పాటైన మున్సిపాలిటీ ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాటి నుంచి మూడో గ్రేడ్, రెండో గ్రేడ్, మొదటి గ్రేడ్, ప్రత్యేక గ్రేడ్, సెక్షన్ గ్రేడ్ వరకు ఎదగడం విశేషం. ఈ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన ఆటుపోట్లు ఎదుర్కొంది. గొప్ప వ్యక్తులను మున్సిపాలిటీకి చైర్మన్లుగా పనిచేశారు. అయితే మొదటిసారి ఎన్నికై న క్రమంలో 1951 ఎలాంటి ఎన్నిక జరగకుండా కౌన్సిల్ బాడీ ఎన్నికై ంది. ఆ తర్వాత 1952– 53 మధ్య కాలంలో కాంగ్రెస్ నేత శంకర్రావు నామినేటెడ్ పద్ధతిలో మున్సిపాలిటీకి తొలి చైర్మన్గా ఎన్నికయ్యారు. తదనంతరం 1953 నుంచి 1992 వరకు ఆరు పర్యాయాలు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. టీడీపీ పాలనలో 1995– 2000, 2000– 2005లో మున్సిపాలిటీకి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 2004లో రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలకు నిర్ణయించింది. 2005 నుంచి మళ్లీ మున్సిపాలిటీకి పరోక్ష పద్ధతిలోనే ఎన్నికలు జరిగాయి. గతేడాది జనవరి 27న కార్పొరేషన్గా అవతరించింది. మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఆదాయం 75 ఏళ్లలో కొంత కొంత పెరుగుతూ వచ్చింది. 1953– 57 మధ్య కాలంలో మున్సిపాలిటీ వార్షిక ఆదాయం రూ.97 వేలు మాత్రమే. రెండో చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ఆదాయం పెంచడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఆదాయం రూ.55 కోట్లు కాగా వ్యయం రూ.60 కోట్లకు చేరింది. రూ.97 వేల నుంచి.. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చైర్మన్లుగా కొనసాగింది వీరే.. 1951లో మొదటిసారిగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఏర్పాటు ఇప్పటి వరకు కొనసాగిన 13 మంది చైర్మన్లు మూడుసార్లు ప్రత్యేకాధికారుల పాలన తొలి మహిళా చైర్పర్సన్గా రాధ బాధ్యతలు తాజాగా తొలి కార్పొరేషన్ మేయర్ పీఠం మహిళకే.. -
జములమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● అమ్మవారికి ఆహ్వానం పలికేందుకు బయలుదేరిన బండి ● నేడు మెట్టినింటికి చేరుకోనున్న అమ్మవారు గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలో ప్రసిద్ధిచెందిన జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు ఆలయంలో, అమ్మవారి నాగపడిగకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం 11 గంటల ప్రాంతంలో నాగపడిగను పూజారులు తలపై ధరించి అమ్మవారిని ఆహ్వానించేందుకు పుట్టిన ఊరైన గుర్రంగడ్డకు ఆలయం నుంచి ఎద్దులబండిపై బయలుదేరారు. డప్పుల మోతలు.. వాయిద్యాలు.. అమ్మవారి పూనకాలతో భక్తులు ఉరేగింపుగా వెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురంధర్కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేడు మెట్టినింటికి అమ్మవారు.. బుధవారం ఉదయం 6 గంటలకు అమ్మవారు తన మెట్టినిల్లు అయిన జమ్మిచేడులోని జములమ్మ ఆలయానికి చేరుకోనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారి సమీపంలో ఉండవెల్లి శివారులోని ఎత్తు బ్యాంకు వద్ద రైల్వే పట్టాలపై గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఎరుపు చొక్కా, నలుపు రంగు జీన్స్ ప్యాంట్, ఒంటి నిండా పచ్చబొట్లు ఉన్నాయని, చాతీపై శివుడి బొమ్మ, ఎడమ వైపు ఫాతీమా, కుడివైపు కాశమ్మ, చేతికి ఎర్ర దారం, అమ్మమ్మ, కాశీ కృష్ణవేణి అనే పేర్లు, మెడ భా గాన త్రిశూలం పచ్చబొట్టు ఉందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు గద్వాల రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ అశోక్ పేర్కొన్నారు. రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య రాజాపూర్: బాలానగర్ మండల కేంద్రం సమీపంలో రైలు కింద పడి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని తిరుమలగిరి పంచాయతీ శివారులోని కిచ్యనాయక్ తండాకు చెందిన సంధ్య(15) మహబూబ్నగర్లోని ఓ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి విద్యనభ్యసిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చిన సంధ్యతో కలిసి తల్లిదండ్రులు శ్రీను, సంగీత తదితర కుటుంబ సభ్యులు సోమవారం శంషాబాద్లో బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడినుంచి మంగళవారం ఉదయం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బాలానగర్లో హోటల్లో టిఫిన్ చేసేందుకు ఆగారు. టిఫిన్ చేసిన అనంతరం చేతులు కడిగేందుకు వెళ్లిన సంధ్య అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెకోసం వెతికారు. కాలినడకన బాలానగర్ రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడినుంచి బాలానగర్–చింతగూడ మార్గం వైపు వెళ్లి రైలు కింద పడి మృతిచెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కూతురు ఎందుకు అఘాయిత్యానికి పాల్పడిందో తెలియదంటూ బోరున విలపించారు. రైల్వేపోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధిలో పాలమూరు పరుగులు
మహబూబ్నగర్పాలమూరు: అభివృద్ధిలో పాలమూరు జిల్లా పరుగులు పెడుతోందని, రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. జిల్లాలో ఈసారి యాసంగిలో 1.34లక్షల ఎకరాలు సాగు అయిందని, రైతు భరోసా కింద వర్షకాలం సీజన్లో 2.14లక్షల మంది రైతులకు రూ.243 కోట్లు, రైతు బీమా కింద 283 మంది రైతుల నామినీ ఖాతాల్లో రూ.14 కోట్లు జమచేసినట్లు పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పరేడ్ మైదనంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ప్రసంగించారు. ఆ వివరాలు ఆమె మాటల్లో.. మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ పైలెట్ కింద 43 వేల రైతులకు లక్షన్నర యూరియా సంచులు బుక్ చేసుకున్నారు. జిల్లాలో పట్టు పరిశ్రమల ద్వారా 714 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల విస్తరణ, డ్రిప్కు రూ.57 లక్షల రాయితీ, కొత్త ఉద్యాన పంటల కోసం 1394 ఎకరాలకు రూ.129 లక్షల రాయితీతో మంజూరు చేశాం. ఈ ఏడాది 230 చెరువులలో 67 లక్షల చేప పిల్లలను వదిలాం. ప్రమాదవశాత్తు మరణించిన 18 మంది మత్స్యకారులకు రూ.83 లక్షలు మంజూరు చేశాం. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కొత్వాల్, తదితరులు ● జిల్లాలో 2,75,825 కార్డులకు దాదాపు 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశాం. 35 950 కొత్త రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు 70,602 కార్డులలో 1,46,979 కుటుంబసభ్యులను చేర్చాం. గత వర్షకాలం సీజన్లో 195 కేంద్రాల ద్వారా ఒక 1.43లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.343 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. ● మహాలక్ష్మి పథకం కింద 1.02లక్షల మందికి ఆరు లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగించుకుని రూ.19 కోట్ల సబ్సిడీ పొందారు. మిషన్ భగీరథ కింద జిల్లాలో 1,50,113 ఇళ్లకు నల్లా కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేశాం. జిల్లాలో 11,035 ఇందిరమ్మ ఇళ్లకు రూ.552 కోట్ల అంచనా విలువతో మంజురు కాగా.. 7,324 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.144 కోట్ల నిధులు విడుదల చేశాం. మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026 రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు రైతు భరోసా కింద 2.14లక్షల మంది రైతులకు రూ.243కోట్లు ఈ ఏడాది 67లక్షలచేప పిల్లలను పంపిణీ 35,950 కొత్త రేషన్ కార్డులు మంజూరు జిల్లాకు 11,035 ఇందిరమ్మ ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న 7,324 ఇళ్లు గణతంత్ర వేడుకల్లోకలెక్టర్ విజయేందిర బోయి -
నేటి నుంచి జములమ్మ బ్రహ్మోత్సవాలు
●విద్యుదీపాల వెలుగులో అమ్మవారి ఆలయ సముదాయం గద్వాల న్యూటౌన్: భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జములమ్మ, పరుశరామస్వామి వారి ఆలయ సముదాయాలను వివిధ రకాల పుష్పాలు, విద్యుదీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) మాగశుద్ధ పౌర్ణమి నుంచి ఏరువాక పౌర్ణమి (జూన్ 29) వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. నేడు పుట్టింటినుంచి బయలుదేరనున్న అమ్మవారు ● గద్వాల మండలంలోని కృష్ణానది దివి గ్రామమైన గుర్రంగడ్డ అమ్మవారి పుట్టినిల్లుగా చరిత్ర చెబుతోంది. అక్కడున్న ఆలయం నుంచి ప్రతి ఏటా అమ్మవారిని మాగశుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే మంగళవారం మెట్టినిల్లు అయిన జమ్మిచేడులోని ఆలయానికి ఆహ్వానించేందుకు ఎద్దుల బండి బయలు దేరుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు గుర్రంగడ్డ గ్రామానికి బండి బయలుదేరనుంది. ఫిబ్రవరి 1న పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారికి అభిషేకం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక పూజలు చేసి అలంకరిస్తారు. అదేరోజు సాయంత్రం పల్లకీ సేవ నిర్వహించనున్నారు. వేడుకలకు నడిగడ్డ ప్రాంతంతో పాటు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహరాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. గుర్రంగడ్డ గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న జములమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, అమ్మవారిని ఆహ్వానించి ఎద్దుల బండిపై తీసుకొస్తారు. బుధవారం తెల్లవారుజామున బయలుదేరి సాయంత్రం 6 గంటల వరకు మెట్టినిల్లు అయిన జమ్మిచేడుకు చేరుకుంటారు. -
అంగరంగ వైభవంగా పాలఉట్లు
మక్తల్: మండలంలోని మాద్వార్లో గట్టుతిమ్మప్పస్వామి(లక్ష్మీవేంకటేశ్వరస్వామి) పాలఉట్లు కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామం నుంచి ఊరేగింపుతో వెళ్లి పాలఉట్లు సందర్భంగా భక్తులు కోలాటం, చిన్నారులు ధాండీయ నత్యాలు, ఆడుగుల భజనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. స్వామివారి పాలఉట్లు కార్యక్రమానికి వివిధ ప్రాంతాలతోపాటు చుట్టపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పాలఉట్ల కార్యక్రమాన్ని పల్లెగుంటి వెంకటేశ్ ఉట్టిని కొట్టారు. ఉట్టిని కొట్టినవారికి 5తులల వెండి కడియాన్ని జాజాపూర్ ప్రతాప్రెడ్డి చేతుల మీద అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేశ్వర్రావు, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్రెడ్డి, డాక్టర్ ఆశప్ప తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతికి వందన సమర్పణలో ‘పాలమూరు బిడ్డ’
మహబూబ్నగర్ రూరల్: ఢిల్లీలో దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటేవిధంగా నిర్వహించబడిన 77వ గణతంత్ర వేడుకల్లో పాలమూరుకు మరో గర్వకారణం దక్కింది. వేడుకల్లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ముకు వందన సమర్పణ చేసిన త్రివిధ దళాల కమాండెంట్ల బృందంలో మహబూబ్నగర్ జిల్లా కోడూర్కు చెందిన సురేశ్ పాల్గొనడం విశేషంగా నిలిచింది. పదాతి దళానికి చెందిన సురేశ్ జూనియర్ కమాండెంట్ ఆఫీసర్గా 25ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్నాడు. ఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ వేళ రాష్ట్రపతికి త్రివిధ దళాలు అభివందనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పదాతి దళం, నౌకాదళం, వాయుసేన జవానులు పాల్గొంటారు. ఈ ప్రతిష్టాత్మక వందన సమర్పణలో పాలమూరు జిల్లాకు చెందిన సైనికుడు సురేశ్ భాగస్వామి కావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా మారింది. ఢిల్లీ భారత్ పర్వ్లో కల్వకుర్తి యువకుడు కల్వకుర్తి రూరల్: గణతంత్ర వేడుకల్లో భాగంగా ఎరక్రోట వద్ద తెలంగాణ జానపద ముత్యాల వైభవం ప్రదర్శించే అవకాశం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్లకు చెందిన తాడేం భరత్కుమార్కు లభించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎరక్రోట వేదికగా సోమవారం నుంచి ఈనెల 31 వరకు భారత్ పర్వ్ 2026కు తాడెం భరత్కుమార్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులు, కలలు, వారసత్వాన్ని చాటిచెప్పే విధంగా భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా భరత్ విలేకరులతో మాట్లాడుతూ.. దేశ రాజధానిలో ఎరక్రోట వద్ద జరిగే సంబురాల్లో ప్రతిభ ప్రదర్శించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంబురాల్లో రాష్ట్ర విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఒక అవకాశం లభించిందని చెప్పారు. తెలంగాణ మట్టి వాసన, కళా వైభవాన్ని ఢిల్లీ వీధుల్లో ప్రతిబింభించేలా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. భరత్ ఎంపికపై పలువురు సంతోషం వ్యక్తం చేయడంతోపాటు శుభాకాంక్షలు చెప్పారు. -
మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలి
దేవరకద్ర: మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని, పార్టీపరంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు అందరు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. పార్టీ టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని వారిని పార్టీ ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తుందన్నారు. టికెట్ రాని వారు నిరాశకు గురి కాకుండా పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తామని, అలాగే వార్డుల వారీగా సర్వేలు చేసి, అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి అందరూ ఐక్యమత్యంగా పని చేయాలని కోరారు. సమావేశంలో నాయకుల లక్ష్మీకాంత్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, బాలస్వామి, అంజన్కుమార్రెడ్డి, వెంకటేశ్, వేణుగోపాల్రెడ్డి, ఫారూఖ్, ఆదిహన్మంతరెడ్డి, శంకర్, శ్రీనివాస్రెడ్డి, బాల్రాజు, చెన్నయ్య, రాము, రాములు, చంద్రమౌలి, బుచ్చన్న, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లా పరేడ్మైదానంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొదట స్కౌట్స్ అండ్గైడ్స్ నుంచి విద్యార్థులు నృత్యం చేయగా, ఆ తర్వాత అక్షర హైస్కూల్, మహితి హైస్కూల్, ఎస్సీ డీడీ హాస్టల్ విద్యార్థులు నృత్యం ఆకట్టుకుంది. రోడ్డు భద్రతపై ఆర్టీఏ శాఖవినూత్న కార్యక్రమం నిర్వహించింది. అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్తో కలిసి కలెక్టర్ విజయేందిర సన్మానించారు. శకటాల ప్రదర్శన వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శాఖల పనితీరు అద్దం పట్టే విధంగా ఆయా శాఖలు శకటాల ప్రదర్శన నిర్వహించాయి. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, గ్రామీణా అభివృద్ధి శాఖ, పురపాలక శాఖ, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖలు తమ శాఖల పనితీరును శకటాల ద్వారా వినూత్నంగా ప్రదర్శించాయి. సందేశాత్మక నమూనాలతో పాటు సృజనాత్మక ఆవిష్కరణలతో శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మహబూబ్నగర్ పురపాలక శాఖకు మొదటి బహుమతి, వైద్యారోగ్యశాఖకు రెండో బహుమతి, అగ్నిమాపక శాఖకు మూడో బహుమతి లభించాయి. ఆ తర్వాత మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్, ఎస్పీ జానకి, ఏఎస్పీ ఎన్బీ రత్నం, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జనసంద్రంగా పాలెం రథోత్సవం
పాలెం వీదుల్లో రథోత్సవ ఉరేగింపు బిజినేపల్లి: పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాల ముఖ్య ఘట్టమైన రథోత్సవం సోమవారం తెల్లవారుజాము వరకు జనసంద్రంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన రథోత్సవం బాణాసంచా వెలుగులో మిరమిట్లు గొలిపింది. భక్తులు పోటీతో తేరును ఆలయ పూరవీధుల్లో లాగారు. రథోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉదయం నిత్యపూజా కార్యక్రమాల అనంతరం సాయంత్రం స్వామివారికి ఉద్దాల మహోత్సవం ఆరంభమైంది. కార్యక్రమంలో స్వామివారి ఉద్దాలను భక్తులకు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉత్సవాల్లో మాజీ చైర్మన్ భక్తులకు నిత్యాన్నదానం చేశారు. -
భక్తుల ఇంటికే బంగారం..
