మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని మహబూబ్నగర్ నగర పాలక సంస్థ, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ విజయేందిర తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయేందిర మా ట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నామని వివరించారు. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా మ్యా పింగ్ చేసి ప్రచురించామని, వీటి వివరాలను ఇప్పటికే టీపోల్లో నమోదు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులపై పరిశీలించామని, ఆర్ఓ, ఏఆర్ఓలను గుర్తించామని చెప్పారు. జిల్లాలో పోలింగ్ నిర్వహణకు సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేపడుతామన్నారు. కౌంటింగ్ నిర్వహణకు పాలమూరు యూనివర్సిటీలో భవనాలను పరిశీలించినట్లు వెల్లడించారు. జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలకు మెజిస్ట్రీయల్ అధికారాలు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


