వన్యప్రాణుల గణనలో అపశ్రుతి
● ప్రొటెక్షన్ వాచర్ శ్రీనివాసులు మృతి
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, దోమలపెంట ఫారెస్టు రేంజ్ పరిధిలో ప్రొటెక్షన్ వాచర్గా విధులు నిర్వహిస్తున్న దాసరి శ్రీ నివాసులు (38) మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కొన్నేళ్లుగా అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజులుగా అటవీశాఖ చేపట్టిన వన్యప్రాణుల గణనలో భాగంగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో తెల్లవారుజామున అనుకోకుండా అటవీ ప్రాంతంలో కుప్పకూలి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన తోటి సిబ్బంది బాధితుడిని హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య అమ్ములు, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు.
రూ.10 లక్షల ఎక్స్గ్రేసియా
విధి నిర్వహణలో మృతి చెందిన దాసరి శ్రీనివాసులు గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎఫ్ఓ రేవంత్చంద్రతో కలిసి ఉన్నతాధికారులతో మాట్లాడి అటవీశాఖ నుంచి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాకు సంబంధించిన చెక్కును మృతుడి భార్య అమ్ములుకు అందజేశారు. అటవీశాఖలో వాచర్గా విధులు నిర్వహించి ప్రమాదవశాత్తు గతంలో మృతి చెందిన ఏ ఒక్కరికీ ఇంత మొత్తంలో ఎక్స్గ్రేషియా రాలేదని, అందుకు సహకరించిన ఎమ్మెల్యే, డీఎఫ్ఓలకు బాధిత కుటుంబం తరుఫున చెంచు నాయకులు, అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి వర్తించే ఇన్సూరెన్స్ పథకం ద్వారా వచ్చే సహాయాన్ని కూడా అందజేయాలని కోరారు.