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు అటూ ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా పార్సింగ్, కొరియర్ సేవలు అందజేస్తోంది. దీంతో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో రాఖీ పండుగ సందర్భంగా దూరంగా ఉన్న సోదరీ మణులు రాఖీలను తమ సోదరులకు పంపించేలా కొరియర్ సేవలు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందజేశారు. ● ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే అందజేసేలా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299తో బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తారు. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. రీజియన్లోని పది డిపోల పరిధిలోని లాజిస్టిక్ కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమ్యాయి. భక్తులు www.tgsrtclogistics. co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడారం ప్రసాదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆర్టీసీ వినూత్న కార్యక్రమం రూ.299తో బుకింగ్ చేసుకుంటే చాలు.. ప్రసాదంతో పాటు దేవతల ఫొటో, పసుపు, కుంకుమ వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం -
వైభవంగా చెన్నకేశవుడి శకటోత్సవం
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శకటోత్సవం వైభవంగా ముగిసింది. ఉత్సవాలు బుధవారంతో ముగియనున్నాయి. ఆదివారం రాత్రి రథోత్సవానికి హాజరైన భక్తులు సోమవారం స్వామి దర్శనం చేసుకుని స్వగ్రామాలకు బయలుదేరారు. అధికసంఖ్యలో భక్తులు సోమవారం ఆయాప్రాంతాల నుంచి తరలివచ్చారు. స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. దాసంగాలు సమర్పించారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించగా.. మరికొందరు సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. సాయంత్రం శకటోత్సవం అత్యంత కోలాహలంగా సాగింది. రైతులు, భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను అలంకరించి గ్రామం వీధుల్లో ఊరేగించారు. ఆలయ రాజగోపురం వద్ద ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఊరేగించారు. ఈసారి మెట్లపైకి బండ్లు, ట్రాక్టర్లు ఎక్కకుండా బారికేడ్లు అడ్డుగా ఉంచారు. భక్తుల కేరింతలు, గోవిందనామస్మరణల మధ్య ప్రదక్షిణలు ముగించారు. శకటోత్సవంలో ఎడ్లబండ్లపై చెన్నకేశవస్వామి చిత్రపటాలతోకూడిన భారీ కటౌట్లను అలంకరించారు. శివసత్తుల నృత్యాలు, సంప్రదాయ మేళతాళాలతో శకటోత్సవం సాగింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం పూర్ణాహుతి, చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలు ముగియనున్నప్పటికి మరో నాలుగురోజులపాటు భక్తుల తాకిడి ఉంటుంది. -
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి
మక్తల్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతీయ జెండాను ఎగురవేస్తుండగా కట్టె విరిగిపడింది. వివరాలిలా.. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్కుమార్ జాతీయ జెండాను ఎగురవేస్తుండగా అకస్మాత్తుగా జెండా ఏర్పాటు చేసిన కట్టె అకస్మాత్తుగా విరిగి కిందపడింది. ఈ ప్రమాదంలో నాగేందర్ అనే వ్యక్తి కాలిపై కట్టె పడటంతో రక్త గాయం కాగా.. పక్కనే రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో కట్టెకు జెండా ఏర్పాటు చేసి తహసీల్దార్ ఎగురవేశారు. జెండా కట్టె పాతది కావడంతో విరిగిపోయిందని సిబ్బంది తెలిపారు.● జెండావిష్కరణలో విరిగిన కట్టె ● రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం -
పంటపొలాల్లో చిరుత సంచారం
దేవరకద్ర రూరల్: బొల్లారం–సందాపూర్ మధ్యలోని వ్యవసాయ పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం రెండు గ్రామాల మధ్యనున్న వరిపొలాల మధ్య చిరుత సంచరిస్తుండగా గమనించిన రైతులు బెంభేలెత్తారు. చిరుతను దూరం నుంచి తనఫోన్లో ఒక రైతు వీడియా తీశాడు. ఈ విషయాన్ని సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లిన వారికి తెలుపగా భయాందోళనకు గురై ఇళ్లకు చేరుకున్నారు. చిరుత తమ పొలాల మీదుగా చిన్నరాజమూరు వైపుగా వెళ్లిందని రైతులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎర్రవల్లి: ఎందరో మహానుభావుల త్యాగఫలం వల్లే మనమంతా ఈరోజు ఇలా స్వతంత్రంగా జీవిస్తున్నామని అలాంటి మహానీయుల త్యాగాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో పటాలంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ హాజరై జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం కన్న కళలను సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే పోలీస్శాఖకు నిజమైన గౌరవమని సూచించారు. అనంతరం పటాలంలో వివిధ విభాగాల్లో ప్రతిభను కనబర్చి ఉత్తమ సేవలందించిన సిబ్బందిని కమాండెంట్ అభినందించి సేవా పథకాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, ఆర్ఐలు ఆర్.పి.సింగ్, నర్సింహ, శ్రీనివాసులు, రాజేశం తదితరులు ఉన్నారు. ● పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు -
బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ అర్ధనగ్న నిరసన
అచ్చంపేట రూరల్: మూడేళ్ల క్రితం మన ఊరు– మన బడి పథకానికి ఎంపికై న పాఠశాలలో అదనపు గదులు, మరమ్మతు తదితర పనుల బిల్లులు చెల్లించడం లేదని ఓ కాంట్రాక్టర్ అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులు చేసి అప్పుల పాలయ్యానని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. మండలంలోని నడింపల్లికి చెందిన కాంట్రాక్టర్ శేఖర్ 2022– 23 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వం హయాంలో మన ఊరు– మనబడి పథకంలో నడింపల్లిలోని జెడ్పీహెచ్ఎస్లో గదుల మరమ్మతుకు రూ.40 లక్షలు మంజూరైతే రూ. 10 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. అదే విధంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.95 లక్షలు, ఆశ్రమ పాఠశాలలో రూ. 25 లక్షలు, ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో రూ.32 లక్షలు అప్పులు తెచ్చి సుమారు రూ.2 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు తెలిపారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ఇటీవలే నడింపల్లి పాఠశాల గదులకు తాళం వేసినా ఫలితం లేక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. -
యూరియాకు రైతుల బారులు
మండలానికి చెందిన రైతులు యూరియా కోసం శనివారం తెల్లవారుజాము నుంచే సింగిల్ విండో కార్యాలయం ఎదుట బారులు తీరారు. రెండు రోజులుగా మండలంలో సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. ఏఈఓలు రైతుల ఆధార్, పాసు పుస్తకాలు తనిఖీ చేసి యూరియా అందజేశారు. ఈ విషయమై ఏఓ కమల్కుమార్ మాట్లాడుతూ.. గత యాసంగి కంటే ఎక్కువగా పంట సాగు ఉందని, దీంతో యూరియా వినియోగం పెరిగిందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. – బిజినేపల్లి -
మెడికల్ సీట్లు పెరిగే అవకాశం?
