ప్రజలకు మెరుగైన పాలన అందించాలి
అచ్చంపేట: ప్రభుత్వ అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక పట్టణ గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో హైదరాబాద్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల క్షేత్రస్థాయి శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలనలో సామర్థ్యం పెంపొందించడంలో క్షేత్రస్థాయి పరిశీలన ఆధారిత శిక్షణ తరగతులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. గ్రూప్–1 అధికారులకు శిక్షణలో భాగంగా నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్, స్టడీటూర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలనలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ విధానాల అమలుపై ప్రాయోగిక అవగాహన కల్పించడమే శిక్షణ తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక దేవాలయాలు, ప్రకృతి సౌందర్య ప్రదేశాలు, వన్యప్రాణులు, వివిధ రకాల పక్షులు, జంతువులతో పాటు చెంచు, గిరిజనుల జీవన విధానం, నైపుణ్యాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు. స్టడీ టూర్లో భాగంగా తొలిరోజు నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం, అక్కమహాదేవి ఆలయాలను సందర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని దట్టమైన అడవులను సందర్శించి అధ్యయనం చేయాలన్నారు. అధ్యయన పర్యటన ద్వారా అనేక అనుభూతులను అందిపుచ్చుకొని శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, కంబైనన్డ్ ఫౌండేషన్ కోర్స్ కోఆర్డినేటర్, తిరువెంగళాచారి తదితరులు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజలకు మెరుగైన పాలన అందించాలి


