‘కంది’ రైతుల కష్టాలు
గండేడ్ కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన కొనుగోళ్లు
గండేడ్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో రెండు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించినా ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదు. పీఏసీఎస్ కేంద్రంలో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుండటంతో మండల కేంద్రంతోపాటు మహబూబ్నగర్ జిల్లాలోని హన్వాడ, కోయిల్కొండ, నవాబ్పేట, మహమ్మదాబాద్ తదితర మండలాల రైతులు కందులు తీసుకొస్తున్నారు.
రైతులకు తప్పని పడిగాపులు..
బయటి మార్కెట్లో దళారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు వస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో రైతులకు అరిగోస తప్పడం లేదు. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో కందులు తీసుకొచ్చిన రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు తూకం చేయడం లేదని సిబ్బందిని నిలదీస్తే ఇప్పడు, రేపంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొన్ని తూర్బారబట్టినా.. ఇప్పటి వరకు తూర్పారబట్టే యంత్రం కూడా అందుబాటులో లేదు. ఐకేపీ కేంద్రంలో ఇప్పటి వరకు ఒక్క కిలో కందులు కూడా తూకం కాలేదు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఐకేపీ కొనుగోలు కేంద్రంలో సేకరించిన 71 బస్తాలను తిప్పి పంపడంతో ఆయా రైతుడు గోడుమంటున్నారు.
మూడు రోజులుగా
తూకాలు చేయని వైనం
గురువారం ప్రారంభమవుతాయంటున్న అధికారులు
‘కంది’ రైతుల కష్టాలు


