సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టండి
మహబూబ్నగర్ క్రైం: కార్పొరేషన్తో పాటు రెండు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి పెట్టాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎన్నికలపై జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని, పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది కేటాయింపు గస్తీ, చెక్పోస్టులు, సీసీటీవీ పర్యవేక్షణ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలు, క్విక్రె స్పాన్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని సూచించారు. మద్యం, నగదు, ప్రలోభాల పంపిణీపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతగా పని చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీలు ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎన్నికల సెల్ డీఎస్పీ గిరిబాబు, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, గాంధీనాయక్, రామకృష్ణ, బాలరాజు, ఎస్ఐలు పాల్గొన్నారు.