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, వైద్యులు ఉన్నారు. 150 సీట్లతో 2016లో పాలమూరు ప్రభుత్వ కళాశాల ప్రారంభం ఇప్పటి వరకు 4 బ్యాచ్లు పూర్తి తాజాగా ఎన్ఎంసీ బృందం పర్యటన ప్రస్తుతం 175 మెడికల్ సీట్లు..200కు పెరిగే అవకాశం -
పీఎంశ్రీ నిధులను సంపూర్ణంగా వినియోగించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పీఎంశ్రీ ద్వారా పాఠశాలలకు మంజూరైన నిధులను సంపూర్ణంగా వినియోగించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్లోని పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పీఎంశ్రీ స్కీమ్ పరిధిలో ఉన్న పాఠశాలలలో యోగా, సైన్స్, గణిత ప్రయోగాలకు కావాల్సిన పరికరాల కొనుగోలు, విద్యార్థులకు విజ్ఞాన, పరిశ్రమల అవగాహన పర్యటనలు, కళలు–హస్తకళల వంటి సహ పాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణ కోసం మంజూరైన నిధులను సమయానికి, సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కేటాయించిన నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్స్ కాకుండా చూడాలని ఆమె ఆదేశించారు. పీఎంశ్రీ కింద 26 పాఠశాలలకు 20 రకాల గ్రాంట్లకు సంబంధించిన బిల్లులు సోమవారం నాటికి ఆన్లైన్లో సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, పీఏఓ యాదగిరి పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ విజయేందిర -
మానవ జీవితంలో సైన్స్ ఎంతో కీలకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సైన్స్ మానవ జీవితంలో ఎంతో కీలకంగా మారిందని, ఉదయం నిద్రలేచిన సమయం నుండి సాయంత్రం పడుకునే సమయం వరకు ప్రతి అంశం కూడా సైన్స్తో మిలితమైందన్నారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మైక్రోబయోలజీ, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో ‘‘అడ్వాన్సెస్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఫర్ డైవర్సిటీ అప్లికేషన్స్ అండ్ హ్యూమన్ వెల్పేర్ –2025’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జీవశాస్త్ర తాజా పరిశోధనల్లో సాంకేతిక ఆవిష్కరణలు, మానవ సంక్షేమానికి అవి చేసేసేవల గురించి చర్చించడానికి ఇది ఒక చక్కటి వేదిక అన్నారు. సైన్స్ మానవ జీవితాన్ని సులభతం చేసేందుకు నిరంతరం జరుగుతున్న పరిఽశోధనలు, ప్రయోగాలు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయన్నారు. నేటి ఆధునిక కాలంలో సైన్స్ రంగాల్లో విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని వారు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాల కోసం వేచి చూడకుండా వాటిని అందించే విధంగా ఆలోచన దృక్పదాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యూమెంట్లో దేశ వ్యాప్తంగా 20లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వివరించారన్నారు. వీటితోపాటు రైజింగ్ తెలంగాణ పాలసీలో కూడా ఉద్యోగ, ఉపాధి మెరుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో 15నెలల కాలంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, ముఖ్య విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యాలు కలిగిన విద్యను అందించేందుకు కృషి చేశామని, భవిషత్లో మరిన్ని మార్పులు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సెమినార్కు సంబంధించి సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీయూ మాజీ వీసీ భాగ్యనారాయణ, ఆర్జేడీ రాజేందర్సింగ్, ప్రిన్సిపాల్ పద్మావతి, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, ఓయూ మాజీ రిజిస్ట్రార్ భద్రయ్య, కన్వీనర్ హరిప్రసాద్, ముగింపు కార్యక్రమానికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యక్షుడు మహమూద్, పీయూ రిజిస్ట్రార్ రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి -
తల్లి మందలించిందని ఆత్మహత్య
గద్వాల (మల్దకల్): తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మేకలసోంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మేకలసోంపల్లికి చెందిన కుర్వ చిన్న ఆంజనేయులు, సుజాతమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె. వీరిలో మొదటి కుమారుడైన హరీష్ (18) వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. అయితే ఇటీవల తమ్ముడు తెచ్చుకున్న గొర్రె పిల్లలను సంతలో అమ్ముకున్నాడు. దీంతో తల్లి మందలించింది. ఈ క్రమంలో పురుగు మందు తాగగా గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపంతో యువకుడి బలవన్మరణం మద్దూరు: యువకుడు అత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అప్పిరెడ్డిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన భీమేష్ (22) ట్రాక్టర్ డైవర్గా పనిచేసేవాడు. వారం క్రితం కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడగా ఇటీవల యువతి ఇంటికి వెళ్లాడు. గమనించిన యువతి కుటుంబ సభ్యులు యువతిని పెళ్లి చేసుకోవాలని అప్పిరెడ్డిపల్లిలో పంచాయతీ నిర్వహించారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు శనివారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఊరేసుకున్నాడు. తన కొడు కును యువతి కుటుంబసభ్యులు బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని, వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య భూత్పూర్: మండలంలోని అమిస్తాపూర్కు చెందిన బోడ మహేష్ (32) కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మహేష్కు సిద్దాయిపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు కాగా భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్ధితి సరిగా లేకపోవడంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. శనివారం భార్యాభర్తలిద్దరూ గొడవ పడగా భార్య బయటికి వెళ్లింది. ఈ క్రమంలో తలుపులు వేసుకొని ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య తలుపు కొట్టిన తెరవకపోవడంతో పగలగొట్టి వెళ్లే సరికి మృతి చెందాడు. మృతుడి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇంద్రకల్ ఘటనపై సస్పెన్షన్ వేటు తాడూరు: మండలంలోని ఇంద్రకల్లోని ప్రభుత్వ పాఠశాల గేటు ఎదుట విద్యుత్ స్థంభానికి వేలాడుతున్న విద్యుత్ వైరు తగిలి 9వ తరగతి విద్యార్థి లోకేష్ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదం పొంచి ఉందని ముందే సమాచారం ఇచ్చినప్పటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో లైన్మెన్ సాయిప్రకాష్గౌడ్, ఆపరేషన్ డీఈ శ్రీధర్శెట్టిలపై సస్పెన్షన్ వేటు వేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారితో పాటు ఎస్ఈ నర్సింహ్మరెడ్డి, ఏడీ శ్రీనివాసులు, ఏఈ శ్రీరాములుకు మోమోలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఎద్దుల పట్టివేత వనపర్తి రూరల్: వాహనాల తనిఖీల్లో భాగంగా ఎద్దులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు పెబ్బేరు ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి స్థానిక సంత వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లలో 128 ఎద్దులు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో కంటైనర్లను పోలీస్స్టేషన్కు తరలించి.. ఎద్దులను మహబూబ్నగర్లోని శ్రీలక్ష్మి గోసంరక్షణ ట్రస్టుకు తాత్కాలిక ఆశ్రయం కోసం అప్పగించామన్నారు. 4 వాహనాలను సీజ్చేసి.. డ్రైవర్లు, యజమానులైన 12 మందిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. 24డబ్ల్యూఎన్పి804 : ఎద్దులను తరలిస్తున్న కంటైనర్లు ఇవే.. -
కృష్ణబ్రహ్మేంద్రస్వామి జాతర ప్రారంభం
గండేడ్: మండలంలోని పగిడ్యాల్లో కృష్ణ బ్రహేంద్రస్వామి(కృష్ణ తాత) జాతర కృష్ణ బ్రహేంద్రస్వామి మఠంలో ప్రారంభమయ్యాయి. ఏటా రథసప్తమి సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం పల్లకీసేవలో స్వామివారి వ్రిగహాన్ని ఉంచి ఆలయం చుట్టూ భజనకీర్తనలతో ప్రదక్షిణ గావించారు. శనివారం అఖండ భజన, నందికోల సేవతో భక్తుల సందడి మొదలైంది. గండేడ్, సల్కర్పేట్, బల్సుర్గొండ, అంచన్పల్లి, వెన్నాచేడ్, రంగారెడ్డిపల్లి, మన్సూర్పల్లి వంటి పరిసర గ్రామాలతోపాటు కోస్గి, గుండుమాల్, హన్వాడ మండలాల భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రథసప్తమి సందర్భంగా మహాఘట్టం, సాధుపూజ, పాదుకపూజ, గంగాస్నానం, మహాన్నదానం, రాత్రి 9గంటలకు డోలారోహణం నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త వెంకట్రాములు, సర్పంచ్ కిష్టయ్య, పీఎస్ కృష్ణనాయక్ వసతులు కల్పించడంతోపాటు జాతర సజావుగా సాగడానికి కృషి చేస్తున్నారు. ఎస్సై శేఖర్రెడ్డి ఎలాంటి ఆవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. -
పగిడ్యాల్లో.. ‘కృష్ణతాత’
● ప్రతిఇంటా ఆయన పేర్లే.. ● భక్తుల కోరికలు తీర్చే దైవంగా నమ్మకం ● కొనసాగుతున్న కృష్ణబ్రహ్మేంద్రస్వామి జాతర గండేడ్: గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం కృష్ణతాత మయంగా మారింది. ఇంటింటా ఆయన పేర్లే ఉన్నాయి. భక్తుల కోరికలు తీర్చే దైవంగా ఆయనను కొలవడంతోపాటు తమపేర్లు కూడా ఆయన పేరు పెట్టుకొని ఏ ఆపద వచ్చినా తమను వెన్నంటి ఉంటాడని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. రామయ్య, భాగ్యమ్మ సంతానమైన కృష్ణతాత వయస్సు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికంలో మునిగి తేలుతూ తన సహజత్వాన్ని బయట పెడుతూ వచ్చాడు. 1934లో జన్మించిన కృష్ణతాత 91ఏళ్లపాటు జీవించారు. రోజుల తరబడి ధ్యానముద్రలో.. కృష్ణతాత రోజుల తరబడి నిద్రాహారాలు మాని ధాన్యంలోకి వెళ్లిపోయేవాడు. కొండలు గుట్టలతోపాటు నీళ్లల్లో సైతం రోజుల తరబడి తిండితిప్పలు లేకుండా ఉండేవాడని పలువురు చెబుతున్నారు. అప్పట్లో ఎవరూ వెళ్లని చెన్నరాయుడి గుట్టకు వెళ్లి రోజుల తరబడి ఉండేవాడు. రుషీశ్వరులతో కలిసి తపస్సు చేసేవాడని కథలుకథలుగా చెబుతున్నారు. ఈయన వద్దకు మహబూబ్నగర్లో అబ్దుల్ ఖాదర్ దర్గాగా పిలువబడుతున్న అబ్దుల్ ఖాదర్, షాషాబ్గుట్టగా పిలవబడుతున్న షాషాబ్వంటి పెద్దపెద్దవారు వవ్చి వెళ్లేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆయనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భక్తులు, శిష్యులు చాలామంది ఉన్నారు. కులాలకతీతంగా అందరినీ చేరదీసే వారని ఆయన భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీలను దగ్గరగా కూర్చోబెట్టుకోవడమేకాక సామూహిక అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. ఆధ్యాత్మిక సత్సంగాలతోపాటు భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. తాతపై విశ్వాసంతోనే.. గ్రామంలో ఎక్కువ శాతం మంది కృష్ణతాత పేర్లే పెట్టుకున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏరోగం వచ్చినా తాతను సంప్రదించేవారు. ఇప్పటికి కూడా చాలామంది ఎలాంటి అనారోగ్యానికి గురైనా తాతను దర్శించుకొని అక్కడున్న విభూతి రాసుకుంటే తగ్గిపోందనే నమ్మకం చాలా మందిలో ఉంది. సహజసిద్ధుడైన తాతను నమ్ముకున్నవారు వివిధ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. ప్రతిఏటా తాతా పేరుమీద చాలా కార్యక్రమాలు జరుగుతాయి. – వెంకట్రామచారి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త భగవత్ స్వరూపడని భావించి కృష్ణతాత భగవాన్ స్వ రూపడని మా నమ్మకం. తాతాపై ఉన్న భక్తి, న మ్మకంతోనే మాపెద్దలు తాతపేరు వచ్చేలా పె ట్టారు. తాతపేరు పెట్టుకుంటే అనారోగ్యం కలగదని, చీడపీడలు, దు ష్ట శక్తులు దరిచేరవని నమ్మకం. అంతా మంచే జరుగుతుందనేది మా నమ్మకం. జాతర ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటాం. మిగతా సమయంలో కూడా తాతను కొలుస్తుంటాం. – అన్నసారం కృష్ణారెడ్డి, పగిడ్యాల్ ఇంటింటా తాతపేరు పగిడ్యాల్లో ప్రతిఇంట్లో ఒకరికి కృష్ణతాత పేరు ఉంది. కృష్ణయ్య, కృష్ణప్ప, చిన్నకృష్ణయ్య, పెద్దకృష్ణయ్య, నడిపి కృష్ణయ్య, కృష్ణారెడ్డి ఇలా రకరకాలుగా తాతాపేరు వచ్చేలా పేర్లు పెట్టుకున్నారు. ఈ గ్రామం వారికి కృష్ణతాతపై అమితమైన భక్తి. అందుకే పేర్లు పెట్టుకోవడంతోపాటు తాత సేవలో తరిస్తుంటారు. -
పీయూ బంగారు పతకం సాధించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో నిర్వహించే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ క్రికెట్ జట్టు శనివారం పయనమైంది. ఈ మేరకు జట్టు సభ్యులను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించి క్రీడా దుస్తులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నిబద్ధతతో ఆడి జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటాలని ఆకాక్షించారు. పీయూ గోల్డ్ మెడల్ సాధించాలని, క్రీడల్లో మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కృష్ణయ్య, పీడీ శ్రీనివాస్, కోచ్లు మన్నన్, సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు బయలుదేరిన పీయూ క్రికెట్ టీం -
150 గ్రాముల గంజాయి సీజ్
మహబూబ్నగర్ క్రైం: కోయిల్కొండలో ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన తనిఖీలో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఎస్ఐ కరుణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కోయిల్కొండ మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద చేసిన తనిఖీల్లో శ్రీకాంత్, కేశవులు అనే ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న పాకెట్లలో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 150 గ్రాముల ఎండు గంజాయి, సెల్ఫోన్ సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయాలపై 87126 58872కు సమాచారం ఇవ్వాలని సీఐ వీరారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనకు బల్మూర్ విద్యార్థి బల్మూర్: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కిరణ్సాగర్ జాతీయ స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై నట్లు జీహెచ్ఎం నరేందర్రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగిన దక్షణ భారత సైన్స్ ఫెయిర్లో ఎలాంటి బ్యాటరీ, ఆయిల్ లేకుండా సోలార్తో నడిచే కలుపుతీత యంత్రాన్ని ప్రదర్శించి ప్రతిభ చాటడంతో జాతీక స్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. కాగా జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థితో పాటు గైడ్ టీచర్ను ఉపాధ్యాయులు అభినందించారు. ఇద్దరు యువకుల అరెస్టు -
కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజులరెడ్డి ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మెప్మా ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వచ్చే మార్చి 31లోగా ప్రతి ఆర్పీ పది చొప్పున కొత్త గ్రూపులు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఉన్న సుమారు 3,100 సంఘాలతో పాటు కనీసం మరో వేయి కొత్తవి ఉండాలన్నారు. ఇప్పటివరకు కేవలం 120 మాత్రమే ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తామని, ఇంటింటికీ తిరిగి వీలైనన్ని ఎక్కువ సంఘాలలో మహిళలను చేర్పించాలన్నారు. ఇన్చార్జి డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు పాల్గొన్నారు. కాంగ్రెస్లో పోటాపోటీ దరఖాస్తులు స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో స్వీకరించారు. ఆయా డివిజన్లకు నియామకమైన కోఆర్డినేటర్లు టికెట్ ఆశిస్తున్న వారినుంచి దరఖాస్తులు తీసుకున్నారు. 60 డివిజన్లకు 293 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆయా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సర్వే నిర్వహించే అవకాశం ఉంది. రూ.11 వేలకు చేరువలో వేరుశనగ జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో వేరుశనగ ధర రూ.11 వేలకు చేరువైంది. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం క్వింటా రూ.609 పెరిగింది. మార్కెట్కు 1,757 క్వింటాళ్ల వేరుశనగ విక్ర యానికి రాగా క్వింటా గరిష్టంగా రూ.10,889, కనిష్టంగా రూ.8203 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,771, కనిష్టంగా రూ.2,369, కందులు గరిష్టంగా రూ.7,639, కనిష్టంగా 6,125, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,979, కనిష్టంగా రూ.1,931, పత్తి గరిష్టంగా రూ.7,629, కనిష్టంగా రూ.6,869, ఉలువలు రూ.4,569, మినుములు రూ.6,899 పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు గరిష్టంగా రూ.7,020, కనిష్టంగా రూ.7,002గా ధరలు లభించాయి. మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ఇన్చార్జిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం నియమించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, భూత్పూర్ మున్సిపాలిటీకి ఏఎంసీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, దేవరకద్రకు మాజీ చైర్మన్ పల్లె రవి, కొత్తకోటకు పార్టీ సీనియర్ నేత పటేల్ విష్ణువర్ధన్రెడ్డిలను నియమించారు. అలాగే జోగుళాంబ జిల్లా పరిధిలోని గద్వాల మున్సిపాలిటీ ఇన్చార్జిగా శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నియామకం అయ్యారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్చార్జిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రాజీవ్సాగర్, కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఉప్పల వెంకటేష్గుప్తాలను నియమించారు. -
ట్రిపుల్ఐటీ కల నిజం చేసేందుకు ఉచిత శిక్షణ
● అర్హత పరీక్ష ద్వారా 150 మంది విద్యార్థుల ఎంపిక ● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి స్టేషన్ మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థిక పరిమితుల వల్ల ట్రిపుల్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేకపోతున్న విద్యార్థులకు నాణ్యమైన ఉచిత ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బోయపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైటీసీ భవనంలో విద్యార్థులకు నెల రోజుల పాటు రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణ అందజేస్తామని తెలిపారు. రూ.200 కోట్లతో ట్రిపుల్ఐటీ భవన నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి ఈనెల 17న భూమిపూజ చేసినట్లు వివరించారు. గతేడాది ట్రిపుల్ఐటీలో ఉమ్మడి జిల్లా నుంచి 5 శాతం విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందలేకపోయారన్నారు. కనీసం ఈ ఏడాది 15 నుంచి 20 శాతం విద్యార్థులు సీట్లు సాధించాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ ఫస్ట్, వందేమాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈనెల 10న నగరంలోని మాడ్రన్ స్కూల్లో మెరిట్ అర్హత పరీక్ష నిర్వహించామని, జిల్లా పరిధిలోని 17 మండలాల నుంచి 750 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. వీరిలో మెరిట్ ఆధారంగా 150 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి 75, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి మరో 75 మంది ఎంపికై నట్లు చెప్పారు. ఈ విద్యార్థులకు ఈనెల 27వ తేదీ నుంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వసతి, భోజన వసతులు అన్ని ఉచితంగానే కల్పిస్తామని తెలిపారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు రూ.30 కోట్లు, బాలుర జూనియర్ కళాశాలకు రూ.7.95కోట్లు, బాలికల జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.6.86 కోట్లు, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల కోసం రూ.2కోట్లు మంజూరు చేయించామన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, డీఈఓ ప్రవీణ్కుమార్, వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి, సిరాజ్ఖాద్రీ, గుండా మనోహర్, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
గుప్తనిధుల కోసం అడవిలో బ్లాస్టింగ్
బల్మూర్: నాగర్కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతమైన బల్మూర్ మండలం బిల్లకల్ అటవి ప్రాంతంలో (ఏడు నంధుల వద్ద) గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం ఏకంగా బ్లాస్టింగ్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. బిల్లకల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన అడవిలోని సలేశ్వరం వెళ్లే నడక దారిలో గల ఏడు నంధుల వద్ద పాపమ్మ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ గుప్తనిధుల కోసం బ్లాస్టింగ్ చేయడంతో పాటు బండరాళ్లపై బ్లాస్టింగ్కు యంత్రంతో రంధ్రాలు చేసి పూసలతో పేల్చి తవ్వినట్లు ఆనవాళ్లు లభించాయి. దీనిని గమనించిన అటవిశాఖలో పని చేసే ఓ వాచర్ సమాచారం ఇవ్వడంతో శనివారం వెలుగులోకి వచ్చింది. కాగా అడవిలోకి ఎవరైన కొత్త వ్యక్తులు వెళ్లాలంటే బిల్లకల్ సమీపంలోనే రుసుల చెరువు వద్ద చెక్ పోస్టు ఉంది. అక్కడ సీసీ కెమోరా కూడా ఉంది. దుండగులు అడవిలోకి ఏమార్గం ద్వారా వచ్చి ఉంటారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బ్లాసింగ్ చేసిన శబ్ధం రాకుండా కూడా దుండగులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు -
నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు సాక్షి, నాగర్కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిశిత పరిశీలన.. మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరులో.. రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి.. ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా? ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి -
రమణీయం.. పూలరథం
● కనులపండువగా గ్రామవీధుల్లో ఊరేగింపు ● నేడు గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం(పెద్దతేరు) జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్పరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ రాజగోపురం ఎదురుగా చిన్నతేరును ఉంచి పుష్పాలతో అలంకరించి బలిహరణం, హోమం జరిపించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో రథానికి పూజలు చేశారు. ఆలయంలో నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేళతాళాలు, భక్తుల గోవింద, చెన్నకేశవస్వామి నామస్మరణలమధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. ఉత్సవ విగ్రహాలకు పూజలు చేసిన పండితులు తాడుతో రథాన్ని లాగారు. పుష్పరథం కనులపండువలా గ్రామపురవీధుల్లో ఊరేగింపు చేశారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఊరేగింపు గ్రామం చివరన ముగించారు. పుష్పరథోత్సవం పురస్కరించుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులతోపాటు సర్పంచ్, వార్డుసభ్యులు, భక్తులు పెద్దసంఖ్యలో పుష్పరథోత్సవంలో పాల్గొన్నారు. నేడు రథోత్సవం ఉత్సవాల్లో భాగంగా రథసప్తమి పురస్కరించుకుని ఆదివారం రాత్రికి స్వామివారి పెద్దతేరు రథోత్సవం జరపనున్నారు. రథోత్సవానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. -
ఓటరు పేర్లు పపపపపప, సీమాంధ్ర
● తుది ఓటరు జాబితాలో విచిత్రమైన పేర్లుజెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు దొర్లడం సహజం. పేర్లు తప్పులు పడడం, ఒక వార్డులో ఉన్న వారి పేర్ల మరో వార్డులో పడడం. తండ్రుల పేర్లు తప్పుడు పడడం చూశాం. కానీ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాలో చిత్రవిచిత్రమైన పేర్లు దర్శనమిచ్చాయి. ఓటరు పేరు పపపపపప, తండ్రి పేరు పపపపపప, మరో ఓటర్ పేరు సీమాంధ్ర అని వచ్చాయి. కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కొత్తగంజ్ ప్రాంతంలోని 169, 170 పోలింగ్స్టేషన్లో పరిధిలోని ఓటరు జాబితాలో ఇవీ కనిపించాయి. ఓటరు తుది జాబితా విడుదలకు ముందు ముసాయిదా జాబితాలో ఇతర గ్రామాలకు చెందిన ఓట్లు మున్సిపాలిటీలో వచ్చిన విషయం తెలిసిందే. వీటిని సవరించి అధికారులు విడుదల చేసిన తుది జాబితాలో కూడా ఇలాంటి తప్పుడు రావడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్తోపాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది. -
పగిడ్యాల్లో ‘కృష్ణతాత’
గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కృష్ణతాత ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. –8లో uఓటరు నమోదుకు కావాల్సినవి.. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు నమోదుకు నిర్దేశించిన ఫారం–6, ఫారం–6ఏలను జతచేసి దరఖాస్తుదారులు వివరాలను పొందుపరచాలి.రెండు ఫొటోలు, వయసు ధ్రువీకరణ కోసం ఎస్ఎస్సీ మెమో, చదువులేని వారికి ఆధార్కార్డు, నివాస ధ్రువపత్రం లేదా కరెంటు బిల్లు అవసరం. ఓటరు నమోదు, ఎన్నికలకు సంబంధించి 1950 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. -
అనాథలకు బాలసదన్ ఓ ఇల్లు: ఎంపీ
మహబూబ్నగర్ రూరల్: మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ మెట్టుగడ్డలోని స్టేట్హోమ్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.34 కోట్ల నిధులతో బాలికల కోసం నూతనంగా నిర్మించిన బాలసదన్ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనాథ పిల్లలకు బాలసదన్ ఒక ఇంటిలా మారుతుందని, ఇక్కడ వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా బాలికలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, బాలసదన్ల ద్వారా వారికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్య పరీక్షలు, విద్య అందిస్తూ భవిష్యత్కు బలమైన పునాది వేస్తున్నామని అన్నారు. అనాథ పిల్లల దత్తత ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తూ వారికి కొత్త కుటుంబాలు లభించేలా కృషి చేస్తున్న జిల్లా సంక్షేమశాఖ సిబ్బందిని ఎంపీ అభినందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి బాలసదన్లో చేర్చి, వారికి ఆహారం, ఆరోగ్యం, విద్య అందించి వారి స్వర్ణ భవిష్యత్కు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ బాలసదన్లోని పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా సంరక్షణ అందించాలని ఆదేశించారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ డీకే అరుణ బాలసదన్ పిల్లలతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామచంద్రం, శిశుగృహ మేనేజర్ గణేష్బాబు, బీజేపీ జాతీయ కౌన్సిల్మెంబర్ పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు కృష్ణవర్ధన్రెడ్డి, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. -
కనులపండువగా శ్రీవారి కల్యాణం
బిజినేపల్లి: పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్వామివారి మూలవిరాట్కు నిత్యారాధన, ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. అనంతరం ఉదయం 11 గంటలకు అలివేలుమంగ సమేత శ్రీవారి ఉత్సవమూర్తులకు కల్యాణతంతు ప్రారంభించారు. వందలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఆలయ అర్చక బృందం మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు కురవి రామానుజాచార్యులు కల్యాణం తిలకించిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ– 3 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పీయూ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాలను వీసీ శ్రీనివాస్, కంట్రోలర్ ప్రవీణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, కాపీయింగ్కు ఎలాంటి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. శుక్రవారం మొత్తం తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో 1,830 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా .. మహిళ మృతి
