పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎన్నికల నిబంధనల మేరకు అర్హత గల ఓటర్ల నుంచి పోస్టల్ బ్యాలెట్ జారీకి దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న వ్యక్తులు (పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, పోలీసులు తదితరులు) పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ఈ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పూర్తి చేసిన వీటిని తమ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లాలో యూరియా సరఫరా యాప్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తెలిపారు. మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా ఏ విధంగా రైతులకు సరఫరా చేస్తున్నారో పరిశీలించారు. జిల్లాలో యూరియా ఎలాంటి కొరత లేదని, ప్రస్తుతం 15,825 బ్యాగుల యూరియా సరఫరాకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 58,288 మంది రైతులకు 2,05,222 యూరియా బస్తాలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట ఏడీఏ రాంపాల్, ఏఓ శ్రీనివాసులు ఉన్నారు.
450 పోలీస్ సిబ్బందితో బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: మన్యంకొండ జాతర కోసం మొత్తం 450 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ ఎన్బీ రత్నం వెల్లడించారు. మన్యంకొండ దగ్గర శనివారం బందోబస్తు ఏర్పాట్లను ఏఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రథోత్సవంతో పాటు జాతరలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక అదనపు ఎస్పీతో పాటు ఇద్దరూ డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 75 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుల్స్, 250 కానిస్టేబుల్స్, 60 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా క్యూలైన్ల నిర్వహణ, ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం రాకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు జేబు దొంగతనాలు లేకుండా, ఇతర అవాంచనీయ ఘటనలు జరగకుండా మఫ్టీలో బందోబస్తుతో పాటు నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వేరుశనగ @ రూ.10,521
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్కు శనివారం 3,311 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా క్వింటా గరిష్టంగా రూ.10,521, కనిష్టంగా రూ.9586 ధరలు లభించాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ రూ.2,450, పత్తి గరిష్టంగా రూ.7,001, కనిష్టంగా రూ.5,800, కందులుగరిష్టంగా రూ. 8,210, కనిష్టంగా రూ.5,239, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,941, కనిష్టంగా రూ.1,711, మినుములు గరిష్టంగా రూ.8,301, పెబ్బర్లు రూ.6,269 ధరలు లభించాయి.


