ఉచిత న్యాయ సేవలపైఅవగాహన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: గ్రామీణుల్లో న్యాయ అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, జడ్జి డి.ఇందిర అన్నారు. శనివారం మన్యంకొండ జాతరలో లీగల్ సర్వీసెస్ స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సమస్యలపై మార్గనిర్దేశం చేయడానికి పారా లీగల్ వలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. కాగా బాధితులకు ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల హక్కులు, కుటుంబ సమస్యలు, భూమి వివాదాలు, గృహహింస, పోక్సో చట్టాలు తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ ఢిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీంద్రనాయక్, ప్రతినిధులు ఎం.యోగేశ్వరావు, మల్లారెడ్డి, శివరాజ్ పాల్గొన్నారు.