● మరో మహిళ పరిస్థితి విషయం ● ఏడుగురికి గాయాలు ధన్వాడ: ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మరికల్ మండలం అపంపల్లి గ్రామంలో వరినాట్లు వేసేందుకు అదే గ్రామానికి చెందిన ఆటో కూలీలను ఎక్కించుకునేందుకు ధన్వాడకు వచ్చింది. స్థానికంగా కంచుకోట వీధిలోని గంగమ్మ దేవాలయం వద్ద 15 మహిళా కూలీలను ఎక్కించుకొని అపంపల్లికి వెళ్తుంది. ఈ క్రమంలో ధన్వాడ పాత పోలీసు స్టేషన్ సమీపంలో పంది అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో కూర్చున్న దండు జయమ్మ, బోయినిపల్లి మంజులకు తీవ్రగాయాలు కావడంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దండు జయమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే విధంగా మంజుల పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వీరితో మరో ఏడుగురు స్వల్పంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి జయమ్మ కుమారుడు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. రూ.5 లక్షలు పరిహారం ఆటో ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి న్యాయం చేయలంటూ పోలీసు స్టేషన్ వద్ద బంధువులు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆటో యజమాని తరుఫున పలువు రు పంచాయతీ చేపట్టారు. రూ.20 లక్షలు ఇవ్వా ల ని డిమాండ్ చేయడంతో రూ.5 లక్షలు పరిహారం ఇచ్చేందుకు సమ్మతి తెలిపినట్లు సమాచారం. -
క్యూలైన్లో బారులు.. ట్రాఫిక్పై ఆంక్షలు
నిజరూప దర్శనం.. కలశాలతో అభిషేకం వసంత పంచమి వేళ భక్తులకు జోగుళాంబ మాత నిజరూప దర్శనాన్ని వీక్షించే భాగ్యం కలిగింది. నిజరూప దర్శనమిచ్చిన జోగుళాంబ మాతకు సహస్ర ఘట్టాలతో విశేషాభిషేకాలు జరిగాయి. పంచామృతాలతోపాటు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పండ్లరసాలు, కుంకుమ, పసుపు, భస్మం, గంధం, పన్నీరు, సుగంధద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. జోగుళాంబ మాతను భక్తులు వివిధ అలంకరణలో వీక్షించే అవకాశం నిరంతరం కలుగుతుంది. కానీ వార్షిక ఉత్సవాల్లో వసంత పంచమిరోజు భక్తులకు నిజరూప దర్శన ప్రాప్తి కలిగింది. అశేష భక్తజనం అమ్మవారి అభిషేకాన్ని తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం జోగుళాంబ మాతకు పట్టువస్త్రాలతో అలంకరించి రకరకాల పూలమాలలు, నిమ్మకాయాల హారాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. అమ్మవారికి దశవిదహారతులు సమర్పించారు. జోగుళాంబ అమ్మవారి అభిషేకానికి, దర్శనాలకు భక్తులు బారులుదీరారు. ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులరాక ఆరంభమైంది. సమయం గడిచే కొద్దీ సుదూర ప్రాంతాల భక్తులు, ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలోని వివిధ కాలనీల నుంచి భక్తులు కలశాలను శిరస్సున ధరంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. భక్తుల తాకిడి అంతకంత పెరిగింది. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నారు. సాధారణ భక్తులు, కలశాలతో వచ్చే భక్తులు, వీఐపీలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలు, ప్రముఖుల తాకిడి పెరగడంతో సాధారణ క్యూలైన్, కలశాలతో వచ్చే భక్తులు అభిషేకానికి, దర్శనాలకు నిరీక్షించాల్సి వచ్చింది. ఆలయ ఈఓ దీప్తి, సీఐలు రవిబాబు, టాటాబాబు ఆధ్వర్యంలో పోలీసులు క్యూలైన్లో భక్తులు ఎక్కువసేపు నిరీక్షించకుండా చర్యలు చేపట్టారు. వాహనాల సంఖ్య పెరగడంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా పట్టణ ముఖద్వారం వద్ద కోర్టు పక్కన వాహనాలను నిలిపివేఽశారు. ప్రముఖల వాహనాలు ఎక్కువ కావడంతో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. -
ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు స్వయంగా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఇన్నోవేషన్ లెర్నింగ్ సంస్థ సీఈఓ స్వాతి రుషిత అన్నారు. జేపీఎన్సీ కళాశాలలో శుక్రవారం ఆంత్రపెన్యూర్షిప్పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రుషిత మాట్లాడుతూ.. విద్యార్థులు నూనత ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకోవాలని, వీటికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటివి వీటికి ఎంతో దోహదపడతాయన్నారు. ఆవిష్కరణలకు తెలంగాణ టీ–హబ్ వరంగా ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు దివ్య, మధులశ్బాబు, గురురాఘవేందర్రెడ్డి, రాహుల్, దివ్యతేజ, స్రవంతి, నితీశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు సంగీత
మహబూబ్నగర్ క్రీడలు: నవాబ్పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన కావలి సంగీత జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 27 నుంచి 30 వరకు జరిగే 72వ సీనియర్ నేషనల్ మహిళా కబడ్డీ చాంపియన్షిప్కు ఎంపిక కావడంతో జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు శాంతికుమార్ హర్షం వ్యక్తం చేశారు. సంగీతను రాష్ట్ర జట్టులో ఎంపిక చేసినందుకు రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్రెడ్డికు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కందనూలు: జిల్లాకు చెందిన శివ, రాజేశ్వరీ, చైతన్య, అరవింద్, సంతోష్ క్రాస్ కంట్రీ పోటీల్లో సత్తా చాటి నేషనల్ లెవల్కు ఎంపికై నట్లు కోచ్ స్వాములు శుక్రవారం తెలిపారు. ఈనెల 2న హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ కేటగిరీల్లో పది కిలోమీటర్ల పరుగు పందెంలో సత్తా చాటడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి జార్ఖండ్లోని రాంచీలో జరిగే నేషనల్ లెవల్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈమేరకు విద్యార్థులను జిల్లా అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ శుక్రవారం అభినందించి జాతీయస్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
సంస్కరణలతో రైతులు, పేదలకు ప్రయోజనం
జడ్చర్ల టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం విశిష్టత, నూతన సంస్కరణల అనంతరం రైతుకూలీలు, పేదలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్, లింగంపేట, రామస్వామిగుట్టతండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండా, గద్దెను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో పథకంలో అనేక లొసుగులు ఉండటంతో అక్రమాలు జరిగేవని, మోడీ సర్కారు తీసుకొచ్చిన మార్పులతో అవినీతికి తావులేకుండా పోయిందన్నారు. వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా పథకం రూపొందించబడిందని వివరించారు. పనులు చేసిన తర్వాత 15రోజుల్లోగా కూలీలకు వేతనాలు చెల్లించాలనే నిబంధనతో పారదర్శకత తీసుకొచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీ రామ్ జీ పథకంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకురాలు పద్మజారెడ్డి, జనార్దన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాలవర్ధన్గౌడ్, నర్సింహులు, మండలాధ్యక్షుడు రామకృష్ణ, రమేశ్జీ, గణపతి, శ్రీశైలం ముదిరాజ్, మోహన్నాయక్, మురళి పాల్గొన్నారు. -
బాలికలకు హక్కులపై అవగాహన ఉండాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఇందిర హాజరై మాట్లాడారు. బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, విద్య ప్రాధాన్యత తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా బాలికలకు రక్షణ కల్పిస్తున్న పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి బాలికకు సమాన గౌరవం, సమాన అవకాశాలు, రక్షణ లభించాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో హక్కులను పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీజే మమతారెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులకు సాక్షి స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సాక్షి మహబూబ్నగర్ బ్రాంచ్ మేనేజర్ శ్యాంసుందర్ అన్నారు. శుక్రవారం సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డు పాఠశాలలో ఎస్సెస్సీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ముఖ్య అతిధిగా హాజరైన మేనేజర్ మాట్లాడుతూ.. సాక్షి మెటీరియలతో సులభంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పరీక్షల సమయంలో సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. పరీక్షలపై దృష్టి పెట్టి మంచి మార్కులు సాధించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కులేషన్ ఇన్చార్జి రాజేందర్, తౌఫిక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ -
బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా రామాంజులరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ను మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా, ఈయన రెండురోజుల క్రితమే జీహెచ్ఎంసీ పరిధిలోని ముషీరాబాద్ జోన్ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యాడు. రేపు ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో ఈనెల 25వ తేదీన ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో జరిగే హెచ్సీఏ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారిణులు ఆధార్కార్డు, రెండు ఫొటోలతో ఉదయం 10 గంటలకు మైదానంలో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. నేడు బాలికలకు చట్టాలపై అవగాహన జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 0 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు బాలిక హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో అన్ని పాఠశాలలు, కళాశాలలో వారి హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 121 పోక్సో కేసులు నమోదయ్యాయని తెలిపారు. బాల్య వివాహాలపై పిల్లలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించనున్నట్లు, తనను తాము రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 53 బాల్య వివాహాలను ఆపడం జరిగిందని, జిల్లాలో ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కళాజాతా కళాకారులతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. లింగ నిర్ధారణ చేయకుండా డయాగ్నస్టిక్ సెంటర్లను నియంత్రించడంతో పాటు బ్రూణ హత్యలు జరగకుండా ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. కాంగ్రెస్లో ఎన్నికల సందడి ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ స్టేషన్ మహబూబ్నగర్: కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. కార్పొరేషన్లోని 60 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. గతంలోనే పది డివిజన్లకు ఇద్దరేసి కోఆర్డినేటర్లను నియమించారు. మొదటగా ఈ నెల 5, 6 తేదీల్లో వ్యక్తిగత వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరించారు. 60 డివిజన్లకు దాదాపు 376 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో తాజాగా డివిజన్ల వారీగా రిజర్వేషన్ ప్రకారం ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు అందజేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు శనివారమే ఆఖరి రోజు కావడంతో నేడు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆయా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సర్వే నిర్వహించి.. గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు సర్వే నిర్వహించే అవకాశం ఉంది. ఆయా డివిజన్లలో ప్రజలు, కాంగ్రెస్ అభిమానులను కలిసి ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందోనన్న విషయాలను సీనియర్ నాయకులు సేకరించనున్నారని సమాచారం. -
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. అలంపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన విజయుడు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అంతా తానై అధికారం చెలాయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ అధికారిక కార్యక్రమాలతో పాటు నిత్యం జరుగుతున్న ఇసుక, మట్టి, మొరం, అసైన్డ్ భూముల దందాల్లో చక్రం తిప్పతున్నారు. ఏ పని అయినా ఆయనకు కమీషన్, వాటా ముట్టనిదే ముందుకు కదలడం లేదనే టాక్ ఉంది. తన మాట వినని అధికారులను బెదిరిస్తున్నట్లు ఇటీవల ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. గద్వాలలో సైతం ఖాకీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారని.. తనను లెక్కచేయని ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీ వెనుక ఆయన ‘హస్తమే’ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులో ఈ నెల 20వ తేదీన ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. వివిధ అభివృద్ధి పనులకు టెంకాయ కొడుతున్న సమయంలో ఇరువురితో పాటు వారి వారి అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎంపీ మల్లు రవి తోసివేస్తూ దుర్భాషలాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్గా మారగా.. రాజకీయ రచ్చకు తెరలేసినట్లయింది. దీనిపై ఎమ్మెల్యే విజయుడిని దూషిస్తూ అవమానం చేసిన ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీ వేదికగా మల్లు రవి ‘నేను ఎమ్మెల్యేను తిట్టింది గానీ, కొట్టింది గానీ లేదు. కానీ నేను ఎమ్మెల్యేపై భౌతిక దాడి చేశానని కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారు నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటా’ అని ప్రతిస్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు గద్వాల జిల్లాలో ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఇంటర్లో వందశాతం ఫలితాలు సాధించాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్లో 100శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ విజయేందిరబోయి సూచించారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇంటర్మీడియట్ ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, అందులో మంచి ప్రతిభ కనబర్చిన వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. పరీక్షలకు నెల రోజుల సమయం ఉన్నందున ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు సిద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవం, అర్హతలు ఉన్న అధ్యాపకులు ఉన్నారని, వారి బోధనలో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం ఐఏఎఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజినీరింగ్ చేశారని గుర్తు చేశారు. లక్ష్య సాధనకు పేదరికం అడ్డుకాదని, ప్రతి రోజూ న్యూస్ పేపర్లు చదివి, పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుందన్నారు. మంచి ఆహారం తీసుకుని ఆటల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సీఎం కప్ క్రీడలు
