వందశాతం స్కాలర్షిప్ మంజూరుకు చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/జడ్చర్ల: జిల్లాలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు వందశాతం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కార్యదర్శి బుద్ద ప్రకాశ్జ్యోతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయితో సమీక్షించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మంజూరుకు ఎస్సీ వసతిగృహాలు, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు సంఖ్య ఎంత.. ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు.. ఎంతమందికి మంజూరు చేశారు. ఎంతమంది అకౌంట్లో డబ్బులు జమ చేశారనే విషయాలపై ఆరాతీశారు. వసతిగృహ సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. అలాగే జడ్చర్లలోని ఎస్సీ గురుకులం, బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి విద్యాప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై సమీక్షించారు. 5వ తరగతి గదిని పరిశీలించి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. వెల్నెస్ హెల్త్ సెంటర్, భోజనశాల, వసతిగృహాలు, క్రీడామైదానం, తాగునీటికి ఆర్ఓ ప్లాంట్ సదుపాయాలపై ఆరా తీశారు. అలాగే చిట్టింబోయిన్పల్లి గురుకులం 25ఏళ్లు పూర్తిచేసుకోవడాన్ని ఓ మైలురాయిగా గుర్తించాలని, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్స్, దుప్పట్లు, టవల్స్, కాస్మెటిక్స్ అవసరాలపై ఆరాతీశారు. 640మంది విద్యార్థులకు 32మంది సిబ్బంది ఉండడంపై చర్చించి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నవీన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిని సునీత, డీఈఓ ప్రవీణ్ కుమార్, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సుదర్శన్, ఎస్సీ వెల్ఫేర్ అదనపు కార్యదర్శి గీత, జాయింట్ సెక్రటరీలు సక్రునాయక్, శర్మ శ్రీనివాస్, జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కార్యదర్శి బుద్ద ప్రకాశ్జ్యోతి


