బడ్జెట్లో అన్ని వర్గాల అభివృద్ధికి ఊతం
పాలమూరు: ప్రపంచంతో పోటీపడే విధంగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా 2026–27 బడ్జెట్ రూపొందించారని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రకటిస్తే దీంట్లో మూడు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషమన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వరకు 570 కి.మీటర్ల దూరం రూ.1.75 లక్షల కోట్ల హైస్పీడ్ కారిడార్ పట్టాలెక్కుతుందని, అన్ని జిల్లా కేంద్రాల్లో స్టాప్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి పుణె వరకు 550 కిలోమీటర్లు రూ.1.65 లక్షల కోట్లు, హైదరాబాద్ నుంచి చైన్నె వరకు 700 కిలోమీటర్లు రూ.2.10 లక్షల కోట్ల అంచనాతో ఏర్పాటు అవుతున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5.50 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్లు పూర్తవుతాయని తెలిపారు. గతం కంటే ఈసారి తెలంగాణకు బడ్జెట్ రూ.1,100కోట్లు అదనంగా పెరిగిందని, రాష్ట్రానికి ఏడు నవోదయ పాఠశాలలు మంజూ రు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో బాలికల వస తి గృహం ఏర్పాటు నిర్ణయం ద్వారా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు.
రూ.7.84 లక్షల కోట్లు కేటాయింపు
కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రూ.7.84 లక్షల కోట్లు కేటాయించారని, విద్యా రంగానికి రూ.1.39 లక్షల కోట్లు, వైద్య రంగానికి రూ.1.4 లక్షల కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. 17 రకాల క్యాన్సర్ మందులపై ధరలు తగ్గించారని పేర్కొన్నారు. మహబూబ్నగర్ను 3 టైర్ మున్సిపాలిటీగా గుర్తించడం వల్ల ఈ సారి నగర అభివృద్దికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో ఏ రంగానికి కాకుండా.. గద్వాల, మహబూబ్నగర్కు ఇంతా అని ప్రత్యేకంగా ఉండదన్నారు. పాలమూరు– రంగారెడ్డిపై ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వడం లేదనే తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టుకు విభజన చట్టంలో జాతీయ హోదా ఎందుకు పెట్టలేదు.. ఆ తప్పు ఎవరిదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, పడకుల బాలరాజు, కృష్ణవర్ధన్రెడ్డి, అంజయ్య, రాములు పాల్గొన్నారు.