జిల్లావ్యాప్తంగా 7 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు ● గ్రామ క్టస్లర్ స్థాయిలోకొనసాగుతున్న క్రీడలు ● 28 నుంచి మండల, వచ్చే నెలలో అసెంబ్లీ, జిల్లాస్థాయి పోటీలు మహబూబ్నగర్ క్రీడలు: ఈ ఏడాది సీఎం కప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తోంది. ఈనెల 17వ తేదీన మహబూబ్నగర్లో జరిగిన సభలో సీఎం రేవంత్రెడ్డి రెండో ఎడిషన్ సీఎం కప్ రోలింగ్ షీల్డ్, జెర్సీ, పోస్టర్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ● సీఎం కప్ క్రీడాపోటీలతో గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం ఉంటుంది. దాదాపు 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీ క్లస్టర్ స్థాయిల్లో సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా. ఫుట్బాల్ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఆయా క్లస్టర్లకు డీఎస్ఏ కోచ్లను ఇన్చార్జిలుగా నియమించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ పలు గ్రామాల్లో జరుగుతున్న సీఎం కప్ క్రీడలను పరిశీలిస్తున్నారు. ● గ్రామ పంచాయతీస్థాయి ఎంపికల అనంతరం సీఎం కప్ క్రీడాపోటీల్లో భాగంగా ఈనెల 28 నుంచి 31 వరకు మండల/అర్బన్ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. వచ్చేనెల 3 నుంచి 5 వరకు అసెంబ్లీస్థాయి, 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 20 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. చిన్నచింతకుంటలో శుక్రవారం జరిగిన సీఎం కప్ క్రీడల ఎంపికలకు లైవ్ టెలికాస్ట్ నిర్వహించారు. ఈ ఎంపికలను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి పర్యవేక్షించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 7,628 క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో పురుషులు 5,415, మహిళలు 2,213 తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లో పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే సీఎం కప్ క్రీడాపోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం బాధ్యత
● ప్రాణాలు కాపాడే రక్షణ కవచం హెల్మెట్ ● ఎస్పీ జానకి మహబూబ్నగర్ క్రైం: ప్రతి వాహనదారుడికి హెల్మెట్ ప్రాణాలను కాపాడే ముఖ్యమైన రక్షణ కవచం అవుతుందని, దీని వల్ల జరిగే ప్రాణ రక్షణపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అరైవ్–అలైవ్ నినాదంతో పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. ర్యాలీ క్లాక్టవర్, అశోక్ టాకీస్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, మెట్టుగడ్డ మీదుగా తిరిగివన్టౌన్ కూడలి వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతి పోలీస్ వాహనదారుడు హెల్మెట్ ధరించి దాని ప్రాముఖ్యతను తెలియజెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ప్రధానంగా సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని, దీని వల్ల ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి నిబంధనలు పాటించాలన్నారు. -
వేరుశనగకు రికార్డు ధర
● బాదేపల్లి, కల్వకుర్తి మార్కెట్లో క్వింటా రూ.10వేలకు పైనే.. ● ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర జడ్చర్ల/నారాయణపేట/కల్వకుర్తి రూరల్/దేవరకద్ర: ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా క్వింటా వేరుశనగ రూ.10 వేలు దాటింది. శుక్రవారం బాదేపల్లితో పాటు కల్వకుర్తి మార్కెట్లో ఈ ధరలు పలకడం విశేషం. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం క్వింటా కు రూ.411 పెరిగింది. మార్కెట్కు 1,679 క్వింటాళ్ల విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ.10,280, కని ష్టంగా రూ.7,560 ధరలు లభించాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,263గా ఉంది. గతే డాది కనీసం మద్దతు ధర కూడా లేదని, త్వరలోనే క్వింటా ధర రూ.11 వేలు పలకవచ్చని వ్యాపా రులు అంచనా వేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,752, కనిష్టంగా రూ.2,649, కందులు గరిష్టంగా రూ.7,801, కనిష్టంగా రూ. 5,766, మొక్కజొన్న రూ.1,921 ధరలు పలికాయి. కల్వకుర్తి మార్కెట్లో వేరుశనగా గరిష్టంగా రూ. 10,200, కనిష్టంగా రూ.9,369 ధర లభించింది. కందులు క్వింటాల్కు రూ.7,009 ధరకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. ● నారాయణపేటలో వేరుశనగ గరిష్టంగా రూ. 8,935, కనిష్టంగా రూ.6,930, ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,308, కనిష్టంగా రూ.6,369, తెల్ల కందులు గరిష్టంగా రూ.8,270, కనిష్టంగా రూ.6,422 గా దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ.7,059, కనిష్టంగా రూ.6,959గా ధరలు నమోదయ్యాయి. -
గంజాయి తాగుతున్న యువకుల అరెస్టు, రిమాండ్
తెలకపల్లి: గంజాయి సేవిస్తున్న యువకులను పోలీసులను పట్టుకొని రి మాండ్కు తరలించినట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్కే కోహినూర్ పంక్షన్ హాలు సమీపంలో గంజా యి సేవిస్తుండగా కొంతమంది యువకులపై పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. మొత్తం ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు తెలిపా రు. తెలకపల్లికి చెందిన జహీర్ఖాన్, రాకొండకు చెందిన బొమ్మసాని సా యి, అచ్చంపేటకు చెందిన గోపి, ఎస్కే ఖాజ, రామకృష్ణ ఉన్నారు. వారి దగ్గర 12 గ్రాముల గంజాయి, 3 సెల్ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయిని హైదరాబాద్లోని సురేశ్ అనే యువకుడి వద్ద కొనుగోలు చేసి మూడేళ్లుగా అలవాటు పడ్డారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. యువత గంజాయికి బానిస కావద్దని విలువైన జీవితాలను బలి చేసుకోవద్దని ఎస్ఐ పేర్కొన్నారు. -
నిజరూప దర్శనం
నేడు జోగుళాంబమాత అలంపూర్: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం అలంపూర్లో వెలిసిన జోగుళాంబమాత వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారంతో ముగుస్తాయి. చివరి రోజు అమ్మవారికి సహస్ర ఘట్టాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా గురువారం కుంకుమార్చనలు, త్రిశతి అర్చన, ఖడ్గమాల అర్చనలు విశేషంగా జరిపించారు. చండీహోమం, పవమానసూక్త పారాయణ, అవాహిత దేవతా హోమాలు కొనసాగాయి. శుక్రవారం వసంత పంచమి సందర్భంగా జోగుళాంబ అమ్మవారు నిజ రూపంలో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కలశాలను ధరించి ఊరేగింపుగా వచ్చే భక్తులకు సైతం ప్రత్యేక క్యూలైన్లు కల్పిస్తున్నారు. తాగునీరు, ఉచిత ప్రసాదాలు, అన్నప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల చివరి రోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆవాహిత దేవతా హోమాలకు పూర్ణాహుతి సమర్పిస్తారు. గంటలేశ్వర ఆలయం నుంచి జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు జాతర ప్రారంభం కానుంది. గ్రామదేవత వేషధారణలో కళాకారులు, కలశాలతో మహిళ భక్తులు ఊరేగింపు నిర్వహిస్తారు. జోగుళాంబ సేవా సమితి సభ్యులు అమ్మవారికి సుగంధ ద్యవాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అభిషేక దర్శనాన్ని భక్తులు నిజరూప దర్శనంగా భావిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిజరూప దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం అమ్మవారికి అభిషేక అనంతరం అలంకారం, భక్తులకు సాధారణ దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. చివరిగా ఆలయంలో దశవిద హారతి అనంతరం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి పేర్కొన్నారు. విద్యుత్ కాంతుల వెలుగులో జోగుళాంబ ఆలయం సహస్ర ఘట్టాలతో అమ్మవారికి అభిషేకాలు ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, వసతుల ఏర్పాటు అలంపూర్ క్షేత్రానాకి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారు, స్వా మివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారే కలుగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానుండటంతో అందుకు తగ్గట్టుగా క్యూలైన్లు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. – దీప్తి, ఆలయాల ఈఓ, అలంపూర్ -
ముగిసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు
రంగాపూర్ ఉర్సులో భక్తులు ఉమామహేశ్వరంలో భక్తులు అచ్చంపేట: శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. వారం పాటు భక్తుల సందడితో క్షేత్రం కళకళలాడింది. ఉత్సవాల చివరి రోజు గవ్యంత పూజలు, వాస్తుపూజ, వాస్తుహోమంతో పాటు పాపనాశనంలో ఉత్తరాయణ పుణ్య స్నానాలు, ప్రత్యేక పూజలను వేద పండితులు వీరయ్యశాస్త్రి నిర్వహించారు. వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షుడు బీరం మాధవరెడ్డి, కార్య నిర్వహణాధికారి శ్రీనివాస్రావు పర్యవేక్షించారు. కొనసాగుతున్న ఉర్సు మండలంలోని రంగాపూర్ నిరంజన్ షావలీ ఉర్సు వైభవంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొట్టేళ్లు సమర్పించి ఫాతేహాలు, కందోరీలు చేసి మొక్కులు చెల్లించారు. కోరిన కోరికలు తీరాలని చెట్టుకు ముడుపులు కట్టారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
నవాబుపేట: మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవించే వ్యక్తికి కుటంబంతో అనుమానం రేకెత్తి గొడవలకు దారితీసింది. దీంతో కొన్నిరోజు లు కుటుంబ గొడవలకే పరిమితం కాగా తాజాగా ఏకంగా ఆత్మహత్యకు దారితీసి ప్రాణాలు తీసుకున్న ఘటన. మండల కేంద్రంలో మాందువాద శివకుమార్(35) మేసీ్త్ర పని చేసుకుంటూ జీవించేవాడు. 8ఏళ్లకిందట దోమ మండలానికి చెందిన లలితతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. భార్య ప్రవర్థనలో మార్పురావడంతో అనుమానం పెరిగి తరచూ గొడవ పడేవారు. కుటుంబ సభ్యులు సర్దిచెప్పి పంపించేవారు. తాజాగా బుధవారం అందరూ తిని నిద్రకు ఉపక్రమించిన తర్వాత శివకుమార్ వేరే గదిలోకి వెళ్లి వెంటిలేటర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారు జామున భార్య భర్తకోసం వెతికితే వేరే గదిలో ఉరివేసుకుని కనిపించాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. ఆటోబోల్తా: వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు మిడ్జిల్: ఆటో బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతిచెందగా.. ముగ్గురు గాయాలపాలైన ఘటన మండలంలోని మసిగొండ్లపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లికి చెందిన పాపకంటి నర్సింహ, ఆయన మనుమరాలు పాపకంటి స్వప్న, ఈదులబావి తండాకు చెందిన ఫిర్యానాయక్, మసిగొండ్లపల్లికి చెందిన దుబ్బ రాములు మసిగొండ్లపల్లి నుంచి మిడ్జిల్కు వస్తుడగా.. గ్రామ సమీపంలోని మలుపు వద్ద బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ‘108’లో జడ్చర్ల ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పాపకంటి నర్సింహ(75) మృతిచెందగా, ఫిర్యానాయక్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే నర్సింహ, మనుమరాలితో కలిసి బంధువుల గ్రామమైన మసిగొండ్లపల్లికి గురువారం ఉదయం వచ్చారు. బంధువులను కలిసి తిరుగు ప్రయాణంలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిర్యానాయక్ను మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నర్సింహ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి లింగాల: మండలంలోని అంబట్పల్లి–శాయిన్పేట మధ్య ఈనెల 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గెంటెల తిరుపతయ్య(53) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్ తెలిపారు. మృతుడు మరో వ్యక్తి బాలచంద్రంతో కలిసి బైక్పై నాయినోనిపల్లి మైసమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు మూలమలుపులో ఎదురుగా వచ్చిన కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని హెచ్సీ తెలిపారు. మృతుడి తమ్ముడు గెంటెల విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి వెల్దండ: మండలంలోని ఎంజీతండాకు చెందిన మూడవత్ నరే్శ (18) చికి త్స పొందుతూ హైదరా బాదులోని గాంధీ ఆస్పత్రి లో గురువారం మృతి చెందినట్లు ఏఎస్ఐ జాకిహు ల్లా తెలిపారు. వివరాలు..బుధవారం ఉద యం ఎంజీతండాకు చెందిన నరేష్ ఆటోలో వెల్దండ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా తండా సమీపంలో మూలమలుపు వద్ద ఆటో అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. క్షతగాత్రు డిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో వెల్దండలోని యెన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయమించడంతో మెరుౖ గెన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందు తూ మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు. నరే ష్ హైదరాబాదులోని నాంపల్లిలో ఐటీఐ చదువుతున్నాడు. మృతుడి తండ్రి దేన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. కరెంట్ షాక్తో వ్యక్తి మృతి వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్లకు చెందిన ఓ వ్యక్తి కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుచ్చన్న (50) గురువారం కూలీ పని నిమిత్తం వనపర్తికి వచ్చాడు. మరికుంట కాలనీలో భవన నిర్మాణానికి తీసుకెళ్లారు. అక్కడ పనులు చేస్తుండగా కరెంట్ షాక్కు గురై కింద పడిపోగా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఆటో డ్రైవర్కు మూడురోజుల జైలుశిక్ష
