ముగిసిన నామినేషన్ల పరిశీలన
పాలమూరు/మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) పూర్తయింది. మొత్తం 60 డివిజన్లకు గాను మూడు రోజుల్లో 781 నామినేషన్లు దాఖలు కాగా... ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల సమక్షంలోనే ఆయా డివిజన్ల వారీగా నామినేషన్లను ఎన్నికల అధికారులు (ఆర్ఓలు) క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. సాయంత్రం ఆరు గంటల వరకే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయినా.. ఆన్లైన్ నమోదులో బాగా ఆలస్యమైంది. వాస్తవానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారికంగా ప్రకటించాల్సిన మున్సిపల్ అధికారులు తాత్సారం చేశారు. చివరకు రాత్రి 11 గంటల తర్వాతే లెక్కలు తేల్చినా పార్టీల వారీగా పూర్తి వివరాలు ఇవ్వలేకపోయారు. కేవలం 521 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నట్లు మాత్రమే వెల్లడించారు. దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులకు 53 మందికి సంబంధించి 96 నామినేషన్లు, భూత్పూర్ మున్సిపాలిటీ 10 వార్డులకు 69 మంది అభ్యర్థులకు సంబంధించిన 96 నామినేషన్లు రాగా.. అన్నింటికి ఆమోదం తెలిపారు. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఒక్కో అభ్యర్థికి సంబంధించిన పరిశీలనను పది నిమిషాల్లో పూర్తి చేశారు. ప్రధాన ముఖద్వారం దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి అభ్యర్థితో పాటు ఒక ప్రతిపాదకుడిని మాత్రమే లోపలికి అనుమతించారు. ప్రక్రియను జిల్లా జనరల్ పరిశీలకురాలు కాత్యాయనిదేవి కమిషనర్ రామాంజులరెడ్డితో కలిసి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడారు. ఎస్పీ డి.జానకి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ దగ్గర ఏర్పాటు చేసిన బందోబస్తును తనిఖీ చేశారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఆరు తిరస్కరణ
60 డివిజన్లలో 521 మంది నామినేషన్లు ఒకే..
49వ డివిజన్లో అభ్యంతరాలు.. కాసేపు ఉద్రిక్తం
ప్రక్రియ పూర్తయిన 5 గంటల తర్వాతే అధికారిక ప్రకటన
దేవరకద్ర, భూత్పూర్లో అన్నింటికీ ఆమోదం


