వైభవంగా చెన్నకేశవుడి శకటోత్సవం
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శకటోత్సవం వైభవంగా ముగిసింది. ఉత్సవాలు బుధవారంతో ముగియనున్నాయి. ఆదివారం రాత్రి రథోత్సవానికి హాజరైన భక్తులు సోమవారం స్వామి దర్శనం చేసుకుని స్వగ్రామాలకు బయలుదేరారు. అధికసంఖ్యలో భక్తులు సోమవారం ఆయాప్రాంతాల నుంచి తరలివచ్చారు. స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. దాసంగాలు సమర్పించారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించగా.. మరికొందరు సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. సాయంత్రం శకటోత్సవం అత్యంత కోలాహలంగా సాగింది. రైతులు, భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను అలంకరించి గ్రామం వీధుల్లో ఊరేగించారు. ఆలయ రాజగోపురం వద్ద ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఊరేగించారు. ఈసారి మెట్లపైకి బండ్లు, ట్రాక్టర్లు ఎక్కకుండా బారికేడ్లు అడ్డుగా ఉంచారు. భక్తుల కేరింతలు, గోవిందనామస్మరణల మధ్య ప్రదక్షిణలు ముగించారు. శకటోత్సవంలో ఎడ్లబండ్లపై చెన్నకేశవస్వామి చిత్రపటాలతోకూడిన భారీ కటౌట్లను అలంకరించారు. శివసత్తుల నృత్యాలు, సంప్రదాయ మేళతాళాలతో శకటోత్సవం సాగింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం పూర్ణాహుతి, చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలు ముగియనున్నప్పటికి మరో నాలుగురోజులపాటు భక్తుల తాకిడి ఉంటుంది.
వైభవంగా చెన్నకేశవుడి శకటోత్సవం