మహబూబ్నగర్ క్రైం: ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అధిక మోతాదులో మద్యం తాగి ఆటో నడుపుతున్న డ్రైవర్ను వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. మద్యం తాగి నిర్లక్ష్యంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని పోతుండగా.. తనిఖీ ల్లో భారీగా మద్యం తాగినట్లు నిర్ధారణ కా గా.. సదరు ఆటో డ్రైవర్ను గురువారం కోర్టులో హాజరుపర్చగా సెకండ్క్లాస్ న్యాయమూర్తి శశిధర్ డ్రైవర్కు మూడురోజుల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. దీంతో పోలీసులు ఆటోడ్రైవర్ను జిల్లా జైలుకు తరలించారు. రైతుకు విద్యుత్ షాక్ గద్వాల క్రైం: మండలంలోని కొండపల్లికి రైతు రఘునాథ్ రెడ్డి ప్రమాదవశాత్తు విద్యుదాఘా తానికి గురయ్యాడు. గురువారం ఉదయం త న పొలంలో పంటకు నీళ్లందించేందుకు బో ర్ మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్ర మంలో విద్యుత్ సప్లై కాలేదు. సమీపంలోని ట్రా న్సఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో కుప్పకూలిపోయా డు. గమనించిన స్థానిక రైతులు వెంటనే 108 లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమి త్తం కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బావిలో పడి మహిళ మృతి ఎర్రవల్లి: బావిలో పడి మ హిళ మృతి చెందిన ఘట న మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని బొచ్చువీరాపురం గ్రామానికి చెందిన జయమ్మ (38) భర్త పెద్దస్వామితో కలిసి గురువారం మధ్యాహ్నం పొలంలో పంటకు మందు పిచికారీ చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో నీళ్ల కోసం బావిలో దిగగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. నీరు తెచ్చేందుకు వెళ్లిన భార్య ఎంతకు తిరిగి రాకపోవడంతో భర్త వెళ్లి చూడగా బావి లో విగతజీవిగా కన్పించింది. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయ గా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కో దండాపురం ఎస్ఐను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. -
పాలమూరులో మార్మోగిన రామనామం
● వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవం ● పాతగంజిలో ఉట్టిపడిన ఆధ్యాత్మికభావం మహోత్సవంలో పాల్గొన్న భక్తులు స్టేషన్ మహబూబ్నగర్: అయోధ్య శ్రీబాలరాముని ప్రాణప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రం క్లాక్టవర్లోగల పాతగంజి వద్ద హైందవ శక్తిసేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్రహాలను వేపూరిగేరి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాతగంజి వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి.. పూజా కార్యక్రమాలు, శ్రీరా ముని పట్టాభిషేకం జరిపారు. సామూహిక హనుమాన్చాలీసా పారాయణం నిర్వహించారు. క్లాక్టవర్ నుంచి పాతగంజి వరకు ఉన్న రహదారి భక్తులతో కిటకిటలాడింది. వేదికపై శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చిన్నారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని రాధా మనోహర్దాస్స్వామి అన్నారు. మహోత్సవంలో పాల్గొని ధార్మిక ప్రవచ నం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఐక్యంగా సంఘటితం కావాలని కోరారు. అదేవిధంగా అయోఘ్ దేశపతి ప్రసంగించారు. అయోధ్యలో శ్రీ బలరాముడి ప్రతిష్ఠాపనతో ఎన్నో వందల ఏళ్ల కల సాకారమైందన్నారు. ఎంతో వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే క ప్రతినిధి ఏపీ జితేందర్రెడ్డి, మాజీ మంత్రి శ్రీని వాస్గౌడ్, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్.రవికుమార్ ప్రత్యేక పూజలు చేశారు. హైందవ శక్తిసేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్, సంతోష్కుమార్, కమల్ కిషోర్ రాఠి, భాస్కర్, కా ర్యదర్శి బాల్రాజు, రమే ష్, రామకృష్ణ, అనంతసా యి, గణేష్, ఆంజనేయులు, అఖిల భార త అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు. -
కమనీయం లక్ష్మీచెన్నకేశవుడి కల్యాణం
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి కల్యాణం గురువారం ఆలయ ప్రాంగణంలోని కృష్ణ మండపంలో వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కాళ్ల మంటపం వద్ద ఎదుర్కోలు వేడుక నిర్వహించి ఊరేగింపుగా ఆలయంలోని కృష్ణ మండపానికి తీసుకొచ్చారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వేడుకల్లో ఆలయ కార్య నిర్వహణాధికారి దీప్తిరెడ్డి, సర్పంచ్ గిరి, భక్తులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన కందుల కొనుగోళ్లు
● అందుబాటులోకి తూర్పార పట్టే యంత్రాలు ● ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపిన రైతులు గండేడ్: కందుల కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై సాక్షి లో వచ్చిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. రైతుల కష్టాలను వివరిస్తూ గురువారం సాక్షిలో ‘కంది రైతుల కష్టాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో గురువారం కందుల కొనుగోళ్లను ప్రారంభించారు. ఉదయమే హమాలీలతో కందులు తూకం వేయడం ప్రారంభించారు. తూర్పు పట్టే యంత్రాన్ని కూడ తీసుకురావడంతో ఓవైపు రైతులు కందుల తూర్పు పడుతుండగా మరోవైపు హమాలీలు కందులు తూకం వేశారు. తూర్పార యంత్రం ఏర్పాటు మిల్లెట్ యూనిట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూర్పు పట్టే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. గత సోమ వారం వరకు 853 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసి గోదాంకు పంపించారు. వీటిలో 71 బ్యాగులు బుర్రలు, దుమ్ము, తాలు అంటూ గోదాం నుంచి తిప్పి పంపించారు. కాగా ఈ విషయాన్ని మంగళవారం ‘కందులు రిటర్న్’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. తూర్పు పట్టే యంత్రం లేకపోవడంతో రైతులు చేతులతో తూర్పు పట్టారు. దీంతో కందులు బాగాలేవంటూ కొనుగోలు కేంద్రానికి తిప్పి పంపించారు. దీనిపై కూడా కథనం రావడంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఏపీఎం రజిత ఉన్నతాధికారులతో మాట్లాడి తూర్పు పట్టే యంత్రాన్ని తెప్పించారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 1500 క్వింటాళ్లకు పైగా కందులు కొనుగోలు చేసి గోదాంకు తరలించారు. సాక్షికి రైతుల ధన్యవాదాలు పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లో సమస్యలను గుర్తించి కందుల కొనుగోళ్లు సవ్యంగా సాగేలా వరుస కథనాలు ప్రచురించిన సాక్షి దినప్రతికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పత్రికల్లో కథనాలు రాకపోతే తాము మరింత ఇబ్బందులు పడేవారమని రైతులు పేర్కొన్నారు. తమ గోడు విని సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. -
ట్రాఫిక్పై దృష్టిపెట్టాలి
సమయానికి వెళ్లలేకపోతున్నా.. కొన్నేళ్లుగా నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో బిల్డింగ్ ప్లానర్గా పనిచేస్తున్నా. మర్లులోని మా ఇంటి నుంచి ఉదయం అక్కడికి చేరు కోవాలంటే అరగంటపైనే పడుతోంది. రోడ్డు మీదకు బైక్పై రావాలంటేనే రద్దీగా ఉంటోంది. ఎన్హెచ్ –167పై ఎప్పుడూ కిక్కిరిసిన ట్రాఫిక్తో నిండి ప ద్మవ్యూహాన్ని తలపిస్తుంది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోవాలన్నా అదే పరిస్థితి. ముఖ్య కూడళ్ల లో అన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులను నియమించాలి. – మహమ్మద్ ఆసిఫ్, మర్లు, మహబూబ్నగర్ బోయపల్లి గేట్ వద్ద.. రైళ్ల రాకపోకల కారణంగా తరుచుగా బోయపల్లి గేట్ మూసివేస్తున్నారు. దీంతో అటు, ఇటువైపు కిలోమీటరు వరకు వాహనాలు ఆగిపోతున్నాయి. రైలు వెళ్లిపోయాక గేటు తెరిచినా ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే 15 నిమిషాలు అవుతోంది. ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మించాలి. అప్పుడే ఈ సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. నగరంలోకి పనిమీద బైక్పై వచ్చి తిరిగి వెళ్లాలంటేనే గంటల తరబడి మధ్య మధ్యలో ఆగాల్సి వస్తోంది. – కిశోర్కుమార్, కల్వరికొండ, నవాబుపేట రోడ్, మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికలు వాపోతున్నారు. కొందరు పుట్బోర్డులు ఆక్రమించి వాహనాలు నిలపడం, చిరువ్యాపారాల వంటివి చేస్తుండటంతో పాదచారులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సమస్యకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘స్థలాలు లేక.. పార్కింగ్కు బేజారు’ కథనం బాగుందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన వారు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను కోరుతున్నారు. వన్టౌన్ వద్ద రద్దీనే.. వివిధ పనుల నిమిత్తం నగరంలోకి బైక్పై రావాలంటే చాలా సమ యం తీసుకుంటోంది. ముఖ్యంగా వన్టౌన్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ఎప్పుడూ వాహనాల రద్దీ కనిపిస్తుంది. ఇక కొత్త బస్టాండ్ వద్ద అయితే అడ్డంగా ఆటోలు ఆగి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నా వాటిని నియంత్రిచడం లేదు. దీంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ బాగా చీకటి అవుతుంది. – రవిప్రకాష్, భగీరథకాలనీ, మహబూబ్నగర్ ● ఎక్కడ బడితే అక్కడ వాహనాల నిలిపివేత పుట్బోర్డులను ఆక్రమించడంతో పాదచారుల ఇక్కట్లు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకోలు -
ఎగబడి పోవాలె..!
‘ఆటో’.. ఇటో నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చెన్నారం, బిజ్జారం గ్రామాల విద్యార్థులకు ఈ ప్రమాదకర ఫీట్లు నిత్యకృత్యంగా మారాయి. ఆయా గ్రామాల విద్యార్థులు సుమారు 60 మంది మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఆ పల్లెలకు బస్సు సౌకర్యం ఉన్నా.. పాఠశాలల సమయానికి రాకపోవడంతో వారికి తిప్పలు తప్పడం లేదు. నాగర్కర్నూల్: 85 గ్రామాలు.. జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు..: మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్ (నాగర్కర్నూల్), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి). జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు..: టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్నగర్ రూరల్) ఫీట్లు.. పాట్లునో బస్.. నో సర్వీస్ మహబూబ్నగర్: 4 పల్లెలకు.. ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే పాఠశాలలకు.. కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు, కాలినడకే శరణ్యం నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం అరకొరగా ఆర్టీసీ సర్వీస్లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు -
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం
స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి పది డిపోలకు 430 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులు నడిపారు. ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లడానికి అధికంగా బస్సులు తిప్పారు. వీటిలో సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అత్యధికంగా 109 శాతం.. మహాలక్ష్మి పథకం కింద ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 20 వరకు (14, 15, 16 తేదీలు మినహా) మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో అదనపు బస్సు సర్వీసులు నడపగా రూ. 22,69,54,338 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నుంచి 20 వరకు రీజియన్లోని బస్సులు 34,47,623 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 39,20,918 మంది బస్సుల్లో ప్రయాణించారు. ఆక్యుపెన్షి రేషియాలో మహబూబ్నగర్ రీజియన్ రాష్ట్రంలో అత్యధికంగా 109 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం. పండుగ రద్దీతో రీజియన్కు మెరుగైన రాబడి ఈ నెల 9 నుంచి 20 వరకు రూ.22 కోట్లు ఆర్జన 34 లక్షల కి.మీ. ప్రయాణం, 39 లక్షల ప్రయాణికుల వినియోగం ఓఆర్లో రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ అగ్రస్థానం -
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని మహబూబ్నగర్ నగర పాలక సంస్థ, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ విజయేందిర తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయేందిర మా ట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నామని వివరించారు. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా మ్యా పింగ్ చేసి ప్రచురించామని, వీటి వివరాలను ఇప్పటికే టీపోల్లో నమోదు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులపై పరిశీలించామని, ఆర్ఓ, ఏఆర్ఓలను గుర్తించామని చెప్పారు. జిల్లాలో పోలింగ్ నిర్వహణకు సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేపడుతామన్నారు. కౌంటింగ్ నిర్వహణకు పాలమూరు యూనివర్సిటీలో భవనాలను పరిశీలించినట్లు వెల్లడించారు. జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలకు మెజిస్ట్రీయల్ అధికారాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
హంస వాహనంపై నారసింహుడు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి హంసవాహన సేవ నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలతో ఆలయ సమీపంలోని శ్రీవారి సముద్రంలో హంస వాహనంపై ఉంచి విహరించారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామివారి హంసవాహన సేవ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయని వేదపండితులు తెలిపారు. సుమారు నెల రోజులు జాతర కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్రావు, సర్పంచ్ యాదన్నగౌడ్, ఉపసర్పంచ్ సాయికృష్ణగౌడ్ పాల్గొన్నారు. -
నీటి గుంతలో పడి వ్యక్తి మృతి
