రమణీయం.. పూలరథం
● కనులపండువగా గ్రామవీధుల్లో ఊరేగింపు
● నేడు గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం(పెద్దతేరు)
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్పరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ రాజగోపురం ఎదురుగా చిన్నతేరును ఉంచి పుష్పాలతో అలంకరించి బలిహరణం, హోమం జరిపించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో రథానికి పూజలు చేశారు. ఆలయంలో నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేళతాళాలు, భక్తుల గోవింద, చెన్నకేశవస్వామి నామస్మరణలమధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. ఉత్సవ విగ్రహాలకు పూజలు చేసిన పండితులు తాడుతో రథాన్ని లాగారు. పుష్పరథం కనులపండువలా గ్రామపురవీధుల్లో ఊరేగింపు చేశారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఊరేగింపు గ్రామం చివరన ముగించారు. పుష్పరథోత్సవం పురస్కరించుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులతోపాటు సర్పంచ్, వార్డుసభ్యులు, భక్తులు పెద్దసంఖ్యలో పుష్పరథోత్సవంలో పాల్గొన్నారు.
నేడు రథోత్సవం
ఉత్సవాల్లో భాగంగా రథసప్తమి పురస్కరించుకుని ఆదివారం రాత్రికి స్వామివారి పెద్దతేరు రథోత్సవం జరపనున్నారు. రథోత్సవానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
రమణీయం.. పూలరథం


