ఉత్సాహంగా సీఎం కప్ క్రీడలు
జిల్లావ్యాప్తంగా 7 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు
● గ్రామ క్టస్లర్ స్థాయిలోకొనసాగుతున్న క్రీడలు
● 28 నుంచి మండల, వచ్చే నెలలో అసెంబ్లీ, జిల్లాస్థాయి పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: ఈ ఏడాది సీఎం కప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తోంది. ఈనెల 17వ తేదీన మహబూబ్నగర్లో జరిగిన సభలో సీఎం రేవంత్రెడ్డి రెండో ఎడిషన్ సీఎం కప్ రోలింగ్ షీల్డ్, జెర్సీ, పోస్టర్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు.
● సీఎం కప్ క్రీడాపోటీలతో గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం ఉంటుంది. దాదాపు 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీ క్లస్టర్ స్థాయిల్లో సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా. ఫుట్బాల్ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఆయా క్లస్టర్లకు డీఎస్ఏ కోచ్లను ఇన్చార్జిలుగా నియమించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ పలు గ్రామాల్లో జరుగుతున్న సీఎం కప్ క్రీడలను పరిశీలిస్తున్నారు.
● గ్రామ పంచాయతీస్థాయి ఎంపికల అనంతరం సీఎం కప్ క్రీడాపోటీల్లో భాగంగా ఈనెల 28 నుంచి 31 వరకు మండల/అర్బన్ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. వచ్చేనెల 3 నుంచి 5 వరకు అసెంబ్లీస్థాయి, 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 20 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. చిన్నచింతకుంటలో శుక్రవారం జరిగిన సీఎం కప్ క్రీడల ఎంపికలకు లైవ్ టెలికాస్ట్ నిర్వహించారు. ఈ ఎంపికలను రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి పర్యవేక్షించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 7,628 క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో పురుషులు 5,415, మహిళలు 2,213 తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లో పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే సీఎం కప్ క్రీడాపోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఉత్సాహంగా సీఎం కప్ క్రీడలు