బల్మూర్: మండలంలోని రామాజిపల్లిలో మంగళవారం రాత్రి నీటి గుంతలో పడి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాలు.. గ్రామానికి చెందిన కురువ పెద్ద నాగయ్య (36) మంగళవారం మధ్యాహ్నం నుంచి కని పించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా.. తన వ్యవసాయ పొలంలో ఉన్న స్టోరేజీ నీ టి గుంతలో రాత్రి శవమై తేలాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని 108 అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య అయిజ: పట్టణంలోని బో యపేటకు చెందిన వెంకటేష్ బుధవారం ఇంట్లోనే ఉరేసుకొని మృతి చెందా డు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ తల్లి, తండ్రి గతంలో నే మరణించారు. అన్న, వదినలు ఉన్నా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒంటరిత నం భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కాలనీ ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి అంత్యక్రియల నిమిత్తం మృతుడి కుటుంబసభ్యలకు సభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. విద్యుదాఘాతానికి యువ రైతు బలి దామరగిద్ద: పొలంలో విద్యుత్ తీగలను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై యువ రైతు మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన బుడ్డపోళ్ల నారాయణ (26) ఉదయం పొలంలో ప్రధాన విద్యుత లైన్ నుంచి విద్యుత్ మోటార్ స్టాటర్ వరకు ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్ను లాగి కట్టే క్రమంలో తెగిపోవడంతో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నారాయణకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా భార్యతో పాటు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యమ్మ తిప్పణ్ణ, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ కోరారు రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి హన్వాడ: మండల పరిధి లోని చిన్నదర్పల్లిలో బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురా లు గాయపడి చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు చిన్నదర్పల్లికి చెందిన జిన్నారం రాజ మ్మ (63) తాండూర్ ప్రధాన రహదారిపై రో డ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. పా తులవత్ రాజేందర్ నాయక్ అనే వ్యక్తి బైక్పై హన్వాడ నుంచి మహబూబ్నగర్కు వెళ్లే క్ర మంలో రాజమ్మను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజమ్మను చికిత్స నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి కుమారుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి నవాబుపేట: చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో చోటు చేసుకుంది. కారుకొండకు చెందిన కేశిరెడ్డి అంజమ్మ కూతురు అమృత (42)ను పదేళ్ల క్రితం అగ్రహారానికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొన్ని నెలలుగా భర్త ఖాళీగా ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన అమృత ఈనెల 19న విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. కేఎల్ఐ కాల్వలో వృద్ధురాలి మృతదేహం బిజినేపల్లి: మండలంలోని మంగనూర్కు చెందిన బోట్క మణెమ్మ (55) మూడు రోజుల కిందట అదృశ్యమైంది. బుధవారం సాయంత్రం కేఎల్ఐ కాల్వలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మణెమ్మ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెదికారు. బుధవారం కేఎల్ఐ కాల్వలో మృతదేహం కనిపించడంతో బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. -
బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతల దాడి
భూత్పూర్: బీఆర్ఎస్ కార్యకర్తపై దాడిచేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలోని మద్దిగట్లకు చెందిన వెంకటేశ్ గౌడ్ను మంగళవారం సాయంత్రం ఎంపీడీఓ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డి కలిసి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి రైతువేదిక వద్ద అసభ్యకర పదజాలంతో దుర్బాషలాడుతూ.. కర్రలతో చితకబాది బెదిరింపులకు గురిచేసినట్లు బాధితిడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్రెడ్డి, భూపతిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఎస్ఎంలో పోస్టు చేసిన కారణంతో దాడి డిసెంబర్లో మద్దిగట్లకు చెందిన వెంకటేశ్గౌడ్ సామాజిక మాధ్యమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్రెడ్డిపై అసభ్యకర పదజాలంతో పోస్టు చేయడంతో డిసెంబర్లో భూత్పూర్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో మంగళవారం వెంకటేశ్గౌడ్పై దాడిచేసినట్లు తెలిసింది. వెంకటేశ్గౌడ్ను సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతోపాటు, వ్యక్తిగత విమర్శలు చేసేవిధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టరాదని పోలీసులు మందలించినట్లు తెలిసింది. -
స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర
● గరిష్టంగా రూ.1,900.. కనిష్టంగా రూ.800 దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గాయి. రెండు వారాల కిందట కాస్త పెరిగినా.. గత వారం సంక్రాంతి సందర్బంగా వేలం నిర్వహించలేదు. బుధవారం ఉదయం మార్కెట్కు సుమారు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వ్యాపారులు వేలం వేసి కొనుగోలు చేశారు. నాణ్యమైన ఉల్లి కొనుగోలుకు పోటీ పడ్డారు. మొదటి రకం ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.1,900, నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లి రూ.1,800 వరకు పలికింది. ఎర్ర ఉల్లి గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.800 ధర లభించాయి. వేలం తర్వాత 50 కిలోల బస్తా రూ.900 నుంచి రూ.950 వరకు, ఎర్ర ఉల్లి బస్తా రూ.400 నుంచి రూ.659 వరకు విక్రయించారు. మార్కెట్లో ఉల్లి కుప్పలు -
వన్యప్రాణుల గణనలో అపశ్రుతి
● ప్రొటెక్షన్ వాచర్ శ్రీనివాసులు మృతి మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, దోమలపెంట ఫారెస్టు రేంజ్ పరిధిలో ప్రొటెక్షన్ వాచర్గా విధులు నిర్వహిస్తున్న దాసరి శ్రీ నివాసులు (38) మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కొన్నేళ్లుగా అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజులుగా అటవీశాఖ చేపట్టిన వన్యప్రాణుల గణనలో భాగంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో తెల్లవారుజామున అనుకోకుండా అటవీ ప్రాంతంలో కుప్పకూలి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన తోటి సిబ్బంది బాధితుడిని హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య అమ్ములు, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. రూ.10 లక్షల ఎక్స్గ్రేసియా విధి నిర్వహణలో మృతి చెందిన దాసరి శ్రీనివాసులు గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎఫ్ఓ రేవంత్చంద్రతో కలిసి ఉన్నతాధికారులతో మాట్లాడి అటవీశాఖ నుంచి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాకు సంబంధించిన చెక్కును మృతుడి భార్య అమ్ములుకు అందజేశారు. అటవీశాఖలో వాచర్గా విధులు నిర్వహించి ప్రమాదవశాత్తు గతంలో మృతి చెందిన ఏ ఒక్కరికీ ఇంత మొత్తంలో ఎక్స్గ్రేషియా రాలేదని, అందుకు సహకరించిన ఎమ్మెల్యే, డీఎఫ్ఓలకు బాధిత కుటుంబం తరుఫున చెంచు నాయకులు, అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి వర్తించే ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే సహాయాన్ని కూడా అందజేయాలని కోరారు. -
మహాత్ముడి విగ్రహానికి నిమజ్జనం
నవాబుపేట: ఏళ్ల తరబడి చెట్టు కింద శిథిలమైన ఉన్న మహాత్ముడి విగ్రహానికి విముక్తి కలిగింది. గాంధీజీ విగ్రాహానికి ప్రతిష్ఠించేందుకు తీసుకొచ్చి మూఢ నమ్మకాలతో వదిలేయడంతో దాదాపు 40 ఏళ్లుగా చె ట్టు కిందనే ఉండి శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో బుధవారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాచారి ఆధ్వర్యంలో గ్రామస్తులు పూజలు చేసి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.ఎక్కడ లేని విధంగా విగ్ర హానికి నిమజ్జనం చేయటం ప్రత్యేకంగా నిలిచింది. మూఢ నమ్మకాలతో.. 1985 సంవత్సరంలో మండల పరిధిలోని గురు కుంటలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చే సేందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు పూనుకున్నారు. ఈ క్రమంలో విగ్రహాన్ని తీసుకొచ్చిన ఉపాఽ ద్యాయుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు అక్కడి నుంచి విగ్రహాన్ని మండల పరిధిలోని పోమాల్ గ్రామానికి తరలించారు. అక్కడ విగ్రహ ఏర్పాటు కు సన్నహాలు చేస్తున్న తరుణంలో గ్రామపెద్ద సైతం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డా డు. ఈ క్రమంలో వారు 35 ఏళ్ల క్రితం నవాబుపేట మండల కేంద్రానికి తీసుకొచ్చారు. అనంతరం ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం పెట్టిన చోటే శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో శిథిల విగ్రహాన్ని ఏం చేయాలన్న దానిపై గ్రామస్తుల్లో తర్జనభర్జన మొదలైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎట్టకేలకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాచారి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం నిమజ్జనం చేశారు. మూఢ నమ్మకాలతోనే గాంధీజీ విగ్రహాన్ని వదిలేయటంతో అది కాస్తా శిథిలమైంది. నిబంధనల ప్రకారం విగ్రహాన్ని నిమజ్జనం చేశాం. తాజాగా అంబేడ్కర్ చౌరాస్తాలో విగ్రహ ఏర్పాటుకు స్థలం పరిశీలించాం. త్వరలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. – నర్సింహాచారి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ -
ప్రతి మనిషికి ఆర్టీసీతో విడదీయలేని బంధం
● మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర ● ఘనంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు స్టేషన్ మహబూబ్నగర్: ప్రతి మనిషికి ఆర్టీసీతో విడదీయలేని బంధమని, ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీపై ఆధారపడి ఉంటారని కలెక్టర్ విజయయేందిర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ తాను కళాశాలలో చదివేటప్పుడూ తమ కాలనీ నుంచి కింగ్కోఠికి బస్సులో వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తారని అన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. రోడ్డు భద్రతా విషయంలో ఇతర రాష్ట్రాల సంస్థలతో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ పనితీరు చాలా బాగుందన్నారు. ఇదే స్ఫూర్తితో బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ మాట్లాడుతూ మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా ప్రమాదాన్ని నివారించవచ్చని అన్నారు. మన జీవితంలో భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా రోడ్డు భద్రతపై ఆయన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏఎస్పీ రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి రఘు మాట్లాడారు. అనంతరం ప్రమాదరహిత డ్రైవింగ్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచిన కల్వకుర్తి డిపోకు చెందిన అంజయ్య, జోన్లో ఎల్ రాములు–షాద్నగర్ (ద్వితీయ), దేవుజా–నారాయణపేట (తృతీయ), రీజినల్లో భద్రయ్య–కోస్గి (ప్రథమ), ఎం.రాముడు–గద్వాల (ద్వితీయ), పి.రామప్ప–షాద్నగర్ (తృతీయ), డిపో స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. చిత్రలేఖన, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు లక్ష్మిధర్మ, కవిత, మహబూబ్నగర్ డీఎం అశోక్కుమార్, పీఓ వెంకటేశ్వర్లు, ఏఓ గంగాధర్, ఇతర డిపోల డీఎంలు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘కంది’ రైతుల కష్టాలు
గండేడ్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో రెండు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించినా ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదు. పీఏసీఎస్ కేంద్రంలో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుండటంతో మండల కేంద్రంతోపాటు మహబూబ్నగర్ జిల్లాలోని హన్వాడ, కోయిల్కొండ, నవాబ్పేట, మహమ్మదాబాద్ తదితర మండలాల రైతులు కందులు తీసుకొస్తున్నారు. రైతులకు తప్పని పడిగాపులు.. బయటి మార్కెట్లో దళారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు వస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో రైతులకు అరిగోస తప్పడం లేదు. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో కందులు తీసుకొచ్చిన రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు తూకం చేయడం లేదని సిబ్బందిని నిలదీస్తే ఇప్పడు, రేపంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొన్ని తూర్బారబట్టినా.. ఇప్పటి వరకు తూర్పారబట్టే యంత్రం కూడా అందుబాటులో లేదు. ఐకేపీ కేంద్రంలో ఇప్పటి వరకు ఒక్క కిలో కందులు కూడా తూకం కాలేదు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సేకరించిన 71 బస్తాలను తిప్పి పంపడంతో ఆయా రైతుడు గోడుమంటున్నారు. మూడు రోజులుగా తూకాలు చేయని వైనం గురువారం ప్రారంభమవుతాయంటున్న అధికారులు -
విద్యార్థి మృతిపై అధికారుల విచారణ
విద్యార్థి కుటుంబానికి అర్థిక సాయం అందిస్తున్న అధికారులు తాడూరు: మండలంలోని ఇంద్రకల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి లోకేశ్ విద్యుదాఘాతంలో మంగళవారం మృతి చెందిన ఘటనపై బుధవారం ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు(ఆర్జేడీ) సోమిరెడ్డి విచారణ చేపట్టారు. జిల్లా విద్యాధికారి రమేష్తో కలిసి పాఠశాలను సందర్శించి మృతి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మంగళవారం పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్న స్తంభానికి విద్యార్థి తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడినట్లు తెలిపారు. ఉపాధ్యాయుడు విద్యార్థిని జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఆర్జేడీ మాట్లాడుతూ.. పాఠశాల సమయంలో విద్యార్థులను బయటికు పంపరాదని, వారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించి రూ. 20 వేలు, విద్యుత్ శాఖ తరఫున రూ.20 వేల నగదుతో పాటు రూ. లక్ష నష్టపరిహార చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజుగౌడ్, సర్పంచ్ బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల ఎక్స్గ్రేషియా టీజీఎస్డీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్అలీ ఫరూకీ ఆదేశాల మేరకు అపరేషన్ డైరెక్టర్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, మేడ్చల్ చీఫ్ ఇంజినీర్ కామేశ్వర్ విద్యార్థి లోకేశ్ మృతిపై విచారణ చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అదే విధంగా విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపర్ ఇంజినీర్ నర్సింహ్మరెడ్డి, విద్యుత్ అధికారులు శ్రీనివాసులు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత


